Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: జులై 2022

కరెంట్​ అఫైర్స్​: జులై 2022

అంతర్జాతీయం

మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌

Advertisement

బ్రిటన్‌కు చెందిన బయో మెడికల్‌ స్టూడెంట్​ ఖుషీ పటేల్‌ ‘మిస్‌ ఇండియా వరల్డ్‌వైడ్‌ -2022’ విజేతగా నిలిచారు. భారత్‌ బయట 29 ఏళ్లుగా ఈ అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. విజేతలను ‘ఇండియా ఫెస్టివల్‌ కమిటీ (ఐఎఫ్‌సీ)’ ప్రకటించింది. అమెరికాకు చెందిన వైదేహీ డోంగ్రే మొదటి రన్నరప్‌గాను, శ్రుతికా మనే రెండో రన్నరప్‌గా నిలిచారు.

జీ7 సమ్మిట్

జర్మనీలో జరగుతున్న జీ 7 శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యావరణ పరిరక్షణకు భారత్‌ పూర్తిగా కట్టుబడి ఉందని తెలిపారు. ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాను ఆర్థికంగా దెబ్బతీయాలని, ఉక్రెయిన్‌కు మద్దతివ్వాలని జీ7 దేశాధినేతలు తీర్మానించారు.

Advertisement

బంగ్లాలో పొడవైన రోడ్డు రైలు వంతెన

బంగ్లాదేశ్‌లో నిర్మించిన అతి పొడవైన వంతెనను ప్రధాని షేక్‌ హసీనా ప్రారంభించారు. పద్మ నదిపై 6.15 కి.మీ.ల పొడవునా ఈ రోడ్‌ – రైలు వంతెనను నాలుగు లేన్లతో నిర్మించారు. నైరుతి బంగ్లాదేశ్‌తో రాజధాని ఢాకా, ఇతర ప్రాంతాలను కలిపే ఈ వంతెనకు ప్రభుత్వం 3.6 బిలియన్‌ డాలర్లు వెచ్చించింది.

బ్రిటన్ ప్రధాని రాజీనామా

Advertisement

బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన పదవికి రాజీనామా చేశారు. పార్టీ నేతలను నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు పదవి నుంచి తప్పుకున్నాడు. కొత్త ప్రధాని ఎన్నికయ్యే వరకూ ఆపద్ధర్మ ప్రధానిగా ఆయనే కొనసాగనున్నారు. తదుపరి ప్రధాని రేసులో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ ముందున్నారు. అదే జరిగితే బ్రిటన్‌ ప్రధాని బాధ్యతలు చేపట్టే తొలి భారత సంతతి వ్యక్తిగా నిలవనున్నారు.

అమెరికా పౌరసత్వాల్లో భారత్‌కు రెండో స్థానం

ఈ ఏడాది జూన్‌ 15 వరకు 6,61,500 మందికి అమెరికా పౌరసత్వం మంజూరు చేస్తే వారిలో మెక్సికో తర్వాత భారతీయులు రెండో స్థానంలో ఉన్నారు. 12,928 మంది భారతీయులకి పౌరసత్వం లభించింది. 2021 ఆర్థిక సంవత్సరంలో 8,55,000 మందికి అమెరికా పౌరసత్వం దక్కింది.

Advertisement

ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ రద్దు

ఇంజ్రాయెల్​లో సంకీర్ణ ప్రభుత్వం విఫలం కావడంతో పార్లమెంట్​ రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. గత నాలుగేళ్లలో ఇలా ఎన్నికలు జరపడం ఇది ఐదోసారి. ప్రస్తుతం విదేశాంగమంత్రిగా ఉన్న యాయెర్‌ లాపిడ్‌ ఎన్నికలు జరిగే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగనున్నారు.

ఐఎస్‌ఎస్‌కు రష్యా సెలవు

Advertisement

ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా పశ్చిమ దేశాలతో ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి వైదొలగనున్నట్లు ప్రకటించింది. భూకక్ష్యలో సొంతంగా ఇలాంటి కేంద్రం నిర్మించడంపై దృష్టి పెట్టనున్నట్లు రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌ కాస్మోస్‌ అధిపతి యూరి బోరిసోవ్‌ తెలిపారు.

శ్రీలంక ప్రధానిగా దినేశ్‌ గుణవర్దెన

రాజపక్స కుటుంబానికి సన్నిహితుడైన మహాజన ఏక్‌సాథ్‌ పెరమున (ఎంఈపీ) పార్టీ నేత దినేశ్‌ గుణవర్దెన శ్రీలంక కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. అధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘె మొత్తం 18 మంది కేబినెట్‌ సహచరులతో ప్రమాణస్వీకారం చేశారు.

Advertisement

ఇటలీ ప్రధాని రాజీనామా

ఇటలీలో సంకీర్ణ సర్కారులోని కీలక మిత్రపక్షాల మద్దతు కోల్పోవడంతో ప్రధాని మారియో ద్రాగీ తన పదవికి రాజీనామా చేశారు. దేశాధ్యక్షుడు సెర్జియో మాటరెలాను కలిసి రాజీనామా సమర్పించారు. ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తదితర పరిణామాలతో ఇటలీ తీవ్రంగా ఇబ్బందులకు గురవుతోంది.

జాతీయం

సజయకు కేంద్ర సాహిత్య పురస్కారం

సామాజిక ఉద్యమకారిణి కె.సజయకు అనువాద రచనలో 2021 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం దక్కింది. ప్రముఖ రచయిత్రి భాషా సింగ్‌ హిందీలో రచించిన ‘అదృశ్య భారత్‌’ను సజయ ‘అశుద్ధ భారత్‌’ పేరిట తెలుగులోకి అనువదించారు. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికుల దుర్భర జీవన స్థితిగతులపై దీన్ని రచించారు.

Advertisement

ధ్రువ స్పేస్‌కు ‘ఇన్‌-స్పేస్‌’ గుర్తింపు

అంతరిక్ష కార్యకలాపాలు పర్యవేక్షించే ఇన్‌-స్పేస్‌ (ఇండియన్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌) రాకెట్‌ ప్రయోగాలు, అంతరిక్షానికి సంబంధించిన ఇతర కార్యకలాపాలు చేపట్టే ప్రైవేట్​ రంగ సంస్థలను గుర్తించే పని చేపట్టింది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ధ్రువ స్పేస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు ఇన్‌-స్పేస్‌ గుర్తింపు ఇచ్చింది.

సీబీడీటీ చైర్మన్‌గా నితిన్‌ గుప్తా

Advertisement

కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) కొత్త చైర్మన్‌గా నితిన్‌ గుప్తాను ప్రభుత్వం నియమించింది. 1986 బ్యాచ్‌ ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ కేడర్‌కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి గుప్తా. ప్రస్తుతం సీబీడీటీ బోర్డులో (దర్యాప్తు) సభ్యుడిగా ఉన్నారు. 2023 సెప్టెంబర్​లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.

ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా దినకర్‌ గుప్త

నేషనల్​ ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ (ఎన్‌ఐఏ) డైరెక్టర్‌ జనరల్‌గా పంజాబ్‌ మాజీ డీజీపీ, 1987 కేడర్‌ ఐపీఎస్‌ ఆఫీసర్​ దినకర్‌ గుప్త నియమితులయ్యారు. కేంద్ర హోం శాఖ ప్రతిపాదనకు నియామక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది.

Advertisement

మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ సభ్యుడిగా నారంగ్‌

స్టార్‌ షూటర్, ఒలింపిక్స్‌ పతక విజేత గగన్‌ నారంగ్‌ మిషన్‌ ఒలింపిక్‌ సెల్‌ సభ్యుడిగా ఎంపికయ్యాడు. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌)లో భాగమయ్యే క్రీడాకారులను గుర్తించడం ఈ సెల్‌ ప్రధాన విధి. 2024, 2028 ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యే క్రీడాకారులను గుర్తించి, ఎంపికచేయడం వీరి పని.

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌గా సినీశెట్టి

ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌ (2022) టైటిల్‌ను కర్ణాటకకు చెందిన సినీశెట్టి గెలుచుకున్నారు. ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో గ్రాండ్‌ ఫైనల్‌ జరిగింది. ఈ పోటీల్లో రాజస్థాన్‌కు చెందిన రూబల్‌ శెఖావత్‌ మొదటి రన్నరప్‌గా, యూపీ యువతి షినాటా చౌహాన్‌ ద్వితీయ రన్నరప్‌గా నిలిచారు.

మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ శిండే

శివసేన చీలిక వర్గం నేత ఏక్​నాథ్​ శిండే బలపరీక్షలో విజయం సాధించి , మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విజయం సాధించారు. శిండేకు 164 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. వ్యతిరేకంగా 99 మంది ఓటేశారు. ఈ సమావేశానికి స్పీకర్‌తో సహా 267 మంది హాజరు కాగా ఓటింగ్‌లో 263 మంది పాల్గొన్నారు.

భీమవరంలో అల్లూరి విగ్రహం

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా, అల్లూరి సీతారామరాజు 125వ జయంతి పురస్కరించుకుని పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొని 30 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు.

హిమాలయాల్లో మాంసాహార మొక్క

పశ్చిమ హిమాలయ ప్రాంతంలో ఒక అరుదైన మాంసాహార మొక్క వెలుగు చూసింది. ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని చమోలీ జిల్లాలో ఉన్న మండల్‌ లోయలో ఇది కనిపించినట్లు అధికారులు తెలిపారు. ఇది తన ఆకృతుల సాయంలో కీటకాలు, దోమల లార్వాలు, చిన్నపాటి కప్పలను ఒడిసిపట్టి తింటుంది.

‘డిజిట్‌ భారత్‌ వారోత్సవాలు – 2022’

‘డిజిట్‌ భారత్‌ వారోత్సవాలు -–2022’ను గాంధీనగర్‌లో ప్రధాని మోడీ ప్రారంభించారు. గత ఎనిమిదేళ్లలో నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.23 లక్షల కోట్ల నగదు బదిలీతో రూ.2.23 లక్షల కోట్లు ఆదా అయ్యాయన్నారు. డిజిటల్‌ ఇండియా భాషిణి, డిజిటల్‌ ఇండియా జెనిసిస్‌లను ఆయన ప్రారంభించారు.

68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలు

2020కి గానూ 68వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను ప్రకటించింది. తెలుగు దర్శకురాలు సుధా కొంగర తమిళంలో తెరకెక్కించిన ‘సూరరై పోట్రు’ జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఇందులో ప్రధాన పాత్రల్లో నటించిన సూర్య, అజయ్​ దేవగణ్​తో కలిసి ఉత్తమ నటుడిగా, అపర్ణా బాలమురళి ఉత్తమ నటిగా పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. ‘కలర్‌ ఫొటో’ తెలుగులో ఉత్తమ చిత్రంగా నిలిచింది.

15వ రాష్ట్రపతిగా ముర్ము

గిరిజన కుటుంబంలో పుట్టిన ద్రౌపదీ ముర్ము భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ఎన్‌.వి.రమణ పార్లమెంట్​ సెంట్రల్‌ హాలులో ప్రమాణం చేయించారు. అతిపిన్న వయసులో రాష్ట్రపతి పీఠాన్ని దక్కించుకున్న వ్యక్తిగా ద్రౌపది (64) ఘనత సాధించారు.

కుబేరుల జాబితాలో అదానీకి నాలుగో స్థానం

అదానీ గ్రూపు సంస్థల చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో నాలుగో స్థానాన్ని అధిరోహించారు. ఫోర్బ్స్‌ రియల్‌ టైమ్‌ కుబేరుల జాబితా ప్రకారం.. అదానీ సంపద 116.30 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.9,30,000 కోట్లు). టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ అగ్రస్థానంలో ఉండగా, ముకేశ్‌ అంబానీ 10వ స్థానం పొందారు.

అప్పుల్లో తమిళనాడు టాప్

రిజర్వ్‌ బ్యాంక్‌ నివేదిక ప్రకారం 2020 మార్చి నుంచి 2022 మార్చి వరకు తమిళనాడు రూ.6,59,868 కోట్ల అప్పుతో మొదటిస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్‌ రూ.6,53,307 కోట్లు, మహారాష్ట్ర రూ.6,08,999 కోట్లతో వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయని పేర్కొన్నారు. తెలంగాణ అప్పు రూ.3,12,191 కోట్లు కాగా, ఏపీ అప్పు రూ.3,98,903 కోట్లుగా ఉంది.

ప్రాంతీయం

అంకుర రాజధానిగా హైదరాబాద్‌

హైదరాబాద్‌ ప్రపంచ అంకురాల రాజధానిగా మారిందని రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన టీహబ్‌-2ను ప్రారంభిస్తూ సీఎం కేసీఆర్​ అన్నారు. ప్రతిభావంతులైన యువ ఆవిష్కర్తలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే దీని లక్ష్యం అన్నారు.

ఫ్లిప్‌కార్ట్‌తో తెలంగాణ సెర్ప్‌ ఒప్పందం

మహిళా సంఘాల ఉత్పత్తులను దేశ విదేశాల్లో మార్కెటింగ్‌ చేసేందుకు ఫ్లిప్‌కార్ట్‌తో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఒప్పందం కుదుర్చుకోవడం చరిత్రాత్మకమని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

బాదామి చాళుక్యుల కాలం విగ్రహాలు

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం మియ్యాపురంలోని సత్యమ్మ ఆలయంలో బాదామి చాళుక్యుల కాలం నాటి విగ్రహాలను గుర్తించారు. ఈ పురాతన శిల్పాలు బాదామి చాళుక్యుల కాలం, ఆనాటి శైలికి చెందినవని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్‌ రామోజు హరగోపాల్‌ తెలిపారు.

తెలంగాణ టాప్​

సులభతర వాణిజ్య విధానం (ఈవోడీబీ) ర్యాంకుల్లో 2020కి సంబంధించి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. పరిశ్రమల ప్రోత్సాహక, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐ ఐటీ) ఏటా ప్రకటించే సులభతర వాణిజ్యం ర్యాంకులను వెల్లడించింది.

రాష్ట్రంలో కొత్త మండలాలు

తొమ్మిది జిల్లాల్లో 13 కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 594 మండలాలుండగా, కొత్త వాటితో కలిపి మొత్తం సంఖ్య 607కి చేరనుంది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ జారీ చేయనుంది.

హైదరాబాద్‌ రైల్వేస్టేషన్లో ‘ఆజాదీకీ రైల్‌ గాడీ’

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం’లో భాగంగా దక్షిణ మధ్య రైల్వే ‘ఆజాదీకీ రైల్‌ గాడీ, ఔర్‌ స్టేషన్‌’ కార్యక్రమం ఏర్పాటు చేసింది.

వార్తల్లో వ్యక్తులు

పరమేశ్వరన్‌ అయ్యర్‌

నీతి ఆయోగ్‌ సీఈఓగా 1981 బ్యాచ్‌ యూపీ క్యాడర్‌ రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్​ పరమేశ్వరన్‌ అయ్యర్‌ నియమితులయ్యారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవిలో ఉండనున్నారు. పరమేశ్వరన్‌ అయ్యర్‌ ఇది వరకు కేంద్ర పారిశుద్ధ్య, గ్రామీణ తాగునీటి శాఖ కార్యదర్శిగా పనిచేశారు.

ఆకాశ్‌ అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెలికాం సేవల విభాగమైన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ చైర్మన్‌ బాధ్యతలను ముకేష్​ అంబానీ తన పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీకి అప్పగించారు. రిలయన్స్‌ జియో డైరెక్టర్ల బోర్డు చైర్మన్‌గా ఆకాశ్‌ అంబానీని నియమించే ప్రతిపాదనకు బోర్డు ఆమోదం తెలిపింది.

ఏఎస్‌ రాజన్‌

హైదరాబాద్‌లోని సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎస్‌వీపీఎన్‌పీఏ) డైరెక్టర్‌గా 1987 బ్యాచ్‌ బిహార్‌ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి ఏఎస్‌ రాజన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన కేంద్ర హోం శాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్‌బ్యూరోలో స్పెషల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. 2023 ఫిబ్రవరి 28 వరకు ఆయన కొనసాగనున్నారు.

తపన్‌కుమార్‌ డేకా

కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ) డైరెక్టర్‌గా 1988 బ్యాచ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి తపన్‌కుమార్‌ డేకా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ స్థానంలో ఉన్న 1984 అస్సాం క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అరవింద కుమార్‌ పదవీ కాలం పూర్తికావడంతో డేకాను నియమిస్తున్నారు.

పల్లోంజీ మిస్త్రీ

వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ ముంబయిలో అనారోగ్యంతో మరణించారు. 100 బిలియన్‌ డాలర్లకు పైగా నికర సంపద కలిగిన టాటా గ్రూప్‌లో 18.37 శాతం వాటాతో పల్లోంజీ మిస్త్రీ అతిపెద్ద మైనార్టీ వాటాదారుగా ఉన్నారు. 2016లో పద్మభూషణ్‌ పురస్కారంతో భారత ప్రభుత్వం ఆయన్ను సత్కరించింది.

సందీప్‌ కుమార్‌ గుప్తా

ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా తదుపరి చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా సందీప్‌ కుమార్‌ గుప్తాను ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో (ఐఓసీ) ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

షింజో అబె

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబె దారుణ హత్యకు గురయ్యారు. లిబరల్‌ డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారంలో ఉండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. అబె 2006లోనే ప్రధాని అయినా అనారోగ్యంతో ఏడాదికే రాజీనామా చేశాడు. 2012లో రెండోసారి ప్రధాని అయ్యాక ఎనిమిదేళ్లపాటు కొనసాగారు.

సందీప్‌ కుమార్‌ గుప్తా

ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్‌ ఇండియా తదుపరి చైర్మన్, సీఎండీగా సందీప్‌ కుమార్‌ గుప్తాను ఎంపిక చేశారు. ఆయన ప్రస్తుతం ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌లో (ఐఓసీ) ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గెయిల్‌ ప్రస్తుత సీఎండీ మనోజ్‌ జైన్‌ స్థానాన్ని సందీప్‌ భర్తీ చేయనున్నారు.

పి.సుశీల

మాజీ సీఎం రోశయ్య జయంతి సందర్భంగా హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో సుప్రసిద్ధ గాయని పి.సుశీలకు ‘రోశయ్య స్మారక జీవన సాఫల్య పురస్కారం’ ప్రదానం చేశారు. మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఆమెకు ఈ అవార్డును అందజేశారు.

ఆర్మండ్‌ డుప్లాంటిస్‌

స్వీడన్‌ పోల్‌ వాల్ట్‌ అథ్లెట్‌ ఆర్మండ్‌ డుప్లాంటిస్‌ ఇదివరకు తన పేరిటే ఉన్న ఔట్‌డోర్‌ ప్రపంచ రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌ మీట్‌లో అతను 6.16 మీటర్ల (20 అడుగుల 2.5 అంగుళాలు) ఎత్తు దూకి చాంపియన్‌గా నిలిచాడు.

తపన్‌ కుమార్‌ డేకా

కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ) డైరెక్టర్‌గా 1988 బ్యాచ్‌ హిమాచల్‌ప్రదేశ్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి తపన్‌ కుమార్‌ డేకా నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న 1984 అస్సాం క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి అరవింద కుమార్‌ పదవీకాలం ముగియడంతో.. డేకా నియామకానికి కేబినెట్‌ కమిటీ ఆమోదముద్ర వేసింది.

ఇందర్మిత్‌ గిల్‌

ప్రపంచ బ్యాంక్‌ తన ముఖ్య ఆర్థికవేత్త, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఇందర్మిత్‌ గిల్‌ను నియమించింది. కౌశిక్‌ బసు తర్వాత ప్రపంచ బ్యాంకులో ముఖ్య ఆర్థికవేత్తగా నియమితులైన రెండో భారత జాతీయుడు ఈయనే. 2022 సెప్టెంబరు 1 నుంచి గిల్‌ నియామకం అమల్లోకి వస్తుంది.

అమ్మంగి వేణు గోపాల్‌

తెలంగాణ సారస్వత పరిషత్​ ఆధ్వర్యంలో జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా.సి.నారాయణరెడ్డి 91వ జయంతి నిర్వహించారు. ఈ ఏడాది ప్రముఖ కవి, విమర్శకుడు డా.అమ్మంగి వేణుగోపాల్‌కు డా.సి.నారాయణరెడ్డి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. రూ.25 వేల నగదు, శాలువా, జ్ఞాపికతో సత్కరించారు.

కౌశిక్‌ రాజశేఖర

అమెరికాలోని హ్యూస్టన్‌ విశ్వవిద్యాలయంలో ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న భారతీయ సంతతికి చెందిన కౌశిక్‌ రాజశేఖర ప్రతిష్టాత్మక గ్లోబల్‌ ఎనర్జీ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. విద్యుత్​ ఉత్పాదక ఉద్గారాలను తగ్గించేటపుడు విద్యుత్​ రవాణా, శక్తిసామర్థ్య సాంకేతికతల రంగంలో అందించిన సేవలకు అవార్డు దక్కింది.

సయ్యద్‌ హఫీజ్‌

ప్రముఖ బిజినెస్‌ పత్రిక ఫోర్బ్స్‌ ఇండియా ప్రకటించిన ‘టాప్‌ 100 డిజిటల్‌ స్టార్స్‌’లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన సయ్యద్‌ హఫీజ్‌ 32వ స్థానంలో నిలిచారు. ఆయన యూట్యూబ్‌లో నిర్వహిస్తున్న ‘తెలుగు టెక్‌టట్స్‌’కు ఈ గుర్తింపు లభించింది.

వీవీఎస్‌ లక్ష్మణ్‌

ఐసీసీ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఐసీసీ చైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియకు ఆమోదం తెలిపింది. ఎన్నికలు నవంబర్​లో జరుగుతాయి. కొత్త చైర్మన్‌ డిసెంబరు 1 నుంచి రెండేళ్లు పదవిలో ఉంటాడు. వీవీఎస్‌ లక్ష్మణ్‌కు ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీలో చోటు దక్కింది. ఆటగాళ్ల ప్రతినిధిగా అతడు కమిటీలో ఉంటాడు.

స్పోర్ట్స్​

రంజీ చాంపియన్​ మధ్యప్రదేశ్‌

రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌ తొలిసారి చాంపియన్‌గా నిలిచింది. టోర్నీలో 41 సార్లు విజేతగా నిలిచిన ముంబయిని ఫైనల్లో ఓడించి ట్రోఫీ అందుకుంది. ఆదిత్య శ్రీవాత్సవ సారథ్యంలోని మధ్యప్రదేశ్‌ ఫైనల్లో 6 వికెట్ల తేడాతో ముంబయిని ఓడించింది.

జ్యోతి జోడికి గోల్డ్​ మెడల్​

ప్రపంచకప్‌ మూడో అంచె పోటీల్లో జ్యోతి సురేఖ ఆర్చరీలో రెండు పతకాలు సాధించింది. అభిషేక్‌ వర్మతో కలిసి కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో పసిడి నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్‌ పోటీల్లో ఈ విభాగంలో స్వర్ణం గెలిచిన తొలి భారత జోడీగా సురేఖ – అభిషేక్‌ రికార్డుల్లోకెక్కారు.

వింబుల్డన్‌ సెంట‌ర్‌ కోర్టుకు వందేళ్లు

వింబుల్డన్‌కే ప్రత్యేక ఆకర్షణగా మారిన సెంట‌ర్‌ కోర్టు 1922లో ప్రారంభమై వందేళ్లు పూర్తి చేసుకుంది. కోర్టు శత వసంత ఉత్సవాల సందర్భంగా తొలిసారి ఆ రోజు కూడా ఈ టోర్నీలో మ్యాచ్‌లు నిర్వహించారు. చెయిర్‌ అంపైర్‌ స్టాండ్‌ పక్కన ‘సెంట‌ర్‌ కోర్టు’, ‘100’ అనే పదాలు కనిపించాయి.

బాక్సింగ్ లో గోల్డ్​ మెడల్స్​

ఎలోర్డా కప్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నీలో భారత బాక్సర్లు గీతిక (48 కేజీలు), అల్ఫియా పఠాన్‌ (ప్లస్‌ 81 కేజీలు) గోల్డ్​ మెడల్స్​ సాధించారు. కజకిస్తాన్‌లో జూలై 4న ముగిసిన ఈ టోర్నీలో భారత్‌కు రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, పది కాంస్యాలతో కలిపి మొత్తం 14 పతకాలు లభించాయి.

నీరజ్‌ చోప్రాకు రజతం

భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో సిల్వర్​ మెడల్​ సాధించాడు. ఫైనల్లో 88.13 మీటర్ల దూరం ఈటెను విసిరి రెండో స్థానం సాధించాడు. డిఫెండింగ్‌ చాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా) పతక పోరులో 90.54 మీ. దూరంతో పసిడి పట్టేశాడు.

అథ్లెటిక్స్‌లో అమెరికా అగ్రస్థానం

ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌లో అమెరికా 13 స్వర్ణాలు, 9 రజతాలు, 11 కాంస్యాలు మొత్తం 33 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఇథియోపియా (4 స్వర్ణాలు, 4 రజతాలు, 2 కాంస్యాలు), జమైకా (2 స్వర్ణాలు, 7 రజతాలు, 1 కాంస్యం) వరుసగా రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నాయి.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం సక్సెస్​

ఇస్రో చరిత్రలో మొదటిసారిగా పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌ (పీఎస్‌ఎల్‌వీ) నాలుగో దశ భూమి చుట్టూ తిరుగుతూ ఉండేలా టెక్నాలజీతో రూపొందించిన నౌక షార్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లింది. ఇది కక్ష్యలో తిరుగుతూ మైక్రో గ్రావిటీ వాతావరణాన్ని సమకూర్చుకుని పరిశోధనలు చేపడుతుంది.

వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌ పరీక్ష విజయవంతం

ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే స్వల్పశ్రేణి క్షిపణి ‘వర్టికల్‌ లాంచ్‌ సర్ఫేస్‌ టు ఎయిర్‌ మిసైల్‌’ (వీఎల్‌-ఎస్‌ఆర్‌శామ్‌)ను భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఈ అస్త్రాన్ని ఒడిశాలోని సమీకృత పరీక్ష వేదిక (ఐటీఆర్‌)కు చేరువలోని ఒక యుద్ధనౌక నుంచి ప్రయోగించారు.

డీఆర్‌డీవో ప్రయోగం సక్సెస్​

స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన సెల్ఫ్​ డ్రైవింగ్​ విమానాన్ని డీఆర్​డీవో తొలిసారి కర్ణాటకలోని చిత్రదుర్గలో పరీక్షించింది. పూర్తిస్థాయి స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తూ, గాల్లోకి ఎగరడం, ప్రయాణం, సురక్షితంగా కిందకు దిగడం వంటి అన్ని పనులను అది విజయవంతంగా పూర్తి చేసుకుందని అధికారులు వెల్లడించారు.

చైనా రోబో ట్యాక్సి

చైనా దిగ్గజ టెక్నాలజీ సంస్థ బైడూ ‘అపోలో ఆర్‌టీ6’ పేరుతో సెల్ఫ్‌–డ్రైవింగ్‌ ట్యాక్సీని ఆవిష్కరించింది. ఇది ‘అపోలో గో’ యాప్‌ ఆధారంగా పనిచేస్తుందని చెబుతోంది. తనంతట తానే నడుపుకొనే ఈ ట్యాక్సీలో 38 రకాల సెన్సార్లు ఉంటాయి. 2023 నాటికి మార్కెట్లోకి తీసుకొచ్చే ఆలోచన ఉందని బైడూ చెబుతోంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!