రద్దయిన ఏఈఈ (AEE) పరీక్షను కంప్యూటర్ బేస్ట్ ఎగ్జామ్గా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ (TSPSC) నిర్ణయించింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తదితర సంస్థలు అనుసరిస్తున్న విధానాన్నే రాష్ట్రంలో అమలు చేయనున్నట్లు వెల్లడించింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల పరీక్షలన్నీ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ పోస్టుల భర్తీకి జనవరిలోనే టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించింది. పేపర్ల లీకేజీ తో వీటిని రద్దు చేసింది. కొత్త షెడ్యూలు ప్రకారం ఈ పరీక్షలను సీబీఆర్టీ విధానంలో నిర్వహించనుంది.
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ విభాగం పోస్టులకు మే 8న సీబీఆర్టీ విధానంలో, అగ్రికల్చర్, మెకానికల్ ఇంజినీరింగ్ పోస్టులకు మే9న సీబీఆర్టీ విధానంలో, సివిల్ ఇంజినీరింగ్ సబ్జెక్టు పోస్టులకు మే 21న ఓఎంఆర్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. సివిల్ ఇంజినీర్ పోస్టులను 44,352 మంది దరఖాస్తు చేశారు. రాష్ట్రంలో అంతమందికి ఒకే రోజున సీబీఆర్టీ విధానంలో పరీక్ష నిర్వహించేందుకు సదుపాయాలు లేవు. అందుకే మే 21, 22 తేదీల్లో షిఫ్ట్ వైజ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఏఈఈ సివిల్ పోస్టులకు సీబీఆర్టీ విధానంలో మే 21 ఉదయం, మధ్యాహ్నం వేళల్లో కొందరికి.. మే 22న మరికొందరికి పరీక్షలు జరుగుతాయి.
సీబీఆర్టీ పద్ధతిలో పరీక్షలు నిర్వహించినప్పుడు మార్కులను నార్మలైజేషన్ విధానంలో లెక్కిస్తారు. ఒక్కో షిఫ్టులో జరిగిన పరీక్షల్లో ప్రశ్నలు ఈజీగా.. కొన్నింటిలో టఫ్గా ఉంటాయి. అందుకే నార్మలైజేషన్ ఫార్ములా కింద తుది మార్కులు లెక్కిస్తారు. ఒక సెంటర్లో పరీక్ష నిర్వహణకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైతే అక్కడి అభ్యర్థులకు తదుపరి షిఫ్టులోని అభ్యర్థులతో కలిపి నిర్వహిస్తారు. ఒకవేళ చివరి షిఫ్టులో ఏదేని పరీక్ష కేంద్రంలో ఇబ్బందులు ఎదురైతే వారికి తరువాత రీ ఎగ్జామ్ నిర్వహిస్తారు. అభ్యర్థుల మార్కుల లెక్కింపు విషయంలో నిపుణుల కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.