త్వరలోనే టెట్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. టీచర్ పోస్టుల నియామకాలకు కీలకమైన టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ (TET) త్వరలో నిర్వహించాలని కేబినేట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో వచ్చే నెలలో టెట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. నోటిఫికేషన్ తర్వాత 45 రోజులకు పరీక్ష జరుగుతుంది. గత ఏడాది జూన్ 12వ తేదీన రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ టెట్ నిర్వహించింది. యూజీసీ నిబంధనల ప్రకారం ప్రతి ఏడాది టెట్ నిర్వహించటం తప్పనిసరి. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా టెట్ పరీక్ష నిర్వహించాలని కేబినేట్ సబ్ కమిటీలో చర్చ జరిగింది.
ఇప్పటికే రాష్ట్రంలో టెట్లో అర్హత సాధించిన అభ్యర్థులు ఏడు లక్షల మందికిపైగా ఉన్నారు. వీరందరూ టీచర్ల రిక్రూట్మెంట్ ఎప్పుడెప్పులా అని ఎదురుచూస్తున్నారు. కొత్తగా టీచర్ రిక్రూట్మెంట్ చేపట్టాలన్నా.. ఈ ఏడాది డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకు ముందుగా టెట్ నిర్వహించటం తప్పనిసరి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటివరకు మూడుసార్లు టెట్ నిర్వహించారు. 2016 మే 22న, 2017 జులై 23, 2022 జూన్ 12న టెట్ పరీక్షలు జరిగాయి. గత ఏడాది టెట్ పేపర్ 1కు 3.50 లక్షల మంది, పేపర్ 2కు 2.76 వేల మంది అప్లై చేసుకున్నారు. నిబంధనల ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా బోధన చేయాలన్నా టెట్ అర్హత తప్పనిసరి కావడంతో అభ్యర్థులంతా టెట్ కోసం ఎదురుచూస్తున్నారు. 2022 లో నిర్వహించిన టెట్లో పేపర్1లో 32.68శాతం, పేపర్ 2లో 49.64శాతం మంది క్వాలిఫై అయ్యారు. దీంతో లక్షల మంది క్వాలిఫై కానీ స్టూడెంట్లు, టెట్ కోసం ఎదురుచూస్తున్నారు.