గ్రూప్ 3 ఉద్యోగ నియామక పరీక్ష తేదీలపై టీఎస్పీఎస్సీ కసరత్తు మొదలు పెట్టింది. వచ్చే నెలాఖరున గ్రూప్ 2 పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ (TSPSC) ఏర్పాట్లు చేస్తోంది. గ్రూప్ 2 పరీక్షతో పాటు గ్రూప్ 3 అప్లికేషన్ల ప్రక్రియ కూడా ఫిబ్రవరిలోనే ముగిసింది. దీంతో గ్రూప్ 3 పరీక్ష ఎప్పుడు జరుగుతుందా.. అని లక్షలాది మంది అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ మూడో వారంలో గ్రూప్ 3 పరీక్ష నిర్వహించాలని టీఎస్పీఎస్సీ ప్రాధమికంగా నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలో మొత్తం 1388 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ గ్రూప్ 3 నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 24వ తేదీ నుంచి మొదలైన అప్లికేషన్ల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ముగిసింది. మొత్తం 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. పరీక్ష తేదీలను త్వరలో ఖరారు చేస్తామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. గ్రూప్ 2, గ్రూప్ 4 పోస్టుల తరహాలోనే గ్రూప్ 3 పోస్టులకు భారీగా పోటీ నెలకొంది. అప్లికేషన్ల సంఖ్యను బట్టి ఒక్కో గ్రూప్ 3 పోస్టుకు 386 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. గ్రూప్ 2 పరీక్ష రాస్తున్న అభ్యర్థులు ఎక్కువ మంది మరో ఆప్షన్గా గ్రూప్ 3 పరీక్షకు ప్రిపేరవుతున్నారు.
గ్రూప్ 3 పరీక్ష తేదీలపై ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ.. గ్రూప్ 2 ముగిసిన తర్వాత అక్టోబర్ లో గ్రూప్ 3 పరీక్ష నిర్వహించేలా టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. అక్టోబర్ 24న దసరా పండుగ. దసరా లోపే ఈ పరీక్ష జరపాలని భావిస్తోంది. స్కూళ్లు, కాలేజీలకు అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులున్నాయి. వీలైతే అదే సెలవుల వ్యవధిలో గ్రూప్ 3 పరీక్ష నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఆలోచనలు చేస్తోందీ. అయిదు లక్షల మందికిపైగా అభ్యర్థులు పరీక్ష రాయనుండటంతో.. ఎగ్జామ్ సెంటర్లు, ఏర్పాట్ల దృష్ట్యా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి. దసరా సెలవుల్లో పరీక్ష నిర్వహించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే బోర్డు పలుమార్లు సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది.