తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSLPRB) నిర్వహిస్తున్న పోటీ పరీక్షలకు, గురుకుల్ (TREI RB) పోస్టులకు నిర్వహిస్తున్న అన్ని పరీక్షలకు యూపీఎస్సీ (UPSC) పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్. జాతీయ, అంతర్జాతీయ స్థాయి ముఖ్యాంశాలు, తెలంగాణ విశేషాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, వార్తల్లో వ్యక్తులు.
అంతర్జాతీయం
■ భారత అమ్మాయిలదే ప్రపంచకప్
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించి టైటిల్ నెగ్గింద ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తితాస్ సాధు (2/6)తో పాటు పర్శవి చోప్రా (2/13), అర్చన దేవి (2/17) రాణించారు.
■ చెక్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా పావెల్
చెక్ రిపబ్లిక్ కొత్త అధ్యక్షుడిగా మాజీ సైనిక ఉన్నతాధికారి జనరల్ పెట్ర పావెల్ ఎన్నికయ్యారు. పావెల్కు 58.2 శాతం, బబీస్కు 42.8 శాతం ఓట్లు దక్కాయి. పావెల్, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. గతంలో నాటో కూటమిలోని సైనిక కమిటీకి నాయకత్వం వహించారు.
■ బ్రిటన్ రాజముద్ర తొలగింపు
ఆస్ట్రేలియా తమ దేశ ఐదు డాలర్ల కరెన్సీ నోటుపై ఇక నుంచి బ్రిటన్ రాజు చిత్తరువుని ముద్రించబోమని ఆ దేశ సెంట్రల్ బ్యాంకు ప్రకటించింది. ఆ స్థానంలో తమ దేశ మూలవాసుల సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త నోట్లను ఆస్ట్రేలియా ముద్రించనుంది.
■ఐఎస్ఐఎల్ అంతర్జాతీయ ఉగ్ర సంస్థే
ఆగ్నేయాసియాలోని భయానక ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవాంట్ (ఐఎస్ఐఎల్)ను అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ప్రకటించింది. దీంతో ఆ సంస్థకు చెందిన ఆస్తులను స్తంభింపజేయడంతో పాటు సంస్థ సభ్యుల ప్రయాణాలపైనా, ఆయుధాలపైనా నిషేధం విధించారు.
■65వ గ్రామీ అవార్డులు
ప్రఖ్యాత 65వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజెల్స్లో జరిగింది. భారత్కు చెందిన రిక్కీ కేజ్ ‘డివైన్ టైడ్స్’ ఆల్బమ్కు గానూ బెస్ట్ ఇమ్మర్సివ్ ఆడియో ఆల్బమ్ అవార్డు అందుకున్నారు. 2015, 2022, 2023తో కలిపి మూడు గ్రామీ అవార్డులు అందుకున్న ఏకైక భారతీయుడుగా కేజ్ నిలిచారు. అత్యధికంగా 31 గ్రామీ అవార్డులు పొందిన సెలబ్రిటీగా జార్జ్ సాల్టి ఉండేది. తాజాగా అమెరికన్ సింగర్, డ్యాన్సర్ బియాన్స్ 32 అవార్డులతో ఆ రికార్డును బద్ధలు కొట్టింది.
■పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ మరణం
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ అమైలాయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతూ మరణించారు. భారత్, పాక్ల మధ్య 1999 నాటి కార్గిల్ యుద్ధానికి ప్రధాన కారణం ముషారఫే. కేసుల భయంతో స్వదేశాన్ని వీడిన ఆయన 2016 నుంచి యూఏఈలో ఉంటున్నాడు.
■సైబర్ సెక్యూరిటీపై క్వాడ్ మీటింగ్
సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేసేందుకు మెషిన్ లెర్నింగ్తో పాటు ఇతర అత్యాధునిక సాంకేతికతలను కలిసికట్టుగా ఉపయోగించుకోవాలని ఆస్ట్రేలియా, భారత్, జపాన్, అమెరికాలతో కూడిన క్వాడ్ కూటమి నిర్ణయించింది. సైబర్ నేరాలను ఎదుర్కోవడానికి సభ్య దేశాలకు ఈ ఒప్పందం ఉపకరిస్తుందని తెలిపింది.
■చాట్ జీపీటీకి పోటీగా.. గూగుల్ బార్డ్
తిరుగులేని ఆదరణతో దూసుకెళ్తున్న చాట్జీపీటీ (చాట్ జెనరేటివ్ ప్రీ ట్రెయిన్డ్ ట్రాన్స్ఫార్మర్)కి పోటీగా గూగుల్ కృత్రిమ మేధ ఆధారిత చాట్బోట్ ‘బార్డ్’ను తీసుకొస్తోంది. చాట్ జీపీటీని మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజన్ బింగ్కు అనుసంధానం చేయనుందన్న వార్తల నేపథ్యంలో గూగుల్ ప్రకటన ఆసక్తి రేకెత్తిస్తుంది.
■బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా చుప్పూ
బంగ్లాదేశ్ కొత్త అధ్యక్షుడిగా మహమ్మద్ షహాబుద్దీన్ చుప్పూ ఎన్నికయ్యారు. అవామీ లీగ్ పార్టీ తరపున చుప్పూ పోటీ చేసినా, ప్రత్యర్థులు ఎవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 74 ఏళ్ల వయసున్న చుప్పూ ప్రస్తుతం అవామీ లీగ్ పార్టీ అడ్వైజరీ కౌన్సిల్ సభ్యుడిగా పనిచేస్తున్నారు.
■దక్షిణాఫ్రికాలో అత్యవసర పరిస్థితి
దక్షిణాఫ్రికాను తీవ్ర విద్యుత్ సంక్షోభం చుట్టుముట్టడంతో దేశంలో విపత్తు అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు అధ్యక్షుడు సిరిల్ రామఫోసా ప్రకటించారు. ఆస్పత్రులు, తాగు నీటి సరఫరా వ్యవస్థలకు నిరంతరం విద్యుత్ సరఫరా ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏకైక విద్యుత్ సరఫరా సంస్థ ఎస్కామ్ దివాళా తీయడంతో ఈ పరిస్థితిని ఎదుర్కొంటోంది.
■చిట్టెలుక గిన్నిస్ రికార్డు
కాలిఫోర్నియాకు చెందిన ఒక చిట్టెలుక ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన మూషికంగా గిన్నిస్ రికార్డు సాధించింది. దీని వయసు 9 ఏళ్ల 209 రోజులని ధ్రువీకరణ పత్రం స్పష్టం చేస్తోంది. మానవ సంరక్షణలో ఎక్కువ కాలం జీవించిన మూషికంగా ఇది గుర్తింపు సాధించింది. ఇది పసిఫిక్ పాకెట్ మౌస్ జాతికి చెందింది.
■ఆఫ్రికాలో కొత్త వైరస్
ఆఫ్రికా దేశంలోని ఈక్వటోరియల్ గినియాలో మార్బర్గ్ వైరస్ వ్యాప్తి కలకలం రేపుతోంది. ఈ కొత్తరకం ఎబోలా వ్యాప్తి చెందుతోందని, దీని వల్ల ఇప్పటి వరకూ 10 మంది ప్రాణాలు కోల్పోయారని ఫిబ్రవరి 14వ తేదీ డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
■యూఎన్ఓలో చిరుధాన్యాల ప్రదర్శన
‘అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం–2023’ సందర్భంగా న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి కార్యాలయంలో ప్రత్యేక చిరుధాన్యాల ప్రదర్శనను భారత్ ఏర్పాటు చేసింది. దేశంలో పండే వివిధ రకాలతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను యూఎన్ఓలో భారత శాశ్వత ప్రతినిధి రుచిర కాంబోజ్ ప్రారంభించారు.
■ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ బంగా
ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త అజయ్ బంగాను ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ఆయన నామినేషన్కు ప్రపంచ బ్యాంకు డైరెక్టర్ల బోర్డు ఆమోదముద్ర వేస్తే ప్రపంచ బ్యాంకు అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్గా బంగా చరిత్ర సృష్టిస్తారు.
■సియాటెల్లో కొత్త చట్టం
అమెరికాలో అమలవుతున్న ‘వివక్ష వ్యతిరేక చట్టంలో’ కులాన్ని చేర్చిన మొదటి నగరంగా సియాటెల్ నిలిచింది. స్థానిక సభలో ప్రవాస భారతీయురాలు, సియాటెల్ నగర కౌన్సిల్ సభ్యురాలు క్షమా సావంత్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. సియాటెల్ సిటీ కౌన్సిల్ 6-1 ఓట్లతో దాన్ని ఆమోదించింది. ఈ నిర్ణయంతో ప్రవాస భారతీయుల్లోని కొన్ని కులాలకు వివక్ష నుంచి విముక్తి లభిస్తుంది.
■అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
మాతృభాషలో చదువుకుంటే విద్యార్థులకు ఎంతో మంచిదని యునెస్కో పేర్కొంది. 24వ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం సందర్భంగా ‘బహుభాష విద్య మార్పునకు ఒక అవసరం’ అన్న అంశంపై దృష్టిసారించామని యునెస్కో పేర్కొంది.
■తొలి డిజిటల్ దేశంగా తువాలు
రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా మెటావర్స్ సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూడొచ్చని ఆ దేశ మంత్రి సైమన్ కోఫే తెలిపారు. ఇందులో తువాలు చరిత్రకు సంబంధించిన డాక్యుమెంట్లు, సంస్కృతీ సంప్రదాయాలు, కుటుంబ చిత్రాలు, సంప్రదాయ పాటలు నిక్షిప్తం చేయనున్నారు.
■బాల్య వివాహాల నిరోధక చట్టం
బాలికలకు చట్టబద్ధ వివాహ వయసును 18 ఏళ్లకు పెంచుతున్న చట్టం ఇంగ్లండ్, వేల్స్లలో అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన సరికొత్త వివాహ, పౌర భాగస్వామ్య (కనీస వయసు) చట్టం నిరుడు ఏప్రిల్లోనే రాజామోదం పొందింది.
■ఇరాన్ కరెన్సీ పతనం
ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు, 2015 అణు ఒప్పందం విచ్ఛిన్నత వంటి పరిణామాల నేపథ్యంలో ఇరాన్ కరెన్సీ పతనం అవుతోంది. తొలిసారిగా డాలర్ విలువ 6,00,000 ఇరాన్ రియాల్స్కు చేరింది. ఇరాన్లో ద్రవ్యోల్బణం రెండేళ్ల క్రితం 41.4 శాతం ఉండగా ఈ ఏడాది జనవరిలో 53.4 శాతానికి చేరింది.
■అధ్యక్షుడిగా మూడోసారి జిన్పింగ్
చైనా అధ్యక్షుడిగా మూడోసారి జిన్పింగ్ బాధ్యతలు స్వీకరించారు. గతేడాది అక్టోబరు16న జరిగిన 20వ కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్లో ఆయన్ను మరోసారి అధ్యక్షుడిగా ప్రకటించారు. పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత మూడవసారి అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన నాయకుడు జిన్పింగ్నే కావడం విశేషం.
■రక్షణ బడ్జెట్@225 బిలియన్ డాలర్లు
చైనా రక్షణ బడ్జెట్ను 7.2 శాతం పెంచడంతో 225 బిలియన్ డాలర్లకు చేరింది. ప్రపంచంలో అమెరికా రక్షణ బడ్జెట్ 2023 సంవత్సరానికి 816 బిలియన్ డాలర్లు. ఆ తరువాత అత్యధిక బడ్జెట్ చైనాదే. భారత రక్షణ బడ్జెట్ (రూ.5.94 లక్షల కోట్లు/72.6 బిలియన్ డాలర్లు)తో పోలిస్తే మూడు రెట్లు అధికంగా ఉంది.
■గిజా పిరమిడ్లో సొరంగం
ఈజిప్టులో గ్రేట్ గిజా పిరమిడ్ ఉత్తర భాగంలో 30 అడుగుల పొడవైన, ఆరు అడుగుల వెడల్పైన సొరంగ ప్రవేశమార్గాన్ని అంతర్జాతీయ పురావస్తు పరిశోధకుల బృందం కనుగొంది. పిరిమిడ్లోని గుర్తించని భాగాలను కనిపెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ‘స్కాన్ పిరమిడ్స్ ప్రాజెక్టు’లో భాగంగా దీన్ని గుర్తించారు.
■తొలి భారతీయ అమెరికన్ మహిళ
అమెరికాలోని మసాచుసెట్స్లో తొలి భారతీయ అమెరికన్ మహిళా జడ్జిగా తెజల్ మెహతా నియమితులయ్యారు. అయెర్ జిల్లా కోర్టు న్యాయమూర్తిగా ఆమె ప్రమాణస్వీకారం చేశారు. కొంతకాలంగా ఇదే న్యాయస్థానంలో ఆమె సహ న్యాయమూర్తిగా పని చేశారు.
■ప్రపంచంలోనే బెస్ట్ విమానాశ్రయం
సింగపూర్లోని ‘ఛాంగి’ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. ఖతార్ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో స్థానంలో నిలవగా.. టోక్యోలోని హనీదా విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది.
■చైనా ప్రధానిగా లీ చియాంగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్కు అత్యంత విశ్వసనీయుడైన లీ చియాంగ్ ఆ దేశ నూతన ప్రధానిగా మంత్రిగా ఎన్నికయ్యారు. గత పదేళ్లుగా ప్రధాని పదవిలో ఉన్న లీ కచియాంగ్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. చియాంగ్ పేరును చైనా పార్లమెంట్ ఆమోదించింది.
■ఆస్కార్ అవార్డులు
లాస్ ఏంజిల్స్ వేదికగా 95వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ ఉత్తమ చిత్రంగా నిలవగా, డానియల్ క్వాన్, డేనియల్ స్కీనెర్ట్ ఈ సినిమాకు ‘ఉత్తమ దర్శకుడి’గా అవార్డును గెలుచుకున్నారు. మిషెల్ యో ‘ఉత్తమ నటి’ అవార్డును, ‘ది వేల్’ చిత్రంతో బ్రెండన్ ఫ్రేజర్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
■హ్యాపీనెస్ ర్యాంకింగ్
అంతర్జాతీయ ఆనంద దినోత్సవం సందర్భంగా యూఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ తాజా ర్యాంకులు విడుదల చేసింది. సంతోష సూచీల్లో నార్డిక్ దేశాలైన ఫిన్లాండ్ (1), డెన్మార్క్ (2), ఐస్లాండ్ (3) వరుసగా తొలి మూడు ర్యాంకుల్లో ఉండగా, భారత్ 125వ స్థానంలో నిలిచింది.
■రష్యాలో జిన్పింగ్ పర్యటన
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మూడు రోజులు రష్యాలో పర్యటించారు. రష్యాపై దండయాత్రకు దిగిన రష్యాను ఒంటరిని చేసేందుకు పశ్చిమ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తుండడం, యుద్ధ నేరాల ఆరోపణల కింద పుతిన్కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంటు జారీ చేసిన చేసిన నేపథ్యంలో జిన్పింగ్ రష్యా పర్యటన ప్రారంభించడం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది.
■ఇండియాలో జపాన్ ప్రధాని
భారత్–జపాన్ అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఇరు దేశాల ప్రధానులు చర్చించారు. భారత ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని ప్యుమియో కిషిడాలు రక్షణ, డిజిటల్ సాంకేతికత, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
■నాటోలోకి ఫిన్లాండ్
ఫిన్లాండ్ నాటో సైనిక కూటమిలో 31వ సభ్య దేశంగా అధికారికంగా చేరింది. నాటోలో ఫిన్లాండ్ చేరేందుకు చివరగా అమోదం తెలిపిన దేశంగా తుర్కియే నిలిచింది. రష్యాతో ఫిన్లాండ్కు 1,340 కి.మీ. సరిహద్దు ఉండడంతో రష్యా భద్రతకు పెనుసవాలుగా మారనుంది.
■యూఎన్వో గణాంక కమిషన్కు భారత్
వచ్చే జనవరి 1వ తేదీ నుంచి నాలుగు సంవత్సరాల కాలానికి ఐక్యరాజ్యసమితి అత్యున్నత గణాంక కమిషన్ సభ్యురాలిగా భారత్ ఎన్నికైంది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జై శంకర్ వెల్లడించారు.
■రష్యాకు యూఎన్ఎస్సీ బాధ్యతలు
ఐరాస భద్రతామండలి అధ్యక్ష బాధ్యతలు రష్యా దక్కించుకుంది. యూఎన్ఎస్సీలో శాశ్వత సభ్య దేశమైన రష్యా ఏప్రిల్ నెలకు ఈ బాధ్యతలు చేపట్టింది. యూఎన్ఎస్సీ అధ్యక్ష హోదాలో రష్యా బాధ్యతగా వ్యవహరించాలని వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కెరీన్ జీన్ పెర్రీ కోరారు.
■యుద్ధానికి చైనా సిద్ధం
చైనా–తైవాన్ ఘర్షణ తారస్థాయికి చేరుతోంది. ఈ ద్వీప దేశంపై ఏ క్షణంలోనైనా యుద్ధానికి దిగేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నట్లు చైనా సైన్యం ప్రకటించింది. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా వాదిస్తుండగా, తైవాన్ తీవ్రంగా విభేదిస్తోంది.
■సౌదీ–ఇరాన్ మధ్య దౌత్య సంబంధాలు
కొన్నేళ్లపాటు శత్రు దేశాలుగా ఉన్న సౌదీ అరేబియా, ఇరాన్ తమ మధ్య దౌత్య సంబంధాలను పునరుద్ధరించుకున్నాయి. దౌత్య సంబంధాల పునరుద్ధరణపై సౌదీ, ఇరాన్ విదేశాంగ మంత్రులు తాజాగా బీజింగ్లో ఒప్పందం కుదుర్చుకున్నారు.
■ఐరాస మహిళా సిబ్బందిపై నిషేధం
అఫ్గానిస్థాన్లో ఐక్యరాజ్య సమితి పరిధిలో అఫ్గాన్ మహిళలు ఎవరూ పనిచేయకూడదని తాలిబన్ సర్కారు నిషేధం విధించింది. ముందుగా వివిధ జాతీయ, అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థల్లోని మహిళలపై నిషేధం విధించిన తాలిబన్లు ఈ మేరకు ఐరాస మహిళా సిబ్బందికీ దాన్ని వర్తింపజేశారు.
■జనాభాలో వరల్డ్ నంబర్ వన్
జనాభాలో చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించిందని ఐక్యరాజ్యసమితి చెందిన సంస్థ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ‘స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2023’ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం భారత జనాభా 142.86 కోట్లతో తొలి స్థానంలో ఉండగా, చైనా జనాభా 142.57 కోట్లతో రెండో స్థానంలో ఉంది.
■ఉక్రెయిన్ చేతికి ‘పేట్రియాట్’
అమెరికా అత్యాధునిక పేట్రియాట్ గైడెడ్ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్ చేతికొచ్చింది. భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే పేట్రియాట్ క్షిపణి వ్యవస్థతో శత్రు సేనల నుంచి దూసుకొచ్చే క్షిపణులు, స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లను కూల్చేయొచ్చు.
■ప్రపంచంలోనే తేలికైన పెయింట్
ప్రపంచంలోనే తేలికైన పెయింట్ను అమెరికాలోని సెంట్రల్ ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తయారుచేశారు. ఎలాంటి రంగు లేకుండా ఉండే ఈ ప్లాస్మోనిక్ పెయింట్ను ఏ రంగులోకి అయినా సులువుగా మార్చుకోవచ్చు. ఈ పెయింట్ను యూనివర్సిటీ ప్రొఫెసర్ దెబాశిస్ చందా నాయకత్వం వహించారు.
■నేరాల్లో వెనుజులా టాప్
నేరాలపై వెలువడిన ఒక నివేదిక ప్రకారం–ప్రపంచ దేశాల్లో భారత్ 77వ స్థానంలో నిలిచింది. వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రకారం–అత్యధిక నేరాలతో వెనుజులా మొదటి స్థానంలో నిలిచింది. అమెరికాకు 55వ ర్యాంక్, ఇంగ్లండ్కు 65వ ర్యాంక్ లభించింది.
■‘జ్యూస్’ ప్రయోగం సక్సెస్
గురు గ్రహం, దాని చుట్టూ పరిభ్రమిస్తున్న చందమామలపై పరిశోధనల కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) ‘జ్యూస్’ వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియాన్ రాకెట్ ద్వారా ఇది నింగిలోకి పయనమైంది.
■అరబ్ లీగ్లోకి సిరియా
అరబ్ లీగ్లోకి సిరియా అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. లీగ్ విదేశాంగ మంత్రులు కైరోలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2011లో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్న ఆందోళనలు అణచివేయడం, అంతర్యుద్ధానికి దారి తీయడంతో ఆ దేశం సభ్యత్వం రద్దైంది.
■పులిట్జర్ అవార్డులు
చార్లెస్ డికెన్స్ రచించిన డేవిడ్ కాపర్ ఫీల్డ్ నవలను ఆధునిక కాలానికి అన్వయిస్తూ బార్బరా కింగ్సాల్వర్ రచించిన ‘డీమన్ కాపర్ ఫీల్డ్’ నవలతో పాటు 1920 నాటి న్యూయార్క్ నగరంలో మోసాల గురించి హెర్నన్ డియాజ్ రచించిన ‘ది ట్రస్ట్’ నవలకు పులిట్జర్ బహుమతులు ప్రకటించారు.
■ముగ్గురి డీఎన్ఏతో శిశువు
బ్రిటన్ శాస్త్రవేత్తల ప్రయోగంతో ఆ దేశంలో తొలిసారి ఓ శిశువు ముగ్గురి డీఎన్ఏలతో జన్మించింది. ఇందులో 99.8 శాతం డీఎన్ఏ తల్లిదండ్రలదే కాగా.. మిగతా శాతం మహిళా దాతది. వినాశకరమైన మైటోకాండ్రియల్ వ్యాధులతో పిల్లలు పుట్టకుండా ఈ సాంకేతికత ఉయోగిస్తున్నారు.
■తీవ్రంగా మోచా తుఫాన్
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మోచా తుపాను బంగ్లాదేశ్, మయన్మార్లను వణికిస్తోంది. గంటకు గరిష్ఠంగా 180- – 190 నుంచి 210 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురు గాలులతో తీరప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. ఇప్పటికే దాదాపు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.
■బైడెన్ ఎన్నికల టీంలో భారతీయ అమెరికన్లు
అమెరికా అధ్యక్షుడు బైడెన్ 2024 ఎన్నికల ప్రచార సలహా మండలిలో ముగ్గురు భారతీయ అమెరికన్లకు చోటు దక్కింది. అమెరికా కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అమి బెరా, కాంగ్రెస్లో భారత్కు మద్దతు పలికే గ్రూపు ఉపాధ్యక్షులు రో ఖన్నా, సిన్సినాటి మేయర్ అఫ్తాబ్ పురేవాల్ సభ్యులుగా నియమితులయ్యారు
■కుల వివక్షను నిషేధించే బిల్లు
కుల వివక్షను నిషేధిస్తూ కాలిఫోర్నియా సెనెట్ చరిత్రాత్మక బిల్లును ఆమోదించింది. అమెరికాలో ఇలాంటి బిల్లును ఆమోదించిన మొదటి రాష్ట్రం కాలిఫోర్నియానే. అఫ్గానిస్థాన్ సంతతికి చెందిన సెనేటర్ అయిషా వాహబ్ గత నెలలో ఈ బిల్లును (ఎస్బీ403) ప్రవేశపెట్టారు. 34–-1 ఓట్ల తేడాతో ఆమోద ముద్ర లభించింది.
■‘సముద్ర శక్తి’ విన్యాసాలు
‘సముద్ర శక్తి’ పేరుతో భారత్, ఇండోనేసియా నౌకాదళాలు సంయుక్త విన్యాసాలు చేస్తున్నాయి. ఇండోనేసియాకు సమీపంలో ఇవి జరుగుతున్నాయి. భారత్ తరఫున ఐఎన్ఎస్ కవరత్తి యుద్ధనౌక, సముద్ర గస్తీ విమానం డోర్నియర్, ఒక చేతక్ హెలికాప్టర్ పాలుపంచుకుంటున్నాయి.
■‘లిటిల్ ఇండియా’కు శంకుస్థాపన
ఆస్ట్రేలియాలో పర్యటించిన ప్రధాని మోడీ ప్రవాస భారతీయుల సేవలకు గుర్తుగా ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనీస్తో కలిసి ‘లిటిల్ ఇండియా’కు శంకుస్థాపన చేశారు. పారామాట నగరంలోని హారిస్ పార్క్లో ‘లిటిల్ ఇండియా’ గేట్ వే నిర్మించనున్నారు. ఈ పార్క్ వద్ద భారత సంతతి ప్రజలు దీపావళి, ఆస్ట్రేలియా డే వేడుకలను నిర్వహిస్తుంటారు.
■దయనీయ దేశంగా జింబాబ్వే
ప్రపంచంలోనే అత్యంత దయనీయ దేశంగా జింబాబ్వే నిలిచింది. ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక వేత్త స్టీవ్ హాంకే ‘వార్షిక దయనీయ సూచీ’ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా పరిశీలించిన 157 దేశాల్లో రికార్డు స్థాయిలో ద్రవ్యోల్బణంతో జింబాబ్వే తొలి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్ 103వ ర్యాంకులో నిలిచింది.
■చార్లెస్ పట్టాభిషేకం
బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్ మే 6న పట్టాభిషేకం జరగనుంది. 1953 తర్వాత బ్రిటన్లో ఇదే తొలి పట్టాభిషేకం. నిరాడంబరంగా జరగబోతున్న ఈ వేడుకలో ఛార్లెస్తో పాటు ఆయన భార్య కెమిల్లా రాణిగా కిరీటం ధరిస్తారు.
■అత్యంత ప్రతికూల ఏడాదిగా 2022
2022 సంవత్సరం మానవాళికి అత్యంత నష్టాన్ని కలిగించినదిగా ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ప్రకటించింది. యూఎన్ నేతృత్వంలో ‘స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమెట్ 2022’ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
■మీడియా స్వేచ్ఛలో భారత్ ర్యాంక్
ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూచీ-2023లో 161వ స్థానానికి భారత్ పరిమితమైంది. గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు161కి చేరింది. రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ (ఆర్ఎస్ఎఫ్) అనే గ్లోబల్ మీడియా వాచ్డాగ్ 180 దేశాలకు ఈ స్వేచ్ఛా సూచిని ప్రచురిస్తుంటుంది. నార్వే టాప్లో ఉంది.
■వైమానిక విన్యాసాలు
భారత్, జపాన్ సంయుక్త వైమానిక విన్యాసాలు జనవరి 12 నుంచి 26 వరకు జపాన్లోని హైకురి ఎయిర్బేస్లో జరుగుతున్నాయి. ‘వీర్ గార్డియన్-2023’ పేరుతో రెండు దేశాల వైమానిక సేనలు ఈ సంయుక్త విన్యాసాలు చేయనున్నాయి.2022 ఫిబ్రవరి–-మార్చిలో భారత్, జపాన్ తొలిసారిగా ‘ధర్మ గార్డియన్-2022’ పేరిట సంయుక్త సైనిక విన్యాసాలు చేపట్టాయి.
■పాకిస్తాన్లో ఆహార సంక్షోభం
పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభంతో పాటు ఆహార సంక్షోభం మొదలయ్యింది. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రధానంగా గోధుమ పిండి కొరత వేధిస్తోంది. రాయితీపై ప్రభుత్వం అందించే గోధుమ పిండి కోసం జనం ఎగబడుతున్నారు.
■ఆస్కార్ రేసులో కాంతారా
ప్రపంచంలోని సినిమా అవార్డుల్లో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ రేసులో పాన్ ఇండియా చిత్రాలుగా సత్తా చాటిన ఆర్ఆర్ఆర్, కాంతారా సినిమాలు బరిలో నిలిచాయి. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్లో సంచలనం సృష్టించిన కన్నడ చిత్రం ‘కాంతార’ ఆస్కార్ పోటీల జాబితాలో ఉత్తమ చిత్రం మరియు ఉత్తమ నటుడి(రిషబ్శెట్టి)గా అర్హత సాధించింది.
■25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్బీబీ
కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్బీబీ.1.5 కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ ఇప్పటికే 25 దేశాలకుపైగా విస్తరించిందని పేర్కొంది. అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. భారత్లో మాత్రం కరోనా వేరియంట్ల ప్రభావం కన్పించండం లేదు.
■ప్రపంచంలో మొదటి రోబో లాయర్
ప్రపంచంలోనే మొట్టమొదటి రోబో లాయర్ త్వరలో కోర్టు కేసును వాదించబోతోంది. ఈ రోబో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ లీగల్ అసిస్టెంట్గా మారింది. ఈ AI రోబోట్ను డునాట్పే అనే కంపెనీ తయారు చేసిన ఈ రోబో వచ్చే ఫిబ్రవరిలో ఒకే కేసులో తన కక్షిదారుకు సహకరించనుంది.
■జనాభాలో భారత్ నంబర్వన్
ప్రపంచ జనాభాలో చైనాను భారత్ ఇప్పటికే అధిగమించి తొలి స్థానానికి చేరుకున్నట్లు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా ‘వరల్డ్ పాపులేషన్ రివ్యూ’ ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించినట్లు పేర్కొంది. చైనాలో జననాల రేటు తగ్గినట్లు ఇటీవలి కొన్ని నివేదికలు వెల్లడించాయి.
■నేపాల్లో విమాన ప్రమాదం
నేపాల్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 72 మంది దుర్మరణం చెందారు. ఖాఠ్మాండు నుంచి టూరిస్టు కేంద్రమైన పొఖారా బయల్దేరిన యతి ఎయిర్లైన్స్ విమానం ల్యాండవడానికి కొద్దిసేపటి ముందు ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దారుణంలో అందరూ మరణించినట్లు భావిస్తున్నారు.
■న్యూజిలాండ్ ప్రధాని రాజీనామా
పది నెలల పదవీకాలం ఉండగానే న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. ప్రధానమంత్రిగా ఫిబ్రవరి 7 తన ఆఖరి రోజని లేబర్ పార్టీ సభ్యుల సమావేశంలో ప్రకటించి ప్రపంచ దేశాలను షాక్కి గురి చేశారు.
■లెఫ్టినెంట్ గవర్నర్గా అరుణా మిల్లర్
అమెరికాలోని భారత సంతతి మహిళ అరుణా మిల్లర్ మేరీలాండ్ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ (10వ)గా ఎన్నికైన తొలి భారత-–అమెరికా మహిళా రాజకీయవేత్తగా రికార్డుకెక్కారు. డెమోక్రాట్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. పలువురు రిపబ్లికన్లూ అమెకు మద్దతు తెలపడం విశేషం.
■బ్రెజిల్ అధ్యక్షుడిగా లూలా డా సిల్వా
బ్రెజిల్ దేశ 39వ అధ్యక్షుడిగా లులా డా సిల్వా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జైర్ బోల్సోనారోపై లులా డ సిల్లా మెజార్టీ సాధించారు. గతంలో ఆయన 2003 నుంచి 2006 వరకు, 2007 నుంచి 2011 వరకు రెండు పర్యాయాలు బ్రెజిల్ అధ్యక్షుడిగా పనిచేశారు.
■భద్రతా మండలికి కొత్త దేశాలు
భద్రతా మండలి అయిదు కొత్త సభ్య దేశాలకు స్వాగతం పలికింది. జపాన్, స్విట్జర్లాండ్, మొజాంబిక్, ఈక్వెడార్, మాల్టా దేశాలు మండలిలో రెండేళ్ల పాటు సభ్యులుగా ఉంటాయి. భారత్, ఐర్లాండ్, కెన్యా, మెక్సికో, నార్వే దేశాల రెండేళ్ల సభ్యత్వ కాలం డిసెంబరు 31తో ముగిసింది.
■ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దంపతులను కేంద్ర ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్కు ఎంపిక చేసింది. ప్రవాసీయులకు ఇచ్చే ఈ అత్యున్నత అవార్డుకు ఈ ఏడాది 21 మందిని ఎంపిక చేసింది. మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో జరిగే ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
■అంతరిక్షంలో సినిమా షూటింగ్
రష్యా దర్శకుడు క్లిమ్ షిపెంకో రూపొందిస్తున్న సినిమా ‘ద చాలెంజ్’లో ఒక సీక్వెన్స్ను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో తీశారు. అందులో నటించిన యూలియా పెరెస్లిడ్తో కలిసి12 రోజుల పాటు ఐఎస్ఎస్లో గడిపారు. దీంతో అంతరిక్షంలో షూటింగ్ జరుపుకున్న తొలి సినిమాగా ద చాలెంజ్ రికార్డు సృష్టించింది
■సిరియాపై ఇజ్రాయెల్ దాడులు
ఇజ్రాయెల్ ప్రభుత్వం మరోమారు సిరియాపై దాడికి పాల్పడింది. సిరియా రాజధాని డమాస్కస్లోని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్పై క్షిపణి దాడులకు దిగింది. బషర్ అల్ అసద్కు మద్దతు పలుకుతున్న స్థానిక ఉగ్రవాదులకు ఇరాన్, లెబనాన్ హిజ్బుల్లాల నుంచి ఆయుధాల సరఫరా అడ్డుకునేందుకే ఈ దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
■మలేసియా కొత్త ప్రధానిగా అన్వర్
మలేసియాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హంగ్ ఏర్పడగా 75 ఏళ్ల అన్వర్ ఇబ్రహీం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 20 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి, జైలు శిక్షలు అనుభవించి, అనేక సంస్కరణల కోసం పోరాడినా అన్వర్ పగ్గాలు చేపట్టడంతో దేశాభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశాభావంతో ఉన్నారు.
■మంకీపాక్స్ ఇక ఎంపాక్స్
మంకీపాక్స్ కొన్ని దశాబ్దాల నుంచి ఆఫ్రికాలో జనానికి సోకుతున్నప్పటికీ ఆ వ్యాధి పేరు జాతి వివక్ష ధ్వనించేలా ఉందని ఫిర్యాదులు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇక నుంచి మంకీ పాక్స్ వ్యాధిని ఎంపాక్స్ అని వ్యవహరించాలని ప్రకటించింది.
■పాక్ ఆర్మీ కొత్త చీఫ్ బాధ్యతలు
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ అధిపతిగా గతంలో పనిచేసిన జనరల్ అసీం మునీర్ పాక్ ఆర్మీ కొత్త చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ ఖమర్ జావేద్ బజ్వా పదవీ విరమణ చేయడంతో పాక్ ఆర్మీకి 17వ కొత్త చీఫ్గా మునీర్ను ప్రధాని షెహబాజ్ షరీఫ్ నియమించారు.
■ఆస్ట్రేలియా స్టెమ్ సూపర్స్టార్స్
ఆస్ట్రేలియాలోని ప్రతిష్టాత్మక సూపర్స్టార్స్ ఆఫ్ ‘స్టెమ్’ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథమేటిక్స్) అవార్డుకు ఈ ఏడాది ఎంపికైన 60 మంది శాస్త్రవేత్తల్లో భారతీయ మూలాలున్న నీలిమా కడియాల, డాక్టర్ అనా బాబూరమణి, డాక్టర్ ఇంద్రాణి ముఖర్జీ చోటు సాధించారు.
■అతిపెద్ద రేడియో టెలిస్కోప్
ది స్క్వేర్ కిలోమీటర్ అరే (ఎస్కేఏ) పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద రేడియో టెలిస్కోప్ నిర్మాణం ఆస్ట్రేలియాలో మొదలైంది. 2028 నాటికి ఈ యంత్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీని నిర్మాణం దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో చేపట్టారు. ప్రధాన కార్యాలయం మాత్రం బ్రిటన్లో ఉంటుంది.
■పెరూ అధ్యక్షురాలిగా దినా బొలార్టే
పెరూ దేశానికి తొలిసారి ఓ మహిళ దేశాధ్యక్షురాలిగా దినా బొలార్టే ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంసన ద్వారా తొలగించారు. ఈ నేపథ్యంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న దినా బొలార్టే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. జూలై 2026 వరకు తానే అధికారంలో ఉండనున్నట్లు ఆమె తెలిపారు.
■ఆక్స్ఫర్డ్ ఈ ఏటి మేటి పదం ‘గాబ్లిన్ మోడ్’
‘గాబ్లిన్ మోడ్’ ఈ ఏడాది మేటి పదంగా ఎన్నికైనట్లు ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీ ప్రచురించే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ (ఓయూపీ) ప్రకటించింది. గాబ్లిన్ మోడ్ అనే పదం వ్యక్తి ప్రవర్తనను సూచిస్తుంది. ఎంతసేపటికీ తన సుఖాలు, తన కోరికలే తప్ప ఇతరుల గురించి పట్టించుకోని తత్వమది.
■ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరాలుగా న్యూయార్క్, సింగపూర్ నిలిచాయి. పెరుగుతున్న జీవన వ్యయాల ఆధారంగా ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఈఐయూ) అనే సంస్థ ఈ జాబితాను రూపొందించింది. 172 ప్రధాన నగరాల జాబితాలో న్యూయార్క్, సింగపూర్ సంయుక్తంగా తొలి స్థానం దక్కించుకున్నాయి.
■భద్రతామండలి ప్రెసిడెంట్గా భారత్
ఐక్యరాజ్యసమితిలోని శక్తివంతమైన భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలను భారత్ చేపట్టింది.15 దేశాల మండలిలో డిసెంబర్ నెలకు గాను అధ్యక్ష పీఠంపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ కొనసాగుతారు. మండలిలో భారత్ రెండేళ్ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్తో ముగియనుంది.
■యూఎన్ఓలో గాంధీ విగ్రహం
ఐక్యరాజ్య సమితి కార్యాలయ ఆవరణలో యూఎన్ఓ సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్తో కలిసి భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. సామ్రాజ్యవాదంపై మహాత్మా గాంధీకి ఉన్న వ్యతిరేకతే ఐరాసకు పునాది అని గుటెరస్ పేర్కొన్నాడు.
■స్వలింగ వివాహాలు చట్టబద్ధం
అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్) ఉభయ సభల్లో ఇప్పటికే ఆమోదం పొందిన స్వలింగ వివాహాల(గే, లెస్బియన్ మ్యారేజెస్) బిల్లుపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. దీంతో బిల్లు ఇక చట్టంగా మారింది. ఈ చట్టం సమాజంలో పలు రూపాల్లో ఉన్న ద్వేషాలకు ఒక ఎదురుదెబ్బ అని బైడెన్ అభివర్ణించారు.
■సిగరెట్లు కొనకుండా నిషేధం
ఆరోగ్యాన్ని హాని కలిగించే పొగాకు వినియోగాన్ని అరికట్టడానికి న్యూజిలాండ్ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం యువత సిగరెట్లు కొనకుండా జీవితకాలం నిషేధం విధించారు. 2009 జనవరి 1న, ఆ తర్వాత జన్మించినవారంతా సిగరెట్లకు దూరంగా ఉండాలి. వారికి ఎవరైనా సిగరెట్లు విక్రయిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి.
■ఐర్లాండ్ ప్రధానిగా లియో వరాద్కర్
భారత సంతతికి చెందిన లియో వరాద్కర్ ఐర్లాండ్ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. ఫిన్గేల్ పార్టీకి చెందిన ఈయనకు రొటేషన్ పద్ధతిలో అవకాశం వచ్చింది. 2017లో తొలిసారి ఐర్లాండ్ ప్రధానిగా ఎంపికైన 43 ఏళ్ల వరాద్కర్, ప్రపంచంలోని అతి కొద్ది మంది స్వలింగ సంపర్క నేతల్లో ఒకరు.
■ప్రపంచ చాంపియన్లుగా నాదల్, స్వైటెక్
ఈ ఏడాది రెండేసి గ్రాండ్స్లామ్ టైటిళ్లు గెలిచిన రఫెల్ నాదల్ (స్పెయిన్), ఇగా స్వైటెక్ (పోలెండ్) ఐటీఎఫ్ ప్రపంచ చాంపియన్ టైటిల్కు ఎంపికయ్యారు. గ్రాండ్స్లామ్, బిల్లీ జీన్ కింగ్ కప్, డేవిస్ కప్ తదితర ప్రధాన టోర్నీలను ప్రతిపాదికగా తీసుకుని ఐటీఎఫ్ ఈ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది నాదల్ ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు గెలిచాడు. స్వైటెక్ ఫ్రెంచ్, యుఎస్ ఓపెన్ ట్రోఫీలు నెగ్గింది.
■ నింగిలోకి నాసా ‘స్వాట్’
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహాసముద్రాలు, నదులు, సరస్సులను మ్యాప్ చేసే సామర్థ్యమున్న సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ (స్వాట్) ఉపగ్రహాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా నింగిలోకి పంపింది. కాలిఫోర్నియాలోని వాండెన్బర్గ్ అంతరిక్ష కేంద్రం నుంచి స్పేస్ఎక్స్ రాకెట్ ద్వారా ఈ ప్రయోగం జరిగింది. దీన్ని ఫ్రాన్స్తో కలిసి నాసా అభివృద్ధి చేసింది.
జాతీయం
■‘అమృత్ ఉద్యాన్’గా మొగల్ గార్డెన్స్
ప్రపంచంలోనే అత్యంత ప్రముఖ ఉద్యాన వనాల్లో ఒకటైన రాష్ట్రపతి భవన్లోని మొగల్ గార్డెన్స్ను ఇకపై ‘అమృత్ ఉద్యాన్’గా పిలవనున్నారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను దేశం నిర్వహించుకొంటున్న వేళ మొగల్ గార్డెన్స్ పేరును మారుస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం తెలియజేసింది.
■2023–24 కేంద్ర బడ్జెట్
2023–24 ఆర్థిక సంవత్సరానికి 45.03 లక్షల కోట్ల రూపాయలతో కేంద్ర బడ్జెట్ను నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును జీడీపీలో 5.9 శాతానికి పరిమితం చేస్తామని పేర్కొన్నారు. 2022–23లో ద్రవ్యలోటును 6.4 శాతంగా సవరించారు.
■రాష్ట్ర గీతంగా ‘జై జై మహారాష్ట్ర మాఝా’
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ‘జై జై మహారాష్ట్ర మాఝా’ను రాష్ట్ర గీతంగా గుర్తించారు. ఫిబ్రవరి 19న మరాఠా సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ విషయాన్ని లాంఛనంగా ప్రకటించనున్నారు.
■విజేతగా ఉత్తరాఖండ్ శకటం
రిపబ్లిక్ డే సందర్భంగా తమ రాష్ట్రంలోని ప్రకృతి సౌందర్యాన్ని, అపూర్వమైన ఆధ్యాత్మికతను కళ్లకు కట్టిన ఉత్తరాఖండ్ శకటానికి రాష్ట్రాల విభాగంలో ప్రథమ స్థానం దక్కింది. త్రివిధ దళాల సైనికులు చేసిన కవాతుల్లో పంజాబ్ రెజిమెంట్ మొదటి స్థానంలో నిలిచింది.
■ ఖేలో ఇండియా స్పాన్సర్గా ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’
ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (కేఐవైజీ)తో దేశీయ క్రీడల నిర్వాహక సంస్థ ‘స్పోర్ట్స్ ఫర్ ఆల్’ (ఎస్ఎఫ్ఏ) జతకట్టింది.యువతలోని క్రీడా నైపుణ్యాన్ని మెరుగు పరచడానికి విశేష కృషి చేస్తున్న ఎస్ఎఫ్ఏ ఐదేళ్ల పాటు ఖేలో ఇండియా గేమ్స్కు స్పాన్సర్గా రూ.12.5 కోట్లు పెట్టుబడి పెట్టనుంది.
■దేశంలో ఓటర్లు@ 94.5 కోట్లు
మన దేశంలో ఓటర్ల సంఖ్య 1951 నుంచి ఇప్పటి వరకు చూస్తే ఆరు రెట్లు పెరిగింది. ఈ ఏడాది జనవరి 1 నాటికి మన దేశంలో రిజిస్టర్ ఓటర్లు 94.50 కోట్లు అని కేంద్ర ఎన్నికల కమిషన్ వెల్లడింది. మొదటిసారి 1951లో ఓటర్ల జాబితాను రూపొందించినప్పుడు 17.32 కోట్ల మంది తమ పేర్లను రిజిస్టర్ చేసుకున్నారు.
■రెపో రేటు పెంచిన ఆర్బీఐ
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ రెపో రేటును పావు శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచి 6.50 శాతానికి పెంచింది. దీంతో 6.25 శాతంగా ఉన్న కీలక వడ్డీ రేటు 6.50 శాతానికి చేరింది. ఎంఎస్ఎప్ రేట్లు 25 బీపీఎస్ పాయింట్లు పెరిగి 6.75 శాతానికి చేరింది.
■బిడ్డకు జన్మనిచ్చిన ట్రాన్స్జెండర్స్
కొయ్కోడ్లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ట్రాన్స్జండర్లలో ఒకరైన జహాద్ బిడ్డకు జన్మనిచ్చారు. దేశంలో ఓ ట్రాన్స్జెండర్ జంట తల్లిదండ్రులు కావడం ఇదే తొలిసారి. కేరళకు చెందిన జహాద్, జియా పావల్ అనే ట్రాన్స్జెండర్ జంట మూడేళ్ల నుంచి కలిసి ఉంటోంది.
■సుప్రీం న్యాయమూర్తుల ప్రమాణస్వీకారం
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలుగు వ్యక్తి, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ పులిగోరు వెంకట సంజయ్కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతో పాటు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ మనోజ్మిశ్రలతో సీజేఐ ప్రమాణం చేయించారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 32కు చేరింది.
■బెంగళూరులో ఏరో ఇండియా ప్రదర్శన
బెంగళూరులో 14వ ఏరో ఇండియా ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన తేజస్, భారత్లో తయారీకి, సమర్థతకు ప్రమాణంగా నిలిచినట్లు ప్రధాని ప్రకటించారు. ఏరో ఇండియా ప్రదర్శనకు 98 దేశాల నుంచి 810 రక్షణ ఉత్పత్తుల తయారీ సంస్థల అధికారులు హాజరయ్యారు.
■సోహ్నా–దౌసా ఎక్స్ప్రెస్ వే ప్రారంభం
కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లతో చేపట్టిన ఢిల్లీ–ముంబయి ఎక్స్ప్రెస్ వే (1,386 కి.మీ.) లో 246 కి.మీ. మొదటి దశ సోహ్నా–దౌసా రహదారిని ప్రధాని మోడీ రాజస్థాన్లోని దౌసాలో ప్రారంభించారు. ఈ రహదారితో ఢిల్లీ, జైపుర్ మధ్య ప్రయాణ సమయం అయిదు గంటల నుంచి రెండు గంటలకు తగ్గనుంది.
■దేశంలో లిథియం నిల్వలు
దేశంలో మొదటిసారి లిథియం నిల్వలను జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించిందని కేంద్ర గనుల శాఖ ప్రకటించింది. జమ్ము కశ్మీర్లోని రియాసి జిల్లాలో లిథియం నిక్షేపాలు గుర్తించింది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు లభించడం మేలు చేయనుంది.
■ఎన్టీఆర్ చిత్రంతో వెండి నాణెం
సినీ హీరో, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రంతో వంద రూపాయల వెండి నాణెం విడుదలకు రిజర్వు బ్యాంకు ఆమోదం తెలిపింది. మరో 2 నెలల్లో ఇది మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ నాణెం కొనుగోలుకు రిజర్వు బ్యాంకు కౌంటర్ లేదా ఏదైనా బ్యాంకులో రూ.4,160 చెల్లించాలి. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం చొప్పున జింక్, నికెల్ కలిపి ఈ నాణెం తయారు చేయనున్నారు.
■దాదాసాహేబ్ ఫాల్కే అవార్డ్స్
‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ఖాతాలో మరో పురస్కారం వచ్చి చేరింది. ముంబయిలో జరిగిన ‘దాదాసాహేబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ (2023)’ వేడుకలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ‘ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును సొంతం చేసుకుంది. అలియా భట్ ఉత్తమ నటి (గంగూభాయి కతియావాడి), రణ్బీర్ కపూర్ ఉత్తమ నటుడు (బ్రహ్మాస్త్ర) అవార్డులను గెలుచుకున్నారు.
■ఎంపీలకు సంసద్ రత్న
సంసద్ రత్న అవార్డులకు (2023) కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధురీ, ఆర్జేడీకి చెందిన మనోజ్ ఝా, సీపీఎం నేత జాన్ బ్రిటాస్ సహా 13 మంది ఎంపీలు నామినేట్ అయ్యారు. వీరిలో 8 మంది లోక్సభ, ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నట్లు అవార్డులను రూపొందించిన ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
■ఫాబా పురస్కారాలు
దేశంలో ప్రతిష్టాత్మక డాక్టర్ బి.ఎస్.బజాజ్ స్మారక ఫెడరేషన్ ఆఫ్ ఏసియన్ బయోటెక్ అసోసియేషన్ (ఫాబా) – 2023 పురస్కారాలు కేంద్ర బయోటెక్నాలజీ విభాగం మాజీ కార్యదర్శి డాక్టర్ రేణూ స్వరూప్; ఎల్వీ ప్రసాద్ నేత్ర విజ్ఞాన సంస్థ పరిశోధన సంచాలకులు డాక్టర్ బాలసుబ్రమణియన్లను వరించాయి.
■‘మిషన్ కర్మయోగి’ కమిటీ
ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల శిక్షణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘మిషన్ కర్మయోగి’ కార్యక్రమ అమలును పర్యవేక్షించేందుకు కేంద్రం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా నేతృత్వంలోని ఈ కమిటీలో పీఎంవో నుంచి ఒక సీనియర్ అధికారి, వివిధ శాఖల నుంచి ఏడుగురు కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు.
■డిజిటల్ పేమెంట్స్
భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్(యూపీఐ), సింగపూర్లోని పే నౌని కనెక్ట్ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య క్రాస్-బోర్డర్ చెల్లింపు కనెక్టివిటీ ప్రారంభించబడింది. ఈ సదుపాయాన్ని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ నుంచి మానిటరీ అథారిటీ ఆఫ్ సింగపూర్ మేనేజింగ్ డైరెక్టర్ రవి మీనన్ ప్రారంభించారు.
■కాలుష్య నగరంగా ముంబై
దేశంలో వాయుకాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో ముంబై మొదటి స్థానంలో నిలిచింది. అత్యంత కాలుష్య నగరంగా ఉన్న ఢిల్లీని దాటి తొలిస్థానంలో నిలిచిందని, స్విస్ ఎయిర్ ట్రాకింగ్ ఇండెక్స్(ఐక్యూ ఎయిర్) వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పాకిస్థాన్లోని లాహోర్ తొలిస్థానంలో ఉండగా, ముంబై రెండోస్థానంలో నిలిచింది.
■విశాఖలో ‘బార్జి’ జలప్రవేశం
నౌకాదళ సేవల కోసం కొత్తగా నిర్మించిన ఎంసీఏ (మిసైల్ – అమ్యూనిటైజేషన్) బార్జి (భారీ నౌకలను ఒడ్డుకు తీసుకొచ్చి, మళ్లీ సముద్ర జలాల్లోకి పంపేది) విశాఖపట్నం నుంచి జలప్రవేశం చేసింది. ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా మెజర్స్ సెకాన్ సంస్థ బార్జి నిర్మాణం చేపట్టిందని నేవీ వర్గాలు తెలిపాయి. సుమారు 30 ఏళ్లు బార్జి సేవలు అందించనుంది.
■ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్ల మార్పు
మహారాష్ట్రలోని రెండు నగరాల పేర్ల మార్పు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు. ఔరంగాబాద్ను ‘ఛత్రపతి శంభాజీ నగర్’గా, ఉస్మానాబాద్ను ‘ధారాశివ్’గా మార్పు చేశారు.
■ఏపీలో పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య
ఆంధ్రప్రదేశ్లో అబ్బాయిలను మించి ఆడపిల్లల సంఖ్య పెరిగిపోయింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. 2021–22 లేబర్ ఫోర్స్ సర్వేను కేంద్ర గణాంకాల ప్రకారం దేశంలో అత్యధికంగా అమ్మాయిలున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి మొదటి స్థానంలో ఉంది.
■ఇండోనేసియా రేవులో భారత సబ్మెరైన్
భారత్కు చెందిన ‘ఐఎన్ఎస్ సింధుకేసరి’ జలాంతర్గామి తొలిసారి ఇండోనేసియాలోని రేవులో లంగరేసింది. ఒక సబ్మెరైన్ను భారత జల సరిహద్దులకు దూరంగా మోహరించడం ఇదే మొదటిసారని నౌకాదళ సీనియర్ అధికారులు వెల్లడించారు.
■నాగాలాండ్ సీఎంగా నెఫ్యూరియో
నాగాలాండ్ సీఎంగా నెఫ్యూరియో ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్డీపీపీ అధినేత అయిన 72 ఏళ్ల నెఫ్యూ ఐదోసారి నాగాలాండ్కు ముఖ్యమంత్రి అయ్యారు. రియో కేబినెట్లో ఏడుగురు ఎన్డీపీపీకి, ఐదుగురు బీజేపీకి చెందినవారున్నారు. తొలిసారి సల్హౌతునొ క్రుసే అనే మహిళకు కేబినెట్లో చోటు దక్కింది.
■మైసూర్ సిల్క్కు జీఐ ట్యాగ్
మైసూర్ సిల్క్, కంగ్రా టీ, తంజావుర్ పెయింటింగ్స్ వంటి 429 ఉత్పత్తులకు ఇప్పటి వరకు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ (జీఐ) ట్యాగ్ కేటాయించినట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇందులో 31 విదేశీ ఉత్పత్తులు ఉన్నాయి.
■మేఘాలయ ముఖ్యమంత్రిగా సంగ్మా
మేఘాలయ ముఖ్యమంత్రిగా నేషనల్ పీపుల్స్ పార్టీ అధినేత కాన్రాడ్ సంగ్మా షిల్లాంగ్లో ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కుమారుడే కాన్రాడ్ సంగ్మా. 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో సీఎంతో సహా 12 మంది మంత్రిగా ప్రమాణం చేశారు.
■త్రిపుర సీఎంగా మాణిక్ సాహా
త్రిపుర ముఖ్యమంత్రిగా మరోసారి మాణిక్ సాహా ఎంపికయ్యారు. భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో భాజపా 32 సీట్లను గెలుచుకుంది.
■మహిళలకు ‘లాడ్లి బెహనా’ యోజన
మధ్యప్రదేశ్లోని బీజేపీ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా లాడ్లి బెహనా(ప్రియమైన సోదరి) పథకాన్ని ప్రకటించింది. భోపాల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రి ‘లాడ్లి బెహనా యోజన’ఫలకాన్ని ఆన్లైన్లో ఆవిష్కరించారు. పథకం కింద ప్రభుత్వం మహిళలకు నెలకు రూ.వెయ్యి అందజేస్తుంది.
■శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పురస్కారం
హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ సర్వే ద్వారా ‘ఉత్తమ విమానాశ్రయం’ అవార్డుకు ఎంపికైంది. వరుసగా 9 సంవత్సరాలు హైదరాబాద్ విమానాశ్రయం గ్లోబల్ టాప్-3 విమానాశ్రయాల్లో ఒకటిగా నిలుస్తోంది.
■గవర్నర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం
రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్కు ‘గవర్నర్ ఆఫ్ ది ఇయర్ 2023’ పురస్కారం వరించింది. కరోనా సంక్షోభం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వంటి క్లిష్ట పరిస్థితుల్లో మార్కెట్లను సమర్థంగా నడిపించినందుకు అంతర్జాతీయ ప్రచురణ సంస్థ సెంట్రల్ బ్యాంకింగ్ ఈ అవార్డును అందించింది.
■ఆయుధ దిగుమతుల్లో నంబర్ వన్
ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుగా భారత్ కొనసాగుతోంది. స్టాక్హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రీ) తన తాజా నివేదికలో ప్రపంచంలో తొలి ఐదు ఆయుధ దిగుమతి దేశాల్లో వరుసగా భారత్, సౌదీ అరేబియా, ఖతార్, ఆస్ట్రేలియా, చైనాలు నిలిచాయి. అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారులుగా వరుసగా అమెరికా, రష్యా, ఫ్రాన్స్, చైనా, జర్మనీ ఉన్నాయి.
■ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ –
ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ 2023 పరిశీలక రచనల జాబితాలో భారత రచయిత పెరుమాళ్ మురుగన్ రచించిన ‘పైర్’ (పుక్కులి) నవల చోటు దక్కించుకుందని బుకర్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ జాబితాలో చేరిన తొలి తమిళ రచయితగా మురుగన్ నిలిచారు.
■‘నాటు.. నాటు’ పాటకు ఆస్కార్
ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ 95వ ఆస్కార్ పురస్కారాల్లో ఉత్తమ ఒరిజినల్ పాట విభాగంలో ఆస్కార్ గెలిచింది. కీరవాణి స్వరకల్పనలో చంద్రబోస్ రచించిన నాటు నాటు పాటను కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడగా, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ సమకూర్చారు.
■ ప్రపంచంలోనే పొడవైన రైల్వే ప్లాట్ఫామ్
ప్రపంచంలోనే అత్యంత పొడవైనదిగా గిన్నిస్ రికార్డుకెక్కిన కర్ణాటకలో శ్రీ సిద్ధారూఢ స్వామీజీ హుబ్బళ్లి రైల్వే స్టేషన్లోని 1,507 మీటర్ల పొడవైన ప్లాట్ఫామ్ను ప్రధాని మోడీ మార్చి 12న జాతికి అంకితం ఇచ్చారు.
■కాశీలో ‘మిల్లెట్’ ప్రసాదం
కాశీ విశ్వనాథుడి ఆలయంలో మిల్లెట్లతో చేసిన ప్రసాదాన్ని పంపిణీ చేయాలని ఆలయ యాజమాన్యం తెలిపింది. ఇటీవల ప్రధాని మోడీ మిల్లెట్లను ’శ్రీ అన్న’గా సంబోధించారు. దీంతో కాశీ ఆలయంలో లడ్డూ ప్రసాదానికి ‘శ్రీ అన్న ప్రసాదం’గా నామకరణం చేశారు.
■తమిళనాడులో ‘మగళిర్ ఉరిమై తొగై’
తమిళనాడులో మహిళలకు ‘మగళిర్ ఉరిమై తొగై (మహిళ హక్కుగా నగదు)’ పథకాన్ని ప్రకటించారు. డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇంట్లో కుటుంబ పెద్దగా ఉన్న మహిళకు ప్రతి నెలా రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేసేలా ప్రకటన చేశారు.
■ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు అత్యున్నత గౌరవం
కొచ్చిలో ఐఎన్ఎస్ ద్రోణాచార్యకు అత్యున్నత గౌరవ పురస్కారం రాష్ట్రపతి పతాకను ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము అందించారు. దేశ వ్యూహాత్మక, మిలిటరీ, ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల్లో నౌకా దళం అత్యంత కీలకమని ఆమె అన్నారు.
■టాప్-–50 పర్యాటక జాబితా
ఈ ఏడాది ప్రపంచంలో దర్శించాల్సిన ముఖ్యమైన 50 ప్రదేశాల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. అందులో భారత్కు ఒడిశాలోని మయూర్భంజ్, లద్దాఖ్ చోటు దక్కించుకున్నాయి. మయూర్భంజ్ జిల్లా సాంస్కృతిక వారసత్వ సంపదకు పెట్టింది పేరు.
■వడాపావ్కు ప్రపంచ గుర్తింపు
ముంబైలో పేరు గాంచిన వడాపావ్ స్ట్రీట్ ఫుడ్ కు ప్రపంచ గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే బెస్ట్ సాండ్విచ్ల జాబితాలో వడాపావ్ కు 13వ స్థానం లభించింది. మొదటి స్థానంలో తుర్కియేకు చెందిన తొంబిక్ శాండ్విచ్ నిలిచింది. ప్రపంచంలో బెస్ట్ సాండ్విచ్లపై ‘టేస్ట్ అట్లాస్’ అనే సంస్థ అధ్యయనం చేసింది.
■జియో ట్యాగింగ్లో కేరళ టాప్
జియో ట్యాగింగ్లో దేశంలోనే కేరళ మొదటి స్థానంలో నిలిచింది. 2022–23 సంవత్సరానికి ఆ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తులకే అత్యధిక జియో ట్యాగ్లు లభించాయి. కేరళకు చెందిన బీన్స్, కందిపప్పు, నువ్వులు, వెల్లుల్లి, కర్బూజాలకు జియో ట్యాగ్లు లభించాయి. తెలంగాణలోని తాండూర్ కందిపప్పునకూ 2022–23లోనే జియో ట్యాగ్ లభించింది.
■భారత వృద్ధి 6.3 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ తగ్గించింది. 6.3 శాతం మాత్రమే వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో ఇదే ప్రపంచ బ్యాంక్ భారత్ వృద్ధి రేటు 6.6 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది.
■అంబానీయే ఆసియా సంపన్నుడు
ఆసియాలోనే సంపన్న వ్యక్తిగా ముకేశ్ అంబానీ మళ్లీ అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. 2023కు ప్రపంచ కుబేరుల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 83.4 బిలియన్ డాలర్ల నికర సంపదతో ముకేశ్ అంబానీ ఆసియాలో అగ్రస్థానంలో, ప్రపంచ కుబేరుల్లో 9వ స్థానంలో నిలిచారు. బెర్నార్డ్ ఆర్నాల్ట్ 211 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో టాప్లో ఉన్నాడు.
■భూటాన్ రాజు పర్యటన
ప్రధాని మోడీతో భారత పర్యటనకు వచ్చిన వాంగ్చుక్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆర్థిక, వాణిజ్యపరమైన సహకారంతో పాటు ఇంధన, అంతరిక్ష, సాంకేతి రంగాల్లో భూటాన్కు చేయూతనందించేందుకు ఈ సందర్భంగా భారత్ హామీనిచ్చింది.
■‘ఇండియా జస్టిస్’ ర్యాంకింగ్
‘ఇండియా జస్టిస్’ ర్యాంకుల్లో కర్ణాటక, తమిళనాడు తొలి రెండు స్థానాల్లో నిలవగా తెలంగాణ మూడు, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానాలను దక్కించుకున్నాయి. టాటా ట్రస్టు మూడో ఇండియా జస్టిస్ నివేదిక (ఐజేఆర్) –2022 వెల్లడించింది. ఈ ట్రస్టు 2019 నుంచి ఐజేఆర్ నివేదికలు ఇస్తోంది.
■ప్రాజెక్ట్ టైగర్కు 50 ఏళ్లు
దేశంలో పులుల సంరక్షణ, తగ్గిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు భారత ప్రభుత్వం ఏప్రిల్ 1, 1973న ప్రాజెక్ట్ టైగర్ను ప్రారంభించింది. దీనికి 50 ఏండ్లు పూర్తయిన ప్రధాని మోడీ ‘ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలియెన్స్(ఐబీసీఏ)’ ప్రాజెక్టు ప్రారంభించారు. 2022 నాటికి దేశంలో 3,167 పెద్ద పులులు ఉన్నాయి.
■ఆప్కు జాతీయ పార్టీ హోదా
ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ హోదా దక్కించుకున్నట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది. సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీలు జాతీయ పార్టీల హోదాను కోల్పోయాయి. ప్రస్తుతం బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), ఆప్ నేషనల్ పార్టీలుగా ఉన్నాయి.
■స్పేస్ పాలసీకి ఆమోదం
ప్రైవేటురంగ భాగస్వామ్యాన్ని పెంచే రీతిలో రూపొందించిన ‘భారత అంతరిక్ష విధానం–2023’కి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆధునిక అంతరిక్ష సాంకేతికతలపై ఇస్రో దృష్టిసారించేందుకు ఇది దోహదపడుతుందని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు.
■నదిలో మెట్రో రైలు ట్రయల్ రన్
పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మెట్రో రైల్వే సంస్థ దేశంలోనే తొలిసారిగా నది లోపల మైట్రో రైలును విజయవంతంగా నడిపింది. హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో కోల్కతాలోని మహాకరణ్ స్టేషన్ నుంచి హావ్డా మైదాన్ స్టేషన్ వరకు రైలు పరుగులు తీసింది.
■వృద్ధి రేటు 5.9 శాతం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2023–24) భారత వృద్ధి రేటు అంచనాలను 6.1 శాతం నుంచి 5.9 శాతానికి తగ్గిస్తున్నట్లు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ప్రకటించింది. అయినా ప్రపంచంలో అత్యంత వేగవంత వృద్ధి సాధించే దేశంగా భారత్ నిలుస్తుందని పేర్కొంది.
■దేశంలో తొలి డిజిటల్ కోర్టు
దేశంలో మొదటి సారి కాగితపు రహిత డిజిటల్ కోర్టుగా నవీ ముంబయిలోని వాశీ కోర్టు విశిష్టతను సొంతం చేసుకుంది. కాగితం వినియోగించాల్సిన అవసరం లేని, పూర్తిస్థాయి డిజిటల్ కోర్టు ఏర్పాటులో స్థానిక న్యాయవాదులు మంచి సహకారం అందించారు.
■హైదరాబాద్కు 65వ స్థానం
హెన్లీ అండ్ పార్ట్నర్స్ సంస్థ అధ్యయనంలో ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరాల జాబితాలో హైదరాబాద్ 65వ స్థానంలో నిలిచింది. ముంబయి 21వ స్థానం దక్కించుకుంది. 3.40 లక్షల మంది మిలియనీర్లతో న్యూయార్క్ నగరం తొలి స్థానం పొందింది.
■క్వాంటమ్ మిషన్కు ఆమోదం
క్వాంటమ్ సాంకేతకతలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధన – అభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించే ‘జాతీయ క్వాంటమ్ మిషన్’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023–31 మధ్య రూ.6,003 కోట్లు దీని కోసం ఖర్చు చేస్తారు.
■‘టీసీఎస్’కు టాప్ ప్లేస్
‘భారతదేశంలో పనిచేయడానికి ఉత్తమమైనవిగా’ ఉద్యోగులు భావిస్తున్న కంపెనీల జాబితాలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) టాప్ ప్లేస్ లో నిలిచింది. లింక్డ్ఇన్ భారత్లో అత్యుత్తమ 25 కంపెనీలతో జాబితా వెలువరించగా అమెజాన్, మోర్గాన్ స్టాన్లీ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
■అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా అమెరికా
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. భారత్ – అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత ఆర్థిక సంవత్సరంలో 128.55 బిలియన్ డాలర్లకు చేరింది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 78.31 బి.డాలర్లకు చేరాయి. అమెరికా నుంచి దిగుమతులు 16% పెరిగి 50.24 బి.డాలర్లుగా నమోదయ్యాయి. చైనా, యూఏఈ, సౌదీ అరేబియా, సింగపూర్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
■డిజిటల్ లావాదేవీల్లో బెంగళూరు టాప్
పేమెంట్ సర్వీసుల సంస్థ వరల్డ్లైన్ ఇండియా నివేదిక ప్రకారం దేశీయంగా గతేడాది డిజిటల్ చెల్లింపు లావాదేవీల్లో బెంగళూరు నగరం అగ్రస్థానంలో నిలిచింది. 2022లో 65 బిలియన్ డాలర్ల విలువ చేసే 2.9 కోట్ల లావాదేవీలతో టాప్ ప్లేస్ దక్కించుకుంది. న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
■పూంచ్లో ఆర్మీ ట్రక్పై ఉగ్రదాడి
జమ్ముకశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదుల ఏరివేతకు బయల్దేరిన భారత సైనికులపై టెర్రరిస్టుల అటాక్ చేశారు. బాటా దురియన్లో ఆర్మీ ట్రక్పై టెర్రరిస్టులు గ్రెనేడ్లు విసరడంతో ఐదుగురు సైనికులు సజీవ దహనమయ్యారు.
■గిన్నిస్ రికార్డుల్లో బిహూ డ్యాన్స్
ఈశాన్య రాష్ట్రం అస్సాం సంప్రదాయ నృత్యమైన బిహూ డ్యాన్స్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం దక్కించుకుంది. ఒకే వేదికపై 11,304 మంది కళాకారులు, నృత్యకారులు బిహూ నృత్యాన్ని ప్రదర్శించి చరిత్ర సృష్టించారు. అస్సాం సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
■టార్గెట్ 9 శాతం అణు విద్యుత్
భారతదేశంలో 2047 కల్లా 9 శాతం విద్యుత్తు అణు వనరుల నుంచే ఉత్పత్తి అవుతుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. 2030 కల్లా 20 గిగావాట్ల అణు ఇంధన శక్తిని ఉత్పత్తి చేస్తామని చెప్పారు. అప్పుడు అమెరికా, ఫ్రాన్స్ తర్వాత అణుఇంధన ఉత్పత్తి దేశాల్లో భారత్ మూడో స్థానానికి చేరుకుంటుందని తెలిపారు.
■దేశంలోనే తొలి 3డీ పోస్టాఫీస్
దేశంలోనే తొలిసారిగా 3డీ ప్రింటెడ్ సాంకేతికతతో నిర్మిస్తున్న అల్సూర్ బజార్ పోస్టాఫీస్.. బెంగళూరులోని కేంబ్రిడ్జి లే అవుట్వాసులకు త్వరలోనే సేవలు అందించనుంది. ఎల్ అండ్ టీ కంపెనీ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ నెల రోజుల్లో పూర్తి కానుంది.
■ఢిల్లీలో గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్
గ్లోబల్ బుద్ధిస్ట్ సమ్మిట్ సెషన్ను ఏప్రిల్ 20న ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గౌతమ బుద్ధుని బోధనలను ఆచరించి సుస్థిరాభివృద్ధిని సాధించవచ్చని అభిలషించారు.
■రాజస్థాన్లో లిథియం నిక్షేపాలు
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో లిథియం నిక్షేపాలు గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులు వెల్లడించారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, విద్యుత్ వాహనాల్లో వినియోగించే బ్యాటరీలకు లిథియం ఎంతో కీలకం.
■అన్ని భాషల్లోనూ ఆకాశవాణే
రేడియో ప్రసారాల సమయంలో ఇక మీదట కేవలం ఆకాశవాణి అన్న పేరు మాత్రమే ఉపయోగించాలని ఆకాశవాణి డీజీ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంగ్లీష్ ప్రసారాల సమయంలోనూ ‘దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో’ అని కాకుండా ‘దిస్ ఈజ్ ఆకాశవాణి’ అని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు.
■భారత వృద్ధి రేటు 6 శాతం
ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధికి తోడు, అంతర్జాతీయంగా ఎదురయ్యే ప్రతికూలతలను తట్టుకునే స్థితిలో ఉండటం వల్ల భారత్కు స్థిరత్వంతో కూడిన ‘బీబీబీ’ – సార్వభౌమ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు అమెరికా క్రెడిట్ రేటింగ్ సంస్థ ఫిచ్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వృద్ధి రేటు భారత్ నమోదు చేయొచ్చని పేర్కొంది.
■కీర్తిచక్ర, శౌర్యచక్ర అవార్డులు
విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుగ్గాను సైనిక, పారా మిలటరీ, పోలీసు విభాగాల సిబ్బందికి భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 8 కీర్తిచక్ర అవార్డులు, 29 శౌర్యచక్ర అవార్డులు రాష్ట్రపతి భవన్లో అందజేశారు.
■భారత హాకీ స్పాన్సర్గా ఒడిశా
భారత పురుషులు, హాకీ జట్లకు తన స్పాన్సర్షిప్ను 2033 వరకు పొడిగించాలని ఒడిషా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలంలో హాకీ ఇండియాకు ఒడిశా రూ.434.12 కోట్లు ఇస్తుంది. ఒడిశా 2018 నుంచి భారత హాకీ జట్ల (పురుషులు/మహిళలు, సీనియర్, జూనియర్) స్పాన్సర్ గా ఉంటోంది.
■రాజస్థాన్లో లిథియం నిక్షేపాలు
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా డెగానా మున్సిపాలిటీ పరిధిలో లిథియం నిక్షేపాలు గుర్తించినట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అధికారులు వెల్లడించారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, విద్యుత్ వాహనాల్లో వినియోగించే బ్యాటరీలకు లిథియం ఎంతో కీలకం.
■అన్ని భాషల్లోనూ ఆకాశవాణే
రేడియో ప్రసారాల సమయంలో ఇక మీదట కేవలం ఆకాశవాణి అన్న పేరు మాత్రమే ఉపయోగించాలని ఆకాశవాణి డీజీ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఇంగ్లీష్ ప్రసారాల సమయంలోనూ ‘దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో’ అని కాకుండా ‘దిస్ ఈజ్ ఆకాశవాణి’ అని మాత్రమే ఉపయోగించాలని ఆదేశించారు.
■భారత వృద్ధి రేటు 6 శాతం
ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధికి తోడు, అంతర్జాతీయంగా ఎదురయ్యే ప్రతికూలతలను తట్టుకునే స్థితిలో ఉండటం వల్ల భారత్కు స్థిరత్వంతో కూడిన ‘బీబీబీ’ – సార్వభౌమ రేటింగ్ను కొనసాగిస్తున్నట్లు అమెరికా క్రెడిట్ రేటింగ్ సంస్థ ఫిచ్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6 శాతం వృద్ధి రేటు భారత్ నమోదు చేయొచ్చని పేర్కొంది.
■కీర్తిచక్ర, శౌర్యచక్ర అవార్డులు
విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించినందుగ్గాను సైనిక, పారా మిలటరీ, పోలీసు విభాగాల సిబ్బందికి భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము 8 కీర్తిచక్ర అవార్డులు, 29 శౌర్యచక్ర అవార్డులు రాష్ట్రపతి భవన్లో అందజేశారు.
■భారత హాకీ స్పాన్సర్గా ఒడిశా
భారత పురుషులు, హాకీ జట్లకు తన స్పాన్సర్షిప్ను 2033 వరకు పొడిగించాలని ఒడిషా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కాలంలో హాకీ ఇండియాకు ఒడిశా రూ.434.12 కోట్లు ఇస్తుంది. ఒడిశా 2018 నుంచి భారత హాకీ జట్ల (పురుషులు/మహిళలు, సీనియర్, జూనియర్) స్పాన్సర్ గా ఉంటోంది.
■సీబీఐ నూతన డైరెక్టర్గా ప్రవీణ్ సూద్
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ మే 25న బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకుముందు కర్ణాటక డీజీపీగా పనిచేశారు.1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రవీణ్ సూద్ సీబీఐ డైరెక్టర్ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారు.
■కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టారు. బెంగళూరులో భేటీ అయిన కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) సిద్ధరామయ్యను తమ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.
■రూ.2000 నోటు ఉపసంహరణ
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చలామణి నుంచి రూ.2,000 నోటును ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మే 23 నుంచి సెప్టెంబర్ 30వ తేదీలోపు బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవచ్చని, ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
■3.5 లక్షల కోట్ల డాలర్లకు భారత్ జీడీపీ
2022లో భారత జీడీపీ 3.5 లక్షల కోట్ల డాలర్లను అధిగమించిందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తెలిపింది. వచ్చే కొన్నేళ్లలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న జీ-20 దేశంగా భారత్ నిలవనుందని, అయితే సంస్కరణలు, విధానపరమైన అడ్డంకుల వల్ల పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం పడొచ్చని అభిప్రాయపడింది.
■ఆర్చరీ ప్రపంచకప్లో స్వర్ణాలు
భారత యువ ఆర్చర్ ప్రథమేశ్ జవాల్కర్ ఆర్చరీ ప్రపంచకప్లో తొలిసారి స్వర్ణం నెగ్గాడు. మరోవైపు అద్భుత ఫామ్లో ఉన్న భారత జంట జ్యోతి సురేఖ, ఒజస్ దేవ్తలె వరుసగా రెండో ప్రపంచకప్లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది.
■ఫిల్మ్ఫేర్ అవార్డ్స్
68వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2023లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి (ఆలియా భట్), ఉత్తమ దర్శకుడు( సంజయ్ లీలా భన్సాలీ) సహా 9 విభాగాల్లో ‘గంగూబాయి కాఠియావాడి’ అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా – రాజ్ కుమార్ రావు (బదాయి దో) పురస్కారం దక్కింది.
■ఎస్సీవో సమ్మిట్
భారత్ నేతృత్వంలో షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) విదేశాంగ మంత్రుల మండలి సమావేశం గోవా వేదికగా జరిగింది. ఈ సదస్సులో దాయాది పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పాల్గొన్నారు.
■రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కు నవరత్న హోదా
రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్వీఎన్ఎల్)కు కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదా ప్రకటించింది. ఈ సంస్థ 2003 జనవరి 24న ఏర్పాటైంది. ప్రస్తుతం ఈ సంస్థ ఆథరైజ్డ్ షేర్ కేపిటల్ రూ.3వేల కోట్లు, పెయిడ్ అప్ షేర్ కేపిటల్ రూ.2,085 కోట్ల మేర ఉంది.
■మణిపుర్లో అల్లర్లు
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మెజారిటీ ప్రజలైన మైతై వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలనే డిమాండ్తో గిరిజనులు, గిరిజనేతరులు(మైతై) మధ్య హింసాత్మక ఘర్షణలు నెలకొన్నాయి. ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించడంతోపాటు, ఘర్షణలు చోటుచేసుకుంటున్న ప్రాంతంలో ‘కనిపిస్తే కాల్చివేత’కు ఉత్తర్వులు జారీ చేశారు.
■కులగణనకు బ్రేక్
కులగణనపై నీతీశ్కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్కు పట్నా హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేను తక్షణం నిలిపివేయాలని, ఇప్పటివరకు సేకరించిన డేటాను భద్రంగా ఉంచాలని, ఎవరితోనూ ఆ సమాచారం పంచుకోవద్దని పేర్కొంది.
■‘నాటు నాటు’కు గోల్డెన్ గ్లోబ్
చిత్ర పరిశ్రమలకు సంబంధించిన గోల్డెన్ గ్లోబ్స్ హాలీవుడ్ అవార్డ్స్ వేడుక కాలిఫోర్నియాలోని లాస్ ఏంజిల్స్లో జరిగాయి. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలో ‘నాటు నాటు’ పాట ఒరిజినల్ సాంగ్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది. ఈ పాట చంద్రబోస్ రాయగా, రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ పాడారు.
■‘శతఘ్ని’లోకి మహిళా అధికారులు
దేశంలో అతిపెద్ద సాయుధ దళం ‘ఆర్మీ’పోరాట విభాగంలోనూ మహిళలను చేర్చుకోవాలని నిర్ణయించింది. ముందుగా ఆర్టిలరీ (శతఘ్ని)దళాల్లో మహిళా అధికారులను చేర్చుకునేందుకు ఉద్దేశించి ప్రతిపాదనలను కేంద్రానికి పంపించినట్లు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు.
■ భారత్ వృద్ధి రేటు 6.6
భారత్ 2023–24 ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంక్ కుదించింది. 6.9 శాతంగా ఉన్న క్రితం అంచనాలను 6.6 శాతానికి కుదిస్తున్నట్లు తన తాజా ఎకనమిక్ అప్డేట్లో తెలిపింది. భారత్ 2021–22లో 8.7 శాతం వృద్ధి రేటును నమోదుచేసుకోగా, ప్రస్తుత 2022–23లో ఈ రేటు 6.9 శాతంగా ఉంటుందని ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ పేర్కొంది.
■పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్’
ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన ప్రయాణం సాగించే నదీ పర్యాటక నౌక ‘ఎంవీ గంగా విలాస్’ను ప్రధాని మోడీ ప్రారంభించారు. వారణాసి నుంచి నౌక ప్రయాణం ఆరంభమైంది. ఇది పాట్నా, సాహిబ్గంజ్, కోల్కతా, ఢాకా, గౌహతి గుండా ప్రయాణిస్తుంది. ఈ నౌకలో 36 మంది ప్రయాణించవచ్చు.
■సేతుసముద్ర ప్రాజెక్ట్కు ఆమోదం
సేతుసముద్ర ప్రాజెక్టుపై తమిళనాడు శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది. రాజకీయ కారణాలతో భాజపా ఈ ప్రాజెక్టుకు అడ్డుపడిందని, దీంతో రాష్ట్ర ప్రగతి కుంటుపడుతోందని ముఖ్యమంత్రి స్టాలిన్ పేర్కొన్నారు. దీని అమలుకు కేంద్రం ముందుకు రావాలని, రాష్ట్రం అన్ని విధాలా సహకరిస్తుందన్నారు.
■నలందలో బౌద్ధ స్తూపాలు
బిహార్లోని నలంద జిల్లాలో 1,200 ఏళ్ల నాటి రెండు సూక్ష్మ రాతి బౌద్ధ స్తూపాలను కనుగొన్నారు. పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నలందలోని మహావిహారం సమీపంలో చేపట్టిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయని పురావస్తు శాఖ పట్నా సర్కిల్ అధికారిణి గౌతమి భట్టాచార్య చెప్పారు.
■సికింద్రాబాద్-–వైజాగ్ మధ్య ‘వందే భారత్’
సికింద్రాబాద్– విశాఖపట్నం మధ్య నడిచే దేశంలో ఎనిమిదో వందేభారత్ రైలును ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఢిల్లీ నుంచి ఆయన జెండా ఊపగా, సికింద్రాబాద్ స్టేషన్లో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, పర్యాటక మంత్రి కిషన్రెడ్డి ప్రత్యక్షంగా ప్రారంభించారు.
■సీజేఐకు ‘గ్లోబల్ లీడర్షిప్ అవార్డు’
గ్లోబల్ లీడర్షిప్ అవార్డు (ప్రపంచ నాయకత్వ అవార్డు)కు భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఎంపిక అయ్యారు. న్యాయ వృత్తిలో జీవితకాల సేవలకుగాను ఆయన్ను కేంబ్రిడ్జ్లోని హార్వర్డ్ లా స్కూల్ సెంటర్ ఎంపిక చేసింది. ఈ అవార్డును జనవరి 11న ఆన్లైన్ ద్వారా అందించనున్నారు.
■108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్
మహారాష్ట్రలోని నాగపూర్లో 108వ జాతీయ సైన్స్ కాంగ్రెస్ సదస్సు జరుగుతుంది. జనవరి 3 నుంచి ఐదు రోజులు ఈ సమ్మిట్ నిర్వహించనున్నారు. క్వాంటమ్ టెక్నాలజీ, డేటా సైన్స్తోపాటు కొత్త వ్యాక్సిన్ల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని పరిశోధకులకు ప్రధాని మోడీ ఈ సందర్భంగా సూచించారు.
■దేశంలో పెరుగుతున్న నిరుద్యోగం
భారత్లో నిరుద్యోగం రోజు రోజుకీ ఎక్కువైపోతోంది. డిసెంబర్లో అత్యధికంగా 8.3% శాతానికి నిరుద్యోగం రేటు ఎగబాకింది. గత 16 నెలల్లో అదే అత్యధికమని సెంటర్ ఫర్ మోనటిరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఒక నివేదికలో తెలిపింది. నిరుద్యోగం రేటు అత్యధికంగా హర్యానాలో 37.4% ఉంది. ఆ తర్వాత స్థానాల్లో రాజస్థాన్ (28.5%), ఢిల్లీ (20.8%) ఉన్నాయి.
■పెద్ద నోట్ల రద్దు సరైనదే
రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం ఆరేళ్ల కింద తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. నోట్ల రద్దును సవాలు చేస్తూ దాఖలైన 58 పిటిషన్లను కొట్టేసింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు 4–1తో మెజారిటీ తీర్పు వెలువరించింది.
■భారత్ కు జీ20 బాధ్యతలు
ప్రపంచంలో శక్తివంతమైన జీ–20(గ్రూప్–20) అధ్యక్ష బాధ్యతలు ఇండోనేషియా నుంచి భారత్ డిసెంబర్ 1వ తేదీన చేపట్టింది. ఏడాది పాటు ఈ బాధ్యతలను నిర్వర్తించనుంది. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ స్ఫూర్తితో ప్రపంచదేశాలను ఏకం చేసేందుకు కృషి చేస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, కరోనా లాంటి సవాళ్లను అందరం కలిసికట్టుగా ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు.
■ రిటైల్ డిజిటల్ ఈ–రూపీ
హోల్సేల్ లావాదేవీల కోసం రిజర్వ్ బ్యాంక్ ఈ–రూపీని డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. మొదట ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లో రిటైల్ డిజిటల్ రూపీని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. తర్వాత హైదరాబాద్తో పాటు మరో తొమ్మిది నగరాల్లో ఈ–రూపీని అందుబాటులోకి తేనున్నారు.
■ తొలి ప్రైవేట్ లాంచింగ్ స్టేషన్
ఇస్రో ఉపగ్రహాల ప్రయోగ క్షేత్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ ప్రాంగణంలో చెన్నైకి చెందిన స్పేస్ స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్, అగ్నికుల్ మిషన్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించారు. ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ నవంబరు 25న ఈ కేంద్రాలను ఆవిష్కరించారు.
■ నిఖత్, శ్రీజలకు అర్జున అవార్డ్
తెలంగాణ యువ క్రీడాకారిణులు నిఖత్ జరీన్ (బాక్సింగ్), ఆకుల శ్రీజ (టీటీ) అర్జున అవార్డులు అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు అవార్డులు బహూకరించారు. ‘మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న’ ను శరత్ కమల్ స్వీకరించారు.
■ మహారాష్ట్ర గ్రామానికి అమరుడి పేరు
పద్నాలుగేళ్ల కింద జరిగిన ముంబయి ఉగ్ర దాడి (26/11)లో అమరుడైన జవాను రాహుల్ శిందే పేరును ఆయన స్వగ్రామానికి పెట్టారు. మహారాష్ట్రలోని సోలాపుర్ జిల్లా సుల్తాన్పూర్లో 600 ఇళ్లు ఉంటాయి. అమర జవాను పుట్టి పెరిగిన ఈ గ్రామం పేరును రాహుల్ నగర్గా మార్చారు.
■పెరిగిన రెపో రేటు
వరుసగా ఐదో విడత ఆర్బీఐ కీలక రెపో రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపో రేటు 0.35 శాతం పెరిగి 6.25 శాతానికి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందన్న గత అంచనాను ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) 6.8 శాతానికి తగ్గించింది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022–23) సగటున 6.7 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.
■విమానయాన భద్రతలో 48వ స్థానం
అంతర్జాతీయ విమానయాన భద్రతలో భారత్కు 48వ స్థానం లభించిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఏఓ) ఇచ్చే ఈ ర్యాంకుల్లో తొలిస్థానంలో సింగపూర్ ఉండగా, రెండు-మూడు స్థానాల్లో యూఏఈ, దక్షిణ కొరియా ఉన్నాయి.
■గుజరాత్లో బీజేపీ.. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చరిత్ర సృష్టించింది.182 అసెంబ్లీ స్థానాల్లో 156 సీట్లను సొంతం చేసుకుంది. హిమాచల్ప్రదేశ్లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాలుండగా, కాంగ్రెస్ 40, బీజేపీ 25 సీట్లు కైవసం చేసుకున్నాయి. ముగ్గురు స్వతంత్ర సభ్యులు నెగ్గారు.
■టాప్ 50 లో ఐఐటీ ఢిల్లీ
టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకటించిన గ్లోబల్ యూనివర్సిటీ ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి ఐఐటీ ఢిల్లీ మాత్రమే టాప్ 50లో చోటు దక్కించుకున్నది. బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 58వ స్థానంలో నిలవగా.. ఐఐటీ బాంబే 72వ స్థానంలో నిలిచింది.
■తాండూరు కంది పప్పునకు జీఐ ట్యాగ్
దేశంలో పేరుగాంచిన తాండూరు కంది పప్పునకు భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పంటల పరంగా మొదట జీఐ పొందింది తాండూరు కంది పప్పే. ఉద్యాన పంటల పరంగా ఏపీలోని బనగానపల్లె మామిడికి ఈ గుర్తింపు ఉంది.
■గవర్నర్కు వర్సిటీల చాన్స్లర్ హోదా రద్దు
కేరళా రాష్ట్రంలోని వర్సిటీలకు చాన్సెలర్గా గవర్నర్ను తొలగించడంతోపాటు ఆ హోదాలో ప్రముఖ విద్యావేత్తను నియమించే బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. చాన్సెలర్ ఎంపిక కమిటీలో సీఎం, ప్రతిపక్ష నేత, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉండాలంది.
■గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్
గుజరాత్ రాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్తో ఆ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజధాని గాంధీనగర్లో నూతన సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్ గ్రౌండ్లో ఈ భూపేంద్ర పటేల్ సీఎంగా ప్రమాణం చేయడం వరుసగా ఇది రెండోసారి.
■సామాజిక శత్రుత్వ సూచీలో భారత్ టాప్
మతం ప్రతిపాదికన సామాజిక శత్రుత్వాలు పెరిగిపోయిన దేశాల్లో భారత్ టాప్ ప్లేస్లో నిలిచింది. దేశంలో మత ఆధారిత సామాజిక శత్రుత్వం అతి దారుణంగా ఉందని ప్యూ రీసెర్చ్సెంటర్( అమెరికా) అధ్యయనంలో తేలింది. భారత్ తర్వాత నైజీరియా, అఫ్గానిస్థాన్ తదితర దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి.
■9 రాష్ట్రాల్లో సీబీఐకి నో ఎంట్రీ
ముందస్తు అనుమతిలేకుండా తమ రాష్ట్రాల్లో కేసులు దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది రాష్ట్రాలు నిరోధించాయని కేంద్రం వెల్లడించింది. తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, పంజాబ్ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని మంత్రి జితేంద్రసింగ్ సభలో పేర్కొన్నారు.
■మూడు ప్రదేశాలకు యునెస్కో గుర్తింపు
భారత్లోని మూడు చారిత్రక స్థలాలను ప్రపంచ వారసత్వ కట్టడాల తాత్కాలిక (టెన్టెటివ్) జాబితాలో చేర్చుతూ యునెస్కో నిర్ణయం తీసుకుంది. గుజరాత్కు చెందిన మొఢేరా సూర్య దేవాలయం, చారిత్రక నగరం వడ్నగర్, ఈశాన్య రాష్ట్రాల ఆన్కోర్వాట్గా పిలిచే త్రిపురలోని ఉనాకోటీ రాతి నిర్మాణాలకు ఈ గౌరవం దక్కింది.
■అంధుల టీ20 ప్రపంచకప్ విన్నర్ భారత్
అంధుల టీ20 ప్రపంచకప్లో భారత్ హ్యాట్రిక్ కొట్టింది. బంగ్లాదేశ్ను 120 పరుగుల తేడాతో ఓడించి వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది. డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడకుండా టైటిల్ నిలబెట్టుకుంది. 2012, 2017 టోర్నీల్లోనూ భారత్ విజేతగా నిలిచింది.
■ఇందిరా గాంధీ శాంతి బహుమతి
కరోనా సమయంలో విశేష సేవలందించిన భారతీయ వైద్య సమాజానికి ఇందిరా గాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి – 2022 అవార్డు దక్కింది. దేశంలోని వైద్యులు, నర్సులందరి తరఫున ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ), ట్రైన్డ్ నర్సెస్ ఆర్గనైజేషన్ (టీఎన్ఏ)లకు ఈ పురస్కారాన్ని అందజేయనున్నారు.
■దేశంలో కరోనా బీఎఫ్.7 వేరియంట్
చైనాను వణికిస్తున్న ఒమిక్రాన్ సబ్వేరియంట్ బీఎఫ్.7 పాజిటివ్ కేసులు భారత్లోనూ వెలుగుచూశాయి. బీఏ.5 అని పిలిచే ఒమిక్రాన్కు చెందిన ఉప వేరియంట్ బీఎఫ్.7. అత్యంత వేగంగా వ్యాప్తి చెందడం దీని ప్రధాన లక్షణం. బలమైన ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. కరోనా టీకా తీసుకున్నవారిని సైతం బీఎఫ్.7 ప్రభావితం చేస్తున్నట్లు తేలింది.
■విజయ్ దివస్ వేడుకలు
ఢిల్లీలోని ఆర్మీ హౌస్లో 1971 బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పాకిస్తాన్పై భారతదేశం సాధించిన విజయాన్ని స్మరించుకుంటూ విజయ్ దివస్ పేరుతో డిసెంబర్16న విజయోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ వేడుకలు రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యవేక్షణలో జరిగాయి. ఎట్ హోమ్పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, సైనికాధికారులు పాల్గొన్నారు.
ప్రాంతీయం
బొగ్గు రవాణాలో రికార్డు
గత నెలలో 68.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, 68.4 లక్షల టన్నుల బొగ్గు రవాణాతో కొత్త రికార్డు నమోదైందని సింగరేణి సంస్థ తెలిపింది. 2016 మార్చి నెలలో చేసిన 64.7 లక్షల టన్నుల బొగ్గు రవాణాయే ఇప్పటి వరకు నెలవారీ గరిష్ఠ రవాణా రికార్డు అని వివరించింది.
కేంద్ర పన్నుల్లో పెరిగిన తెలంగాణ వాటా
కేంద్రపన్నుల్లో తెలంగాణ రాష్ట్ర వాటా పెరిగింది. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్రపన్నుల్లో భాగంగా 2023–24లో తెలంగాణకు రూ.21,470.98 (2.102 శాతం) కోట్లు రానున్నాయి.
రాష్ట్ర బడ్జెట్ 2023–24
సంక్షేమం, వ్యవసాయం అగ్ర ప్రాధాన్యాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023–24 బడ్జెట్ను ప్రవేశపెట్టింది. రానున్న ఆర్థిక సంవత్సరానికి రూ.2,90,396 కోట్ల భారీ బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 46 శాతం మంది వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నారని రాష్ట్ర గణాంకాల తాజా నివేదిక వెల్లడించింది.
శాసనమండలి వైస్ చైర్మన్ ఎన్నిక
శాసన మండలి ఉపాధ్యక్ష (వైస్చైర్మన్) పదవి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ పదవికి వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మండలి ఉపాధ్యక్ష పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉంది.
స్టార్టప్లో ఎనిమిదో స్థానం
4,566 స్టార్టప్లతో తెలంగాణ అంకుర సంస్థల ఏర్పాటులో ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ 15వ స్థానానికి పరిమితమైంది. తొలి మూడు స్థానాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ నిలిచాయి.
ఆదిమానవుని వర్ణ చిత్రాలు
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం వ్యారారం గ్రామ పొలిమేరలో చిత్తరిగుట్టపైన ఆదిమానవుని కాలం నాటి వర్ణ చిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది.
అత్యుత్తమ పోలీస్స్టేషన్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ పోలీస్స్టేషన్ రాష్ట్రంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్గా ఎంపికైంది. 2022కు గాను దుండిగల్ ఠాణా తెలంగాణలో తొలి ర్యాంకు సాధించింది.
హైదరాబాద్లో బయో ఆసియా సమ్మిట్
హైదరాబాద్లో 20వ బయో ఆసియా సదస్సును ‘అడ్వాన్సింగ్ ఫర్ వన్: షేపింగ్ నెక్స్ట్ జనరేషన్ హ్యూమనైజ్డ్ హెల్త్కేర్’ నినాదంతో నిర్వహిస్తున్నారు. బయోటెక్, లైఫ్ సైన్సెస్ విభాగంలో 75 స్టార్టప్లు ఈ సదస్సులో పాల్గొంటున్నాయి. జీవశాస్త్రంలో విశేష కృషికి అందించే ‘జీనోమ్ వ్యాలీ ఎక్సెలెంట్’ పురస్కారం రాబర్ట్ లాంగర్కు అందించారు.
అటవీ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు
అడవుల నిర్వహణ, అభివృద్ధిలో ప్రమాణాలు పాటిస్తున్న తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ (టీఎస్ఎఫ్డీసీ)కు జర్మనీకి చెందిన ఫారెస్ట్ స్టీవార్డ్ కౌన్సిల్ (ఎఫ్ఎస్సీ) సర్టిఫికెట్ దక్కింది. రాష్ట్రంలో తయారయ్యే సేంద్రియ అటవీ ఉత్పత్తులకు 5 సంవత్సరాల పాటు తమ లోగోను ఉపయోగించుకునేందుకు ఎఫ్ఎస్సీ అనుమతినిచ్చింది.
‘స్వచ్ఛ సుజల్’ పురస్కారం
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా(కె) గ్రామ పంచాయతీని మరో జాతీయ అవార్డు వరించింది. అన్ని విభాగాల్లో స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడంలో ఆదర్శం (ఓడీఎఫ్ ప్లస్ మోడల్)గా నిలిచినందుకు ఆ గ్రామ సర్పంచి గాడ్గె మీనాక్షిని కేంద్ర ప్రభుత్వం ‘స్వచ్ఛ సుజల్ శక్తి సమ్మాన్ – 2023’ పురస్కారానికి ఎంపిక చేసింది. పచ్చదనం, పరిశుభ్రత, 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం, సోలార్ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టిన ఆ గ్రామ సర్పంచి ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆదిమానవుని వర్ణ చిత్రాలు గుర్తింపు
రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం వ్యారారం గ్రామ పొలిమేరలో చిత్తరిగుట్టపైన ఆదిమానవుని కాలం నాటి వర్ణ చిత్రాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది.
‘ఆరోగ్య మహిళ’ పథకం
ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ‘ఆరోగ్య మహిళ’ పథకాన్ని మంత్రి హరీశ్ రావు కరీంనగర్లో ప్రారంభించారు. 33 జిల్లాల్లో అన్ని వయసుల వారికి 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
కొంగర కలాన్లో ఫాక్స్కాన్
ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్నకు చెందిన ‘ఫాక్స్కాన్’ సంస్థ రంగారెడ్డి జిల్లాలోని కొంగర కలాన్లో భారీ పెట్టుబడులతో తమ ఉత్పత్తి ప్లాంట్ను నెలకొల్పనుంది.
తెలంగాణకు మరో రెండు పురస్కారాలు
తెలంగాణ మరో రెండు ప్రతిష్టాత్మక కేంద్ర పురస్కారాలకు ఎంపికైంది. దేశంలో వంద శాతం బహిరంగ మల మూత్ర విసర్జన రహిత (ఓడీఎఫ్) ప్లస్ రాష్ట్రంగా ఆవిర్భవించింది. గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్లోనూ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.
సావిత్రి, నాగిరెడ్డికి అవార్డులు
మహానటి సావిత్రి, విజయా ప్రొడక్షన్స్ అధినేత బి.నాగిరెడ్డికి ప్రకటించిన ఎన్టీఆర్ శతాబ్ది చలనచిత్ర పురస్కారాలను విజయచాముండేశ్వరికి, విశ్వనాథరెడ్డిలకు బాలకృష్ణ అందజేశారు. ఎన్టీఆర్ అభిమాని పురస్కారాన్ని ప్రసన్నప్రదీప్కు ఇచ్చారు
రాష్ట్రానికి టెక్స్టైల్ పార్కు
తెలంగాణలో పీఎం మిత్ర మెగా టెక్స్టైల్ పార్క్ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. టెక్స్టైల్ రంగానికి మరింత ఊతం ఇచ్చేలా 5 ఎఫ్ (ఫార్మ్–ఫైబర్–ఫ్యాక్టరీ–ఫ్యాషన్–ఫారిన్) దృష్టితో దేశవ్యాప్తంగా ఏడు మెగా టెక్స్టైల్ పార్కులు నెలకొల్పనున్నట్టు ప్రధాని తెలిపారు.
టీసీఎస్కు ఇండస్ట్రీస్ అవార్డ్
రాష్ట్రంలో ఐటీ సేవల రంగానికి అందిస్తున్న సేవలకు ‘తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీ అవార్డ్ ఫర్ ఎక్స్లెన్సీ ఇన్ ఐటీ’ పురస్కారానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఎంపికయ్యింది.
చినజీయర్కు పద్మభూషణ్ ప్రదానం
రాష్ట్రపతి భవన్లో 53 మందికి పద్మ పురస్కారాలు ప్రదానం చేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి పద్మభూషణ్ను అందుకోగా, సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి పద్మశ్రీ అందుకున్నారు.
వెయ్యేళ్ల నాటి శిల్పాలు
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం పోతులమడుగులోని వేణుగోపాల స్వామి అలయ సమీపంలో వెయ్యేళ్ల నాటి శిల్పాలను గుర్తించారు.
పీహెచ్సీలకు జాతీయ గుర్తింపు
రాష్ట్రంలోని మూడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ నాణ్యత ధ్రువీకరణ పొందాయి. యాదాద్రి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు నిజామాబాద్ జిల్లా నందిపేట, మేడ్చల్ జిల్లా నారపల్లి ప్రాథమిక ఆర్యోగ్య కేంద్రాలు క్వాలిటీ సర్టిఫైడ్ స్టేషన్లుగా గుర్తింపు దక్కించుకున్నాయి.
రాష్ట్రానికి 13 జాతీయ అవార్డులు
జాతీయస్థాయి పురస్కారాల్లో తెలంగాణ పల్లెలకు 13 అవార్డులు వచ్చాయి. దీన్దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్కు 8 పురస్కారాలతోపాటు నానాజీ దేశ్ముఖ్ సర్వోత్తమ్ పంచాయత్ సతత్ వికాస్కు 5 అవార్డులు లభించాయి.
దక్షిణ డిస్కంకు పురస్కారాలు
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)కు ఉత్తమ పంపిణీ సంస్థ కేటగిరీలో ప్రథమ, వినియోగదారులకు అవగాహన కల్పించే విభాగంలో ద్వితీయ అవార్డు లభించింది.
రాష్ట్రంలో అయ్యనార్ ఆరాధన
కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో కనిపించే అయ్యనార్ల ఆరాధన తెలంగాణలోని జనగామ జిల్లాలో గుర్తించామని చారిత్రక పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి వివరించారు. ఇది సుమారు 1600 సంవత్సరాల నాటిదై ఉంటుందని తెలిపారు.
హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్
హుస్సేన్సాగర్ తీరంలో ఆవిష్కరించిన అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహానికి అరుదైన గౌరవం లభించింది. హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఈ స్మారకం నమోదైంది.
రెండు కొత్త మండలాలు
రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లా నుంచి పాల్వంచ మండలంగా ఏర్పాటు చేయగా, జోగులాంబ గద్వాల జిల్లాలో ఎర్రవల్లి నూతన మండలంగా ఏర్పాటు చేశారు.
కందూరు చోళుల శాసనం
దాదాపు 900 ఏళ్ల నాటి శిలా శాసనం ఒకటి నల్లగొండ జిల్లా డిండి మండలం వావికోల్లో లభ్యమైంది. దీన్ని కందూరు చోళుల నాటి వైద్య శాసనంగా పురావస్తు నిపుణులు చెబుతున్నారు. 12వ శతాబ్దానికి చెందిన కందూరు చోళుల శాసనంగా వారు గుర్తించారు.
‘ఓడీఎఫ్ ప్లస్’ గ్రామాల్లో టాప్
స్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా ఓడీఎఫ్ ప్లస్ కేటగిరీలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ ఫలితాలను కేంద్ర జల్శక్తి శాఖ వెల్లడించింది. మిషన్ రెండో దశలో దాదాపు 50% గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ స్థాయికి చేరాయని, ఇందులో 100% ఫలితాలు సాధించి తెలంగాణ టాప్లో నిలిచినట్లు వెల్లడించింది.
ప్రధాన సలహాదారుగా సోమేశ్కుమార్
మాజీ సీఎస్ సోమేశ్కుమార్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుగా నియమితులయ్యారు. మూడేళ్ల పాటు క్యాబినెట్ హోదాలో ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. తెలంగాణ సీఎస్గా సోమేశ్కుమార్ 2019 డిసెంబరు 31 నుంచి దాదాపు మూడేళ్ల పాటు పనిచేశారు.
మైనార్టీ కమిషన్ చైర్మన్గా తారిఖ్
రాష్ట్ర మైనార్టీ కమిషన్ చైర్మన్గా తారిఖ్ అన్సారీని సీఎం కేసీఆర్ నియమించారు. ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తారిఖ్ అన్సారీ ఈ పదవిలో మూడేండ్ల పాటు కొనసాగనున్నారు.
శాతవాహన కాలం నాటి ఇటుక గోడలు
తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గజగిరిగుట్ట దిగువన మట్టి దిబ్బల కింద శాతవాహన కాలం నాటి ఇటుక గోడల నిర్మాణాలను చర్రిత పరిశోధకుడు రెడ్డి రత్నాకర్రెడ్డి గుర్తించారు.
‘ఆసియా పసిఫిక్ గ్రీన్’ అవార్డు
పర్యావరణహితమైన చర్యల్లో భాగంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ) 2023 ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గోల్డ్ పురస్కారం దక్కింది.
రాష్ట్రంలో గుర్తింపు పొందిన పార్టీలు
దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఉన్న గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. దీని ప్రకారం ఏపీలో రెండు, తెలంగాణలో నాలుగు పార్టీలకు ఈ గుర్తింపు లభించింది. తెలంగాణలో ఎంఐఎం, భారాసతో పాటు తెలుగుదేశం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీ హోదా పొందినట్లు వెల్లడించింది.
సెక్రటేరియట్కు గోల్డ్ రేటింగ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి భారతీయ హరిత భవన మండలి (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ) ప్రతినిధుల బృందం గోల్డ్ రేటింగ్ ఇచ్చింది. దేశంలోనే గోల్డ్ రేటింగ్ పొందిన తొలి సచివాలయం తెలంగాణ.
సీఎస్గా శాంతికుమారి
తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1989 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శాంతికుమారి నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. సీఎస్గా ఆమె 2025 వరకు పదవీలో కొనసాగనున్నారు.
పర్యాటక మిత్ర పురస్కారం
కోల్కతాలో జరిగిన బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల సంఘం అంతర్జాతీయ సదస్సులో తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం లభించింది. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య దీన్ని స్వీకరించారు.
ఉత్తమ ఇంక్యుబేటర్గా ‘టీ హబ్’
భారత్లో ఆవిష్కరణలకు మూల స్తంభంలా పనిచేస్తున్న ‘టీ హబ్’కు ‘బెస్ట్ ఇంక్యుబేటర్ ఇండియా’అవార్డు లభించింది. జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో ‘నేషనల్ స్టార్టప్ అవార్డులు 2022’ను ప్రదానం చేశారు.
ప్రిన్స్ ముకర్రమ్ఝా
ఏడో నిజాం మీర్ఉస్మాన్ అలీఖాన్ మనవడు, చివరి నిజాం ప్రిన్స్ మీర్ అలీఖాన్ ముకర్రమ్ ఝా టర్కీలో మరణించారు. ముకర్రమ్ ఝాను 8వ నిజాంగా ఉస్మాన్ అలీఖాన్ ప్రకటించారు.
కేసీఆర్ కు ‘సర్ ఛోటూ రామ్’ అవార్డు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు అఖిల భారత రైతు సంఘం ప్రతినిధులు ‘సర్ ఛోటూ రామ్’అవార్డును ప్రకటించారు. పంజాబ్ రైతుల సంక్షేమం కోసం కృషి చేసిన సర్ ఛోటూ రామ్ పేరిట ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు.
స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డులు
జాతీయస్థాయిలో తెలంగాణకు ఫోర్ స్టార్ రేటింగుల్లో తెలంగాణ మొదటి మూడు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ (ఎస్ఎస్జీ) అవార్డులు సాధించింది. వీటితోపాటు 3 స్టార్, 2 స్టార్ రేటింగ్స్లోనూ తెలంగాణ పల్లెలు టాప్ ర్యాంక్లలో నిలిచాయి.
తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం
కోల్కతాలో జరిగిన బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల సంఘం అంతర్జాతీయ సదస్సులో తెలంగాణకు పర్యాటక మిత్ర పురస్కారం లభించింది. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య దీనిని స్వీకరించారు.
కొత్తరాతియుగపు మట్టి శిల్పం
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చారిత్రక ప్రదేశమైన నర్మెట్ట గ్రామంలోని పాటిగడ్డమీద 6 సెంటీమీటర్ల ఎత్తు ఉన్న అమ్మదేవత మట్టి శిల్పం లభించినట్లు కొత్త తెలంగాణ బృందం తెలిపింది.
టాప్లో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్
మంచిర్యాల జిల్లా జైపూర్లోని 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి 90.86% సామర్థ్యంతో విద్యుదుత్పత్తి(పీఎల్ఎఫ్) సాధించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్
విద్యార్థి నేతగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన రవీందర్సింగ్ 2014లో జరిగిన కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ కార్పొరేటర్గా గెలిచి మేయర్గా ఐదేళ్ల పాటు కొనసాగారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ స్టేట్ సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకు బాధ్యతలు అప్పగించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్లో సిరిసిల్ల టాప్
స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా నవంబర్ నెలకు బహిరంగ విసర్జన నిర్మూలన (ఓడీఎఫ్) ప్లస్ కేటగిరీలో ఫోర్స్టార్ రేటింగ్ విభాగంలో రాజన్న సిరిసిల్ల జిల్లా దేశంలోనే టాప్ ప్లేస్లో నిలిచింది.
రఘు అరికపూడికి అవార్డు
గడిచిన పది సంవత్సరాలుగా దివ్యాంగులకు అందిస్తున్న సేవలకు గుర్తించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి రఘు అరికపూడికి బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు ప్రకటించింది.
రెడ్కోకు జాతీయ పురస్కారం
ఇంధన పొదుపు కార్యక్రమాల నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో)కు జాతీయ ఉత్తమ పురస్కారం లభించింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సంస్థ రాష్ట్రానికి ఈ అవార్డు ప్రకటించిందని సంస్థ చైర్మన్ సతీష్రెడ్డి తెలిపారు.
తెలంగాణాకు రెండు జాతీయ అవార్డులు
తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంరక్షణలో తీసుకుంటున్న చర్యలకు జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఢిల్లీలో నిర్వహిస్తున్న ‘నేషనల్ మెటర్నల్ హెల్త్ వర్క్ షాప్’లో భాగంగా తెలంగాణకు రెండు అవార్డులను ప్రకటించింది.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్
రక్తహీనతతో బాధ పడుతున్న గర్భిణుల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకాన్ని అమలు చేస్తున్నది. మిషన్ కాకతీయ, ఈ-పంచాయతీ వంటి కీలక ఘట్టాల ప్రారంభోత్సవాలకు వేదికైన కామారెడ్డి గడ్డ మీదుగానే ఈ విప్లవాత్మక పథకం అమలు కానున్నది.ఒక్కో కిట్కు రూ. 1962 చొప్పున ప్రభుత్వం వెచ్చిస్తున్నది.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు
అనువాద రచనల విభాగంలో వారాల ఆనంద్ రాసిన ‘ఆకుపచ్చ కవితలు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం లభించింది. నరేంద్ర రాసిన ‘మనో ధర్మపరాగం’ నవలకు తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
వార్తల్లో వ్యక్తులు
నిఖత్ జరీన్
ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ లిమిటెడ్కు బ్రాండ్ అంబాసిడర్గా బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ వ్యవహరించనున్నారు. వచ్చే ఒలింపిక్ క్రీడల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించనున్న ఆమెకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తామని సంస్థ వెల్లడించింది.
శివ్నందన్ కుమార్
కృష్ణా బోర్డుకు కొత్త చైర్మన్గా శివ్ నందన్ కుమార్ను నియమిస్తూ కేంద్ర జల్శక్తి మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని కేంద్ర జల సంఘంలో సభ్యులుగా నవీన్కుమార్, ఎస్.కె.సిబాల్లను కొత్తగా నియమించారు. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ డైరెక్టర్ చందన్ ముఖర్జీ ఆదేశాలు జారీ చేశారు.
ఆర్కే రోజా
భారత క్రీడా ప్రాధికార సంస్థ (శాయ్) పాలకవర్గ సభ్యురాలిగా మంత్రి ఆర్కే రోజా నియమితులయ్యారు. పాలకవర్గ పునర్నియామకంలో భాగంగా సభ్యులుగా ఏపీతో పాటు హిమాచల్ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు చెందిన క్రీడాశాఖల మంత్రులను నియమించారు.
మన్మోహన్ సింగ్
భారతదేశ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు బ్రిటన్లో జీవితకాల సాఫల్య గౌరవాన్ని ప్రకటించారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రకటించింది. బ్రిటన్లోని భారత విద్యార్థులు, పూర్వ విద్యార్థుల సంఘం (ఎన్ఐఎస్ఏయూ) త్వరలో ఈ అవార్డును ప్రదానం చేస్తుంది.
నిక్కీ హేలీ
2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రముఖ భారతీయ అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ ప్రకటించారు. తాజా పరిణామంతో ట్రంప్కు ఆమె ఏకైక ప్రత్యర్థిగా నిలువనున్నారు. నిక్కీ హేలీ సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్ గాను, ఐరాసలో అమెరికాలో రాయబారిగాను పనిచేశారు.
నటాషా
ప్రపంచంలోనే అత్యంత తెలివైన విద్యార్థినిగా భారతీయ – అమెరికన్ విద్యార్థిని నటాషా పెరియనాయగమ్ వరుసగా రెండో ఏడాది ఘనత సాధించింది. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ టాలెంటెడ్ యూత్ (సీటీవై) నిర్వహించిన పోటీలో ప్రపంచవ్యాప్తంగా15,300కి పైగా విద్యార్థులు పాల్గొంటే నటాషా ప్రథమ స్థానంలో నిలిచింది.
ఆది స్వరూప
కర్ణాటకలోని మంగళూరుకు చెందిన 17 ఏళ్ల బాలిక ఆది స్వరూప ఏకకాలంలో రెండూ చేతులతో నల్లబల్లపై రాస్తూ తన నైపుణ్యం చాటుకుంటోంది. ఒకే నిమిషంలో కన్నడ, ఇంగ్లీష్ భాషలు రెండూ చేతుల సాయంతో 45 పదాలు రాసి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డు’లో స్థానం దక్కించుకుంది.
ధర్మేంద్ర కుమార్
బిహార్లోని కైమూర్ జిల్లా రామ్గఢ్కు చెందిన ధర్మేంద్ర కుమార్165 కిలోల బరువును తన పళ్లతో పది సెకన్లపాటు పైకిలేపి ప్రపంచ రికార్డు నమోదు చేశారు. ధర్మేంద్ర ఇప్పటివరకు 9 ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించారు. ‘హ్యామర్ హెడ్మాన్ ఆఫ్ ఇండియా’గా ఈయనకు పేరుంది.
సత్యనారాయణ రాజు
కెనరా బ్యాంక్ ఎండీ, సీఈఓగా కె.సత్యనారాయణ రాజు నియమితులయ్యారు. బ్యాంకింగ్, ఫైనాన్స్లో పోస్ట్గ్రాడ్యుయేట్ అయిన రాజు 1988లో విజయా బ్యాంకులో చేరారు. బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) ముంబయి జోనల్ హెడ్గా పనిచేసి, అదే బ్యాంకులో చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయికి చేరారు.
ప్రొఫెసర్ రాబర్ట్ ఎస్ లాంగర్
బయో ఆసియా 20వ విడత సదస్సు సందర్భంగా 2023 సంవత్సరానికి ‘జీనోమ్ వ్యాలీ ఎక్స్లెన్స్’ పురస్కారాన్ని ప్రొఫెసర్ రాబర్ట్ ఎస్ లాంగర్కు ప్రకటించారు. ఇన్ఫెక్షస్ డిసీజెస్ను నిరోధించడానికి వినియోగించే ‘ఎంఆర్ఎన్ఏ’ టీకాను వృద్ధి చేయడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు.
జస్టిస్ అబ్దుల్ నజీర్
ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ను నియమించింది. ఇప్పటివరకు ఇక్కడ ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్ను ఛత్తీస్గఢ్కు బదిలీ చేసింది. మొత్తం 13 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది.
నీల్ మోహన్
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్కు భారతీయుడు నీల్ మోహన్ సీఈవోగా నియమితులయ్యారు. సుదీర్ఘ కాలంగా సీఈవోగా ఉన్న సూసన్ వొజిసికి పదవి నుంచి వైదొలగడంతో యూట్యూబ్ యాజమాన్యం ఇండియన్-అమెరికన్ అయిన నీల్ మోహన్ను నూతన సీఈవోగా నియమించింది.
కోనేరు హంపి
అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) ఆధ్వర్యంలో జరిగిన మహిళల గ్రాండ్ప్రి సిరీస్ రెండో టోర్నమెంట్లో భారత స్టార్, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి రన్నరప్గా నిలిచింది. ద్రోణవల్లి హారిక 6 పాయింట్లతో నాలుగో ర్యాంక్లో నిలిచింది. అలెగ్జాండ్రా కొస్టెనిక్ (రష్యా) విజేతగా అవతరించింది.
నిక్కీ హేలీ
ఎన్ఆర్ఐ నిక్కీ హేలీ 2024లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్నారు. 51 ఏళ్ల నిక్కీ ఫిబ్రవరి 14న ఒక వీడియో సందేశంలో ఈ ప్రకటన చేశారు. వలస వచ్చిన భారత కుటుంబం నుంచి వచ్చిన కూతురుగా గర్వపడతాను అని నిక్కీ వ్యాఖ్యానించారు.
పెన్నా మధుసూదన్
రచయిత్రి, పరిశోధకురాలు డా.ముదిగంటి సుజాతారెడ్డి ఏర్పాటు చేసిన ఆచార్య ముదిగంటి గోపాల్రెడ్డి స్మారక పురస్కారానికి ఆచార్య పెన్నా మధుసూదన్ ఎంపికయ్యారు. తెలంగాణకు చెందిన ఆచార్య పెన్నా మధుసూదన్, నాగ్పుర్ రాంటెక్లోని కవికుల గురువు కాళీదాసు సంస్కృత విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
బీవీఆర్ సుబ్రహ్మణ్యం
నీతి ఆయోగ్ సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు. 1987 ఛత్తీస్గఢ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి సుబ్రహ్మణ్యం కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. సుబ్రహ్మణ్యం తల్లిది కాకినాడ. తండ్రిది ఒడిశాలోని గుణుపురం. ప్రస్తుత సీఈఓ పరమేశ్వరన్ అయ్యర్ వరల్డ్ బ్యాంక్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులయ్యారు.
షెల్లీ ఒబెరాయ్
దేశ రాజధాని ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా.. షెల్లీ ఒబెరాయ్కు 150 ఓట్లు; రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి. కొత్త మేయర్ షెల్లీ ఒబేరాయ్కు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభినందనలు తెలిపారు.
డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ
భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నూతన డైరెక్టర్ జనరల్గా డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ నియమితులయ్యారు. 2025 ఫిబ్రవరి 28 వరకు రఘువంశీ ఈ పదవిలో ఉంటారు. దేశవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే ఔషధ ప్రమాణాలు, నాణ్యతను ధ్రువీకరించి వాటి వినియోగానికి అనుమతివ్వడంలో ఈ సంస్థదే ప్రధానపాత్ర.
వివేక్ రామస్వామి
భారతీయ మూలాలున్న అమెరికన్ యువ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ఆ దేశ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన భారతీయ మూలాలున్న రెండో భారతీయుడు వివేక్. 37 ఏళ్ల వివేక్ తల్లిదండ్రులు గతంలో కేరళ నుంచి అమెరికాకు వలసవచ్చారు.
చలిగంటి రఘు
జర్మనీ తెలంగాణ సంఘం అధ్యక్షుడు చలిగంటి రఘుకు ఇండో జర్మన్ ప్రతిభా పురస్కారం – 2023 లభించింది. కరోనా సమయంలో రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కమిటీ భాగస్వామిగా జర్మనీలోని 410 మంది భారతీయులకు, విద్యార్థులకు ఆహారం, ఆరోగ్య సేవలు అందించింనందుకు ఈ పురస్కారం దక్కింది.
బిశ్వభూషణ్ హరిచందన్
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పుర్లో బిశ్వభూషణ్ హరిచందన్ ఆ రాష్ట్ర గవర్నర్గా ప్రమాణస్వీకారం చేశారు. ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా వ్యవహరించిన హరిచందన్ ఇటీవల ఛత్తీస్గఢ్ గవర్నర్గా బదిలీ అయ్యారు.
ఖుష్బూ సుందర్
ప్రముఖ నటి, బీజేపీ నేత ఖుష్బూ సుందర్ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఈ పదవిలో ఆమె మూడేళ్ల పాటు కొనసాగనున్నారు.ఖుష్బూతో పాటు మమత కుమారి, డెలియానా కొంగ్డుప్ను జాతీయ మహిళా కమిషన్ సభ్యులుగా కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది.
రేయానా బర్నావి
సౌదీ అరేబియాకు చెందిన మొదటి మహిళా వ్యోమగామి రేయానా బర్నావి ఈ సంవత్సరం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తోటి సౌదీ వ్యోమగామి అలీ అల్–కర్నీతో కలిసి వెళ్లనుంది. ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ఆక్సియోమ్ స్పేస్ మిషన్ లో భాగంగా బర్నావి, అల్–కర్నీ స్పేస్ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకలో ఐఎస్ఎస్కు వెళ్తుంది.
శైలేష్ పాఠక్
ఫిక్కీ కొత్త సెక్రటరీ జనరల్గా మాజీ ఐఏఎస్ అధికారి శైలేష్ పాఠక్ నియమితులయ్యారు. 37 ఏళ్ల ఉద్యోగ జీవితంలో ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు, ప్రైవేట్ రంగంలోని పలు దిగ్గజ కంపెనీల్లోనూ శైలేష్ విధులు నిర్వర్తించారని ఫిక్కీ తెలిపింది.
నొవాక్ జకోవిచ్
నొవాక్ జకోవిచ్ టెన్నిస్ చరిత్రలోనే (పురుషులు, మహిళలు కలిపి) అత్యధిక వారాల పాటు నంబర్వన్గా ఉన్న ఆటగాడిగా నిలిచాడు. స్టెఫీ గ్రాఫ్ (377 వారాలు) రికార్డును అతను బద్దలు కొట్టాడు. ఓవరాల్గా 378వ వారం ఇప్పుడు జకో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
స్టీవె న్ సీగల్
ఉక్రెయిన్పై యుద్ధాన్ని సమర్థించిన హాలీవుడ్ యాక్షన్ స్టార్ స్టీవె న్ సీగల్కు రష్యా ‘ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్’ అవార్డు ప్రకటించింది. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్, ఫిఫా అధ్యక్షుడు గియానీ ఇన్ఫాంటినో తదితరులకు ఆర్డర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అవార్డు ప్రకటించారు.
రామచంద్ర పౌడెల్
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా రామచంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్ (మావోయిస్టు సెంటర్) తో పాటు ఎనిమిది పార్టీల సంయుక్త అభ్యర్థి రామచంద్ర తన ప్రత్యర్థి అయిన సుభాష్ చంద్ర నెబ్మాంగ్పై విజయం సాధించారు.
వెర్స్టాపెన్
ఫార్ములావన్ సీజన్లోని తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్ప్రిలో రెడ్బుల్ జట్టు డ్రైవర్ వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. పెరెజ్ (రెడ్బుల్) రెండో స్థానంలో, అలోన్సో (ఆస్టన్ మారిటన్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్లోని రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్ప్రి మార్చి 19న జరుగుతుంది.
శాలిజా ధామీ
ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) చరిత్రలో తొలిసారి పోరాట విభాగమైన క్షిపణుల స్క్వాడ్రన్కు మహిళ అయిన శాలిజా ధామీ నేతృత్వం వహించనున్నారు. 2003లో హెలికాప్టర్ పైలట్గా ఐఏఎఫ్లోకి ధామీ అడుగుపెట్టారు.
ఫుల్టన్
భారత పురుషుల హాకీ జట్టు కోచ్గా క్రెయిగ్ ఫుల్టన్ (దక్షిణాఫ్రికా) నియమితుడయ్యాడు. శిక్షణలో 25 ఏళ్ల అనుభవమున్న ఫుల్టన్కు హాకీ ఇండియా (హెచ్ఐ) చీఫ్ కోచ్గా బాధ్యతలు అప్పగించింది. సొంతగడ్డపై జరిగిన ప్రపంచకప్లో భారత్ పేలవ ప్రదర్శనతో కోచ్ పదవికి గ్రాహమ్ రీడ్ రాజీనామా చేశాడు.
