అంతర్జాతీయం
మిస్ యూనివర్స్–2023
ప్రతిష్టాత్మకమైన మిస్ యూనివర్స్–2023 కిరీటం షెన్నిస్ పలాసియోస్ దక్కించుకుంది. నికరాగ్వా నుంచి అంతర్జాతీయ గౌరవం దక్కడం ఇదే మొదటిసారి. ఫస్ట్ రన్నరప్గా మిస్ థాయ్లాండ్ ఆంటోనియో పోర్సిల్డ్, సెకండ్ రన్నరప్గా మిస్ ఆస్ట్రేలియా మొరాయా విల్సన్ నిలిచారు.
అర్జెంటీనాకు నూతనాధ్యక్షుడు
అర్జెంటీనాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జేవియర్ మిలి ఘన విజయం సాధించారు. మొత్తం 99.4 శాతం ఓట్లు పోలవ్వగా మిలి 55.7 శాతం ఓట్లు సాధించారు.1983 తరువాత ఇంత భారీ మెజారిటీతో అధ్యక్ష అభ్యర్థి గెలుపొందడం ఇదే తొలిసారి.
ఇందిరాగాంధీ శాంతి పురస్కారం
ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి పురస్కారం – 2022ను భారత కొవిడ్ వారియర్లు గెల్చుకున్నారు. వారి ప్రతినిధులుగా భారత వైద్య సంఘం (ఐఎంఏ) అధ్యక్షుడు శరద్ కుమార్ అగర్వాల్, భారత ట్రైన్డ్ నర్సుల సంఘం ప్రెసిడెంట్ రాయ్ కె జార్జ్ దీన్ని అందుకున్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ ఈ పురస్కారాన్ని అందజేశారు.
శ్రీలంక వీసా ఫ్రీ సేవలు ప్రారంభం
భారతీయులతో పాటు ఏడు దేశాల వారికి వీసా ఫ్రీ సేవలను శ్రీలంక ప్రారంభించింది. ఇక నుంచి భారత్, చైనా, రష్యా, మలేసియా, జపాన్, ఇండోనేసియా, థాయ్లాండ్ దేశాలవారు వీసా లేకుండానే శ్రీలంకలో 30 రోజుల పాటు పర్యటించవచ్చు. 2024 మార్చి 31వ తేదీ వరకూ ఈ సౌకర్యం అమల్లో ఉంటుంది.
ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’(ఈఐయూ) తెలిపింది. జ్యూరిచ్ ఆరోస్థానం నుంచి ఎగబాకి సింగపూర్ సరసన చేరినట్లు పేర్కొంది. గతేడాది సింగపూర్తోపాటు తొలిస్థానంలో నిలిచిన న్యూయార్క్ ఈసారి మూడోస్థానానికి పరిమితమైంది.
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా లక్సన్
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్టఫర్ లక్సన్ ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం దేశార్థికాన్ని మెరుగుపరచడమే తన ప్రథమ లక్ష్యమని ప్రకటించారు. గత నెల పార్లమెంటు ఎన్నికల తరవాత రెండు చిన్న పార్టీల మద్దతుతో లక్సన్కు చెందిన నేషనల్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
వరల్డ్ పాపులర్ లీడర్ మోడీ
ప్రపంచంలోకెల్లా అత్యధిక ప్రజామోదం గల నేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి నిలిచారు. దేశంలో ఆయన నాయకత్వాన్ని 76 శాతం ప్రజలు హర్షిస్తున్నారు. ‘మార్నింగ్ కన్సల్ట్’ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో మోడీ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రేడర్ ఉన్నారు.
ఐరాస కీలక కమిటీలో భారత్కు సభ్యత్వం
ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల్ని నిర్దేశించే ఐక్యరాజ్యసమితికి చెందిన అత్యంత కీలకమైన కమిటీలో భారత్ సభ్య దేశంగా ఎన్నికైంది. రోమ్లోని ఐరాస ఫుడ్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ‘సీఏసీ’ 46వ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఆసియా ప్రాంతం నుంచి ప్రాతినిథ్యం వహించే సభ్య దేశంగా భారత్ ఏకగ్రీవంగా ఎంపికైంది.
ఈజిప్టు అధ్యక్షుడిగా అబ్దుల్ ఫతా
ఈజిప్టు అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు అబ్దుల్ ఫతా ఎల్ సిసి వరుసగా మూడోసారి విజయం సాధించారు. తొమ్మిదేళ్ల నుంచి దేశాన్ని పాలిస్తున్న ఈ మాజీ సైన్యాధికారి మరో ఆరేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఎన్నికల ఫలితాల్లో ఎల్ సిసికి 89.6% ఓట్లు రాగా, ఆయనపై పోటీ చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో ఏ ఒక్కరికీ కనీసం 5 శాతం ఓట్లు రాలేదు.
ఇరాన్కు వీసా అవసరం లేదు
ఇరాన్కు వెళ్లేందుకు ఇక వీసా అవసరమే లేదు. విదేశీ పర్యాటకులు, సందర్శకులకు ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం భారత్ సహా 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలకు అనుమతులివ్వనున్నట్లు ప్రకటించింది.వీసా ఫ్రీ వెసులుబాటు ప్రకటించిన దేశాల్లో భారత్తోపాటు రష్యా, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ, ఖతార్, కువాయిట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్ తదితరాలున్నాయి.
అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్
యుఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రపంచంలోనే అతిపెద్ద సాంద్రీకృత సౌర విద్యుత్ ప్రాజెక్ట్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ సోలార్ పార్క్ నాల్గవ దశను ప్రారంభించారు.
వరల్డ్ బెస్ట్ ఫుడ్ సిటీస్
ఉత్తమ ఆహారాల జాబితాను ట్రావెల్ ఆన్లైన్ గైడ్ అయిన టేస్ట్ అట్లాస్ ఇటీవలే విడుదల చేసింది. ఆ జాబితాలో టాప్ 50లో ముంబై 35వ స్థానం, హైదరాబాద్ 39వ స్థానం నిలాచాయి. ఢిల్లీ 56వ స్థానానికి, చెన్నై(65), లక్నో(92) స్థానాలను దక్కించుకున్నాయి. రోమ్(ఇటలీ) టాప్లో నిలిచింది.
పాకిస్థాన్ స్వదేశీ క్షిపణి సక్సెస్
దేశీయంగా అభివృద్ధి చేసిన బహుళ ప్రయోగ క్షిపణి (రాకెట్) వ్యవస్థ ఫతా-2ను పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. ఇది 400 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదిస్తుంది.
ప్రవాసుల నిధులు పంపడంలో భారత్ టాప్
ప్రవాసులు తమ స్వదేశానికి అత్యధికంగా నిధులు పంపిన దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలిపింది. 2023లో ఇండియాకు 125 బిలియన్ డాలర్ల (సుమారు రూ.10.37 లక్షల కోట్ల)ను ప్రవాసులు పంపించారు. భారత్కు అత్యధికంగా యూఏఈ నుంచి ప్రవాసులు నిధులు పంపిస్తున్నారు. మెక్సికో రెండో స్థానంలో (67 బిలియన్ డాలర్లు) ఉంది.
జాతీయం
వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ద ఇయర్ జాబితా
ఈ ఏడాది ప్రపంచ పురుషుల అత్యుత్తమ అథ్లెట్ పురస్కారం తుది జాబితాలో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు స్థానం లభించింది. సామాజిక మాధ్యమాల్లో నిర్వహించిన ఓటింగ్లో 20 లక్షల మంది పాల్గొన్నారు. ఓటింగ్ అనంతరం ఈ జాబితాను 11 నుంచి కుదించి టాప్–5 ఆటగాళ్లను ఎంపిక చేశారు.
భారత ఆర్థిక వృద్ధి 6-7.1 శాతం
భారత ఆర్థిక వృద్ధి 2024 –26 ఆర్థిక సంవత్సరాల్లో ఏటా 6-7.1 శాతం మేర నమోదవుతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. భారత వాస్తవ జీడీపీ మార్చి త్రైమాసికం నాటి 6.1 శాతంతో పోలిస్తే, జూన్ త్రైమాసికంలో 7.8 శాతానికి పెరిగింది.
విజయవంతమైన మిస్సైల్ ప్రయోగం
డీఆర్డీఓ సహకారంతో సముద్రజలాల్లో భారత నౌకాదళం చేపట్టిన క్షిపణి ప్రయోగం విజయవంతమైందని విశాఖపట్నంలోని నేవీ వర్గాలు తెలిపాయి. యాంటీ షిప్ మిసైల్ను నేవీ హెలికాప్టర్ ద్వారా ప్రయోగించినట్లు పేర్కొన్నాయి. ఈ క్షిపణి లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదించినట్లు వెల్లడించాయి.
సంపద అసమానతల్లో భారత్ టాప్
అధికాదాయం ఉన్నప్పటికీ సంపదలో అసమానతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. 2015–16 నుంచి 2019–21 మధ్య దేశంలో తీవ్ర పేదరికంలో మగ్గుతున్న వారు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గారు. ఈ మేరకు ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్ డీపీ) తాజాగా ఒక నివేదికను వెలువరించింది.
అతిపెద్ద టైగర్ రిజర్వుకు కేంద్రం అమోదం
2,300 చదరపు కి.మీ విస్తీర్ణంతో దేశంలోనే అతి పెద్ద టైగర్ రిజర్వు ఏర్పాటు కానుంది. మధ్యప్రదేశ్లోని నౌరదేహి వన్యప్రాణి అభయారణ్యం, రాణి దుర్గావతి వన్యప్రాణి అభ్యయారణ్యాలను కలిపేయనున్నారు. ఈ రెండు అభయారణ్యాలు సాగర్, దమోహ్, నర్సింగ్పుర్, రైసెన్ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
ఆసియాన్ – ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్
ఇండోనేసియా రాజధాని జకార్తాలో అయిదు రోజుల తృణధాన్యాల పండగను భారత్ ప్రారంభించింది. భారత వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ది ఇండియన్ మిషన్ టూ ఆసియన్ సంయుక్తంగా ‘ఆసియాన్ – ఇండియా మిల్లెట్స్ ఫెస్టివల్’ను అయిదు రోజుల పాటు నిర్వహించాయి.
తపాలా బిల్లుకు రాజ్యసభ ఆమోదం
దేశంలోని తపాలా కార్యాలయాలకు సంబంధించిన 125 ఏళ్ల నాటి ఇండియన్ పోస్ట్ ఆఫీస్ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకురాదలచిన బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత శాసనం ప్రకారం.. ఏ వస్తువునైనా అడ్డుకోవడానికి, తనిఖీ చేయడానికి, అదుపులోకి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏ అధికారినైనా అనుమతించవచ్చు.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
భారత్ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. 2023–24లో దేశ జీడీపీ వృద్ధి 6.4 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం మన దేశం అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. భారత్ కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ ఉన్నాయి.
సురక్షిత నగరంగా కోల్కతా
దేశంలో సురక్షిత నగరంగా పశ్చిమబెంగాల్ రాజధాని కోల్కతా వరుసగా మూడోసారి మొదటి స్థానంలో నిలిచింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం.. 2022లో ప్రతి లక్ష మంది జనాభాకు కనిష్ట సంఖ్యలో గుర్తించదగిన నేరాలు నమోదైన నగరాల్లో 86.5 కేసులతో కోల్కతా ప్రథమ స్థానం సాధించింది. తర్వాత స్థానాల్లో పుణె (280.7), హైదరాబాద్ (299.2) నగరాలు ఉన్నాయి. –
యునెస్కో జాబితాలో గర్బా డ్యాన్స్
గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. గర్బాను మానవత్వ సాంస్కృతిక వారసత్వ ప్రాతినిధ్య జాబితాలో యునెస్కో చేర్చినట్లు ప్రకటించారు.
ఛత్తీస్గఢ్ కొత్త సీఎం విష్ణుదేవ్ సాయ్
బీజేపీ సీనియర్ నాయకుడు విష్ణుదేవ్ సాయ్ ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. గిరిజన నేత అయిన ఆయన్ని పార్టీ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధిష్ఠాన పరిశీలకులు అర్జున్ ముండా, సర్బానంద సోనోవాల్, దుశ్యంత్ కుమార్ సమక్షంలో రాయ్పుర్లో నిర్వహించిన సమావేశానికి 54 మంది నూతన శాసనసభ్యులు హాజరై ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మ
భాజపా అధిష్ఠానం తొలిసారి ఎమ్మెల్యేను రాజస్థాన్ భజన్లాల్ శర్మను సీఎంగా ఎంపిక చేసింది. సాంగానెర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 48,081 ఓట్ల మెజార్టీతో తొలిసారి ఎమ్మెల్యేగా నెగ్గిన శర్మ నేరుగా సీఎం పదవి చేపడుతున్నారు. దియా కుమారికి ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది.
గిరిజన వర్సిటీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
తెలంగాణలోని ములుగులో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఇప్పటివరకు ఉన్న కేంద్ర విశ్వవిద్యాలయాల జాబితాలో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం పేరును చేరుస్తూ ప్రవేశపెట్టిన సెంట్రల్ యూనివర్సిటీస్ (అమెండ్మెంట్) బిల్లు 2023కి రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదముద్ర వేసింది.
‘సీఈసీ, ఈసీ’ల బిల్లుకు ఆమోదం
ప్రధాన ఎన్నికల కమిషనరు (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీల) నియామకాలను నియంత్రించడంతో పాటు వారి సర్వీసులకు నిబంధనలను రూపొందించే బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ‘ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్మెంట్, కండీషన్స్ ఆఫ్ సర్వీస్ అండ్ టెర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు – 2023ను సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది.
వారణాసిలో అతిపెద్ద ధ్యాన కేంద్రం
ప్రధాని నరేంద్ర మోడీ వారణాసిలో స్వరవేద మహా మందిరాన్ని ప్రారంభించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం. ఒకేసారి 20 వేల మంది ధ్యానం చేసుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు. నవ సూత్రావళిని (9 సూత్రాలను) ఉద్బోధించి, వాటిని నెరవేర్చాలని ఆయన పిలుపునిచ్చారు.
33 నేరాల్లో జైలు శిక్ష పెంపు
ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్) మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు లోక్సభ ఆమోదం తెలిపింది. కొత్త బిల్లుల్లో 33 నేరాలకు జైలు శిక్ష పెంపును ప్రతిపాదించారు.
ఇస్రోకు ఐస్లాండ్ అవార్డు
చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు ఐస్లాండ్లోని హుసావిక్లో గల ఎక్స్ప్లొరేషన్ మ్యూజియం ‘2023 లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్’ను అందజేసింది.
తొలి ఫార్మా కంపెనీగా డాక్టర్ రెడ్డీస్
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ 2023 సంవత్సరానికి స్టాండర్డ్ అండ్ పూర్ డౌజోన్స్ సస్టెయినబులిటీ వరల్డ్ ఇండెక్స్ (డిజేఎస్ఐ వరల్డ్)లో స్థానం సంపాదించుకుంది. ఈ ఘనతను సొంతం చేసుకున్న తొలి భారతీయ ఫార్మా కంపెనీ ఇదే.
టెలీ కమ్యూనికేషన్స్ బిల్లుకు ఆమోదం
పార్లమెంటులో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన ద టెలీ కమ్యూనికేషన్స్ బిల్లు–2023కి లోక్సభ ఆమోదం తెలిపింది. ఆర్థిక బిల్లులో వసూలు చేసిన పన్ను రిఫండ్ ఆప్షన్ లేకపోవడంతో ఈ బిల్లును తీసుకొచ్చారు.
మీరాబాయి స్మారక నాణెం
శ్రీకృష్ణ భక్తురాలు, కవయిత్రి మీరాబాయి 525వ జయంతి సందర్భంగా కోల్కతా టంకశాల రూ.525 స్మారక నాణెం ముద్రించింది. దీన్ని ప్రధాని మోదీ మధురలో విడుదల చేశారు. కాకినాడకు చెందిన నాణేల సేకర్త మార్ని జానకిరామ్ చౌదరి దీనిని తెప్పించారు. నాణేనికి ఒకవైపు మీరాబాయి చిత్రం, మరోవైపు నాలుగు సింహాలతో ముద్రించారు.
ఇస్రోకు ఐస్లాండ్ ‘అన్వేషణ’ అవార్డ్
చంద్రుడిపై జీవం జాడ కోసం అన్వేషిస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు ఐస్ల్యాండ్కు చెందిన సంస్థ నుంచి అవార్డ్ దక్కింది. చంద్రయాన్–3 మిషన్ ద్వారా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ సక్సెస్కు 2023 ఏడాదికి లీఫ్ ఎరిక్సన్ లూనార్ ప్రైజ్ ఇస్తున్నారు.
కొత్త నేర బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
బ్రిటిష్ వలస పాలన నాటి నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళించేలా భారత పార్లమెంట్ గత వారం ఆమోద ముద్ర వేసిన మూడు కొత్త నేర బిల్లులపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకం చేశారు. ఇకపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య (బీఎస్) చట్టాలుగా పిలవనున్నారు.
సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా నీనా సింగ్ నియమితులయ్యారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) ప్రత్యేక డైరెక్టర్ రాహుల్ రస్గోత్రాను ఐటీబీపీ డైరెక్టర్ జనరల్గా కేంద్రం నియమించింది.
ఐడీఎఫ్సీ బ్యాంక్ ల విలీనానికి ఆర్బీఐ ఆమోదం
ఐడీఎఫ్సీ, తన బ్యాంకింగ్ అనుబంధ సంస్థ అయిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో విలీనం కావడానికి (రివర్స్ మెర్జర్) రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆమోదముద్ర వేసింది. ఈ విలీన ప్రతిపాదనను ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బోర్డులు జులైలో అంగీకరించాయి.
ప్రాంతీయం
నంబర్ వన్ మెరైన్ స్టేట్
ఏపీని దేశంలోనే నంబర్ 1 మెరైన్ స్టేట్గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఈ నెల 21వ తేదీన జాతీయ మత్స్య దినోత్సవం సందర్భంగా అహ్మదాబాద్లో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ట్రోఫీ, సర్టిఫికెట్తో పాటు అవార్డును ప్రదానం చేయనున్నారు.
పోటీలో 226 మందికి నేర చరిత్ర
ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 226 మందికి నేర చరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్జీజీ) అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాష్ట్రం ఇచ్చిన పార్టీగా దాదాపు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. 63 స్థానాల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాలకు పరిమితం అయింది. బీజేపీ ఎనిమిది స్థానాల్లో, ఎమ్ఐఎమ్ ఏడు స్థానాల్లో గెలుపు బావుటా ఎగురవేశాయి.
స్పీకర్ గా గడ్డం ప్రసాద్కుమార్
తెలంగాణ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికయ్యినట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. స్పీకర్ గా అధికారికంగా ప్రకటించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను ఛెయిర్ లో కూర్చోబెట్టి అభినందించారు.
డెల్టా ర్యాంకింగ్లో తిర్యాణికి తొలి స్థానం
నీతి ఆయోగ్ ప్రకటించిన యాస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రాం డెల్టా ర్యాంకుల్లో కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి బ్లాక్ తొలి స్థానాన్ని కైవసం చేసుకొంది.
ఆసియా బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డు
సృజనాత్మకత, నూతన డిజైన్లతో చేనేత వస్త్రాల తయారీ, ఉత్తమ మార్కెటింగ్, ఆన్లైన్ అమ్మకాలు చేస్తోన్న భూదాన్పోచంపల్లికి చెందిన ఇక్కత్ వరల్డ్ అధినేత గంజి యుగేందర్ ‘ఆసియా బెస్ట్ హ్యాండ్లూమ్ అవార్డు’ అందుకున్నారు.
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కు పర్యావరణ అవార్డు
పర్యావరణ కాలుష్య నివారణ సదస్సులో ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ ఉత్తమ పేపర్ ప్రజెంటేషన్ అవార్డును గెలుచుకుంది. భవన నిర్మాణం చేస్తున్నప్పుడు ఏర్పడే కాలుష్యంపై ట్రిపుల్ఐటీ బృందం అధ్యయనం చేసి సమర్పించిన పేపర్ ప్రజెంటేషన్ అందరినీ ఆకట్టుకుంది.
హైదరాబాద్ రంజీ కెప్టెన్గా తిలక్
2023–24 రంజీ సీజన్లో తొలి రెండు మ్యాచ్ల్లో ఆడే హైదరాబాద్ జట్టును ప్రకటించారు. జనవరిలో నాగాలాండ్, మేఘాలయలతో తలపడే హైదరాబాద్ జట్టుకు తిలక్ వర్మ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టుకు వైస్ కెప్టెన్గా రాహుల్ సింగ్ ఉంటాడు.
వార్తల్లో వ్యక్తులు
పంకజ్ అడ్వాణీ
భారత స్టార్ ఆటగాడు పంకజ్ అడ్వాణీ ప్రపంచ బిలియర్డ్స్లో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకున్నాడు. ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్లో అడ్వాణీ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో 2003లో తొలిసారిగా విజేతగా నిలిచిన అడ్వాణీ టైటిల్ నెగ్గడం ఇది 26వ సారి.
మాధురీ దీక్షిత్
‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫి) 54వ వేడుకలు గోవాలో ప్రారంభమయ్యాయి. బ్రిటిష్ దర్శకుడు స్టూవర్ట్ గాట్ తీసిన ‘క్యాచింగ్ డస్ట్’ చిత్ర ప్రదర్శనతో మొదలైన ఆ చిత్రోత్సవంలో ప్రముఖ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్కి ప్రత్యేక గుర్తింపు లభించింది.
క్రిస్టఫర్ లక్సన్
న్యూజిలాండ్ కొత్త ప్రధానిగా క్రిస్టఫర్ లక్సన్ ప్రమాణస్వీకారం చేశారు. గత నెల పార్లమెంటు ఎన్నికల తరవాత రెండు చిన్న పార్టీల మద్దతుతో లక్సన్కు చెందిన నేషనల్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి.
డా.ఎస్.మాధవరాజ్
యువ శాస్త్రవేత్తలను ప్రోత్సహించేందుకు గోవా ప్రభుత్వం ‘మనోహర్ పారీకర్ యువ శాస్త్రవేత్త’ అవార్డును ఇస్తుండగా తొలిసారి ఆ అవార్డును ఇస్రో అనుబంధ యూఆర్ రావు శాటిలైట్ సెంటర్కు చెందిన డా.ఎస్.మాధవరాజ్కు ఇవ్వనున్నట్లు గోవా సీఎం ప్రమోద్కుమార్ సావంత్ ప్రకటించారు.
అపర్ణ గుప్తా
సాంకేతిక దిగ్గజం మైక్రోసాఫ్ట్ తన గ్లోబల్ డెలివరీ సెంటర్ (జీడీసీ) లీడర్గా అపర్ణ గుప్తాను నియమించినట్లు వెల్లడించింది. జీడీసీకి లీడర్గా అపర్ణ కస్టమర్ ఇన్నోవేషన్, డెలివరీ ఎక్స్లెన్స్, క్లౌడ్ తదితర విభాగాలకు నాయకత్వం వహించనున్నారు.
చంద్రబోస్
గురజాడ రచనల్లో వాడుక భాష ఎంతో గొప్పదని, అదే తనకు నచ్చిన అంశమని ప్రముఖ సినీ గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. ఏపీలోని విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో చంద్రబోస్ను గురజాడ విశిష్ట పురస్కారంతో సత్కరించింది.
జేవియర్ మిలి
అర్జెంటీనాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జేవియర్ మిలి ఘన విజయం సాధించారు. మొత్తం 99.4 శాతం ఓట్లు పోలవ్వగా మిలి 55.7 శాతం ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, ఆర్థికమంత్రి సెర్గియో మాసా 44.3 శాతం ఓట్లు పొందారు. ఈ మేరకు అర్జెంటీనా ఎన్నికల సంఘం తెలిపింది.
ఆలోక్ శర్మ
ప్రధాన మంత్రి రక్షణ బాధ్యతలను చూసే ‘ప్రత్యేక భద్రతా దళం’ (ఎస్పీజీ) డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఆలోక్ శర్మ నియమితులయ్యారు. ఆయన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఎస్పీజీలో అదనపు డైరెక్టర్ జనరల్గా వ్యవహరిస్తున్నారు
అదితి అశోక్
భారత మహిళా స్టార్ గోల్ఫర్ అదితి అశోక్ ఈ ఏడాది తన ఖాతాలో రెండో టైటిల్ను జమ చేసుకుంది. మహిళల యూరోపియన్ టూర్లో భాగంగా ఈ మేరకు ముగిసిన స్పానిష్ ఓపెన్లో బెంగళూరుకు చెందిన అదితి విజేతగా నిలిచింది.
జస్టిస్ ఫాతిమా బీవి
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవి కేరళలోని కొల్లంలో మరణించారు. గతంలో ఆమె తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు.1983 నుంచి 1989 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1989 అక్టోబరు 6 నుంచి 1992 ఏప్రిల్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
మోహన్ యాదవ్
మధ్యప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా దక్షిణ ఉజ్జయిని ఎమ్మెల్యే మోహన్ యాదవ్ను బీజేపీ ఎంపిక చేసింది. శివరాజ్సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో ఉన్నత విద్యాశాఖ మంత్రిగా ఆయన సేవలందించారు. స్వయంగా చౌహాన్ చేసిన ప్రతిపాదన మేరకు పార్టీ శాసనసభాపక్ష నేతగా యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
లాల్దుహోమా
మిజోరం శాసనసభ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించిన జోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీ (జెడ్పీఎం) అధ్యక్షుడు లాల్దుహోమా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ కంభంపాటి హరిబాబు రాజ్భవన్లో ఆయన చేత ప్రమాణం చేయించారు.
అక్బరుద్దీన్ ఒవైసీ
తెలంగాణ రాష్ట్ర నూతన శాసనసభ కొలువుదీరింది. ఇటీవలి ఎన్నికల్లో గెలుపొందిన శాసనసభ్యుల్లో 101 మంది ప్రమాణ స్వీకారం చేశారు. మజ్లిస్ సీనియర్ శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఒవైసీ ప్రొటెం స్పీకర్గా సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
సమీర్ షా
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఛైర్మన్ పదవికి భారత్లో జన్మించిన డాక్టర్ సమీర్ షాను ప్రభుత్వం ఎంపిక చేసింది. జర్నలిజం, టీవీ కార్యక్రమాల నిర్మాణంలో 40 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్ షా స్వతంత్ర టీవీ, రేడియా కార్యక్రమాల సంస్థ జూనిపర్ సీఈవో గా పనిచేస్తున్నారు.
తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి
ప్రముఖ రచయిత తల్లావజ్ఝల పతంజలిశాస్త్రి రాసిన ‘రామేశ్వరం కాకులు.. మరికొన్ని కథలు’ లఘు కథల సంపుటికి ప్రతిష్టాత్మక కేంద్ర సాహితీ పురస్కారం దక్కింది. ఢిల్లీలో కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కె.శ్రీనివాసరావు 24 భాషల్లోని ఉత్తమ గ్రంథాలకు 2023 సంవత్సరానికి ఈ అవార్డులను ప్రకటించారు.
సావిత్రి జిందాల్
దేశంలో అత్యంత సంపన్నుల్లో ఈ ఏడాది అత్యధిక సంపద ఆర్జించిన జాబితాలో సావిత్రి జిందాల్ అగ్రస్థానంలో నిలిచినట్లు ‘బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్’ వెల్లడించింది. ఆమె మొత్తం సంపద 25.3 బి.డాలర్లు. ఈ ఒక్క ఏడాదిలోనే ఆమె సంపద 9.6 బి.డాలర్లు పెరిగింది.
రువెన్ అజర్
మాజీ దౌత్యవేత్త రువెన్ అజర్ను భారత్లో తమ రాయబారిగా ఇజ్రాయెల్ నియమించింది. శ్రీలంక, భూటాన్లకూ 56 ఏళ్ల రువెన్ నాన్ రెసిడెంట్ రాయబారిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం భారత్లో ఇజ్రాయెల్ రాయబారిగా నౌర్ గిలన్ పని చేస్తున్నారు.
పాల్ లించ్
ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ రాసిన ‘ప్రాఫెట్ సాంగ్’ పుస్తకానికి ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్–2023 లభించింది. లండన్కు చెందిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన తొలి నవల ‘వెస్ట్రన్ లేన్’ సైతం ఈ బహుమతి కోసం పోటీ పడగా, ప్రొఫెట్ సాంగ్ విజేతగా నిలిచింది.46 ఏళ్ల పాల్ లించ్ బుకర్ ప్రైజ్ అందుకున్నారు. ఈ బహుమతి కింద ఆయనకు రూ.52,64,932 నగదు లభించింది.
