ఇంటర్ లో చేరిన తర్వాత విద్యార్థి అనుకోని పరిస్థితుల్లో మానేయాల్సి వస్తే.. విద్యార్థి చెల్లించిన ఫీజు రిటర్న్ చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరిలో నార్సింగ్లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య ఘటన సంచలనం సృష్టించింది. దీనికి తోడు యాజమాన్యాల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఆత్మహత్యల నిరోధానికి ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీ విచారణ, అధికారులతో సమీక్షల అనంతరం ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ ప్రైవేట్ కాలేజీలకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. మొత్తం 16 మార్గదర్శకాలను పేర్కొన్నారు. అన్ని కాలేజీలు వీటిని పాటించాలని సూచించారు.
తాజా మార్గదర్శకాల్లో ముఖ్యమైనవి
- కాలేజీలో చేరిన విద్యార్థి అనుకోని పరిస్థితుల్లో మానేయాల్సి వస్తే విద్యార్థి కట్టిన ఫీజును కాలేజీ యాజమాన్యాలు తిరిగి ఇచ్చేయాలి. కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ముందుగానే ఫీజు మొత్తం కట్టించుకుంటున్నాయి. అనారోగ్యంతోనో, ఇతర కారణాలతోనో విద్యార్థి కాలేజీ వీడాల్సి వస్తే ఆ ఫీజును కళాశాలలు తిరిగి చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
- విద్యార్థి కాలేజీలో చేరిన మూడు నెలల్లోపు మానేస్తే 75 శాతం ఫీజు, ఆరు నెలల్లోపు మానేస్తే 50శాతం, ఆరు నెలల అనంతరం మానేస్తే 25శాతం ఫీజు రిటర్న్ చేయాలి.
- ప్రతీ ఏడాది విద్యార్థికి యాజమాన్యాలు రెండు సార్లు వైద్య పరీక్షలు చేయించాలి.
- కాలేజీలో తగినంత మంది సిబ్బందిని నియమించుకోవాలి. వారికి ఆధార్ తో కూడిన బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాలి.
- బోధన సిబ్బందిలో 50శాతం మంది పీజీ చేసిన వారుండాలి.
- జూనియర్ కాలేజీకి ప్రత్యేక మొబైల్ నెంబర్ ఉండాలి. ప్రిన్సిపల్ మారినా అదే నెంబర్ కొనసాగించాలి. ప్రిన్సిపల్ మారితే.. డీఐఈవోకు తప్పనిసరిగా ఆ సమాచారాన్ని ఇవ్వాలి.
- బోధన, బోధనేతర సిబ్బందిని నియమించుకుంటే విద్యా సంవత్సరం ముగిసే వరకు వారిని తొలగించరాదు. ఒకవేళ తీసివేయాలని అనుకుంటే నోటీసు ఇచ్చి ఆ స్థానంలో మరొకరిని నియమించుకోవాలి.
- ప్రతీ కాలేజీలో సీనియర్ లెక్చరర్ను స్టూడెంట్ కౌన్సిలర్ గా నియమించుకోవాలి.
- విద్యార్థులకు రోజూ ఏ పాఠం చెప్పారో లెక్చరర్లు టీచింగ్ డైరీల్లో రాయాలి.
- ప్రతి కాలేజీలో ర్యాగింగ్ నిరోధానికి కమిటీ నియమించాలి.
- క్లాసులు జరిగే టైమ్లో క్లాస్ రూంలోకి ఎవరిని అనుమతించొద్దు. ఒకవేళ తల్లిదండ్రులను అనుమతించాలంటే నిర్దేశిత సమయంలోనే అనుమతించాలి.
- ఇంటర్ ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ప్రత్యేక మార్గ దర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం…ఇంటర్ బోర్డు
- ఇంటర్ బోర్డు గుర్తించిన జూనియర్ కాలేజీల్లోనే తరగతులు నిర్వహించాలి.
- క్వాలిఫైడ్ సిబ్బందితోనే కాలేజీలు నిర్వహించాలి. సిబ్బందికి కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయాలి.
- సిబ్బందిని మధ్యలో (ఏప్రిల్లోపు) తొలగించకూడదు. తొలగించాల్సి వస్తే ముందుగా నోటీసులివ్వాలి. వారి స్థానాలను భర్తీ చేయాలి.
- ప్రిన్సిపాల్ను మార్చాల్సి వస్తే ముందుగానే సదరు కాలేజీలు ఆ జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి అనుమతి తీసుకోవాలి.
- ఇంటర్ బోర్డు జారీ చేసే అకడమిక్ క్యాలెండర్ను ప్రతీ కాలేజీ పాటించాలి.
- రోజూ 3 గంటల కంటే ఎక్కువ సమయం అదనపు క్లాసులు తీసుకోరాదు.
- రెసిడెన్షియల్ కాలేజీల్లో కనీసం 8 గంటల పాటు విద్యార్థులకు నిద్రకు అవకాశం ఇవ్వాలి.
- ఉదయం తయారు కావడానికి, బ్రేక్ఫాస్ట్ కు గంటన్నర సమయం ఇవ్వాలి.
- మధ్యాహ్నం, రాత్రి భోజనానికి 45 నిమిషాల చొప్పున సమయమివ్వాలి.
- ప్రతి రోజూ స్పోర్ట్స్, రిక్రియేషన్ కార్యకలాపాలు నిర్వహించాలి. సాయంత్రం పూట గంట పాటు రిక్రియేషన్కు అవకాశం ఇవ్వాలి.
- విద్యార్థులకు సంబంధించి ఉపాధ్యాయులు టీచింగ్ డైరీలు నిర్వహించాలి.
- విద్యార్థుల హాజరు కనీసం 75 శాతం ఉండాలి.
- ప్రతి కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలి.