తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో డీఎస్సీ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఉపాధ్యాయ నియామకాల పరీక్ష కొత్త తేదీలను ఎన్నికలు పూర్తయిన తర్వాతే..కొత్త సర్కారు కొలువుదీరిన తర్వాత ప్రకటించాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు సమాచారం. ఈనెల 20 నుంచి 30వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈసారి ఈ పరీక్షలను ఆన్ లైన్ విధానం ద్వారా నిర్వహించనున్నట్ల సంగతి తెలిసిందే. ముందుగా అనుకున్నట్లు నవంబర్ 20వ తారీఖు నుంచే నిర్వహించాలని భావించినప్పటికీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది.
నవంబర్ 30 అసెంబ్లీ ఎన్నికలు, డిసెంబర్ 6న ఎన్నికల ఫలితాలు ఉండటంతో ఈ కాలంలో పరీక్షలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారుతుందని విద్యాశాఖ భావించింది. ఒకవేళ పరీక్షలు నిర్వహించాలనుకుంటే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అనుమతులు తీసుకోవడం అంత సులభంగా కాదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి లోనే డీఎస్సీ పరీక్షల తేదీలను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంటే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత పరీక్షలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొత్తానికి డీఎస్సీ పరీక్ష కోసం వేచి చూస్తున్న అభ్యర్థులు మరింత కొంత కాలం నిరీక్షించాల్సిందే. కాగా 5089 టీఆర్టీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇది కూడా చదవండి: ఇలా ప్రిపేరయితే బోర్డు ఎగ్జామ్స్ లో ప్రతి సబ్జెక్ట్ లో 95 మార్కులు పక్కా
కాగా తెలంగాణ డీఎస్సీ దరఖాస్తుల స్వీకరణ ముగిసింది. మొత్తం 1,76,530 దరఖాస్తులు అన్ని జిల్లాల నుంచి వచ్చాయి. ముఖ్యంగా సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు అత్యధికంగా 60,190 అప్లికేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 6న డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా అదే నెల 20వ తేదీ నుంచి కూడా ఆన్ లైన్ ద్వారా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. కాగా దరఖాస్తుల గడువు ఈ నెల 21తో ముగిసింది. అయితే అభ్యర్థుల వినతి మేరకు ఈ గడువును మరో వారం పాటు పొడిగించారు. పొడిగించిన దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసింది. గడువు తేదీ ముగిసిన తర్వాత మొత్తంగా 1,79, 297 మంది అభ్యర్థుల ఫీజు చెల్లించినట్లు అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు 1.76లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు గుర్తించారు. ఇక డీఎస్సీ పరీక్షలను జనవరి చివరి వారం లేదా ఫిబ్రవరి మొదటి వారంలో నిర్వహించే వీలుందని అధికారులు చెబుతున్నారు.