నేషనల్
మారిటైమ్ ఇండియా సమ్మిట్ 2021
భారత సముద్రయాన సదస్సు–2021ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో మార్చి 2న ప్రారంభించారు. పర్యావరణానికి నష్టం లేకుండా సరకు రవాణా చేయడానికి జల రవాణా ఎంతో ఉపయోగపడుతుందని, 2030 నాటికి 23 మార్గాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. 20200 నాటికి తూర్పు, పశ్చిమతీరం పొడవునా షిప్ రిపేర్ క్లస్టర్లు డెవలప్ చేయనున్నట్లు తెలిపారు.
సంసద్ టీవీ
పార్లమెంట్ సమావేశాలు, కార్యకలాపాలను ప్రసారం చేసే రాజ్యసభ, లోక్సభ టీవీలను మెర్జ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు టీవీలను కలిపి ‘సంసద్’ టీవీగా ఏర్పాటు చేసినట్ల కేంద్రం మార్చి 2న ప్రకటించింది. కాగా సంసద్ టీవీకి మాజీ ఐఏఎస్ అధికారి రవి కపూర్ను సీఈవోగా నియమించింది. ఏడాదిపాటు ఆయన ఆ బాధ్యతల్లో కొనసాగుతారు.
హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్
భారత కుబేరుల సంఖ్య 177కు చేరిందని హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్–2021 వెల్లడించింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ దేశంలో అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. ఆయన సంపద సుమారు రూ.6.05 లక్షల కోట్లకు చేరింది. గౌతమ్ ఆదానీ , హెచ్సీఎల్ శివ్నాడార్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ 19700 కోట్ల డాలర్లతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నాడు.
ప్రైవేటు జాబ్స్లో రిజర్వేషన్
ప్రైవేటు జాబ్స్లో 75 శాతం రిజర్వేషన్ వర్తించేలా హర్యానా ప్రభుత్వం తెచ్చిన కొత్త బిల్లును మార్చి 2న ఆ రాష్ట్ర గవర్నర్ ఆమోదించారు. ప్రైవేటు కంపెనీలు, సొసైటీలు, ట్రస్ట్లు రూ.50 వేల జీతం లోపు ఉగ్యోగాల రిక్రూట్మెంట్లో తప్పనిసరిగా 75 శాతం రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్–2021
హోలివుడ్కు చెందిన గోల్డెన్ గ్లోబ్ అవార్డు–2021లో ఉత్తమ సినిమాలుగా నోమాడ్ల్యాండ్, బోర్టాలు అవార్డులు దక్కించుకున్నాయి. నోమాడ్ల్యాండు సినిమా డైరెక్షన్ చేసిన చోలే జావోకు ఉత్తమ దర్శకురాలి అవార్డు వచ్చింది. గోల్డెన్ గ్లోబ్ చరిత్రలో డైరెక్టర్ అవార్డును ఓ మహిళ గెలుచుకోవడం ఇది రెండోసారి. 1983లో బార్బ్రా స్ట్రీశాండ్ ఈ అవార్డును అందుకున్నారు.
ఉత్తరాఖండ్కు కొత్త సీఎం
ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా లోక్సభ సభ్యుడు తీరథ్ సింగ్ రావత్ బాధ్యతలు చేపట్టారు. డెహ్రాడూన్లోని రాజ్భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ బేబీ రాణి మౌర్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్న త్రివేంద్ర సింగ్ రావత్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు.
వరల్డ్ బుక్ ఫెయిర్
న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2021ను కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ మార్చి 5న వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ బుక్ ఫెయిర్ థీమ్ ‘నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ–2020’.
మత స్వేచ్ఛ బిల్లుకు ఆమోదం
మోసపూరిత విధానాలతో మత మార్పిడికి పాల్పడిన వారికి పదేళ్ల జైలు శిక్ష విధించే ‘మత స్వేచ్ఛ బిల్లు–2021కి మధ్యప్రదేశ్ అసెంబ్లీ మార్చి 8న ఆమోదం తెలిపింది. జనవరి 9న తీసుకొచ్చిన ఆర్డినెన్స్ స్థానంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
మధ్యవర్తిత్వ బిల్లు
మోసపూరిత విధానాల్లో మధ్యవర్తిత్వ తీర్పు పొందినప్పుడు దాని అమలును బేషరతుగా నిలిపివేయాలని కోరేందుకు అవకాశం కల్పించే ‘మధ్యవర్తిత్వ–రాజీ(సవరణ) బిల్లు 2021’కు మార్చి 10న పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే లోక్సభలో ఆమోదం పొందిన ఈ బిల్లుకు తాజాగా రాజ్యసభ ఆమోదం తెలిపింది.
రైల్వే హెల్ప్ లైన్ 139
ఇప్పటి వరకు ఉన్న అన్ని రైల్వే హెల్ప్లైన్లను మెర్జ్ చేస్తూ.. ఇండియన్ రైల్వేస్ ‘139’ ను కొత్త హెల్ప్ లైన్గా ప్రకటించింది. ఇప్పటి వరకు ఉన్న అన్ని రకాల హెల్ప్లైన్ సేవలు ఆగిపోయి.. 1 ఏప్రిల్ 2021 నుంచి 12 భాషల్లో 139 సేవలు అందుబాటులోకి వస్తాయి.
అమృత్ మహాత్సవాలు
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 2023 ఆగస్టు 15 నాటికి 75 ఏళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకొని ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం 75 వారాల ఉత్సవాలు నిర్వహిస్తోంది. మార్చి 12న ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. గాంధీజీ దండియాత్ను గుర్తుకు తెచ్చేలా అహ్మదాబాద్లోని సబర్మతీ ఆశ్రమం నుంచి 81 మంది నవసరి జిల్లాలోని దండి సముద్రతీరానికి యాత్రగా బయలుదేరారు. వీరు 25 రోజుల్లో 386 కి.మీ నడిచి ఏప్రిల్ 5న అక్కడికి చేరుకుంటారు.
అతిపెద్ద కిడ్నీ హాస్పిటల్
ఢిల్లీలో సిక్కు గురుద్వారా యాజమాన్య కమిటీ దేశంలోనే అతిపెద్ద కిడ్నీ హాస్పిటల్ను అందుబాటులోకి తెచ్చింది. ఇక్కడ రోజుకు 500 మంది పేషంట్లకు ఫ్రీగా డయాలసిస్ చేసే కెపాసిటీ ఉంది. 20 ఏళ్లకు పైగా మూతబడి ఉన్న బాలాసాహిబ్ హాస్పిటల్ను గురుహరికృష్ణన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్గా మార్చారు.
