బీఎస్సీ నర్సింగ్ (Bsc Nursing) కోర్సులో చేరాలనుకుంటున్నారా…? కొత్త నిబంధనల ప్రకారం ఈ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు రెండు ఎంట్రన్స్లు రాయాల్సి ఉంటుంది. ఈ ఏడాది నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. అందుకు అవసరమైన ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి.
బీఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలనుకునే విద్యార్థులు ఎంసెట్ (TS EAMCET) తో పాటు నీట్ (NEET UG) రెండు ఎంట్రన్స్లు రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లోని సీట్లను, ప్రైవేటు నర్సింగ్ కాలేజీల్లోని కన్వీనర్ కోటా సీట్లను ఎంసెట్ ర్యాంక్ మెరిట్ ప్రకారం భర్తీ చేస్తామని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ సోమవారం ప్రకటించింది. ప్రైవేటు కాలేజీల్లోని మేనేజ్మెంట్ కోటా సీట్లను మాత్రం నీట్ ర్యాంక్ ఆధారంగా భర్తీ చేస్తామని పేర్కొంది. ఇందుకు అనుగుణంగా విద్యార్థులు రెండు ఎగ్జామ్స్కు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
కన్వీనర్ కోటా సీట్లను కూడా ఈసారి నీట్ ర్యాంక్ ఆధారంగానే భర్తీ చేయాల్సి ఉండగా, రెండ్రోజుల క్రితం ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (Indian Nursing Council) ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. నీట్కు బదులు రాష్ట్ర ప్రభుత్వమే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ను నిర్వహించుకోవాలని సూచించింది. ఐఎన్సీ ఆదేశాలకు అనుగుణంగా కాళోజీ వర్సిటీ సోమవారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.