ఈ ఏడాది తెలంగాణలో ఎంసెట్ రాయనున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో మే 7 నుంచి జరిగే ఎంసెట్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వనున్నారు. సెకండియర్లో మాత్రం 100 శాతం సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ఈ విషయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి వెల్లడించారు. ఎంసెట్ రాయబోయే విద్యార్థులు 2021-22లో ఫస్టియర్ పరీక్షలు రాశారని, కరోనా కారణంగా అప్పుడు 70 శాతం సిలబస్తోనే వార్షిక పరీక్షలు నిర్వహించినందున ఎంసెట్లో ప్రథమ సంవత్సరంలో అదే సిలబస్ ఉంటుందని వివరించారు. ఉన్నత విద్యామండలి తాజాగా చేసిన ప్రకటనతో ఎంసెట్ సిలబస్ విషయంలో ఏర్పడిన గందరగోళానికి తెరపడింది.