తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ (TS EAMCET-2023) కు సంబంధించిన కీని కొద్ది సేపటి క్రితం అధికారులు విడుదల చేశారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in/ నుంచి కీని డౌన్ లోడ్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు. కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 17వ తేదీ రాత్రి 8 గంటల వరకు తెలియజేయాలని అధికారులు సూచించారు. అధికారిక వెబ్ సైట్ లో వ్యక్తి గత లాగిన్ ద్వారా విద్యార్థులు కీపై తమ అభ్యంతరానలు తెలియజేయాల్సి ఉంటుంది. విద్యార్థులు రెస్పాన్స్ షీట్లను, మాస్టర్ క్వశ్చన్ పేపర్లను కూడా అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన ఎంసెట్ పరీక్షను ఈ నెల 12, 13, 14 తేదీల్లో మూడు రోజుల పాటు నిర్వహించారు.
విద్యార్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణ తర్వాత ఫైనల్ కీని విడుదల చేయనున్నారు. అనంతరం ఫలితాలు విడుదల అవుతాయి. అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులోగా ఎంసెట్ ఫలితాలను విడుదల చేయాలన్నది అధికారుల ఆలోచనగా తెలుస్తోంది. ఈ సారి ఎంసెట్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ కు మొత్తం 2, 05,351 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,95,275 మంది హాజరయ్యారు. అయితే.. ఈ ఏడాది ఎంసెట్ ర్యాంకుల కేటాయింపులో ఇంటర్ మార్కులకు వెయిటేజీని తొలగించారు. కేవలం ఎంసెట్ లో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగానే ర్యాంకులను కేటాయించనున్నారు.