తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరంలో 5వ తరగతి అడ్మిషన్లకు సంబంధించి అప్లికేషన్ల ప్రక్రియ ఈరోజు (డిసెంబర్ 18) నుంచి మొదలు కానుంది. తెలంగాణలోని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్, టీటీడబ్ల్యూఆర్ఈఐఎల్, ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఈఐఎస్, టీఆర్ఈఐఎస్ గురుకులాల్లో 2024-25 విద్యాసంవత్సరానికి గానూ ఐదో తరగతి ఇంగ్లిషు మీడియంలో ప్రవేశాలకు సంబంధించి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ సెక్రటరీ నవీన్ నికోలస్ ప్రకటన విడుదల చేశారు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ: డిసెంబర్ 18, 2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 6, 2024.
ప్రవేశ పరీక్ష తేదీ: ఫిబ్రవరి 11, 2024.
ఐదో తరగతి ప్రవేశ పరీక్ష-2024, రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. ప్రస్తుతం 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 6. ఫిబ్రవరి11న రాత పరీక్ష నిర్వహిస్తారు. ఎగ్జామ్ మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు రుసుము కింద ప్రతి ఒక్కరూ రూ.100లు చెల్లించాల్సి ఉంటుంది. ఆయా జిల్లాల్లోని ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 4వ తరగతి చదివి ఉండాలి.
జిల్లాలోని గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి సంబంధిత జిల్లాలోని పాఠశాలల్లో చదువుతూ ఉండాలి. విద్యార్ధుల వయసు 9 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతంలో రూ.1.50,000, పట్టణ ప్రాంతంలో రూ.2,00,000 మించకుండా ఉండాలి. ఇతర వివరాలకు 1800 425 45678 టోల్ఫ్రీ నంబర్లో సంప్రదించాలని సూచించారు.
ప్రవేశ పరీక్ష విధానం:
తెలంగాణ గురుకులాల్లో అయిదో తరగతి ప్రవేశ పరీక్ష-2024 ఆబ్జెక్టివ్ పద్ధతిలో జరుగుతుంది. ఓఎంఆర్ షీట్ విధానంలో 10 ప్రశ్నలకు100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ఆంగ్ల మాధ్యమాల్లో ఉంటుంది. తెలుగుకు 20 మార్కులు, ఇంగ్లిష్ 25 మార్కులు, గణితం 25 మార్కులు, మెంటల్ ఎబిలిటీ 10 మార్కులు, పరిసరాల విజ్ఞానం 20 మార్కులు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు వస్తాయి. నాలుగో తరగతి స్థాయిలో ప్రశ్నలు అడుగుతారు.