‘మేరా రేషన్’
కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ ‘మేరా రేషన్’ పేరుతో మొబైల్ అప్లికేషన్ను ఆవిష్కరించింది. దేశవ్యాప్తంగా ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు సౌకర్యం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో లబ్ధిదారులకు తమ చుట్టు పక్కల ఉండే షాప్ల వివరాలు తెలిసేలా కొత్త యాప్ను తీసుకొచ్చారు.
గ్రామీ అవార్డులు
అమెరికాలోని లాస్ ఎంజిల్ కాన్వెన్షన్ సెంటర్లో మార్చి 15న 63వ యానువల్ గ్రామీ అవార్డ్స్ 2021 ప్రకటించారు. గాబ్రియెల్లా విల్సన్(హెచ్ఈఆర్) రాసిన ‘ఐ కాంట్ బ్రీత్’ ఉత్తమ పాటగా గ్రామీ అవార్డు సొంతం చేసుకోగా.. పాప్సింగర్ బెయాన్స్ అత్యధికంగా నాలుగు గ్రామీ అవార్డులు పొందారు. బెస్ట్ ర్యాప్ సాంగ్గా ఆమె పాడిన ‘సావేజ్ బై మేగాన్ తీ స్టాలియన్’కు అవార్డు దక్కింది. టేలర్ స్విఫ్ట్ మ్యూజిక్ ఆల్బమ్ ‘ఫోక్లోర్’కు ఉత్తమ ఆల్బమ్ అవార్డు, జేమ్స్ బాండ్ ‘నో టైం టు డై’ మూవీకి రాసిన ఓ పాటకు ఉత్తమ గేయరచయితగా ఎలిస్ను అవార్డు వరించింది.
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు
కేంద్ర సాహిత్య అకాడమీ దేశవ్యాప్తంగా 20 భాషల్లోని కవితా సంకలనాలు, చిరు కథలు, స్మృతి కావ్యాలు, నవలలను 2020 పురస్కారాలకు ఎంపిక చేసింది. నిఖిలేశ్వర్గా ప్రసిద్ధులైన కుంభం యాదవరెడ్డి(యాదాద్రిభువనగిరి జిల్లా) ‘అగ్నిశ్వాస’ కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన కన్నెగంటి అనసూయ ‘స్నేహితులు’ బాల కథల సంపుటి బాలసాహితీ పురస్కారానికి ఎంపికైంది. నెల్లూరుకు చెందిన మానస ఎండ్లూరి ‘మిళింద’ కథల పుస్తకానికి సాహిత్య అకాడమీ యువ పురస్కార్ వచ్చింది. రచయిత్రి పి. సత్యవతికి కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం వచ్చింది. కాంగ్రెస్ సీనియర్ నేత, రచయిత వీరప్ప మొయిలీ కన్నడ భాషలో రచించిన ‘శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం’ ఇతిహాస కవిత్వానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది.
అన్ ఎంప్లాయిమెంట్ 34.7 శాతం
లాక్డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా నిరుద్యోగ రేటు 34.7 శాతంగా నమోదైందని కేంద్ర గణాంక శాఖ సర్వే తెలిపింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు అన్ ఎంప్లాయిమెంట్ రేటు రెండింతలై 21 శాతానికి చేరిందని, 29 ఏళ్లలోపు యువతలో 21.1 శాతం నుంచి 34.7 శాతంగా నమోదైందని రిపోర్టులో తెలిపింది. లాక్డౌన్ టైంలో ఏపీలో 24.7, తెలంగాణలో 26.4 శాతంగా ఉన్నట్లు సర్వేలో పేర్కొంది.
కంబళ పరుగులో కొత్త రికార్డ్
కర్నాటక గ్రామీణ క్రీడ అయిన కంబళ పోటీల్లో శ్రీనివాసగౌడ కొత్త రికార్డ్ సృష్టించాడు. మంగళూరు సమీపంలో నిర్వహించిన పోటీల్లో 100 మీటర్లను 8.96 సెకండ్లలో చేరి గతంలో నమోదైన రికార్డును తిరగరాశాడు. గతంలో 11.21 సెకండ్లు, 9.37 సెకండ్లతో రికార్డుగా నమోదైంది.
బంగబంధుకు గాంధీ పురస్కారం
ప్రపంచంలోని వివిధ రంగాల ప్రముఖులకు ఇచ్చే గాంధీ శాంతి పురస్కారాలు కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. 2020 సంవత్సరానికి దివంగత బంగబంధు షేక్ ముజిబుర్ రహ్మాన్కు, 2019 సంవత్సరానికి ఒమన్ దేశ దివంగత సుల్తాన్ కబూస్ బిన్ సయిద్ అల్ సయిద్కు బహుకరించనున్నారు.
బీమా సవరణ బిల్లుకు ఆమోదం
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు(ఎఫ్డీఐ)లను 74 శాతానికి పెంచేందుకు వీలు కల్పించే బీమా సవరణ బిల్లు–2021 కు లోక్సభ ఆమోదం తెలిపింది. ఇప్పటి వరకు ఎఫ్డీఐల పరిమితి 49 శాతంగా ఉంది. ఐఆర్డీఏఐ సిఫార్సుల మేరకే పరిమితి పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి తెలిపింది.
ప్రభుత్వమంటే లెఫ్టినెంట్ గవర్నరే
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), కాంగ్రెస్ సభ్యుల తీవ్ర అభ్యంతరాల మధ్య ‘ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నరే’ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వ నిర్వహణలో ఎదురవుతున్న సమస్యల నివారణకు, వివిధ అంశాలపై స్పష్టత రావడానికి ఈ బిల్లు అవసరమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి సభకు వివరించారు.
మరాఠాలకు కోటా రాజ్యాంగబద్ధమే
మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉందని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సామాజికంగా, విద్యాపంరంగా వెనుకబడిన వర్గాల (ఎస్ఈబీసీ) జాబితాను ప్రకటించకుండా రాష్ట్రాల అధికారాలను రాజ్యాంగంలోని 102వ సవరణ ఏమాత్రం అడ్డుకోవడం లేదని వివరించారు.
ఇంటర్నేషనల్
మిల్లెట్స్ ఇయర్గా 2023
2023ను ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించాలని భారత్ ప్రతిపాదించిన బిల్లును 193 మంది సభ్యుల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ(యూఎన్జీఏ) ఆమోదించింది. భారత్ ప్రతిపాదనను 70 దేశాలు సమర్థించాయని యూఎన్వోలో భారత శాశ్వత ప్రతినిధి టీఎస్తిరుమూర్తి తెలిపారు. 2023ను మిల్లెట్స్ ఇయర్గా ప్రకటించడం వల్ల చిరుధాన్యాల్లో ఉండే పోషకాలు, వాటితో హెల్త్ బెనిఫిట్స్పై ప్రపంచవ్యాప్తంగా మరింత అవేర్నెస్ పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడికి జైలు
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు నికొలస్ సర్కోజీకి స్థానిక కోర్టు అవినీతి కేసులో మూడేళ్ల జైలుశిక్ష వేసింది. రెండేళ్ల కాలాన్ని సస్పెండ్ చేయగా ఒక ఏడాది శిక్ష అనుభవించాలి. సర్కోజీ 2007–12 మధ్య కాలంలో ఫ్రాన్స్ అధ్యక్షుడిగా చేశారు. 2007లో ఎన్నికల ప్రచారానికి లిబియా నియంత గడాఫీ నుంచి ఆర్థిక సాయం పొందారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
డిజర్ట్ ఫ్లాగ్
యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్లోని ఏఐ దఫ్రా ఏయిర్బేస్లో మూడు వారాల మల్టీనేషనల్ యుద్ధ విన్యాసాలు ప్రారంభమయ్యాయి. సౌదీ అరేబియాకు చెందిన వైమానికదళం ఈ వార్ఫేర్ను నిర్వహిస్తుండగా.. ఇండియన్ ఎయిర్ఫోర్స్తోపాటు అమెరికా, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలకు చెందిన యుద్ధ విమానాలు విన్యాసాల్లో పాల్గొననున్నాయి. ‘డిజర్ట్ ఫ్లాగ్-6’ పేరిట నిర్వహిస్తున్న ఈ విన్యాసాల్లో భారత్ నుంచి 6 సుఖోయ్ జెట్ ఫైటర్లు, 2సీ-17 గ్లోబ్ మాస్టర్స్తోపాటు ఐఎల్-78 ట్యాంకర్ కూడా పాల్గొంటున్నాయి. ఫ్రాన్స్కు చెందిన రాఫెల్ ఫైటర్లు, అమెరికా తయారీ ఎఫ్-16 బాంబర్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మార్చి 13
భారత్–బంగ్లాదేశ్ ‘మైత్రీ సేతు’
భారత్–బంగ్లాదేశ్ మధ్య నిర్మించిన ‘మైత్రీ సేతు’ను ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 9న ప్రారంభించారు. త్రిపురలోని సబ్రూం, బంగ్లాదేశ్లోని రాంఘర్లను కలుపుతూ.. ఫెనీ నదిపై నిర్మించిన 1.9 కి.మీ ‘మైత్రీ సేతు’ను మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. రూ.133 కోట్లతో భారత్కు చెందిన జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఈ వంతెనను నిర్మించింది.
నేపాల్లో పార్టీల ఏకీకరణ రద్దు
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని యూనిఫైడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్, పుష్ప కమల్ దహ(ప్రచండ) ఆధ్వర్యంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ ఏకీకరణను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎన్–యుఎంఎల్, సీపీఎన్(మావోయిస్ట్ సెంటర్) పార్టీలు మే 2018ల విలీనం అయ్యాయి. 2017 సార్వత్రిక ఎన్నికలలో తమ కూటమి విజయం సాధించిన తర్వాత ఏకీకృత నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్సీపీ)ని ఏర్పాటు చేసింది.
సెరావీక్ వార్షిక సదస్సు
అమెరికా కేంద్రంగా వీడియోకాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన ‘సెరావీక్–2021’ వార్షిక సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. వాతావరణ మార్పులు, విపత్తులను అధిగమించేందుకు పారిస్ ఒప్పందంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకోవాలన్నారు. 2030 నాటికి ఈ లక్ష్యాలను చేరుకోవాలని అనుకున్నాం.. కానీ భారత్ అంతకంటే ముందే వీటిని సాధిస్తుందని మోడీ పేర్కొన్నారు.
మార్చి 20
ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్
ప్రపంచవ్యాప్తంగా 30 కాలుష్య పీడిత నగరాల్లో 22 ఇండియాలోనే ఉన్నాయని అందులో ఢిల్లీ మొదటి స్థానంలో ఉందని ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్–2020’ రిపోర్ట్ తెలిపింది. ‘ఐక్యూ ఎయిర్’ అనే స్విస్ సంస్థ రూపొందించిన ఈ రిపోర్ట్ ప్రకారం.. ప్రపంచంలో అత్యంత కాలుష్య పీడిత నగరం చైనాలోని ఝింజియాంగ్. దీని తర్వాత వరుసగా తొమ్మిది స్థానాల్లో ఇండియన్ సిటీలే ఉన్నాయి. గజియాబాద్ సెకండ్ ప్లేస్లో ఉంది. ఢిల్లీ ప్రపంచ కాలుష్య పీడిత నగరాల్లో పదో స్థానంలో, రాజదాని నగరాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది.
శ్రీలంకలో బురఖాలు బ్యాన్
ముస్లిం మహిళలు బురఖా వేసుకోవడాన్ని బ్యాన్ చేస్తున్నట్లు శ్రీలంక గవర్నమెంట్ ప్రకటించింది. వెయ్యికి పైగా మదర్సాలను కూడా మూసివేయనున్నట్లు తెలిపింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకోనున్నట్లు ప్రజా భద్రత శాఖ మంత్రి శరత్ వీరశేఖర తెలిపారు.
మయన్మార్లో మార్షల్ యాక్ట్
మయన్మార్లోని అతిపెద్ద నగరమైన యాంగూన్లోని ఆరు టౌన్షిప్ల్లో సైన్యం మార్షల్ చట్టాన్ని అమలు చేసింది. ఆ దేశ అధ్యక్షురాలు ఆంగ్సాన్ సూకీని అధికారం నుంచి తప్పించిన సైన్యం చాలా మంది రాజకీయ నాయకులను నిర్బంధంలోనే ఉంచింది. వారిపై సైన్యం వివిధ కేసులను మోపినా, మార్షల్ చట్టాన్ని ప్రయోగించడం మాత్రం ఇదే ఫస్ట్ టైం.
ఫారెక్స్ నిల్వల్లో ఇండియా..
విదేశీ మారకపు(ఫారెక్స్) నిల్వల్లో రష్యాను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది. మార్చి 5 నాటికి నిల్వలు 430 కోట్ల డాలర్ల మేర పెరిగి 58,030 కోట్ల డాలర్లకు పెరిగినట్లు ఆర్బీఐ తెలిపింది. చైనా దగ్గర అత్యధికంగా ఫారెక్స్ నిల్వలు ఉండగా.. జపాన్, స్విట్జర్లాండ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
1900 ఏళ్ల నాటి రాజప్రతులు
బైబిల్ వచనాలున్న పురాతన చర్మపత్ర భాగాలను ఇజ్రాయిల్ పురాతత్వ శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. ఇవి 1900 సంవత్సరాల క్రితం నాటివని వారు గుర్తించారు. క్రీ.శ 1 నుంచి 3 శతాబ్దాలకు చెందిన ఇలాంటి పత్రాలు మొదట వెస్ట్ బ్యాంక్లోని మృత సముద్రానికి ఉత్తరాన ఉన్న కుమ్రాన్ గుహల్లో 1940–50 మధ్య దొరికాయి. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు జెరూసలేంకు దక్షిణాన ‘కేవ్ ఆఫ్ హారర్’గా పిలిచే గుహలో కనిపించాయి.
మార్చి 27
పవర్ఫుల్ మిలిటరీగా చైనా
ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ కలిగిన దేశంగా చైనా నిలిచింది. మిలిటరీ డైరెక్ట్ అనే డిఫెన్స్ వెబ్సైట్ అధ్యయనంలో ఈ విషయం తెలిసింది. మిలిటరీ కోసం భారీ బడ్జెట్ కేటాయించే జాబితాలో అమెరికా రెండోస్థానం, భారత్ నాలుగో స్థానంలో నిలిచాయి. 100 పాయింట్లకు చైనా 82, అమెరికా 74, రష్యా 69, భారత్ కు 61 పాయింట్లు వచ్చాయి.
సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్
ప్రపంచంలోనే అత్యంత సంతోకరమైన దేశంగా ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ‘ అంతర్జాతీయ ఆనంద నివేదిక–2021’ ను ఐక్యరాజ్యసమితి విడుదల చేసింది. 149 దేశాల జాబితాలో భారత్ 139వ స్థానాన్ని దక్కించుకుంది. జర్మనీ 7, అమెరికా 14, బ్రిటన్ 18, చైనా 19వ స్థానాల్లో నిలిచాయి.
అంతర్గత చర్చలకు ఓకే
భారత్తో అంతర్గత భద్రత చర్చలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ప్రకటించింది. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఈ చర్చలను నిలిపివేశారు. హింసాత్మక అతివాదాన్ని ఎదుర్కోవడం, సైబర్ భద్రత, నూతన సాంకేతికత వంటి ముఖ్యమైన అంశాలపై చర్చించుకున్నారు.
ప్రాంతీయం
మిసెస్ ఇండియాగా పల్లవి సింగ్
జైపూర్లో జరిగిన ‘గ్లామన్ మిసెస్ ఇండియా–2020’ పోటీల్లో హైదరాబాద్కు చెందిన పల్లవి సింగ్ కిరీటం దక్కించుకున్నారు. ద మోస్ట్ బ్యూటిఫుల్ స్మైల్ అవార్డును కూడా ఆమె సొంతం చేసుకున్నారు. మొదటి రన్నరప్గా పుణెకు చెందిన శెనెల్ల, హైదరాబాద్కు చెందిన ఉష, రెండో రన్నరప్గా కోల్కతాకు చెందిన షీతల్ నిలిచారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు అవార్డ్
శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు 2020 సంవత్సరానికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ఏసీఐ), ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ (ఏఎస్క్యూ) అవార్డ్ లభించింది. ఆసియా–పసిఫిక్ దేశాల్లోగల 15 నుంచి 25 మిలియన్ ప్యాసింజర్స్ విభాగంలో శంషాబాద్ ‘2020 ఉత్తమ విమానాశ్రయం’ గా గుర్తింపు పొందినట్లు జీఎమ్ఆర్ ఒక ప్రకటనలో తెలిపింది.
అప్పుల్లో తెలంగాణ ఆరోస్థానం
బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తీసుకోవడంలో తెలంగాణ ఆరోస్థానం, ఏపీ నాలుగో స్థానంలో నిలిచాయి. రిజర్వ్ బ్యాంక్ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం 2020 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఏపీ రూ.44, 250 కోట్లు, తెలంగాణ రూ.36,354 కోట్ల రుణాలు సేకరించాయి. మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
మీషోతో వీహబ్ అగ్రిమెంట్
తెలంగాణలోని మహిళా పారిశ్రామికవేత్తలకు ఆన్లైన్ వ్యాపారం, ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ప్రముఖ ఇ–కామర్స్ సంస్థ మీషోతో రాష్ట్ర మహిళా పారిశ్రామికవేత్తల కేంద్రం(వీహబ్) ఒప్పందం కుదుర్చుకుంది. స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో వీహబ్ సీఈవో దీప్తి రావుల, మీసో సీఈవో విదిత్లు ఒప్పందంపై సంతకాలు చేశారు.
హరిత తెలంగాణ
మొక్కల పెంపకం, ఫారెస్టైజేషన్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియో రాజ్యసభలో కొందరు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడించారు. తెలంగాణ తర్వాత ఏపీ రెండు, యూపీ మూడు, గుజరాత్ నాలుగో స్థానంలో నిలిచాయి. 2019–20లో దేశవ్యాప్తంగా 150.23 కోట్ల మొక్కలు నాటగా, తెలంగాణలో 38.17 కోట్ల మొక్కలు పెంచారు.
