బీటెక్ బీఈతో బీఈడీ చేసిన అభ్యర్థులు టీచర్ పోస్టులకు అర్హులేనని సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి డీఎస్సీకి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ పోస్టులకు వాళ్లు పోటీ పడొచ్చని విద్యాశాఖ కార్యదర్శి వాకటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు. 5089 టీచర్ పోస్టుల భర్తీకి గత నెల 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 71వేల వరకూ దరఖాస్తులు అందాయి. బీటెక్, బీఈతో బీఈడీ చేసిన అభ్యర్థులకు డీఎస్సీ–2023 దరఖాస్తునకు సర్కార్ అవకాశమిచ్చింది.
స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ పోస్టులకు వాళ్లు పోటీ పడొచ్చనీ స్పష్టం చేసింది. తొలిసారిగా బీటెక్, బీఈ చదివిన స్టూడెంట్లకు 2015–17 నుంచి బీఈడీకి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత 2017లో తొలిసారిగా టీఎస్ టెట్ కూ వారికి అవకాశమిచ్చారు. అయితే టీఆర్టీ–2017కు బీటెక్, బీఈ అభ్యర్థులకు ఛాన్స్ ఇవ్వలేదు. దీనిపై అప్పట్లో కొందరు కోర్టునూ ఆశ్రయించారు. తాజాగా 5089 టీచర్ పోస్టుల భర్తీకి సర్కారు డీఎస్సీ–2023 నోటిఫికేషన్ ఇచ్చింది. ప్రస్తుతం గతనెల 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ క్రమంలో టెట్ కు ఛాన్స్ ఇచ్చిన నేపథ్యంలో డీఎస్సీకి అవకాశమివ్వాలనీ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు విజ్ఞప్తి చేయగా, దీనికి ప్రభుత్వం అంగీకరించింది. కొత్తగా నిర్ణయం తీసుకోవడంతో ప్రస్తుతం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియలో మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం నుంచి బీటెక్, బీఈ తో బీఈడీ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం రానున్నది. కాగా, ఇప్పటికీ 71వేల వరకూ దరఖాస్తులు అందాయి. తొలిసారిగా బీటెక్ అభ్యర్థులకు అవకాశం ఇవ్వడంతో వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.