రశ్మీ శుక్లా
సరిహద్దు భద్రతా దళం సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రశ్మీ శుక్లా నియమితులయ్యారు.1988 బ్యాచ్ మహారాష్ట్ర కేడర్కు చెందిన ఐపీఎస్ రశ్మీ శుక్లా ప్రస్తుతం సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) అదనపు డీజీగా ఉన్నారు.
సి.శేఖర్ రెడ్డి
సీఐఐ (భారతీయ పరిశ్రమల సమాఖ్య), తెలంగాణ విభాగానికి నూతన చైర్మన్గా సి.శేఖర్ రెడ్డి ఎంపికయ్యారు. వైస్ చైర్మన్గా డి.సాయి ప్రసాద్ వ్యవహరిస్తారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి వీరిద్దరూ సీఐఐ – తెలంగాణ బాధ్యతలు నిర్వహిస్తారు.
కార్తికి గోన్సాల్వెస్
అనాథ ఏనుగులను ఆదరించిన దంపతుల కథతో తెరకెక్కిన ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అవార్డు గెలుచుకుంది. దర్శకురాలు కార్తికి గోన్సాల్వెస్, నిర్మాత గునీత్ మోంగా వేదికపై అవార్డు తీసుకున్నారు. భారతీయ డాక్యుమెంటరీ చిత్రానికి ఆస్కార్ దక్కడం ఇదే తొలిసారి.
ఎరిక్ గార్సెట్టి
భారత్లో అమెరికా రాయబారిగా అధ్యక్షుడు బైడెన్ సన్నిహితుడు ఎరిక్ గార్సెట్టి నియామకం ఖరారైంది. ఆయన నామినేషన్ను సెనెట్ 52-–42 మెజార్టీతో ఆమోదించింది. రెండేళ్లుగా ఖాళీగా ఉన్న అమెరికా రాయబారి పదవి త్వరలోనే భర్తీ కానుంది.
అమితవ ముఖర్జీ
ఎన్ఎండీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా అమితవ ముఖర్జీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆయన ఎన్ఎండీసీలో ఫైనాన్స్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. అమితవ ముఖర్జీ 1995 బ్యాచ్ ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్ఏఎస్) అధికారిగా ఉంటున్నారు.
జయతీఘోష్
ప్రముఖ ఆర్థికవేత్త, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ జయతీఘోష్ వ్యవసాయ ఆర్థికశాస్త్రం విభాగంలో ప్రదానం చేసే అంతర్జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. గ్లోబల్ అగ్రికల్చరల్ ఎకనామిక్స్ అవార్డును 2023 ఏడాదికి జయతీఘోష్కు బహూకరించనున్నారు.
అరుణ్ సుబ్రమణియన్
సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ (ఎస్డీఎన్వై) జడ్జిగా భారతీయ అమెరికన్ అరుణ్ సుబ్రమణియన్ నియామకానికి అమెరికా సెనేట్ ఆమోదముద్ర వేసింది.ఈ పదవి చేపట్టబోతున్న తొలి దక్షిణాసియా వ్యక్తిగా సుబ్రమణియన్ నిలవనున్నారు.
లక్ష్మణ్ నరసింహన్
ఇంటర్నేషనల్ కాఫీ దిగ్గజం స్టార్బక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ)గా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ బాధ్యతలను స్వీకరించారు. కంపెనీ వ్యవస్థాపకుడు, తాజా మాజీ సీఈఓ హోవర్డ్ స్కాల్జ్ స్థానాన్ని ఆయన భర్తీ చేశారు. దీంతో అంతర్జాతీయ దిగ్గజ సంస్థల సీఈఓలుగా ఉన్న భారత సంతతి వ్యక్తుల్లో ఇంకొకరు చేరారు.
లలిత్కుమార్ గుప్తా
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్, ఎండీగా లలిత్కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం అదే సంస్థలో డైరెక్టర్ (ఫైనాన్స్)గా సేవలందిస్తున్నారు. కొత్త బాధ్యతల్లో అయిదేళ్ల పాటు కొనసాగుతారు.
పీవీ సతీష్
తెలంగాణ మిల్లెట్ మ్యాన్గా పేరుగాంచిన పీవీ సతీష్ అనారోగ్యంతో మరణించారు. ప్రతీ సంక్రాంతికి ‘పాత పంటల జాతర’ను ఆయన నిర్వహిస్తున్నారు. చిరుధాన్యాలను ప్రజల ఎజెండాగా చేయడంలో ఆయన జీవితకాల కృషికి ఇటీవల పురస్కారం లభించింది.
అల్కరాజ్
స్పెయిన్ యువ స్టార్ కార్లోస్ అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్ ర్యాంకింగ్స్లో నంబర్వన్ ర్యాంక్ అందుకున్నాడు. ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టోర్నీలో 19 ఏళ్ల అల్కరాజ్ తొలిసారి విజేతగా అవతరించాడు. స్పెయిన్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రఫెల్ నాదల్ ఏటీపీ పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్ టాప్-10లో చోటు కోల్పోయాడు.
రాణి రాంపాల్
భారత మహిళల హాకీ స్టార్ రాణి రాంపాల్కు అరుదైన గౌరవం దక్కింది. రాయ్బరేలీలోని ఓ స్టేడియానికి ఆమె పేరు పెట్టారు. ఇకపై ఈ స్టేడియాన్ని ‘రాణీస్ గర్ల్స్ హాకీ టర్ఫ్’ పేరిట పిలవనున్నారు. రాణీనే ఈ స్టేడియాన్ని ప్రారంభించింది. హాకీలో ఈ ఘనత సాధించిన తొలి మహిళ ఆమే.
ప్రచండ
విశ్వాస పరీక్షలో నేపాల్ ప్రధాని ప్రచండ నెగ్గారు. 3 నెలల్లో ఆయనకు ఇది రెండో విశ్వాస పరీక్ష. 275 మంది సభ్యులున్న నేపాల్ పార్లమెంటులో 262 మంది ఓటేశారు. ప్రచండకు 172 ఓట్లు వచ్చాయి. 89 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటేశారు.
రిషి సింగ్
‘ఇండియన్ ఐడల్’ ట్రోఫీని అయోధ్యకు చెందిన రిషి సింగ్ సొంతం చేసుకున్నాడు. విజేతగా నిలిచిన రిషి సింగ్కు ఇండియన్ ఐడల్ ట్రోఫీతోపాటు కారు, రూ.25 లక్షల నగదు బహుమతి అందుకున్నారు. కోల్కతాకు చెందిన దెబోస్మితా రాయ్ ఫస్ట్ రన్నర్గా నిలిచారు.
సంజిత చాను
రెండుసార్లు కామన్వెల్త్ చాంపియన్, వెయిట్లిఫ్టర్ సంజిత చానుపై నాలుగేళ్ల నిషేధం పడింది. గతేడాది డోప్ పరీక్షలో పట్టుబడిన మణిపుర్ లిఫ్టర్పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ క్రమశిక్షణ కమిటీ ఈ శిక్షను విధించింది.
కిరణ్ నాడార్
సామాజిక సేవకురాలు, కళాకృతుల సేకరణలో అవిరళ కృషి చేస్తున్న కిరణ్ నాడార్కు ఫ్రెంచ్ ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భారత్లో ఫ్రాన్స్ రాయబారి ఇమ్మానుయేల్ లీనన్ ఆ పురస్కారాన్ని కిరణ్ నాడార్కు అందజేసి సత్కరించారు.
జోగినపల్లి సంతోష్కుమార్
‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో తాజాగా ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’కు చోటు లభించింది. సామాజిక సేవా విభాగంలో ఒక గంటలో అత్యధిక సంఖ్యలో మొక్కలు నాటించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త జోగినపల్లి సంతోష్కుమార్కు చోటు కల్పించారు.
అమిత్ క్షత్రియ
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ‘మూన్ టు మార్స్’ కార్యక్రమం హెడ్గా భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్, రోబోటిక్స్ ఇంజనీర్ అయిన అమిత్ క్షత్రియ నియమితులయ్యారు. చంద్రుడిపై సుదీర్ఘ కాలం మకాం వేయడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపే బృహత్తర లక్ష్యంతో నాసా ఈ మిషన్కు రూపకల్పన చేసింది.
కల్యంపూడి రాధాకృష్ణారావు
భారత్–అమెరికన్ గణాంకశాస్త్ర(స్టాటిస్టిక్స్) నిపుణుడు కల్యంపూడి రాధాకృష్ణారావుకు స్టాటిస్టిక్స్ రంగంలో నోబెల్ బహుమతితో సమానమైన ‘ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్’ ను 2023 సంవత్సరానికి రాధాకృష్ణారావుకు అందజేయనున్నట్లు ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఫౌండేషన్ తెలిపింది.
చంద్రకళ ఓజా
ఛత్తీస్గఢ్కు చెందిన 15 ఏళ్ల చంద్రకళ ఓజా నిర్విరామంగా 8 గంటల పాటు ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్సులో చోటు సంపాదించింది. తెల్లవారుజామున అయిదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్విరామంగా ఈత కొట్టింది. చంద్రకళ 8 గంటల పాటు చెరువులో 64 రౌండ్లు ఈత కొట్టింది.
గుకేశ్
భారత చెస్ స్టార్ గుకేశ్ ఆర్మగెడాన్ ఆసియా, ఓసియానియా టైటిల్ సాధించి సత్తా చాటాడు. రెండు మ్యాచ్ల ఫైనల్లో అతను ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ నొడిర్బెక్ అబ్దుసతొరోవ్ (ఉజ్బెకిస్థాన్)ను ఓడించి, విజేతగా నిలిచాడు.
రక్షిత రవి
భారత చెస్ క్రీడాకారిణి రక్షిత రవి మహిళా గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎం) హోదా సాధించింది. చివరి డబ్ల్యూజీఎం నార్మ్ను దక్కించుకున్న ఆమె 2300 ఎలో రేటింగ్ దాటింది. ఫస్ట్ సాటర్డే టోర్నీ ఆరో రౌండ్లో సహజ్ గ్రోవర్ను ఓడించినప్పుడు రక్షిత ఆఖరి నార్మ్ను సొంతం చేసుకుంది.
సూర్యకుమార్ యాదవ్
స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 906 పాయింట్లతో ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లి 15వ స్థానంలో ఉండగా, రషీద్ ఖాన్ నంబర్వన్ టీ20 బౌలర్గా కొనసాగుతున్నాడు. ఏ భారత బౌలర్ టాప్-10లో లేడు.
నందినీ గుప్తా
రాజస్థాన్కు చెందిన 19 ఏళ్ల నందినీ గుప్తా ఫెమినా మిస్ ఇండియా వరల్డ్–2023గా ఎంపికయ్యారు. మిస్ వరల్డ్ పోటీల్లో ఆమె భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. మణిపుర్ రాజధాని ఇంఫాల్లో జరిగిన ఫైనల్స్లో ఢిల్లీకి చెందిన శ్రేయా పూంజా మొదటి రన్నరప్గా, మణిపుర్కు చెందిన స్ట్రెలా లువాంగ్ రెండో రన్నరప్గా నిలిచారు.
మను బాకర్
జాతీయ రైఫిల్/పిస్టల్ సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్లో మను బాకర్ గోల్డ్ మెడల్ సాధించింది. ఫైనల్లో మను 31-–29తో చింకీ యాదవ్ను ఓడించింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబుతా విజేతగా నిలిచాడు.
నూతక్కి ప్రియాంక
ఫ్రాన్స్లో జరిగిన ‘టోర్నియో ఎంఐఎఫ్ ఇకామ్ లియోన్–2023’ అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజయవాడకు చెందిన మహిళా గ్రాండ్ మాస్టర్ నూతక్కి ప్రియాంక చాంపియన్గా నిలిచింది. తొమ్మిది రౌండ్ల టోర్నీలో టాప్ సీడ్గా బరిలోకి దిగిన ప్రియాంక ఏడు పాయింట్లతో టాప్లో ఉంది.
వెర్ స్టాపన్
ఫార్ము లావన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిలో మ్యాక్స్ వెరైపెన్(రెడ్ బుల్, 25 పాయింట్లు) విజేతగా నిలిచాడు. లూయిస్ హామిల్టన్(మెర్సిడెజ్, 18 పాయింట్లు) నుంచి గట్టిపోటీ ఎదురైనా తొలిసారి ఆస్ట్రేలియన్ టైటిల్ను మ్యాక్స్ తన ఖాతాలో వేసుకున్నాడు.
లుకాస్ హెల్మెక్
ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్కు చెందిన 33 ఏళ్ల లుకాస్ హెల్మెక్ గంటకి 3,182 పుష్ అప్లు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించాడు. లుకాస్ నిమిషానికి 53 పుష్ అప్లు చేశాడని గిన్నిస్ వరల్డ్ అధికారులు తెలిపారు. ఈ రికార్డు కోసం మూడేళ్లు లుకాస్ ట్రైనింగ్ తీసుకున్నాడు.
ప్రకాశ్సింగ్ బాదల్
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అగ్రనేత ప్రకాశ్సింగ్ బాదల్ (95) మొహాలీలోని ఓ ఫోర్టిస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 25న కన్నుమూశారు. 1970–71, 1977–80, 1997–2002, 2007–2012, 2012–2017 ఐదుసార్లు పంజాబ్ సీఎంగా చేశారు.
అనంత్ మహేశ్వరి
ఐటీ పరిశ్రమ అత్యున్నత సంఘమైన నాస్కామ్ చైర్పర్సన్గా 2023–24 సంవత్సరానికి అనంత్ మహేశ్వరి ఎంపికయ్యారు. మహేశ్వరి ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. అంతేకాదు నాస్కామ్ వైస్ చైర్మన్గానూ ఇప్పటి వరకు సేవలు అందించారు.
రాధా అయ్యంగార్
అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అండర్ సెక్రటరీ (మంత్రి)గా భారతీయ అమెరికన్ రాధా అయ్యంగార్ ప్లంబ్ నియామకాన్ని అమెరికా సెనెట్ 68-30 ఓట్లతో ఆమోదించింది. రక్షణ శాఖలో సాధన సామగ్రి సేకరణ విభాగాన్ని ఆమె పర్యవేక్షిస్తారు.
దీపికా మిశ్ర
మధ్యప్రదేశ్ వరద సహాయక చర్యల్లో అసాధారణ ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ దీపికా మిశ్ర భారత వాయుసేన శౌర్య అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకొన్న తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందారు. రాజస్థాన్కు చెందిన దీపిక హెలికాప్టర్ పైలట్గా భారత వాయుసేనలో పనిచేస్తున్నారు.
నీరజ్ చోప్రా
రెండేళ్ల కిందట టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్తో చరిత్ర సృష్టించి, నిరుడు డైమండ్ లీగ్ ఫైనల్లోనూ విజేతగా నిలిచిన నీరజ్ చోప్రా డైమండ్ లీగ్ కొత్త సీజన్లో తొలి అంచె జావెలిన్ త్రో ఫైనల్లో ఈటెను అత్యుత్తమంగా 88.67 మీటర్ల దూరం విసిరిన నీరజ్ విజేతగా నిలిచాడు.
ప్రాచీ దహబల్ దేబ్
మహారాష్ట్రలోని పుణెకు చెందిన ప్రాచీ దహబల్ దేబ్ అనే మహిళ కేకులతో అద్భుతమైన ఆకృతులు రూపొందిస్తూ ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంటుంది. తాజాగా రాయల్ ఐసింగ్ విధానంలో 200 కిలోల భారతీయ రాజభవనం నమూనా కేకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది.
ప్రవీణ్
ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్ జాతీయ రికార్డు బద్దలు కొట్టాడు. హవానా (క్యూబా)లో జరుగుతున్న ఈవెంట్లో ప్రవీణ్ 17.37 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రెంజిత్ మహేశ్వరి పేరిట ఉన్న జాతీయ రికార్డు (17.30 మీ., 2016)ను అతడు తిరగరాశాడు.
సబలెంకా
మహిళల టెన్నిస్ ప్రపంచ నంబర్వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్ (పోలాండ్)ను ఓడించి బెలారస్ స్టార్ సబలెంకా మాడ్రిడ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టోర్నీలో రెండోసారి చాంపియన్గా నిలిచింది. సబలెంకా కెరీర్లో ఇది 12వ సింగిల్స్ టైటిల్.
దలైలామా
ప్రముఖ టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు 1959లో ప్రకటించిన రామన్ మెగసెసె పురస్కారం ఇటీవల వ్యక్తిగతంగా అందుకున్నారు. జీవన విధానం, సంస్కృతి ద్వారా ప్రపంచానికి స్ఫూర్తినిచ్చిన టిబెటన్ సమాజానికి నాయకత్వం వహించినందుకు ఈ అవార్డును అందించారు.
ప్రవీణ్ సూద్
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నూతన డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ ప్రవీణ్ సూద్ ఎంపికయ్యారు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి, లోక్సభప్రతిపక్ష నేతతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఈయన్ను ఎంపిక చేసింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండేళ్ల పాటు ప్రవీణ్సూద్ ఈ పదవిలో కొనసాగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది.
మహమ్మద్ హుసాముద్దీన్
ఐబీఏ పురుషుల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్స్లో మహమ్మద్ హుసాముద్దీన్కు మోకాలి గాయం కారణంగా 57 కేజీల విభాగం సెమీస్లో పోటీపడలేకపోయాడు. క్యూబా బాక్సర్ సైడల్ హోర్టాకు వాకోవర్ ఇచ్చి కాంస్యానికే పరిమితమయ్యాడు.
సుల్తాన్ అల్ నెయాదీ
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)కు చెందిన సుల్తాన్ అల్ నెయాదీ అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి అరబ్గా చరిత్రకెక్కారు. భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్) నుంచి వెలుపలికి వచ్చిన ఆయన రోదసిలోని శూన్య స్థితిలో 7.01గంటల సేపు విధులు నిర్వహించారు.
నరేంద్ర మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీకి పపువా న్యూగినియాతో పాటు ఫిజి దేశం తమ అత్యున్నత పౌర పురస్కారాలతో సత్కరించాయి. పపువా న్యూ గినియా గవర్నర్ జనరల్ సర్ బాబ్ దాడే ‘గ్రాండ్ కంపానియన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ లొగొహు’ అవార్డును మోదీకి బహూకరించారు. ఫిజి ప్రధాని సిటివేని రెబుకా తమ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘కంపానియన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఫిజి’ని మోడీ మెడలో వేసి గౌరవించారు.
లిండా యాకరినా
ట్విటర్కు కొత్త సీఈఓగా లిండా యాకరినా నియమితులయ్యారు. సంస్థ అధినేత ఎలాన్ మస్క్ నుంచి ఆమె ఈ బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రధానంగా ట్విటర్ వ్యాపార కార్యకలాపాలపైనే లిండా దృష్టి సారిస్తారని ట్విటర్ ద్వారా మస్క్ తెలియజేశారు.
అర్జున్రామ్ మేఘ్వాల్
న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజును ఆ మంత్రిత్వ శాఖ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ తప్పించారు. ఆయనకు భూవిజ్ఞానశాస్త్ర శాఖను అప్పగించారు. రిజిజు స్థానంలో రాజస్థాన్ దళిత నేత, మాజీ ఐఏఎస్ అధికారి అర్జున్రామ్ మేఘ్వాల్ను న్యాయశాఖ నూతన మంత్రిగా నియమించారు.
సల్మాన్ రష్దీ
బుకర్ ప్రైజ్ విజేత అయిన అంతర్జాతీయ రచయిత సల్మాన్ రష్దీ మాన్హట్టన్లో గల అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీలో జరిగిన 2023 లిటరరీ గాలాకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘పెన్’ సెంటినరీ కరేజ్ అవార్డుతో ఆయనను సత్కరించారు.
ఎన్.చంద్రశేఖరన్
టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం ‘షువాలె డి లా లీజియన్ దోనర్’ను ప్రకటించారు. భారత్ -ఫ్రాన్స్ మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి చంద్రశేఖరన్ చేసిన కృషికి గాను ఈ అవార్డును అందించారు.
అజయ్ బంగా
ప్రపంచ బ్యాంక్ కొత్త అధ్యక్షుడిగా అజయ్ బంగా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్కు నాయకత్వం వహించనున్న తొలి భారతీయ అమెరికన్గా ఆయన నిలిచారు. ఈ ఏడాది జూన్ 2 నుంచి అయిదేళ్ల పాటు బంగా పదవిలో కొనసాగుతారని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.
సిద్ధార్థ మొహంతి
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) చైర్మన్గా సిద్ధార్థ మొహంతిని ప్రభుత్వం నియమించింది. 2024 జూన్ వరకు మొహంతి ఈ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత జూన్ 7, 2025 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగుతారు.
మల్లికార్జున ప్రసాద్
మహారత్న సంస్థ కోల్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా తెలుగు వ్యక్తి పోలవరపు మల్లికార్జున ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుతం కోల్ ఇండియా అనుబంధ సెంట్రల్ కోల్ఫీల్డ్స్ సీఎండీగా ప్రసాద్ ఉన్నారు.
అరుణ్ గాంధీ
ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త, జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపుర్లో అనారోగ్యంతో మరణించారు.1934, ఏప్రిల్ 14న దక్షిణాఫ్రికాలోని డర్బన్లో మణిలాల్ గాంధీ, సుశీలా మష్రువాలా దంపతులకు అరుణ్ గాంధీ జన్మించారు.
చేతన్ శర్మ
బీసీసీఐ ఐదుగురు సభ్యుల కొత్త సీనియర్ సెలక్షన్ కమిటీని ప్రకటించింది. చేతన్ శర్మ (నార్త్జోన్) చైర్మన్గా వ్యవహరించే ఈ కమిటీలో సలీల్ అంకోలా (వెస్ట్), సుబ్రతో బెనర్జీ (ఈస్ట్), శివ్ సుందర్ దాస్ (సెంట్రల్), ఎస్.శరత్ (సౌత్జోన్) సభ్యులుగా ఉంటారు.
శరద్ యాదవ్
సీనియర్ రాజకీయవేత్త, లోక్తాంత్రిక్ జనతా దళ్(ఎల్జేడీ) అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ గుర్గావ్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శరద్ యాదవ్ మొత్తం పదిసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు. ఏడు సార్లు లోక్సభకు, మూడు సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు.
ఏసీ చరానియా
అమెరికా అంతరిక్ష సంస్థ ప్రతిష్టాత్మక నాసా చీఫ్ టెక్నాలజిస్ట్గా భారతీయ అమెరికన్ ఏసీ చరానియా నియమితులయ్యారు. వాషింగ్టన్లోని నాసా ప్రధాన కార్యాలయంలో అడ్మిస్ట్రేటర్ బిల్ నెల్సన్కు టెక్నాలజీ పాలసీ, ప్రోగ్రామ్ల ప్రధాన సలహాదారుగా చరానియా సేవలందించాల్సి ఉంటుంది.
ప్రసన్నకుమార్
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎల్సీ ఇండియా లిమిటెడ్ (గతంలో నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్) చైర్మన్ – మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా తెలుగువారైన ప్రసన్నకుమార్ మోటుపల్లి నియమితులయ్యారు. ఖమ్మం జిల్లాకు చెందిన ప్రసన్న కుమార్ బాపట్ల ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు.
కమల్ దహల్ ప్రచండ
నేపాల్ నూతన ప్రధానమంత్రి పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ పార్లమెంట్ విశ్వాస తీర్మానం నెగ్గారు. ఎన్నికల ముందు నేపాలీ కాంగ్రెస్తో పెట్టుకున్న పొత్తును వదిలేసి, అనూహ్యంగా ప్రతిపక్ష నేత కేపీ ఓలీతో చేతులు కలిపిన ప్రచండ మూడోసారి నేపాల్ ప్రధానిగా డిసెంబర్ 26న బాధ్యతలు చేపట్టారు.
ఆర్బోనీ గాబ్రియల్
అమెరికాకు చెందిన ఆర్బోనీ గాబ్రియల్ మిస్ యూనివర్స్ 2022 విజేతగా నిలిచింది. విన్నర్కు భారత్కు చెందిన మాజీ విశ్వ సుందరి హర్నాజ్ సంధు ఈ కిరీటాన్ని బహుకరించారు. మిస్ వెనిజులా ఆమంద డుడామెల్ తొలి రన్నరప్గా, మిస్ డొమిన్కన్ రిపబ్లిక్ ఆండ్రీనా మార్టినెజ్ రెండో రన్నరప్గా నిలిచారు.
అబ్దుల్ రెహ్మాన్ మక్కీ
పాకిస్తాన్ కేంద్రంగా భారత్పైకి ఉగ్రమూకలను ఉసిగొల్పుతున్న లష్కరే తోయిబా ఉగ్రసంస్థ డిప్యూటీ చీఫ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీని గ్లోబల్ టెర్రరిస్ట్గా ప్రకటించాలంటూ భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఉషారెడ్డి
డెమోక్రటిక్ పార్టీకి చెందిన భారతీయ అమెరికన్ ఉషారెడ్డి కాన్సస్ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్ 22 సెనేటర్గా బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలంగా ఆ పదవిలో ఉన్న టామ్ హాక్ స్థానంలో ఆమె ఈ పదవిలోకి వచ్చారు. ఎడ్యుకేషనల్ లీడర్షిప్ అంశంపై మాస్టర్స్ చేసిన ఉష గతంలో రెండు సార్లు మేయర్గా పనిచేశారు.
