టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ ‘టెట్’ నోటిఫికేషన్ విడుదలకు రంగం సిద్ధమైంది. ప్రకటన వెలువడిన తర్వాత అభ్యర్థులకు 60 రోజులు ప్రిపరేషన్కు టైమ్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించేందుకు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సమాయత్తం అవుతోంది. ఈ సారి టెట్కు లైఫ్టైమ్ వ్యాలిడిటీతో పాటు బీఈడీ అభ్యర్థులకు టెట్ పేపర్–1 రాసేందుకు అవకాశం ఇవ్వడం, మరోవైపు టెట్ నిర్వహణ వెంటనే టీచర్ పోస్టుల భర్తీ చేపట్టంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. టెట్ కేవలం అర్హతా పరీక్షే కాకుండా డీఎస్సీలో 20 మార్కుల వెయిటేజీ కూడా ఉంటుంది. దీంతో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డీఎస్సీ ఫలితాల్లోనూ టెట్ స్కోర్ కీలకంగా మారనుంది. 2011 నుంచి 2017 వరకు జరిగిన టెట్ పేపర్లను గమనిస్తే సబ్జెక్టుల వారిగా ప్రశ్నల స్థాయి ఎలా ఉంది?, ఏ అంశాల నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతున్నారు? కొత్తగా చేర్చిన అంశాలు ఏవి? వేటిపై అభ్యర్థులు ఫోకస్ పెట్టి చదవాలి? ఎలా చదివితే టెట్లో టాప్ స్కోర్ సాధించవచ్చనే నిపుణులు సలహాలు, సూచనలు ఒకసారి చూద్దాం..
- చాలా మంది టెట్ అంటే అర్హత సాధిస్తే చాలు మిగతా డీఎస్సీలో చదువుదాం అనే ఆలోచనతో నామమాత్రంగా చదువుతారు. ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే డీఎస్సీకి టెట్ అనేది సెమిఫైనల్ లాంటిది. దాదాపు 80 శాతం సిలబస్ టెట్లో ఉన్నదే డీఎస్సీలో ఉంటుంది. కనుక అభ్యర్థులు టెట్లో మంచి స్కోర్ సాధిస్తే డీఎస్సీ ప్రిపరేషన్ చాలా సులభం అవుతుంది. కేవలం డీఎస్సీ విషయానికి వస్తే కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మాత్రమే కొత్తగా ఉంటుంది. మిగతా కంటెంట్, ఇంగ్లీష్, తెలుగు, మెథడాలజీ అంశాలు టెట్, డీఎస్సీలో ఒకే విధమైన సిలబస్ ఉంటుంది. కొంత ప్రశ్నల కఠిన్యత పెరుగుతుంది అంతే. కాబట్టి అభ్యర్థులు టెట్లో గరిష్ట స్కోర్ సాధించేందుకు కష్టపడాల్సి ఉంటుంది. 150 మార్కులకు గాను కనీసం 110 నుంచి 130 మార్కులు సాధిస్తే డిఎస్సీలో మంచి వెయిటేజి వస్తుంది. మీ ప్రిపరేషన్ బాగుందని భావించవచ్చు.
- టెట్ నోటిఫికేషన్ వెలువడుతుందన్న సమాచారం తెలియగానే చాలా మంది అభ్యర్థులు మార్కెట్లో ఉన్న పుస్తకాలన్నింటినీ ఇంటికి తెచ్చుకుని ఏది చదవాలో తెలియన గందరగోళానికి గురవుతుంటారు. ముఖ్యంగా మొదటి సారి టెట్ రాసే వారిలో ఇది ఎక్కువగా ఉంటుంది. అయితే అనవసర టెన్షన్కు లోను కాకుండా తెలుగు అకాడమీ పుస్తకాలు, డీఈడీ, బీఈడీ సిలబస్, రాష్ట్ర ప్రభుత్వం ప్రచురించి పాఠ్యపుస్తకాలను ప్రామణికంగా చేసుకుని చదివితే మంచి స్కోర్ సాధించవచ్చు. ప్రశ్నాపత్రం తయారు చేసే నిపుణులు ప్రామాణిక పుస్తకాలనే ఆధారంగా చేసుకుంటారని అభ్యర్థులు గమనించాలి.
- కొత్త సిలబస్, పాత సిలబస్ ఏది చదవాలి అనే ఆందోళన సాధారణంగా అందరి అభ్యర్థుల్లో ఉంటుంది. అలాగే క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది? ఏదైనా మార్పులు, చేర్పులు ఉంటాయా? అనే ఆలోచన మొదలువుతుంది. అయితే ఈసారి దాదాపుగా పాత పద్ధతిలోనే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సవరించిన సిలబస్తోనే పరీక్ష నిర్వహించేందుకు అధికారులు మొగ్గు చూపుతున్నారు. అనవసర ఆందోళన పక్కన పెట్టి గతంలో టెట్ సిలబస్ షీట్ను పక్కన పెట్టుకుని ప్రిపరేషన్ ప్రారంభించడం ఉత్తమం.
- ప్రిపరేషన్ ప్రారంభంలోనే మోడల్ పేపర్ ప్రాక్టీస్, బిట్ బ్యాంక్ ప్రాక్టీస్ చేయడం లాంటివి కాకుండా సిలబస్లోని అంశాల థియరీ పార్ట్ను కచ్చితంగా చదవాలి. మొదటి 30 రోజులు ప్రిపరేషన్కు, తర్వాతి 15 రివిజన్కు, తర్వాతి 15 రోజులు ప్రాక్టీస్ కోసం కేటాయించుకుని చదవాలి. కీలక పాఠ్యాంశాలపై పట్టు ఉంటే మిగిలిన విషయాలపై దృష్టి కేంద్రీకరించాలి. ఇది తర్వాత చదువుదాం, ఫలానా సబ్జెక్ట్ ఈజీ అని తేలికగా తీసుకోవద్దు. ఇతరులతో పోల్చుకుని న్యూనత భావానికి లోను కావద్దు. నాకే అన్ని తెలుసు అనే భావనను విడిచిపెట్టి తెలియని విషయాలను సబ్జెక్టు నిపుణులు, తోటి విద్యార్థుల ద్వారా తెలుసుకుని చదివాలి.
- చైల్డ్ సైకాలజీ–పెడగాగి– ఈ సబ్జెక్ట్ను అభ్యర్థులు డీఈడీ, బీఈడీ కోర్సులో భాగంగా చదివే ఉంటారు. దీని సిలబస్ చాలా విస్తృతమైంది. కాన్సెప్ట్లు అర్ధం చేసుకుని చదివితే కాని సరైన జవాబులను గుర్తించలేము. ఎక్కువ ప్రశ్నలు అప్లికేషన్ మెథడ్లో అడుగుతుంటారు. సైకాలజీకి బట్టి విధానం అస్సలు పనికిరాదు. గత టెట్లను పరిశీలిస్తే పెడగాజి నుంచి 8 నుంచి 10 ప్రశ్నలు, అభ్యసనం నుంచి 6నుంచి 8 ప్రశ్నలు, శిశువికాసం నుంచి 8–10 ప్రశ్నలు , వైయక్తిక భేదాలు, మూర్తిమత్వం టాపిక్ నుంచి రెండు ప్రశ్నలు అడిగారు. దాదాపు ఇదే తరహాలో ఈ సారి నిర్వహించే టెట్లో ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. మెథడాలజీలో తరగతి గది, విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠశాల పరిసరాలు వీటి చుట్టే ప్రశ్నలు తిప్పి తిప్పి ఎక్కువగా అడుగుతున్నారు. నిత్యజీవితానికి అన్వయించుకుని జవాబులను గుర్తించవచ్చు.
- లాంగ్వేజ్ –1 తెలుగు నుంచి 30 ప్రశ్నలు ఇస్తారు. తెలుగు భాష సులభంగా ఉంటుందని భావించి చివరిలో చదవడం, తేలికగా తీసుకోవడం సరైన ధోరణి కాదు. ఎక్కువగా వ్యాకరణ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కవులు, రచనలు, బిరుదులు వంటి కంటెంట్ అంశాలపై దృష్టి పెట్టాలి. పాఠ్య పుస్తకాల వెనకాల ఉన్న వ్యాకరణ అంశాలను పాఠ్యాంశంలోని విషయాలను అన్వయించుకుని చదవాలి. పద్యాలు, ప్రతిపదార్థాలు, భావం, అర్థాలు, ప్రకృతి–వికృతి, సొంత వ్యాక్యాలు, నానార్థాలు, వ్యతిరేక పదాలు ఇలా ప్రతి అంశం నుంచి గతంలో నిర్వహించిన టెట్లలో ప్రశ్నలు వచ్చాయి. వీటిపై దృష్టి పెట్టాలి. తెలుగు మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు వస్తాయి. డీఈడీ, బీఈడీ సిలబస్లోని భాషా బోధనలో అనుసరించాల్సిన వ్యూహాలు, బోధనా పద్ధతులు ఇతర అంశాలను చదవాలి.
- చాలా మంది అభ్యర్థులకు ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులు ఇంగ్లీష్ అనగానే భారంగా ఫీలవుతుంటారు. ఇది మాకు రాదు అనే ధోరణి కనిపిస్తుంది. పరీక్షకు 60 రోజుల సమయం ఉన్నందున ప్రతి రోజు 2 గంటలు ఇంగ్లీష్ కు తప్పనిసరిగా కేటాయించాలి. గ్రామర్పై పట్టు సాధిస్తే 15 మార్కులు ఈజీగా స్కోర్ చేయవచ్చు. తెలియని పదాలను డిక్షనరీ ద్వారా తెలుసుకుంటూ నోట్స్ రాసుకుంటూ, 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్ పాఠ్య పుస్తకాల్లో ఉన్న గ్రామర్ను ప్రాక్టీస్ చేస్తే మార్కులు స్కోర్ చేయవచ్చు. గత ప్రశ్నాపత్రాలను ఒకసారి గమనిస్తే ప్రశ్నలు ఎలా అడుగుతున్నారనేది అర్ధమవుతుంది. ఇంగ్లీష్ మెథడాలజీ నుంచి 6 ప్రశ్నలు వస్తాయి. ఇవి దాదాపు, డీఈడీ, బీఈడీ సిలబస్ నుంచే అడుగుతారు.
- కంటెంట్ విషయానికి వస్తే ఇది చాలా విస్తృతమైంది. మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టుల నుంచి పేపర్–1 రాసేవారు 1–8 తరగతుల వరకు, పేపర్ –2 రాసేవారు 10వ తరగతి సిలబస్ స్థాయిలో చదవాల్సి ఉంటుంది. సిలబస్ దాటి ప్రశ్నలు అడిగే అవకాశమే లేదు. కాబట్టి పాఠ్యపుస్తకాలను లైన్ టు లైన్ చదువుతూ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కంటెంట్లో ఒక్క మార్కు మిస్ కాదు. కంటెంట్లో డైరెక్ట్ క్వశ్చన్స్ కాకుండా గత టెట్లలో అప్లికేషన్ టైపులో ప్రశ్నలు అడిగారు. వీటిని గత ప్రశ్నాపత్రాలు చూస్తే అర్ధమవుతుంది. కంటెంట్ చదవడం పూర్తయిన తర్వాత మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ కాలం గుర్తుంటుంది.