గ్రూప్ -1 ప్రిలిమ్స్ ఫలితాలు ఎప్పుడు వెలువడుతాయనే ఉత్కంఠ కొనసాగుతోంది. గత నెలలోనే టిఎస్పిఎస్సి (TSPSC) గ్రూప్ 1 ప్రిలిమినరీ కీని విడుదల చేసింది. ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాలను సమర్పించే గడువు ఇప్పటికే ముగిసింది. దీంతో ప్రిలిమ్స్ ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్లో నిర్వహించిన పరీక్ష రద్దవటంతో.. జూన్ 11వ తేదీన తిరిగి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను టిఎస్పిఎస్సి పకడ్భందీగా నిర్వహించింది.
గత నెల 28వ తేదీన ప్రిలిమ్స్ ప్రాథమిక ‘కీ’ని విడుదల చేసింది. పరీక్షకు హాజరైన మొత్తం 2,33,056 మంది అభ్యర్థుల ఒఎంఆర్ షీట్లను కమిషన్ ఇప్పటికే వెబ్సైట్లో అందుబాటులోకి ఉంచింది. ఈనెల 1వ తేదీ నుంచి జులై5 వరకు అభ్యంతరాలను స్వీకరించింది. ప్రైమరీ కీ పై అభ్యర్థులు సమర్పించిన అభ్యంతరాలను ఇప్పటికే సబ్జెక్టు నిపుణులు పరిశీలించి తుది కీ ని ఖరారు చేసినట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
దీంతో గ్రూప్1 ఫైనల్ కీతో పాటు ప్రిలిమినరీ ఫలితాలను వచ్చే వారంలో విడుదల చేసే చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ప్రిలిమ్స్ ఫలితాలను వెబ్సైట్లో ఉంచకపోవటంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈసారి.. ఫైనల్ కీతో ప్రిలిమినరీ ఫలితాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచే అవకాశాలున్నాయి.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చే వారంలో విడుదల చేసి.. మూడు నెలల తర్వాత మెయిన్స్ నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. మూడు నెలల వ్యవధి తర్వాత.. నవంబరు నెలలో గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించేందుకు వీలుగా షెడ్యూలును తయారు చేస్తున్నట్లు సమాచారం. ఆగస్ట్ లో గ్రూప్ 2, సెప్టెంబర్ వరకు ఇతర పరీక్షల షెడ్యూలు బిజీగా ఉంది. అక్టోబర్లో గ్రూప్ 3 నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. అందుకే నవంబర్లో మెయిన్స్ పరీక్షలు జరిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకుంటోంది.