తెలంగాణలోని గురుకుల విద్యాలయాల్లో (Telangana Residential Institutions JOBS) ఉద్యోగ నియామకాల ప్రక్రియ రేపటి నుంచి మొదలవనుంది. టీచింగ్ పోస్టుల భర్తీకి గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు (TREIRB) వన్టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)కు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఓటీఆర్ నమోదు ద్వారా వచ్చే నంబరుతో అభ్యర్థులు అర్హత కలిగిన పోస్టులకు అప్లై చేసువాల్సి ఉంటుంది. అందుకే గురుకుల పోస్టులకు పోటీ పడే అభ్యర్థులందరూ విధిగా ఓటీఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ సదుపాయం ఏప్రిల్ 12వ తేది.. అంటే బుధవారం నుంచి అందుబాటులోకి వస్తుందని బోర్డు అధికారులు తెలిపారు.
గురుకులాల్లో మొత్తం 9,231 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. పోస్టులను బట్టి మొత్తం తొమ్మిది నోటిఫికేషన్లు జారీ చేసేందుకు బోర్డు ఏర్పాట్లు చేసింది. పోస్టుల కేటగిరీల వారీగా అప్లికేషన్ల ప్రక్రియ ఈ నెల 17వ తేదీ నుంచి మొదలవుతుంది. ముందుగా ఓటీఆర్ నమోదు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వీలుంటుంది. అందుకే అభ్యర్థులు ఆలస్యం చేయకుండా ముందుగా ఓటీఆర్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.
టీచర్, లెక్చర్ పోస్టులకు అర్హులైన అభ్యర్థులకు తాము చదివిన డిగ్రీ, పీజీ కోర్సుల మేరకు ఒకటి కన్నా ఎక్కువ పోస్టులకు పోటీ పడే అవకాశముంటుంది. అందుకే ప్రతిపోస్టుకు దరఖాస్తు చేసేందుకు వ్యక్తిగత వివరాలు నమోదు చేసే అవసరం లేకుండా దరఖాస్తుల ప్రక్రియను సులభతరం చేసేందుకు ఓటీఆర్ విధానం అమల్లోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు. ఓటీఆర్ రిజిస్టేషన్ నెంబర్ ఆధారంగా అభ్యర్థి ఎన్ని పోస్టులకైనా దరఖాస్తు చేసుకోవచ్చు.