నీటిపై తేలే సోలార్ ప్రాజెక్ట్
వచ్చే మే నాటికి రామగుండంలో 100 మెగావాట్ల నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నామని ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీవీ ఆనంద్ తెలిపారు. రూ.423 కోట్లతో దీన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. రామగుండంతోపాటు ఏపీలోని సింహాద్రి, కేరళలోని కాయంకుళంలలో ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
ఎస్హెచ్పీ గ్రూపులకు అవార్డులు
దేశవ్యాప్తంగా ఉత్తమ పనితీరు కనబరిచిన 30 స్వయం సహాయక సంఘాలు, పది గ్రామ సమాఖ్యలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మార్చి 6న జాతీయ అవార్డులు ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి రెండు స్వయం సహాయక సంఘాలు, ఒక గ్రామ సమాఖ్య ఉంది. కామారెడ్డి జిల్లా ఉగ్రవాయిలోని శ్రీబాలాజీ మహిళా పొదుపు సంఘం, రంగారెడ్డి జిల్లా చిలుకూరు ప్రగతి పొదుపు సంఘం, సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి వెలుగు గ్రామైక్య సంఘానికి అవార్డులు వచ్చాయి.
బడ్జెట్ రూ.2,30,825 కోట్లు
రూ.2,30,825 కోట్లతో 2021–22 ఆర్థిక సంవత్సారినికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి హరీశ్రావు మార్చి 18న శాసనసభలో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లుగా, క్యాపిటల్ వ్యయం రూ.29,046.77 కోట్లు, రెవెన్యూ మిగులు రూ.6,743.50 కోట్లుగా పేర్కొన్నారు. గత బడ్జెట్ కంటే రూ.48 వేల కోట్ల అధిక అంచనాలతో ఈసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
యాసంగి పంటల రికార్డు
యాసంగి సీజన్లో అన్ని పంటలు సాధరణం కన్నా 85 శాతం అధికంగా సాగైతే, వరి సాగు మాత్రం 135 శాతం పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్రంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 36.43 లక్షల ఎకరాలు కాగా, ప్రస్తుతం 67.47 లక్షల ఎకరాల్లో విత్తనాలు, నాట్లు వేసినట్లు వ్యవసాయ శాఖ లేటెస్ట్ రిపోర్ట్లో వెల్లడించింది.
ఎఫ్డీఐ రాకలో ఏడో స్థానం
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డీఐ) రాకలో దేశంలో తెలంగాణ ఏడు, ఏపీ 14వ స్థానాల్లో నిలిచాయి. 2020 ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో దేశంలోకి 51,470.22 మిలియన్ డాలర్ల ఎఫ్డీఐలు రాగా అందులో తెలంగాణకు 859.96 మిలియన్ డాలర్లు వచ్చాయి. దేశంలో తెలంగాణ వాటా 1.67 శాతంగా ఉంది.
ఫిట్మెంట్ 30 శాతం
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త పీఆర్సీ అమల్లోకి రానుంది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించాడు.
విద్యుత్ సంస్థకు స్కోచ్ అవార్డ్
సౌర విద్యుత్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు టీఎస్ఎన్పీడీసీఎల్ కు స్కోచ్ పురస్కారం లభించింది. 72వ స్కోచ్ సదస్సు సందర్భంగా ఆన్లైన్లో నిర్వహించిన సమావేశంలో ఈ అవార్డును సంస్థ సీఎండీ గోపాలరావు అందుకున్నారు.
పీఎం–కుసుం పథకం అమలుకు కమిటీ
తెలంగాణలో పీఎం–కుసుం పథకం అమలుకు ఎనిమిది మందితో ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఇంధనశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. రైతులు గ్రిడ్ ఆధారిత సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి పునరుత్పాదక ఇంధనశాఖ ఈ పథకం ప్రారంభించింది.
వార్తల్లో వ్యక్తులు
రిత్వికశ్రీ
ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో (5,685 మీటర్ల ఎత్తు) పర్వతాన్ని ఏపీలోని అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల రిత్వికశ్రీ అధిరోహించింది. ఆసియా ఖండం నుంచి చిన్నవయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా ఆమె రికార్డులకెక్కగా.. ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది.
ప్రశాంత్ కిశోర్
ప్రశాంత్ కిశోర్ తనకు ఎన్నికల వ్యూహకర్తగా ఉంటారని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ అన్నారు. ఆయనకు కేబినేట్ హోదా కల్పించి, రూపాయి గౌరవ వేతనం అందిస్తామని తెలిపారు. 2017 ఎన్నికల్లోనూ పంజాబ్లో కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిశోర్ ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో తృణముల్ కాంగ్రెస్కు, తమిళనాడులోని డీఎంకే పార్టీలకు కూడా పొలిటికల్ స్ట్రాటెజిస్ట్గా ఉన్నారు.
మజూ వర్గీస్
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పాలనా విభాగంలో ఉప సహాయకుడిగా, శ్వేతసౌధ సైనిక కార్యాలయ డైరెక్టర్గా భారతీయ అమెరికన్ మజూ వర్గీస్ను నియమించారు. లాయర్ అయిన వర్గీస్ గతేడాది బైడెన్–హారిస్ ఎన్నికల ప్రచారంలో చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా, సీనియర్ సలహాదారుగా సేవలందించారు.
మేరికోమ్
ఇండియన్ బాక్సర్ మేరీకోమ్ మార్చి 1న ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్(ఏఐబీఏ) చాంపియన్స్ అండ్ వెటరన్స్ కమిటీ చైర్పర్సన్గా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉమర్ క్రిమ్లేవ్ చైర్పర్సన్గా ఉన్నారు.
కోనేరు హంపి
భారత చెస్ స్టార్, ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హపికి ప్రతిష్టాత్మక బీబీసీ క్రీడా అవార్డుల పుర్కస్కారం దక్కింది. వార్షిక అవార్డుల్లో హంపి ‘ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్–2020’గా ఎంపికైంది. రెజ్లర్ వినేశ్ ఫొగాట్, స్ర్పింటర్ ద్యుతీ చంద్, షూటర్ మనూ భాకర్, హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్లతో పోటీ పడిన హంపి విజేతగా నిలిచింది.
అనురాగ్ ఠాకుర్
టెరిటోరియల్ ఆర్మీలో కెప్టెన్గా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకుర్ నియమితులయ్యారు. హిమాచల్ప్రదేశ్కు చెందిన ఠాకుర్ 2016 జులైలో టీఎలోకి లెఫ్టినెంట్గా బాధ్యతలు నిర్వహించారు. ఇటీవల ఆయన్ 124 సిక్కు రెజిమెంట్లోకి కెప్టెన్గా పదోన్నతి పొందినట్లు ఓ అధికారిక ప్రకటన వెలువడింది.
థామస్ బాచ్
ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ప్రెసిడెంట్ థామస్ బాచ్ మార్చి 10న నిర్వహించిన ఎన్నికల్లో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇంకో నాలుగేళ్లు.. 2025 వరకు ఆయన అధ్యక్ష పదవిలో కొనసాగుతారు.
సత్యనారాయణ రాజు
కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కె. సత్యనారాయణ రాజు బాధ్యతలు స్వీకరించారు. ఆయన విజయ బ్యాంక్లో 1988లో చేరారు. అది బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనం అయ్యాక, చీఫ్ జనరల్ మేనేజర్ స్థాయిలో పని చేశారు.
దయానందం
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ(టీఎస్డీపీఎస్) ముఖ్య కార్య నిర్వహణ అధికారి(సీఈవో)గా రాష్ట్ర అర్ధ గణాంకశాఖ డైరెక్టర్ జి.దయానందం నియమితులయ్యారు. ఆర్థిక ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి కె. రామకృష్ణారావు జీవో జారీ చేశారు.
కొల్లూరి చిరంజీవి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తొలి, మలి దశ ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన డాక్టర్ కొల్లూరి చిరంజీవి(74) మరణించారు. 1947 ఫిబ్రవరిలో వరంగల్లో జన్మించిన ఆయన 1980 వరకు విప్లవ రాజకీయాలత మమేకమై పీపుల్స్ వార్ పార్టీ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించారు. ‘బహుజన పత్రిక’కు ఎటిటర్గా పని చేశారు.
దీపక్ మిశ్రా
ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్(ఐసీఆర్ఐఈఆర్) తదుపరి డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా దీపక్ మిశ్రా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంకులో పలు హోదాల్లో పని చేసిన మిశ్రా..2012 నుంచి డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న రజత్ కతూరియా స్థానంలో చార్జ్ తీసుకోనున్నారు.
పీకే సిన్హా
ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన సలహాదారు పీకే సిన్హా తన పదవికి రాజీనామా చేశారు. 1977 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ సిన్హా 2019 నుంచి సలహాదారుగా పదవిలో కొనసాగారు.
ఎం.ఎ గణపతి
జాతీయ భ్రదతా దళం(ఎన్ఎస్జీ) అధిపతిగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఎం.ఎ గణపతి, సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్గా కుల్దీప్ సింగ్ మార్చి 16న నియమితులయ్యారు. గణపతి ప్రస్తుతం పౌర విమానయాన భ్రదతా బ్యూరో(బీసీఏఎస్)కు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. 1986 బ్యాచ్కు చెందిన కుల్దీప్ సింగ్ పశ్చిమ బెంగాల్ క్యాడర్ ఆఫీసర్.
కున్హి రామన్
కేరళకు చెందిన ప్రఖ్యాత కథాకళి కళాకారుడు, నృత్య శిక్షకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత చెమన్చెరి కున్హిరామన్ నాయర్(105) మార్చి 15 మరణించారు. ఆయన 1916 జూన్ 16న జన్మించారు. కథాకళి నృత్యానికి ఆయన చేసిన సేవలకు 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.
ఎన్వీ రమణ
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ భారత తదుపరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులుకానున్నారు. ప్రస్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ఏప్రిల్ 23న రిటైర్మెంట్ తీసుకోనున్నారు. అనంతరం ఏప్రిల్ 24న సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
గోలి శ్యామల
భారత్, శ్రీలంక మధ్య ఉన్న పాక్ జలసంధిని ఈదిన తొలి తెలుగు మహిళగా గోలి శ్యామల రికార్డు సృష్టించింది. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ జలసంధిని శ్రీలంక తీరం నుంచి రామేశ్వరంలోని ధనుష్కోటి వరకు ఈదింది. 2012లో ఈ జలసంధిని ఈదిన ఐపీఎస్ ఆఫీసర్ రాజీవ్ త్రివేది శ్యామలకు శిక్షణ ఇచ్చాడు.
వివేక్ మూర్తి
ప్రవాస భారతీయుడు డాక్టర్ వివేక్ మూర్తి అమెరికా సర్జన్ జనరల్గా మరోసారి నియమితులయ్యారు. 57–43 ఓట్లతో అమెరికన్ సెనేట్ నియామకాన్ని ఆమోదించింది. ఒబామా ప్రభుత్వంలో సర్జన్ జనరల్గా పనిచేసిన ఆయన రెండోసారి బాధ్యతలు చేపట్టాడు.
సైన్స్ & టెక్నాలజీ
పీఎస్ఎల్వీ–సీ51 సక్సెస్
ఇస్రో తొలి ప్రైవేట్ కమర్షియల్ మిషన్ పీఎస్ఎల్వీ–సీ51 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. షార్ నుంచి ప్రయోగించిన ఈ మిషన్లో బ్రెజిల్కు చెందిన అమోజానియా–1తో పాటు, ఇండియాకు చెందిన 5, అమెరికాకు చెందిన 13 మైక్రో ఉపగ్రహాలను తీసుకెళ్లింది. ఈ ఉపగ్రహాల్లో డీఆర్డీవో రూపొందించిన సింధునేత్ర, భగవద్గీత, ప్రధాని మోడీ ఫొటో కూడా ఉన్నాయి.
కొత్త గ్రహశకలాలు గుర్తింపు
భారత్కు చెందిన విద్యార్థులు 18 కొత్త గ్రహశకలాలను కనుగొన్నారు. వీటిని అంతర్జాతీయ ఖగోళ సంఘం (ఐఏయూ) ధ్రువీకరించింది. స్టెమ్ అండ్ స్పేస్ అనే సంస్థ చేపట్టిన ‘అంతర్జాతీయ గ్రహశకల అవిష్కార ప్రాజెక్ట్’ కార్యక్రమంలో భాగంగా స్టూడెంట్స్ ఈ ఘనత సాధించారు. నాసా, ఐఏఎస్సీ భాగస్వామ్యంతో 150 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు.
మార్స్ ప్రాజెక్టులో ఇండో అమెరికన్
నాసా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ మార్స్ మిషన్లో భారతీయ అమెరికన్ విష్ణు శ్రీధర్ పర్సెవరెన్స్ రోవర్కు అమర్చిన సూపర్క్యామ్ను లీడ్ చేయనున్నాడు. శ్రీధర్ ఐదేళ్లుగా కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ ( జేపీఎల్) లో పనిచేస్తున్నారు. ఈ కెమెరాతో అక్కడి అతి సూక్ష్మ కణాలను సైతం ఫొటోలు తీసి అక్కడి ఖనిజాలు, రసాయన అవశేషాలు అంచనా వేయనున్నారు.