పంకజ్కుమార్ సింగ్
జాతీయ భద్రత ఉప సలహాదారునిగా (డిప్యూటీ ఎన్ఎస్ఏగా) పంకజ్కుమార్ సింగ్ నియమితులయ్యారు. రాజస్థాన్ క్యాడర్ 1988 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆయన బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ హోదాలో 2022 డిసెంబరు 31న పదవీ విరమణ చేశారు.
కె.సచ్చిదానందన్
ఆధునిక మళయాళ కవి, విమర్శకుడు, అనువాదకుడు కె.సచ్చిదానందన్ను ‘ఎనిమిదవ మహాకవి కన్హయ్యాలాల్ సేఠియా కవిత్వ అవార్డు’ వరించింది.16వ జైపుర్ సాహిత్య ఉత్సవంలో ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు.
రవి కుమార్
కాగ్నిజెంట్ సీఈవోగా రవి కుమార్ నియమితులయ్యారు. గతంలో ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్గా ఆయన వ్యవహరించారు. ప్రస్తుత కాగ్నిజెంట్ సీఈఓగా ఉన్న బ్రయాన్ హంఫ్రీస్ మార్చి 15న కంపెనీని వీడాల్సి ఉంది. ఇప్పుడే ఆయన బాధ్యతల నుంచి వైదొలగనున్నారు.
శివ చౌహాన్
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సరిహద్దు రక్షణ స్థానం సియాచిన్లో మొట్టమొదటిసారిగా ఒక మహిళా ఆఫీసర్ దళాధిపతిగా కెప్టెన్ శివ చౌహాన్ నియమితురాలయ్యింది. 15 వేల అడుగున ఎత్తున దేశ రక్షణకు నిలిచిన ఆమె ఈ పోస్ట్ పొందడానికి ఎంతో కష్టతరమైన ట్రైనింగ్ పూర్తి చేసింది.
బెనెడిక్ట్–16
మాజీ పోప్ బెనెడిక్ట్–16 వాటికన్ సిటీలో మరణించారు. మాజీ పోప్కు ప్రస్తుత పోప్ అంతిమ సంస్కారాలు జరిపిన అరుదైన సన్నివేశంగా ఇది చరిత్రలో నిలిచిపోనుంది. బెనెడిక్ట్ కోరిన విధంగా కార్యక్రమాన్ని నిరాడంబరంగా జరపనున్నట్టు వాటికన్ పేర్కొంది.
ఇ. ఆంజనేయ గౌడ్
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నూతన చైర్మన్గా డాక్టర్ ఇ. ఆంజనేయ గౌడ్ నియమితులయ్యారు. ఈ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. గద్వాల్కు చెందిన ఆంజనేయ గౌడ్ గతంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడిగా పనిచేశారు.
ఎరిక్ గార్సెటి
భారతదేశంలో అమెరికా రాయబారిగా లాస్ ఏంజెలెస్ మాజీ మేయర్ ఎరిక్ గార్సెటి మళ్లీ నామినేట్ అయ్యారు. ఈ మేరకు బైడెన్ సర్కారు నిర్ణయం తీసుకుంది. భారత్తో సత్సంబంధాలు చాలా కీలకమైనందున మళ్లీ నామినేట్ చేస్తున్నట్లు వైట్హౌస్ పేర్కొంది.
హీరాబెన్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ కన్నుమూశారు. ఆమెకు ప్రధాని మోడీ సహా అయిదుగురు కుమారులు సోమాబాయ్, అమృత్, ప్రహ్లాద్, పంకజ్, కుమార్తె వాసంతిబెన్ ఉన్నారు. గాంధీనగర్ శ్మశాన వాటికలో ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో అంత్యక్రియలు ముగిశాయి.
రీనా వినోద్ పుష్కర్ణ
ప్రవాస భారతీయురాలు, ప్రముఖ పాకశాస్త్ర నిపుణురాలు రీనా వినోద్ పుష్కర్ణను భారత ప్రభుత్వం ప్రవాసీ భారతీయ సమ్మాన్ పురస్కారానికి ఎంపిక చేసింది. జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో జరిగే ప్రవాసీ భారతీయ దివస్ కార్యక్రమంలో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు.
చాగంటి కోటేశ్వరరావు
మహాకవి గురజాడ107వ వర్ధంతి సందర్భంగా గురజాడ సాంస్కృతిక సమాఖ్య విజయనగరంలోని జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో చాగంటికి గురజాడ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసింది. గురజాడ తన రచనలను లోకంలోని కష్టాలను చూసి ఆ కన్నీళ్లతో రాశారని ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు తెలిపారు.
అల్లూరి సరోజ
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వాసి అల్లూరి సరోజకు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నవంబరు 19న జరిగిన పోటీల్లో మిసెస్ ఆసియా కిరీటాన్ని సొంతం చేసుకుంది. అల్లూరి సరోజ తండ్రి రాంబాబు, తల్లి పార్వతి స్వగ్రామం సఖినేటిపల్లి. ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్థిరపడ్డారు.
జియాంగ్ జెమిన్
కమ్యూనిస్టు చైనాను ఆర్థిక సంస్కరణలతో అభివృద్ధిపథంలో పరుగులు పెట్టించిన ఆ దేశ మాజీ అధ్యక్షుడు జియాంగ్ జెమిన్ అనారోగ్యంతో షాంఘైలో మరణించారు. చైనా అధ్యక్షుడి హోదాలో భారత్లో పర్యటించిన తొలి వ్యక్తి జియాంగ్ జెమిన్.
ప్రీతి సూదన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సభ్యురాలిగా ప్రీతి సూదన్ బాధ్యతలు చేపట్టారు. ఆమె 1983 బ్యాచ్ ఏపీ కేడర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని ప్రీతీ సూదన్తో ప్రమాణం చేయించారు. కరోనా సమయంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పని చేసి, రిటైర్ అయ్యారు.
ప్రశాంత్ కుమార్
అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఏఏఐ) ప్రెసిడెంట్గా ‘గ్రూప్ఎం మీడియా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్’ దక్షిణాసియా సీఈవో ప్రశాంత్ కుమార్ ఎన్నికయ్యారు. ఏఏఏఐ ఏజీఎంలో ఈ ఎన్నిక జరిగింది. 2022–23 సంవత్సరానికి ఏఏఏఐ ప్రెసిడెంట్గా ప్రశాంత్ కుమార్ సేవలు అందించనున్నారు.
జెలెన్స్కీ
‘పర్సన్ ఆఫ్ ది ఇయర్-–2022’గా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీని ఎంపికచేస్తూ ఆయన ముఖచిత్రంతో టైమ్ మేగజీన్ తాజా సంచిక ప్రచురించింది. ‘2022లో ఏడాదిగా ప్రజాస్వామ్యం, ధిక్కారానికి ఓ చిహ్నంగా నిరూపించుకున్నారు. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండానే రష్యా దాడులను ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు.’ అని పేర్కొంది.
డాక్టర్ నాగేశ్వరరెడ్డి
‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్’ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ) ఛైర్మన్, ప్రఖ్యాత జీర్ణకోశ వైద్యనిపుణుడు డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డికి ‘డాక్టర్ ఆఫ్ సైన్స్’ పురస్కారాన్ని అందజేశారు.
ఎస్.ఎస్.రాజమౌళి
ఆస్కార్ పురస్కారాల్లో ఫేవరేట్గా నిలుస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రానికిగానూ, ప్రతిష్టాత్మకమైన న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ (ఎన్.వై.ఎఫ్.సి.సి) పురస్కారాల్లో ఉత్తమ దర్శకుడిగా రాజమౌళి ఎంపికయ్యారు.
రమేష్ కార్తీక్
నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం వివేక్నగర్ తండాకు చెందిన రమేష్ కార్తీక్ తన 20వ ఏట రాసిన కవితా సంపుటి ‘బల్దేర్ బండి’లోని జారేర్బాటి కవితను కాకతీయ విశ్వవిద్యాలయం అటానమస్ కళాశాల డిగ్రీ 5వ సెమిస్టర్ సిలబస్లో రెండేళ్ల కిందటే పెట్టారు. తాజాగా ఏయూలో ఎంఏ తెలుగు 4వ సెమిస్టర్ సిలబస్లో దాన్ని చేర్చారు.
అరుణ్ కుమార్ సింగ్
ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ చైర్మన్గా అరుణ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు.ఆయన గతంలో చమురు రిఫైనింగ్, మార్కెటింగ్ సంస్థ బీపీసీఎల్ చైర్మన్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. సింగ్ మూడేళ్ల పాటు ఓఎన్జీసీ చైర్మన్గా వ్యవహరిస్తారు.
అఫ్సిన్ ఘడెర్జాదేహ్
ప్రపంచంలోనే అత్యంత పొట్టి వ్యక్తిగా ఇరాన్కు చెందిన అఫ్సిన్ ఘడెర్జాదేహ్ రికార్డ్ సృష్టించాడు. అతడు 65.24 సెంటీమీటర్లు (2 అడుగుల 1.68 అంగుళాలు) ఉన్నట్లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు వెల్లడించారు. ఇప్పటివరకు ఎడ్వర్డ్ నినో (కొలంబియా) అతి పొట్టి వ్యక్తిగా రికార్డుల్లో ఉండగా అతని కంటే అఫ్సిన్ 7 సెం.మీ. పొట్టిగా ఉన్నాడు.
సుఖ్వీందర్ సింగ్ సుఖు
హిమాచల్ప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా సుఖ్వీందర్ సింగ్ సుఖుతో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రమాణం చేయించారు. సుఖు కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ నాయకుడి నుంచి సీఎం వరకు అంచెలంచెలుగా ఎదిగారు.
బెర్నార్డ్ అర్నాల్ట్
ఫ్రెంచ్ లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ఎల్వీఎంహెచ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ బెర్నార్డ్ అర్నాల్ట్ నికర సంపద 190.90 బి.డాలర్లకు చేరడంతో బిలియనీర్ల జాబితాలో ఆయన అగ్ర స్థానం దక్కించుకున్నారని ఫోర్బ్స్ తెలిపింది. 175.50 బి.డాలర్లతో ఎలాన్ మస్క్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మూడో స్థానంలో భారత వ్యాపారవేత్త గౌతమ్ అదానీ కొనసాగుతున్నారు.
కార్టూనిస్ట్ శంకర్
హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో బాపూ జయంతి వేడుకల సందర్భంగాప్రముఖ కార్టూనిస్ట్ పామర్తి శంకర్కు బాపూ పురస్కారం, రచయిత్రి పొత్తూరి విజయలక్ష్మికి రమణ పురస్కారాలను ప్రదానం చేశారు.
జస్టిస్ దీపాంకర్ దత్తా
సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ దీపాంకర్ దత్తాతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రమాణం చేయించారు. జస్టిస్ దత్తా ప్రమాణస్వీకారం తర్వాత సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 28కి పెరిగింది. భారత రాజ్యాంగ నిబంధనలప్రకారం సీజేతో కలుపుకుని సుప్రీంకోర్టులో గరిష్టంగా 34 మంది వరకు జడ్జీలు ఉండొచ్చు.
ఆదిత్య
యువ చెస్ ఆటగాడు ఆదిత్య మిట్టల్ (ముంబయి) గ్రాండ్మాస్టర్గా అవతరించాడు. జీఎం టైటిల్ సాధించిన 77వ భారత క్రీడాకారుడిగా ఆదిత్య ఘనత అందుకున్నాడు. 2500 ఎలో రేటింగ్, మూడు జీఎం నార్మ్లు సాధిస్తే గ్రాండ్మాస్టర్ టైటిల్ లభిస్తుంది.
సంపత్కుమార్
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం డైరెక్టర్గా ప్రొఫెసర్ మాడభూషి సంపత్ కుమార్ను నియమించారు. ఆ మేరకు మైసూరులోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అసిస్టెంట్ డైరెక్టర్ నారాయణ చౌదరి ఉత్తర్వులు జారీ చేశారు.
సర్గమ్ కౌశల్
ఈ ఏడాది ‘మిసెస్ ఇండియా వరల్డ్’గా నిలిచిన జమ్ము కశ్మీర్కు చెందిన 32 ఏళ్ల సర్గమ్ కౌశల్ ‘మిసెస్ వరల్డ్’ కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది. మిసెస్ వరల్డ్ కిరీటం మన దేశాన్ని వరించి 21 ఏళ్లైంది. ఇప్పటివరకూ దేశానికి ఆ కిరీటాన్ని తీసుకొచ్చింది డాక్టర్ అదితి గోవిత్రికర్ మాత్రమే.
రేవంత్
బిగ్బాస్ సీజన్-–6లో సింగర్ రేవంత్ విజేతగా నిలిచారు. ఆయనకు ఇంటి స్థలం, కారు, రూ.10 లక్షల ప్రైజ్ మనీ, ట్రోఫీ లభించాయి. శ్రీహాన్ రన్నరప్గా నిలిచాడు. సెప్టెంబరు 4న స్టార్ మా టీవీలో ప్రారంభమై 106 రోజులు కొనసాగిన ఆటలో 21 మంది పోటీపడగా సినీ నటుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించారు.
రాజా రిత్విక్
స్పెయిన్లో జరిగిన సన్వే సిట్గెస్ ఓపెన్ అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్లో 18 ఏళ్ల రాజా రిత్విక్ చాంపియన్గా అవతరించాడు. 30 దేశాల నుంచి 120 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో రిత్విక్ అజేయంగా నిలిచాడు.
అన్వితారెడ్డి
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి చెందిన పడమటి అన్వితారెడ్డి అంటార్కిటికాలోని విన్సన్ పర్వతాన్ని అధిరోహించారు. 4,892 మీటర్ల ఎత్తయిన విన్సన్ పర్వతాన్ని డిసెంబర్ 16వ తేదీన ఉదయం అధిరోహించి భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అన్వితారెడ్డి సెప్టెంబర్ 28న నేపాల్లోని మనాస్లు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారత మహిళగా ఇప్పటికే చరిత్ర సృష్టించారు.
పీటీ ఉష
భారత అథ్లెటిక్స్ దిగ్గజం పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలిగా ఎన్నికైంది. డిసెంబర్ 10వ తేదీ దానికి అధికారికంగా ఆమోదముద్ర పడింది. ఐఓఏ అధ్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళగా 58 ఏళ్ల ఉష గుర్తింపు పొందింది.
స్పోర్ట్స్
ఆస్ట్రేలియన్ ఓపెన్
ఆస్ట్రేలియన్ ఓపెన్లో పురుషుల సింగిల్స్ ఫైనల్లో సెర్బియా ఆటగాడు జకోవిచ్ మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. మహిళల సింగిల్స్ ఫైనల్లో రిబకినాపై గెలిచి కొత్త చాంపియన్గా అరీనా సబలెంక నిలిచింది. మరోవైపు మహిళల డబుల్స్ ట్రోఫీని సినియాకోవా–క్రెజికోవా (చెక్ రిపబ్లిక్) జోడీ గెలుచుకుంది.
హాకీ ప్రపంచకప్ విన్నర్
భారత్ ఆతిథ్యమిచ్చిన 2023 హాకీ ప్రపంచకప్ను జర్మనీ కైవసం చేసుకుంది. ఫైనల్లో జర్మనీ 5-–4తో షూటౌట్లో డిఫెండింగ్ చాంపియన్ బెల్జియంను ఓడించింది. జర్మనీకిది మూడో ప్రపంచకప్. 2002, 2006లోనూ ఆ జట్టు ట్రోఫీ నెగ్గింది.
వన్డే, టీ20ల్లో నంబర్ వన్
టీమిండియా సూపర్ ఫామ్తో ప్రస్తుతం టీ20ల్లో, వన్డేల్లో నెంబర్వన్గా ఉంది. టీమిండియా మొదట శ్రీలంకను, న్యూజిలాండ్తో సిరీస్లో క్లీన్స్వీప్ చేయడంతో టాప్లో నిలిచింది. టెస్టుల్లోనూ అగ్రస్థానం అందుకుంటే.. ముచ్చటగా మూడు ఫార్మాట్లలోనూ ఏకకాలంలో నెంబర్వన్గా నిలిచిన అరుదైన జట్టుగా నిలవనుంది.
వర్షిణికి ‘ఫిడే మాస్టర్’ టైటిల్
ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఎం.సాహితీ వర్షిణి ‘ఫిడే మాస్టర్’ టైటిల్ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు విమెన్ క్యాండిడేట్ మాస్టర్, విమెన్ ఫిడే మాస్టర్, విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్స్ సాధించిన సాహితి వర్షిణి తాజాగా ‘ఫిడే మాస్టర్’ అయింది.
ఫార్ములా-ఈ–రేస్ ఛాంప్
ఫార్ములా-ఈ ప్రి నాలుగో రౌండ్లో పెన్స్కీ డ్రైవర్ జీన్ ఎరిక్ వెర్న్ చాంపియన్గా నిలిచాడు. హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్లో సాగిన రేసులో వెర్న్ అగ్రస్థానం సాధించాడు. 46 నిమిషాల 1.099 సెకన్లలో 32 ల్యాప్లను పూర్తిచేసి అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్
ఇండియన్ స్టార్ ప్లేయర్ శుభ్మన్ గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’ (జనవరి–2023)గా ఎంపికయ్యాడు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్ల్లో కలిపి 567 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్కు చెందిన గ్రేస్ స్క్రీవెన్స్ మహిళల విభాగంలో ‘ప్లేయర్ ఆఫ్ ద మంత్’గా ఎంపికైంది.
చాంపియన్ సౌరాష్ట్ర
రంజీ ట్రోఫీలో సౌరాష్ట్ర చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో సౌరాష్ట్ర 9 వికెట్ల తేడాతో బెంగాల్ను ఓడించింది.ఈ సీజన్లో 907 పరుగులు సాధించిన అర్పిత్ వసవాడాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. తొలి ఇన్నింగ్స్లో బెంగాల్ 174 పరుగులకే కుప్పకూలగా సౌరాష్ట్ర 404 పరుగులు చేసింది.
సన్రైజర్స్ కెప్టెన్ మార్క్రమ్
రానున్న ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్కు దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ మార్క్రమ్ కెప్టెన్గా ఉండనున్నారు. ఇటీవల జొహానెస్బర్గ్లో ముగిసిన తొలి ఎస్ఏ20 లీగ్లో విజేతగా నిలిచిన సన్రైజర్స్ ఈస్టర్న్ కేప్కు మార్క్రమ్ నాయకత్వం వహించాడు.
ప్రపంచ ఉత్తమ ఫుట్బాలర్
అర్జెంటీనా జట్టును ప్రపంచ చాంపియన్గా నిలబెట్టిన లియోనెల్ మెస్సీ 2022 ప్రపంచ ఉత్తమ ఫుట్బాలర్గా ఎంపికయ్యాడు. గత 14 ఏళ్లలో మెస్సీ ఏడోసారి ప్రపంచ ఉత్తమ ఫుట్బాలర్ అవార్డు గెల్చుకున్నాడు. మహిళల విభాగంలో ప్రపంచ ఉత్తమ క్రీడాకారిణి అవార్డు స్పెయిన్కు చెందిన అలెక్సియా పుటెలాస్కు లభించింది.
ఆస్ట్రేలియాదే ప్రపంచకప్
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ జట్టు మరో ‘హ్యాట్రిక్’తో టీ20 ప్రపంచకప్ను కైవసం చేసుకుంది. 2010, 2012, 2014లలో వరుసగా మూడుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆసీస్.. 2016 మెగా ఈవెంట్లో రన్నరప్తో సరిపెట్టుకుంది. మళ్లీ 2018, 2020గెలవగా, 2023లో ఫైనల్లో దక్షిణాఫ్రికాపై నెగ్గి ప్రపంచకప్ల హ్యాట్రిక్ నమోదు చేసింది.
సంతోష్ ట్రోఫీ చాంపియన్
సంతోష్ ట్రోఫీ చాంపియన్గా కర్ణాటక అవతరించింది. 54 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఫుట్బాల్ టోర్నీలో విజేతగా నిలిచింది. ఫైనల్లో కర్ణాటక 3–2తో మేఘాలయపై విజయం సాధించింది. సునీల్ కుమార్ (3వ నిమిషం), బెకి ఓరమ్ (20వ), రాబిన్ యాదవ్ (44వ) కర్ణాటక తరఫున గోల్స్ చేశారు.
రెస్ట్దే ఇరానీ కప్
రెస్టాఫ్ ఇండియా ఇరానీ కప్లో చాంపియన్గా నిలిచింది. 2022 రంజీ ట్రోఫీ చాంపియన్ మధ్యప్రదేశ్ను చిత్తుచేసి ఇరానీ కప్ను నిలబెట్టుకుంది. ఫైనల్ మ్యాచ్లో రెస్ట్ 238 పరుగుల తేడాతో మధ్యప్రదేశ్పై విజయం సాధించింది.
నంబర్వన్ బౌలర్గా అశ్విన్
టీమ్ ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మళ్లీ ప్రపంచ నంబర్వన్ బౌలర్గా నిలిచాడు. ఈ మేరకు ప్రకటించిన ఐసీసీ టెస్టు బౌలింగ్ జాబితాలో అశ్విన్ 869 పాయింట్లతో నంబర్వన్ ర్యాంకు సాధించాడు. జేమ్స్ అండర్సన్, కమిన్స్ రెండు, మూడో స్థానాల్లో ఉన్నారు.
ఇండియాదే బోర్డర్-–గావస్కర్ ట్రోఫీ
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆఖరి టెస్టు డ్రాగా ముగియడంతో2–-1తో వరుసగా నాలుగో సారి భారత్ బోర్డర్-గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకుంది. అశ్విన్, జడేజాలకు సంయుక్తంగా ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. 2017, 2018,19, 2020 – 21లో సిరీస్ కైవసం చేసుకుంది.
ఆసియా బిలియర్డ్స్ టైటిల్
భారత క్యూ సూపర్ స్టార్ పంకజ్ అద్వాని మరోసారి ఆసియా బిలియర్డ్స్ టైటిల్ను సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో అతను 5-–1తో బ్రిజేష్ దమానిపై విజయం సాధించాడు. పంకజ్కిది తొమ్మిదో ఆసియా బిలియర్డ్స్ టైటిల్.
ఏటీపీ మాస్టర్స్ టైటిల్
ఇండియన్ వెల్స్ ఓపెన్ ఏటీపీ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి రోహన్ బోపన్న పురుషుల డబుల్స్ టైటిల్ సాధించాడు. ఈ గెలుపుతో 43 ఏళ్ల బోపన్న ఏటీపీ మాస్టర్స్ సిరీస్ టైటిల్ నెగ్గిన పెద్ద వయస్కుడిగా రికార్డు నెలకొల్పాడు.
మియామి టైటిల్
రష్యా టెన్నిస్ స్టార్ డానియల్ మెద్వెదెవ్ మియామి టైటిల్ కైవసం చేసుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో అతడు 7-–5, 6–-3తో జానిక్ సినర్ (ఇటలీ)ను ఓడించాడు. గత 25 మ్యాచ్ల్లో మెద్వెదెవ్ 24 గెలవడం విశేషం. ఇండియన్ వెల్స్ ఫైనల్లో కార్లోస్ అల్కరాస్ చేతిలో మాత్రమే ఓడిపోయాడు.
ఆస్ట్రేలియన్ ఓపెన్
ఫార్ములావన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ప్రిలో మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్బుల్) చాంపియన్గా నిలిచాడు. ఏడుసార్లు ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెజ్, 18 పాయింట్లు) నుంచి గట్టిపోటీ ఎదురైనా నిలిచిన మ్యాక్స్ తొలిసారి ఆస్ట్రేలియన్ టైటిల్ను ఖాతాలో వేసుకున్నాడు.
నంబర్వన్గా అర్జెంటీనా
అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రపంచ ర్యాంకింగ్స్లో అర్జెంటీనా జట్టు ఆరేళ్ల తర్వాత మళ్లీ టాప్ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఫ్రాన్స్, బ్రెజిల్ వరుసగా రెండు, మూడో స్థానంలో ఉన్నాయి. భారత జట్టు ఐదు స్థానాలు పురోగతి సాధించి 101వ ర్యాంక్ చేరింది.
ఆర్లీన్స్ మాస్టర్స్ టోర్నీ
భారత యువ షట్లర్ ప్రియాంశు రజావత్ ఆర్లీన్స్ మాస్టర్స్ టోర్నీ విజేతగా నిలిచాడు. అతను తొలి బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్ సూపర్ 300 టైటిల్ను దక్కించుకున్నాడు. క్వాలిఫయర్గా అడుగుపెట్టి 21 ఏళ్ల ప్రియాంశు పురుషుల సింగిల్స్ ఫైనల్లో మాగ్నస్ జొహానెసన్ (డెన్మార్క్)పై గెలిచాడు.