జై షా
2023 సంవత్సరానికి గానూ బెస్ట్ స్పోర్ట్స్ బిజినెస్ లీడర్గా జై షా ఎంపికయ్యాడు. ఈ అవార్డును కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ప్రకటించింది. స్పోర్ట్స్ బిజినెస్ అవార్డ్స్లో భాగంగా ఈ అవార్డును ప్రతి ఏటా ప్రకటిస్తారు. షాతో పాటు రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ, డాక్టర్ సమంత ఈ అవార్డుకు ఎంపికయ్యారు.
నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఛానల్ సబ్స్క్రైబర్ల (వీక్షకుల) సంఖ్య రెండు కోట్లు దాటింది. ప్రపంచంలో మరే ఇతర నేతకూ ఇలాంటి ఘనత లభించలేదు. 2007లో ఈ ఛానల్ను మోదీ ఏర్పాటు చేసుకున్నారు. ఛానల్లో మోదీ పోస్ట్ చేసిన వీడియోలకు వీక్షణలు (వ్యూస్) 450 కోట్ల పైనే ఉన్నాయి.
దీప్తి బాబుతా
పంజాబీ సాహిత్యంలో ధహన్ ప్రైజ్ గెలుచుకున్న మొదటి మహిళగా దీప్తి బాబుతా చరిత్ర సృష్టించారు. ఆమె విజయానికి ‘భుఖ్ ఇయోన్ సా లైండి హై’ అనే చిన్న కథల సంకలనం అని తెలిపింది.
గీతిక కౌల్
సైన్యానికి చెందిన కెప్టెన్ గీతిక కౌల్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లో విధులు నిర్వర్తించనున్న తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా నిలిచారు. పూర్తిగా మంచుతో నిండి ఉండే సియాచిన్లో (సముద్ర మట్టానికి దాదాపు 15,500 అడుగుల ఎత్తులో) విపరీతమైన చలి ఉంటుంది. ఇక్కడ విధులు నిర్వర్తించడమనేది సాహసంతో కూడుకున్నది.
ఉమా శేఖర్
ఇటలీలోని రోమ్ కేంద్రంగా పని చేసే అంతర్జాతీయ ప్రైవేటు న్యాయ ఏకీకరణ సంస్థ (యూనిడ్రాయిట్) పాలక మండలి సభ్యురాలిగా భారతదేశానికి చెందిన ఉమా శేఖర్ ఎన్నికయ్యారు. అమెరికా, చైనా, తుర్కియే, సౌదీ అరేబియా, ఫ్రాన్స్ తదితర 32 దేశాల నుంచి అభ్యర్థులు పోటీ పడినా ఆమె విజయం సాధించారు.
చిరాగ్ సేన్
సీనియర్ జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో చిరాగ్ సేన్ విజేతగా నిలిచాడు. ఈ మేరకు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో చిరాగ్ 21-–14, 13–-21, 21–-9తో తరుణ్పై విజయం సాధించాడు.
స్పోర్ట్స్
ఆస్ట్రేలియాకు ఆరోసారి ప్రపంచకప్
ప్రపంచకప్ ఫైనల్లో భారత్ మీద నెగ్గి ఆస్ట్రేలియా ఆరోసారి వరల్డ్ కప్ కైవసం చేసుకుంది. టోర్నీలో అత్యధిక పరుగులు (765) చేయడంతో విరాట్ కోహ్లీకి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ప్రపంచకప్లో మహమ్మద్ షమి అత్యధికంగా 24 వికెట్లు పడగొట్టాడు.
జకోవిచ్ సరికొత్త రికార్డు
నొవాక్ జకోవిచ్ ఖాతాలో మరో రికార్డు చేరింది. ఏటీపీ ఫైనల్స్ టోర్నీలో జకోవిచ్ విజేతగా నిలవడంతో ఫెదరర్ (6)ను దాటి ఏడోసారి ట్రోఫీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 400 వారాలు నంబర్వన్గా ఉన్న రికార్డు కూడా జకోవిచ్ సొంతం.
వెర్స్టాపెన్కు 19వ టైటిల్
ఫార్ములావన్ దిగ్గజ రేసర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ అబుదాబి గ్రాండ్ప్రి రేస్ను గెలుచుకున్నాడు. ఓవరాల్గా అతనికిది 54వ టైటిల్ కాగా అత్యధిక టైటిల్స్ సాధించిన వారిలో మూడో స్థానానికి చేరుకున్నాడు. లూయిస్ హామిల్టన్ (103), మైకేల్ షుమాకర్ (91) అతనికంటే ముందున్నారు.
శీతల్ దేవి@ నంబర్ వన్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మహిళల కాంపౌండ్ పారా ర్యాంకింగ్స్లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుని నంబర్ వన్గా నిలిచింది. ఇటీవల ఆసియా ఛాంపియన్షిప్లో శీతల్ రెండు స్వర్ణాలు, ఓ రజతంతో సత్తా చాటింది.
బిష్ణోయ్@ టీ20ల్లో నంబర్వన్ బౌలర్
భారత యువ లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీ20 క్రికెట్లో నంబర్వన్ బౌలర్గా అవతరించాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో స్థానానికి పరిమితం అయ్యాడు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్
వన్డే ప్రపంచకప్లో అదరగొట్టిన ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ నవంబర్ నెలకుగాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు. భారత పేసర్ మహ్మద్ షమి, ఆసీస్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా ఈ అవార్డు రేసులో ఉండగా.. చివరకు హెడ్ విజేతగా నిలిచాడు
సాత్విక్, చిరాగ్లకు ఖేల్ రత్న
భారత స్టార్ బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డును గెలుచుకుంది. ఆసియా క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్షిప్లో కాంస్యం, కామన్వెల్త్ క్రీడల్లో రజత పతకాలను ఈ జంట సాధించింది.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర
ఐపీఎల్ మినీ వేలంలో రూ.24.75 కోట్లు దక్కించుకున్న ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ను సన్రైజర్స్ హైదరాబాద్ ఏకంగా రూ.20.50 కోట్లకు దక్కించుకుంది.
డేవిస్ కప్ చాంపియన్ ఇటలీ
డేవిస్ కప్లో ఇటలీ జట్టు టోర్నీ చరిత్రలో రెండో సారి చాంపియన్గా నిలిచింది. 47 ఏళ్ల తర్వాత జట్టు ఖాతాలో ఈ టైటిల్ చేరింది. 1998లో ఫైనల్ చేరి ఓటమిపాలైన ఇటలీ… పాతికేళ్ల తర్వాత ఫైనల్లో ఇటలీ 2–0 తేడాతో 28 సార్లు చాంపియన్ ఆస్ట్రేలియాను చిత్తు చేసింది.
విజయ్ హజారే ట్రోపీ విన్నర్
రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో హర్యానా 30 పరుగుల తేడాతో రాజస్థాన్ను ఓడించి విజయ్ హజారే ట్రోఫీ 2023 టైటిల్ను గెలుచుకుంది. విజయ్ హజారే ట్రోఫీని తొలిసారి హర్యానా గెలుచుకుంది
సైన్స్ అండ్ టెక్నాలజీ
‘స్టార్షిప్’ ప్రయోగం విఫలం
మానవులను అంగారకుడు, చంద్రుడిపైకి పంపేందుకు అమెరికాకు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మెగా రాకెట్ ‘స్టార్షిప్’ మరోసారి విఫలం అయింది. నింగిలోకి పయనమైన 8 నిమిషాలకే ఈ రాకెట్తో సంబంధాలు తెగిపోయాయి.
ఇండియన్ నేవీలో ఐఎన్ఎస్ సంధాయక్
దేశంలో రూపొందిన అతిపెద్ద సర్వే నౌక ఐఎన్ఎస్ సంధాయక్ భారత నౌకాదళంలో చేరింది. కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (జీఆర్ఎస్ఈ) సంస్థ దీన్ని నిర్మించింది. రక్షణ అవసరాల కోసం సముద్ర, భౌగోళిక డేటాను సేకరించగలదు. అవసరమైతే ఆసుపత్రి నౌకగానూ సేవలు అందిస్తుంది. ఈ నౌకపై ఒక హెలికాప్టర్ను మోహరిస్తారు.
అగ్ని-1 క్షిపణి పరీక్ష సక్సెస్
స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణి ‘అగ్ని-1’ను శిక్షణలో భాగంగా ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి భారత్ విజయవంతంగా ప్రయోగించింది. నిర్దేశిత పరామితులన్నింటినీ అది కచ్చితత్వంతో అందుకున్నట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.
అతిపెద్ద విలాసవంతమైన నౌక
ప్రపంచంలోనే అతిపెద్ద విలాసవంతమైన నౌకను గ్వాంగ్ ఝౌ షిప్యార్డ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. ఈ భారీ ఓడ పేరు ‘మోబీ లెగసీ’. ఒకే విడతలో 2,500 మందిని గమ్యస్థానాలకు చేరుస్తుంది. 237 మీటర్ల పొడవు, 533 విలాసవంతమైన గదులతో 13 అంతస్తులు ఉంటాయి.
నేవీలోకి ‘ఐఎన్ఎస్ ఇంఫాల్’
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ ఇంఫాల్’ను నౌకాదళంలో ప్రవేశపెట్టారు. రక్షణ రంగంలో భారత స్వావలంబనకు ‘ఐఎన్ఎస్ ఇంఫాల్’ నిదర్శనమని రక్షణ మంత్రి రాజ్నాథ్ పేర్కొన్నారు.
Provide PDF files for current affairs