మార్చి 13
నేవీలోకి ఐఎన్ఎస్ కరంజ్
భారత నౌకాదళంలోకి స్కార్పీన్ శ్రేణికి చెందిన జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ చేరింది. ముంబయిలో మార్చి 9న జరిగిన ఓ కార్యక్రమంలో దీన్ని సముద్ర జలాల్లోకి ప్రవేశపెట్టారు. 1971 ఇండో, పాక్ యుద్ధంలో కమాండింగ్ ఆఫీసర్గా వ్యవహరించిన నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ వీఎస్ షెకావత్ ఈ కార్యక్రమంలో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు.
లూనార్ రీసెర్చ్ స్టేషన్
రష్యా, చైనా ఇరుదేశాలు జాయింట్గా లూనార్ రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మేరకు చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(సీఎన్ఎస్ఏ), రష్యా ఫెడరల్ స్పేస్ ఏజెన్సీలు ఇంటర్నేషనల్ లూనార్ రీసెర్చ్ స్టేషన్(ఐఎల్ఆర్ఎస్) ఏర్పాటుపై మార్చి 9న ఎంఓయూలు కుదుర్చుకున్నాయి.
ఇస్రో జాక్సా ఒప్పందం
వరి పంటకు అనువైన భూముల గుర్తింపు, పంట పర్యవేక్షణ, వాతావరణ స్థితి గతులను గుర్తించేందుకు ఇస్రో జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ(జాక్సా) ఒప్పందం కుదుర్చుకున్నాయి. కక్ష నుంచి భూమి పర్యవేక్షణ, చంద్రునిపై ప్రయోగాలకు సంబంధించి రెండు సంస్థలు పరస్పరం సహకరించుకుంటాయి.
వీసీ 11184
వ్యూహాత్మక అణు క్షిపణి ప్రయోగాలు, నీటి అడుగున కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే సత్తా కలిగిన అధునాతన నౌక వీసీ 11184 నిర్మాణం పూర్తయింది. ఈ తరహా సామర్థ్యం కలిగిన అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా ఫ్రాన్స్ల సరసన ఇండియా చేరింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్యార్డులో 2014లో దీని నిర్మాణం సీక్రెట్గా ప్రారంభమైంది. దీని తయారీలో డీఆర్డీవో, భారత నౌకాదళం పాల్గొన్నాయి. ఈ ప్రాజెక్టు విలువ రూ.725 కోట్లు.
ఆర్మీకి మిస్సైల్ కిట్
ఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే మధ్యతరహా క్షిపణి(ఎంఆర్ఎస్ఏఎం)లోని కీలక భాగాన్ని ఉత్పత్తి చేసిన కల్యాణి రఫేల్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్(కేఆర్ఏఎస్) తొలి కిట్ను భారత సైన్యం, వైమానిక దళానికి అందించింది. భారతదేశపు కల్యాణి గ్రూపు, ఇజ్రాయిల్కు చెందిన రఫేల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉమ్మడి సంస్థే కేఆర్ఏఎస్.
సైంటిస్టుల సముద్రయాత్ర
హిందూ మహాసముద్రంలోని దక్షిణార్ధగోళం 30 డిగ్రీల అక్షాంశం వరకు ప్రయాణిస్తూ జీవ వైవిధ్యం, సముద్ర జీవుల జన్యు పరిణామక్రమం అధ్యయనం చేయాడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ(ఎన్ఐఓ) సైంటిస్టులు సముద్రయాత్ర ప్రారంభించారు. 90 రోజులపాటు సుమారు 9 వేల నాటికల్ మైళ్లు ప్రయాణించి గోవా చేరుకుంటారు. ఆర్.వి.సింధు సాధన అనే పరిశోధక నౌకలో వివిధ విభాగాలకు చెందిన 30 మంది సైంటిస్టులు మార్చి 16న విశాఖ నుంచి బయలుదేరారు.
క్వాంటమ్ ప్రయోగం సక్సెస్
భవిష్యత్ తరం క్వాంటమ్ కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. ‘ఫ్రీ స్పేస్ క్వాంటమ్ కమ్యూనికేషన్’ ను 300 మీటర్ల దూరంలో దిగ్విజయంగా నిర్వహించింది. సొంతంగా అభివృద్ధి చేసిన ‘నావిక్’ రిసీవర్ను ఇందులో ఉపయోగించింది.
నౌకాదళంలోకి ధ్రువ్
భారత నౌకాదళంలోకి మరో శక్తివంతమైన యుద్ధనౌక ధ్రువ్ చేరనుంది. వి.సి.11184 పేరుతో విశాఖలోని హిందుస్థాన్ షిప్యార్డులో రహస్యంగా ఐదేళ్లపాటు శ్రమించి దీన్ని తయారు చేశారు. పాకిస్థాన్, చైనా తదితర దేశాల నుంచి క్షిపణులను ప్రయోగించినా ఈ యుద్ధనౌక గుర్తించగలదు.
సైన్యానికి లైట్ కాంబాట్ వెహికల్స్
సైన్యానికి అవసరమైన 1300 లైట్ కాంబాట్ వెహికల్స్ కొనుగోలుకు మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ (ఎండీఎస్ఎల్) తో భారత రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. రూ.1056 కోట్లతో ఈ వాహనాలను కొననున్నట్లు రక్షణ శాఖ ప్రకటించింది. ఈ వెహికల్స్ను మెషిన్ గన్లు, అటోమాటిక్ గ్రెనేడ్ లాంచర్లు, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ రవాణా చేయడానికి ఉపయోగిస్తారు.
స్పోర్ట్స్
జ్యోతి సురేఖ రికార్డ్
భారత ఆర్చరీ సంఘం నిర్వహించిన సెలెక్షన్ టోర్నీలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ జాతీయ రికార్డు నమోదు చేసింది. ఏప్రిల్లో జరగనున్న ప్రపంచకప్ కోసం ఎంపిక చేసిన భారత కాంపౌండ్ జట్టులో సురేఖ స్థానం దొరికింది. సెలెక్షన్ టోర్నీలో ర్యాంకింగ్ రౌండ్లో సురేఖ 710/720 స్కోరు సాధించింది. 8 మంది క్రీడాకారిణులకు నిర్వహించిన ర్యాంకింగ్ రౌండ్లో 2808/2880 తో టాప్లో నిలిచింది.