ఆర్చరీలో ప్రపంచ రికార్డు
తెలుగమ్మాయి వెన్నెం జ్యోతి సురేఖ తుర్కియేలో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నమెంట్లో మహిళల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ర్యాంకింగ్ రౌండ్లో ప్రపంచ రికార్డుతో అదరగొట్టింది. ఈ పోటీల్లో డబుల్-50 రౌండ్లో (353/360), సింగిల్-50 రౌండ్లో (360/360) పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుదే చెస్ టైటిల్
కజకిస్తాన్, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ మహిళల జట్ల మధ్య జరిగిన చెస్ టోర్నమెంట్లో ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టు టైటిల్ దక్కించుకుంది. భారత గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక, తమిళనాడుకు చెందిన మహిళా గ్రాండ్మాస్టర్ (డబ్ల్యూజీఎం) సవితాశ్రీ ‘రెస్ట్ ఆఫ్ ద వరల్డ్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు.
గుకేశ్ కు ఆర్మగెడాన్ టైటిల్
భారత చెస్ కెరటం గుకేశ్ మరోసారి సత్తా చాటాడు. ఆర్మగెడాన్ ఆసియా, ఓసియానియా టైటిల్ను ఈ గ్రాండ్ మాస్టర్ సొంతం చేసుకున్నాడు. రెండు మ్యాచ్ల ఫైనల్లో అతను ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ నొడిర్బెక్ అబ్దుసతొరోవ్ (ఉజ్బెకిస్థాన్)ను ఓడించాడు.
లారెస్ గ్లోబల్ అవార్డులు
అర్జెంటీనా ఫుట్బాల్ కెప్టెన్ లియోనెల్ మెస్సీ, జమైకా స్ప్రింటర్ షెల్లిఆన్ ఫ్రేజర్ ప్రైస్ ఆయా విభాగాల్లో ప్రతిష్టాత్మక లారెస్ గ్లోబల్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు గెలుచుకున్నారు. అర్జెంటీనా ఫుట్బాల్ జట్టు టీమ్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో కలిపి మెస్సీ రెండు అవార్డులను అందుకున్నాడు.
ప్రపంచకప్ షూటింగ్
ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్లో భారత్కు తొలి స్వర్ణ పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో సరబ్జోత్ సింగ్–దివ్య థడిగోల్ సుబ్బరాజు (భారత్) ద్వయం విజేతగా నిలిచింది.
భారత షూటర్ వరల్డ్ రికార్డ్
షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ రిథమ్ సాంగ్వాన్ నయా ప్రపంచ రికార్డు సృష్టించింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో క్వాలిఫికేషన్లో 595 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచిన రిథమ్.. అత్యధిక క్వాలిఫికేషన్ స్కోరు రికార్డును బద్దలు కొట్టింది.
పారితోషికాల్లో రొనాల్డో టాప్
అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాళ్లలో ఫుట్బాలర్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో ఉన్నట్టు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఇటీవల సౌదీ అరేబియా క్లబ్ అల్నాసర్కు మారిన తరువాత రొనాల్డో పారితోషికం మూడేళ్ల కాలానికి 136 మిలియన్ డాలర్లకు పెరిగినట్టు ఫోర్బ్స్ తెలిపింది. మెస్సీ, ఎంబాపె తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
టాప్ ప్లేస్లో నీరజ్ చోప్రా
భారత స్టార్ నీరజ్ చోప్రా ప్రపంచ జావెలిన్ త్రోలో నంబర్వన్ ర్యాంకు సాధించిన తొలి ఇండియన్గా చరిత్ర సృష్టించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ తాజా ర్యాంకింగ్స్లో నీరజ్ (1455 పాయింట్లు) ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా, 1433)ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.
ఐహెచ్ఎఫ్ ఛాలెంజర్ ట్రోఫీ
అంతర్జాతీయ హ్యాండ్బాల్ ఫెడరేషన్ (ఐహెచ్ఎఫ్) ఛాలెంజర్ ట్రోఫీలో భారత అమ్మాయిల జట్టు విజేతగా నిలిచింది. ఢాకాలో జరిగిన పోటీల్లో భారత్ ఫైనల్లో ఆతిథ్య బంగ్లాదేశ్పై గెలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది.
టెస్టు క్రికెట్లో భారత్ నంబర్వన్
టెస్టు క్రికెట్లో టీమ్ ఇండియా నంబర్వన్గా నిలిచింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 121 రేటింగ్ పాయింట్లతో భారత్ నంబర్వన్ స్థానం సాధించింది. ఆసీస్ (116) రెండు, ఇంగ్లాండ్ (114) మూడో స్థానాల్లో నిలిచాయి.
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్స్
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో రంకిరెడ్డి సాత్విక్–సాయిరాజ్ – చిరాగ్శెట్టి జోడీ చరిత్రాత్మక డబుల్స్ స్వర్ణం సాధించింది. దీంతో బీడబ్ల్యూఎఫ్ తాజా ర్యాంకింగ్స్లో సాత్విక్ ద్వయం అయిదో ర్యాంకులో నిలిచింది.
అడిలైడ్ ఓపెన్ విజేత జొకోవిచ్
అడిలైడ్ ఇంటర్నేషనల్–1 ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో 35 ఏళ్ల సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ చాంపియన్గా నిలిచాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ ప్రపంచ 33వ ర్యాంకర్ సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై గెలిచాడు. జొకోవిచ్ కెరీర్లో ఇది 92వ సింగిల్స్ టైటిల్.
బ్రిటీష్ ఓపెన్ స్క్వాష్ టోర్నీ
ప్రతిష్టాత్మక బ్రిటీష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ టోర్నీలో అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో భారత అమ్మాయి అనాహత్ సింగ్ విజేతగా నిలిచింది. ఫైనల్లో సొహైలా హజీమ్ (ఈజిప్ట్)పై గెలిచింది. గతంలో భారత్ నుంచి జోష్నా చినప్ప, దీపిక పళ్లికల్ మాత్రమే బ్రిటీష్ ఓపెన్ జూనియర్ టోర్నీలో విజేతలుగా నిలిచారు.
యుకి–సాకేత్ జోడీకి టైటిల్
యుకి బాంబ్రి, సాకేత్ మైనేని జంట బ్యాంకాక్ ఓపెన్ ఛాలెంజర్ టైటిల్ను గెలుచుకుంది. ఫైనల్లో ఈ టాప్ సీడ్ జోడీ రుంగ్కాత్ (ఇండోనేషియా), అకిర సాంటిలన్ (ఆస్ట్రేలియా) ద్వయంపై విజయం సాధించింది. యుకి, సాకేత్ జంటకు ఆస్ట్రేలియన్ ఓపెన్లో వైల్డ్కార్డ్ లభించింది.
జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు
భారత ఆర్చరీ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఓపెన్ సెలెక్షన్ ట్రయల్స్లో తెలుగు అమ్మాయి జ్యోతి సురేఖ ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ట్రయల్స్లో డబుల్ 50 మీటర్ల రౌండ్లో 1440 పాయింట్లకుగాను 1418 పాయింట్లతో వరల్డ్ రికార్డ్ సాధించింది.
బ్లిట్జ్ చాంపియన్షిప్లో హంపికి రజతం
భారత మహిళా చెస్ స్టార్ కోనేరు హంపి ప్రపంచ బ్లిట్జ్ చాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సాధించింది.ఈ టోర్నీలో 35 ఏళ్ల హంపి 12.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. 13 పాయింట్లతో బిబిసారా (కజకిస్తాన్) చాంపియన్గా అవతరించింది. ఓపెన్ విభాగంలో మాగ్నస్ కార్ల్సన్ (నార్వే) టైటిల్ సాధించాడు.
సౌదీ అరేబియా క్లబ్తో రొనాల్డో
తన 20 ఏళ్ల ప్రొఫెషనల్ కెరీర్లో యూరోప్లోని విఖ్యాత క్లబ్లకు ప్రాతినిధ్యం వహించిన పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తొలిసారి ఆసియాలోని సౌదీ అరేబియాకు చెందిన అల్ నాసర్ క్లబ్తో రెండున్నరేళ్ల కాలానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు.
కెనడాకు డేవిస్కప్
ప్రపంచ పురుషుల టీమ్ టెన్నిస్ చాంపియన్షిప్ డేవిస్కప్లో కెనడా జట్టు తొలిసారి విజేతగా అవతరించింది. స్పెయిన్లో జరిగిన ఫైనల్లో కెనడా 2–0తో ఆస్ట్రేలియాపై గెలిచింది.122 ఏళ్ల డేవిస్కప్ చరిత్రలో కెనడా తొలిసారి టైటిల్ అందుకుంది. 2019లో కెనడా ఫైనల్కు చేరినా రన్నరప్గా నిలిచింది.
ఐఓఏ అధ్యక్షురాలిగా పీటీ ఉష
దిగ్గజ స్ప్రింటర్ పీటీ ఉష భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైంది. ఐఓఏ అధ్యక్ష పదవికి ఆమె ఒక్కరే నామినేషన్ వేయడంతో విజయం ముందే ఖాయమైంది. ఐఓఏ ఉపాధ్యక్షుడిగా ఒలింపిక్ కాంస్య విజేత గగన్ నారంగ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.
సౌరాష్ట్రదే విజయ్హజారె ట్రోఫీ
విజయ్ హజారె ఫైనల్లో మహారాష్ట్రపై సౌరాష్ట్ర 5 వికెట్ల తేడాతో గెలిచింది. 249 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర 46.3 ఓవర్లలో 5 వికెట్లే కోల్పోయి ఛేదించింది. సౌరాష్ట్ర ఈ ట్రోఫీ సాధించడం ఇది రెండోసారి. 2007–8 సీజన్లో ఆ జట్టు విజేతగా నిలిచింది.
మెస్సి సూపర్ రికార్డ్
ప్రొఫెషనల్ ఆటగాడిగా మెస్సి 1000 మ్యాచ్లు ఆడాడు. అందులో అర్జెంటీనా తరపున 169 (94 గోల్స్), బార్సిలోనా తరపున 778 (672 గోల్స్), పారిస్ సెయింట్ జర్మైన్ తరపున 53 (23 గోల్స్) మ్యాచ్లాడాడు. మొత్తం 789 గోల్స్ సాధించాడు.
మీరాబాయికి సిల్వర్ మెడల్
భారత స్టార్ మహిళా వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను ప్రపంచ వెయిట్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. బొగోటా (కొలంబియా)లో జరిగిన 49 కేజీల విభాగం పోటీల్లో మీరాబాయి రెండో స్థానంలో నిలిచింది. జియాంగ్ హుయ్హువా (చైనా; 206 కేజీలు) స్వర్ణం సాధించింది.
ఇషా సింగ్కు రజతం
జాతీయ షూటింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రజత పతకం గెలుచుకుంది. భోపాల్లో డిసెంబర్ 12న ముగిసిన ఈ టోర్నీలో ఇషా సింగ్ జూనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగం ఫైనల్లో హర్యాణకు చెందిన ఒలింపియన్ మను భాకర్ చేతిలో ఓడిపోయింది.
ఫిఫా ప్రపంచకప్ విజేత అర్జెంటీనా
ఫిఫా ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ను ఓడించి అర్జెంటీనా విజేతగా నిలిచింది. అర్జెంటీనా షూటౌట్లో 4-2తో పైచేయి సాధించింది. మొత్తంగా ఆ జట్టు మూడోసారి జగజ్జేతగా నిలిచింది. గోల్డెన్ బాల్ (బెస్ట్ ప్లేయర్) అవార్డ్ మెస్సీ, గోల్డెన్ బూట్ ఎంబాపె, గోల్డెన్ గ్లౌవ్ మార్టినెజ్, బెస్ట్ యంగ్ ప్లేయర్ ఎంజో ఫెర్నాండెజ్ (అర్జెంటీనా), ఫెయిర్ ప్లే అవార్డు ఇంగ్లండ్ టీమ్ దక్కించుకుంది.
జైపుర్దే ప్రొ కబడ్డీ-–9 టైటిల్
ప్రొ కబడ్డీ లీగ్ ఆరంభ సీజన్లో విజేతగా నిలిచిన జైపుర్ పింక్ పాంథర్స్ మళ్లీ తొమ్మిదో సీజన్ ఫైనల్లో జైపుర్ 33-–29తో పుణెరి పల్టాన్పై విజయం సాధించడంతో టైటిల్ గెలుచుకుంది.
సైన్స్ అండ్ టెక్నాలజీ
మానవసహిత గగన్యాన్
2024 చివరికల్లా మానవసహిత గగన్యాన్ ప్రయోగం నిర్వహిస్తామని షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ ప్రకటించారు. వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలతో పాటు సూర్యుడిపై పరిశోధనకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగించడంతో చంద్రయాన్–3 ప్రయోగానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఎస్ఎస్ఎల్వీ-డీ2 సక్సెస్
ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నుంచి ఎస్ఎస్ఎల్వీ-డీ2 రాకెట్ మూడు ఉపగ్రహాలను విజయవంతంగా మోసుకెళ్లింది. మార్చిలో జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్ ద్వారా వన్వెబ్ ఇండియాకు చెందిన 236 శాటిలైట్లను ప్రయోగించనున్నట్లు ఇస్రో చీఫ్ సోమనాథ్ తెలిపారు.
అంతరిక్ష యాత్రకు బోయింగ్
విమానాల తయారీ సంస్థ బోయింగ్ కొత్తగా అంతరిక్షంలోకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంది. బోయింగ్ కంపెనీ ఇంతకు ముందు మానవ రహిత అంతరిక్ష కేంద్రాలను పంపింది. ఈ మిషన్ కోసం నాసాకు చెందిన ఇద్దరు సీనియర్ సైంటిస్టులు బుచ్ విల్మోర్తో పాటు భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ ఎంపికయ్యారు.
అస్త్ర మిస్సైల్ సక్సెస్
డీఆర్డీవో అస్త్ర మిస్సైల్ ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. ఒడిశా తీరంలో ఎస్యూ–30 ఎంకేఐ ఫైటర్ జెట్ నుంచి దీన్ని పరీక్షించగా సక్సెస్ఫుల్గా టార్గెట్ను ఛేదించిందని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. అస్త్ర క్షిపణి వ్యవస్థను తేజస్ మార్క్–1ఏ యుద్ధ విమానం, మిగ్–29 జెట్ అప్గ్రేడ్ వర్షన్లలో వినియోగించనున్నట్లు పేర్కొన్నాయి.
అంతరిక్షంలోకి నలుగురు వ్యోమగాములు
స్పేస్ఎక్స్ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ నలుగురు వ్యోమగాములతో నింగిలోకి దూసుకెళ్లింది. వీరిలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కు చెందిన సల్తాన్ అల్ నెయాదీ ఉన్నారు. అమెరికాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది. ఈ నలుగురు ఐఎస్ఎస్లో విధులు నిర్వర్తించనున్నారు.
బ్రహ్మోస్ విజయవంతం
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణిని భారత నౌకాదళం అరేబియా సముద్రంలో యుద్ధనౌకపై నుంచి విజయవంతంగా ప్రయోగించింది. డీఆర్డీవో దేశీయంగా రూపొందించిన సీకర్ అండర్ బూస్టర్ పరిజ్ఞానంతో ఈ పరీక్ష చేపట్టారు. ధ్వని వేగానికి దాదాపు మూడు రెట్ల వేగంతో (మ్యాక్ 2.8) ప్రయాణించగలదు.
ఎంఆర్ శామ్ క్షిపణి సక్సెస్
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల అధునాతన మధ్యశ్రేణి క్షిపణి (ఎంఆర్ శామ్)ను భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది. అగ్రశ్రేణి యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ విశాఖపట్నం’ నుంచి ఈ ప్రయోగం జరిగింది. దీన్ని బీడీఎల్ సంస్థ అభివృద్ధి చేసింది.
తేజస్లో స్వదేశీ పవర్ టేకాఫ్ షాఫ్ట్
భారత్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన తేలికపాటి యుద్ధ విమానం (తేజస్) స్వదేశీ పవర్ టేకాఫ్ (పీటీవో) షాఫ్ట్తో తొలిసారి గగనవిహారం చేసింది. ఈ పరీక్ష బెంగళూరులో జరిగింది. పీటీవో షాఫ్ట్, చాలా కీలక సాధనం. విమానం ఇంజిన్ నుంచి శక్తిని గేర్బాక్స్కు బదిలీ చేస్తుంది.
చంద్రయాన్–3 ప్రీలాంచ్ టెస్ట్
చంద్రయాన్–3 ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన ప్రీలాంచ్ పరీక్ష విజయవంతమైందని ఇస్రో ప్రకటించింది. చంద్రుడిపైన ప్రొపల్షన్, ల్యాండర్, రోవర్ మాడ్యూళ్లతో కూడిన లూనార్ను క్షేమంగా దించడమే లక్ష్యంగా చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఈ ఏడాది జూన్లో చేపట్టే అవకాశం ఉంది.
రీయూజబుల్ లాంచ్ వెహికల్
అంతరిక్షంలో ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించే ప్రక్రియలో కీలకమైన రీయూజబుల్ లాంచ్ వెహికల్ అటానమస్ ల్యాండింగ్ మిషన్ (ఆర్ఎల్వీ ఎల్ఈఎక్స్)ను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది.
చంద్రుడి మీదకి క్రిస్టినా కోచ్
అర్టిమిస్–2 పేరుతో నాసా వచ్చే సంవత్సరం నిర్వహించనున్న చంద్రునిపై ప్రదక్షిణకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల్లో క్రిస్టినా కోచ్ అనే మహిళ ఉంది. దీంతో చంద్రుడి వరకూ వెళ్లిన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించనుంది.
‘స్టార్ షిప్’ ప్రయోగం ఫెయిల్
మస్క్కు చెందిన స్పేస్ఎక్స్ కంపెనీ రూపొందించిన అతిపెద్ద రాకెట్ ‘స్టార్షిప్’ నింగిలోకి ఎగిసిన కాసేపటికే పేలిపోయింది. చంద్రుడు, అంగారకుడిపైకి మానవ సహిత యాత్రల కోసం స్పేస్ఎక్స్ అభివృద్ధి చేసిన ఈ ప్రయోగం తొలి పరీక్షలో విఫలం అయింది. ‘స్టార్షిప్’ ప్రధాన రాకెట్, బూస్టర్లు కలిపి ఎత్తు 120 మీటర్లు (సుమారు 40 అంతస్తుల భవనం ఎత్తు) ఉంటుంది.
పీఎస్ఎల్వీ-సీ55 రాకెట్ సక్సెస్
తిరుపతి జిల్లా శ్రీహరికోట షార్(సతీష్ ధావన్ స్పేస్సెంటర్) నుంచి ఏప్రిల్ 22న ఇస్రో ప్రయోగించి పీఎస్ఎల్వీ-సీ 55 రాకెట్ విజయవంతమైంది. వాహననౌక రెండు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా మోసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ఏడాది ఇస్రోకిది తొలి పీఎస్ఎల్వీ ప్రయోగం కాగా, ఈ సిరీస్లో 57వ ప్రయోగమన్నారు.
ఆర్మీలో ఎలక్ట్రిక్ జిప్సీలు
ఇండియన్ ఆర్మీ సెల్ కొత్తగా ఎలక్ట్రిక్ జిప్సీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఐఐటీ ఢిల్లీ, ట్యాడ్పోల్ ఈవీ స్టార్టప్లతో కలిసి భారతీయ సైన్యం పాత జిప్సీ వాహనాలను కొత్త ఎలక్ట్రిక్ జిప్సీ వాహనాలుగా మార్చేస్తుంది.
గురుగ్రహంపై జ్యూస్ పరిశోదన
ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ) ‘జ్యూస్’ అనే వ్యోమనౌకను ప్రయోగించింది. ఇది గురుడి కక్ష్యలో ఉన్న యూరోపా, లిస్టో, గానీమీడ్ చందమామల పైనా పరిశోధనలు సాగించనుంది.
‘ఐఎన్ఎస్ మగర్’ వీడ్కోలు
నీటిలోనే కాదు.. నేలపైనా దాడిచేసే స్వభావం ఉన్న మొసలి (మగర్) యుద్ధనౌక 36 ఏళ్లపాటు భారత నౌకాదళానికి సుదీర్ఘ సేవలందించిన ఐఎన్ఎస్ మగర్ మే 7వ తేదీ తన విధులకు స్వస్తి పలికింది.
జపాన్ నౌక ఆచూకీ లభ్యం
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో వెయ్యి మందికి పైగా యుద్ధ ఖైదీలను తరలిస్తుండగా మునిగిపోయిన జపాన్ నౌక ఆచూకీ ఎట్టకేలకు లభ్యమైంది. దక్షిణ చైనా సముద్రంలో ’ఎస్ఎస్ మాంటెవీడియో మారు’ నౌక ఆచూకీ లభించింది.
ఎంఆర్ శామ్ పరీక్ష సక్సెస్
ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే మధ్యశ్రేణి క్షిపణి (ఎంఆర్ శామ్)ని భారత నౌకాదళం తన యుద్ధనౌక ఐఎన్ఎస్ మోర్ముగావ్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. సముద్ర ఉపరితలానికి చేరువగా వెళుతున్న (సీ స్కిమింగ్) ఒక లక్ష్యాన్ని ఇది దిగ్విజయంగా ఛేదించింది.
నిఘా కోసం ప్రత్యేక డ్రోన్
గిడ్డంగుల నిర్వహణ, సైనిక అవసరాలు, శాంతి భద్రతల పరిరక్షణకు గువాహటి ఐఐటీ పరిశోధకులు విభిన్న రకాల డ్రోన్లను అభివృద్ధి చేశారు. గాల్లోకి నిట్టనిలువున పైకి లేచే మానవరహిత విమానం ‘రావెన్’నూ రూపొందించారు. ఇరుకైన ప్రాంతాల్లో నిఘా కోసం దీన్ని పక్షుల డిజైన్ స్ఫూర్తిగా తయారు చేశారు.
ఆపరేటింగ్ సిస్టం ‘భారోస్’
దేశీయ మొబైల్ ఆపరేటింగ్ సిస్టంను (ఓఎస్) ఐఐటీ మద్రాస్ తీసుకొచ్చింది. ‘ఆత్మ నిర్భర్ భారత్’లో భాగంగా ఈ సరికొత్త సాఫ్ట్వేర్ను తయారు చేసినట్లు ప్రకటించింది. దీనికి ‘భారోస్ (భారత్ ఓఎస్)’ అని పేరుపెట్టింది. జండ్కే ఆపరేటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జండ్ కాప్స్) సంస్థ దీన్ని రూపొందించింది.
నౌకాదళంలోకి ‘వజీర్’
భారత నావికాదళం అమ్ములపొదిలోకి ఐదో స్కార్పీన్ తరగతికి చెందిన జలాంతర్గామి ‘వజీర్’ చేరింది. ప్రాజెక్టు–75లో భాగంగా దేశీయంగా నిర్మించిన ఈ సబ్మెరైన్ ద్వారా భారత నేవీకి మరింత బలం చేకూరనుంది. వజీర్ను ఫ్రాన్స్ నావల్ గ్రూప్ భాగస్వామ్యంతో ముంబైలోని మజగావ్డాక్షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది.
పీఎస్ఎల్వీ సీ–54 సక్సెస్
షార్ నుంచి నవంబర్ 26న ప్రయోగించిన 44 మీటర్ల ఎత్తయిన పీఎస్ఎల్వీ సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్ 1,117 కేజీల ఎర్త్ ఆబ్జర్వేషన్ శాటిలైట్ ఓషన్శాట్–03(ఈవోఎస్6) సహా మొత్తం 1,171 కేజీల తొమ్మిది ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యల్లోకి ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వీ రాకెట్తో ఇది 56వ ప్రయోగం.
అగ్ని–3 పరీక్ష సక్సెస్
మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని–3 పరీక్షను భారత్ నవంబర్ 23న విజయవంతంగా నిర్వహించింది. ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్కలాం ద్వీపం నుంచి ఈ ప్రయోగం చేపట్టినట్టు డీఆర్డీవో వర్గాలు వెల్లడించాయి. అగ్ని శ్రేణిలో వచ్చిన ఈ మూడవ క్షిపణి 3,500 నుంచి 5,000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు.
అగ్ని5 క్షిపణి పరీక్ష సక్సెస్
అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న అగ్ని–5 బాలిస్టిక్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. అగ్ని–2 క్షిపణి సామర్థ్యం 2 వేల కిలోమీటర్లు కాగా తాజాగా అభివృద్ధి పరిచిన అగ్ని–5 క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.
నేవీలోకి ‘ఐఎన్ఎస్ మోర్ముగావ్’
దేశీయంగా తయారు చేసిన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ‘ఐఎన్ఎస్ మోర్ముగావ్’ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముంబయిలో లాంఛనంగా నేవీలో ప్రవేశపెట్టారు. గోవాలోని చారిత్రక ఓడరేవు నగరమైన మోర్ముగావ్ పేరిట దీనికి నామకరణం చేశారు. అణు, జీవ, రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ ఇది పోరాడగలదు.