వినేశ్ పొగాట్కు గోల్డ్
ఉక్రెయిన్ రెజ్లింగ్ టోర్నీలో ఇండియన్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ గోల్డ్ మెడల్ సాధించింది. 53 కేజీల మహిళల విభాగంలో 10–8 తేడాతో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ వెనెసా ను ఓడించింది. మొదట్లో వెనకబడినా చివర్లో ఒకేసారి నాలుగు పాయింట్లు సాధించి గెలుపొందింది.
ఆరు బంతుల్లో ఆరు సిక్సులు
వెస్టిండీస్ ఆల్రౌండర్ కీరన్ పొలార్డ్ శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో అఖిల ధనంజయ వేసిన ఓవర్లో ఆరుబంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ గిబ్స్, టీమ్ ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన బ్యాట్స్మెన్గా రికార్డ్ సృష్టించాడు.
మార్చి 13
జకోవిచ్ రికార్డ్
నొవాక్ జకోవిచ్ పురుషుల సింగిల్స్లో అత్యధిక వారాలు ప్రపంచ నంబర్వన్ ఆటగాడిగా ఆల్టైమ్ రికార్డు నమోదు చేశాడు. ఇప్పటి వరకు ర్యాంకింగ్స్లో నెంబర్ వన్గా 311 వారాలు గడిపాడు. గత వారమే ఫెదరర్(310 వారాల) రికార్డును సమం చేసిన జకోవిచ్ తాజాగా రికార్డ్ బ్రేక్ చేశాడు.
బజ్రంగ్ న నెం.1
భారత స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియా ప్రపంచ రెజ్లింగ్ 65 కిలోల విభాగంలో తిరిగి నంబర్వన్ ర్యాంకును సొంతం చేసుకున్నాడు. మాటియో పెలిసోన్ ర్యాంకింగ్ సిరీస్లో స్వర్ణం సాధించడంతో అతడు రెండో స్థానం నుంచి ఫస్ట్ప్లేస్కు చేరుకున్నాడు. ఈ టోర్నీ ఫైనల్లో మంగోలియాకు చెందిన తుల్గా తుమర్ ఓచిర్ను ఓడించి పసిడి గెలుచుకున్నాడు.
బెస్ట్ క్రికెటర్గా అశ్విన్
భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్ఇన్ ఐసీసీ ఫిబ్రవరి నెతల ఉత్తమ క్రికెటర్గా నిలిచాడు. ఫిబ్రవరిలో జరిగిన మ్యాచుల్లో 176 రన్స్ చేయడంతోపాటు 24 వికెట్లు తీశాడు. ఎక్కువ మంది అభిమానుల ఓట్లు అశ్విన్కే పడినట్లు ఐసీసీ తెలిపింది.
మార్చి 20
100 మీ.లో ధనలక్ష్మి
ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ మహిళల 100 మీటర్ల పరుగులో ధనలక్ష్మి విజేతగా నిలిచింది. ఈ రేసులో నేషనల్ రికార్డు హోల్డర్ ద్యుతి చంద్ను ఓడించి ఆమె స్వర్ణం గెలుచుకుంది. తమిళనాడుకు చెందిన 22 ఏళ్ల ధనలక్ష్మి 11.39 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకోగా.. ద్యుతి(ఒడిశా) 11.58 సెకన్లతో సెకండ్ ప్లేస్లో నిలిచి రజతం సాధించింది.
లాంగ్ జంప్లో రికార్డ్
భారత లాంగ్ జంపర్ మురళి శ్రీశంకర్ టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించాడు. ఫెడరేషన్ కప్ సీనియర్ నేషనల్ అథ్లెటిక్స్లో 8.26 మీటర్ల దూరం దూకిన అతడు తన పేరుతోనే ఉన్న నేషనల్ రికార్డును బ్రేక్ చేశాడు. ఫస్ట్ అటెంప్ట్లో 8.02 మీటర్లు దూకిన శ్రీశంకర్ అయిదో ప్రయత్నంలో రికార్డు సాధించాడు.
ఫస్ట్ ఇండియన్ ఫెన్సర్
తమిళనాడు ఫెన్సర్ భవాని దేవి టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించింది. ఒలింపిక్స్లో పాల్గొంటున్న ఫస్ట్ ఇండియన్ ఫెన్సర్గా ఆమె రికార్డు సృష్టించింది. వ్యక్తిగత సాబ్రె విభాగంలో ర్యాంకింగ్ ద్వారా భవాని టోక్యో బెర్త్ సొంతం చేసుకుంది.
మార్చి 27
జాతీయ టెన్నిస్ చాంప్ రష్మిక
జాతీయ టెన్నిస్ హార్డ్కోర్ట్ చాంపియన్షిప్లో తెలంగాణ అమ్మాయి రష్మిక విజేతగా నిలిచింది. మహిళల సింగిల్స్ ఫైనల్స్లో రెండో సీడ్ రష్మిక 6–2,7–6, (7/2) తో టాప్సీడ్ వైదేహి చౌదరిని ఓడించింది. పురుషుల సింగిల్స్ టైటిల్ అర్జున్ ఖాదె (మహారాష్ట్ర) కైవసం చేసుకున్నాడు. ఫైనల్లో పృథ్వీ శేఖర్పై 6–3, 6–4 తో గెలుపొందాడు.
ఇండియా లెజెండ్స్కు టైటిల్
సచిన్ సారథ్యంలోని ఇండియన్ లెజెండ్స్ జట్టు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ చాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ఇండియా 14 పరుగుల తేడాతో శ్రీలంక లెజెండ్స్పై విజయం సాధించింది. ఫైనల్లో యూసఫ్ పఠాన్, యువరాజ్ హాఫ్ సెంచరీలతో రెచ్చిపోవడంతో ఇండియా లెజెండ్స్ చాంపియన్గా అవతరించింది.
సింగ్రాజ్కు గోల్డ్
ప్రపంచ పారా షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ సింగ్రాజ్ సత్తా చాటాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్లో సింగ్రాజ్ 236.8 పాయింట్లతో టాప్లో నిలిచి పసిడి పతకం సొంతం చేసుకున్నాడు.