అంతర్జాతీయం
మలేసియా రాజుగా ఇస్కందర్
మలేసియా కొత్త రాజుగా 65 ఏళ్ల సుల్తాన్ ఇబ్రహీం ఇస్కందర్ ప్రమాణస్వీకారం చేశారు. మలేసియాలోని జోహోర్ రాష్ట్రాన్ని పాలించిన ఈయన.. వంతులవారీ రాజరిక వ్యవస్థలో భాగంగా కొత్త రాజయ్యారు. పట్టాభిషేక కార్యక్రమం తర్వాత జరగనుంది.
ప్రపంచ ఉత్తమ నగరాల్లో ముంబై
‘టైమ్ ఔట్’ విడుదల చేసిన ప్రపంచంలో టాప్ నగరాల జాబితాలో ముంబై పన్నెండో స్థానంలో ఉంది. జాబితాలో న్యూయార్క్, కేప్టౌన్ , లండన్ , బెర్లిన్ , మ్యాడ్రిడ్ మొదటి ఐదు స్థానాలను దక్కించుకున్నాయి.
అవినీతి ర్యాంకింగ్
ప్రపంచంలోని అత్యంత అవినీతి, తక్కువ అవినీతి దేశాల జాబితా విడుదలైంది. 180 దేశాల జాబితాలో అవినీతి ఎక్కువగా ఉన్న దేశాల్లో సోమాలియా, సిరియా, యెమెన్ ఉన్నాయి. అదే సమయంలో, అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో డెన్మార్క్, న్యూజిలాండ్, ఫిన్లాండ్ ఉన్నాయి. భారత్ 93వ స్థానంలో ఉంది.
ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ అర్నాల్ట్
ఫోర్బ్స్ మ్యాగజైన్ రూపొందించిన రియల్-టైమ్ బిలియనీర్స్ జాబితాలో బెర్నార్డ్ అర్నాల్ట్ ప్రపంచ కుబేరుడిగా మారారు. టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ను అధిగమించి అగ్రస్థానానికి చేరారు. అర్నాల్ట్, ఆయన కుటుంబం నికర విలువ 207.8 బి.డాలర్లకు చేరింది. టెస్లా సీఈఓ నికర విలువ 204.7 బి.డాలర్లుగా ఉంది.
ఇరాన్ వీసీ ఫ్రీ ప్రోగ్రాం
భారతీయులకు వీసా మినహాయింపు కల్పించిన దేశాల వరుసలో ఇరాన్ చేరింది. ఇరాన్ దేశంలో పర్యాటక రంగాన్ని బాగా అభివృద్ధి చేయడానికి వీసా ఫ్రీ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు ఇరాన్ పర్యాటక మంత్రి తెలిపారు. భారత్తో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, మలేషియాతో సహా 32 ఇతర దేశాల కోసం వీసా-ఫ్రీ ప్రోగ్రామ్ను ఆమోదించింది.
మాల్దీవుల పర్యాటకుల జాబితాలో ఐదో స్థానం
ఇరు దేశాల మధ్య విభేదాలతో భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ ఏడాది జనవరి 28వ తేదీ నాటికి మాల్దీవులను అత్యధికంగా సందర్శించిన పర్యాటకుల సంఖ్య పరంగా రష్యా(18,561 మంది) తొలి స్థానానికి చేరింది. తర్వాతి స్థానాల్లో ఇటలీ, చైనా, బ్రిటన్, భారత్(13,989) నిలిచాయి.
ఫ్రెంచ్ నేర్చుకునేందుకు ప్రత్యేక ప్రోగ్రామ్
భారత విద్యార్థులు ఫ్రెంచ్ భాష నేర్చుకొనేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్ ‘క్లాసెస్ ఇంటర్నేషనలేస్’అనే ప్రత్యేక ప్రోగ్రామ్ని ప్రారంభించారు. దీని ద్వారా ఏడాదిపాటు ఫ్రాన్స్లో ఉండి ఫ్రెంచ్ నేర్చుకోవచ్చు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ప్రధాని మోడీ, అధ్యక్షుడు మెక్రాన్ ల సంయుక్త ప్రకటనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
పాక్ ప్రధానిగా షెహబాజ్
పాకిస్థాన్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనను నామినేట్ చేస్తూ పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) నిర్ణయం తీసుకుంది. ప్రధాన మంత్రి పదవి రేసు నుంచి తాను తప్పుకొంటున్నట్లు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ స్పష్టం చేశారు.
పవర్ఫుల్ పాస్పోర్టుల జాబితా
హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఫ్రాన్స్ పాస్పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. భారత పాస్పోర్టు గతేడాది కంటే ఒక స్థానం పడిపోయి 85వ స్థానంలో ఉంది. భారత్ వీసా లేకుండా 62 దేశాలకు ప్రయాణించే వీలుంది.
ఆర్థిక మాంద్యంలోకి జపాన్
జపాన్ మాంద్యంలోకి జారిపోయింది.2023 చివరి త్రైమాసికంలో జీడీపీ క్షీణతతో, ఆర్థిక వ్యవస్థ పరిమాణం పరంగా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న జపాన్.. అమెరికా, చైనా, జర్మనీల తర్వాత నాలుగో స్థానానికి పడిపోయింది. భారత్ ఐదో స్థానంలో ఉంది.
ప్రపంచ అవినీతి సూచీ
ప్రపంచ అవినీతి సూచీలో భారత్ గతేడాది (2022) కంటే ఈ ఏడాది (2023) ఎనిమిది స్థానాలు దిగువకు పడిపోయింది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ రిపోర్టు ప్రకారం–2023 ఏడాదికిగాను మొత్తం 180 దేశాల్లో భారత్ 93వ స్థానంలో నిలిచింది. 2022లో భారత్ ర్యాంక్ 85గా ఉంది.
జాతీయం
పద్మ అవార్డులు 2024
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది వివిధ రంగాలకు చెందిన మొత్తం 132 మందికి ‘పద్మ’ పురస్కారాలు ప్రకటించింది. ఇందులో 5 పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీలు ఉన్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సినీనటుడు చిరంజీవిలకు పద్మవిభూషణ్ వరించింది. తెలంగాణ నుంచి కళారంగం విభాగంలో ఎ.వేలు ఆనందాచారి, దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, సాహిత్యం, విద్యారంగం నుంచి కేతావత్ సోమ్లాల్, కూరెళ్ల విఠలాచార్య ఉన్నారు.
టాప్లో ఒడిశా శకటం
రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలోని ‘కర్తవ్య్ పథ్’లో ప్రదర్శించిన శకటాల్లో ఒడిశా శకటానికి మొదటి బహుమతి దక్కింది. ప్రజల ఎంపిక విభాగంలో గుజరాత్ శకటం ప్రథమ స్థానాన్ని పొందింది. న్యాయ నిర్ణేతల విభాగంలో ఒడిశా మొదటి స్థానం కైవసం చేసుకోగా.. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ప్రజా ఎంపిక విభాగంలో గుజరాత్కు ప్రథమం స్థానం దక్కింది. ఉత్తర్ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
బిహార్ సీఎంగా తొమ్మిదోసారి నీతీశ్
బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే కూటమిలో చేరారు. 18 నెలల క్రితం వదిలేసిన కూటమిలోకి మళ్లీ వచ్చేందుకు వీలుగా తన పదవికి రాజీనామా చేసి, కాసేపట్లోనే తిరిగి సీఎంగా ప్రమాణం చేశారు. బిహార్ సీఎంగా ఆయన రికార్డుస్థాయిలో తొమ్మిదోసారి బాధ్యతలు చేపట్టినట్లయింది.
ఆర్థికసంఘానికి నూతన సభ్యులు
అరవింద్ పనగాడియా నేతృత్వంలో ఏర్పాటైన 16వ ఆర్థికసంఘం సభ్యులుగా నలుగురు నియమితులయ్యారు. అజయ్ నారాయణ్ ఝా, ఏనీ జార్జ్ మాథ్యూ, నిరంజన్ రాజాధ్యక్ష, సౌమ్యకాంతి ఘోష్లను ఆర్థికసంఘం పూర్తికాల సభ్యులుగా నియమిస్తూ కేంద్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
డార్క్స్కై పార్క్గా పెంచ్ టైగర్ రిజర్వ్
దేశంలోనే తొలి డార్క్స్కై పార్క్(కృత్రిమ కాంతి కాలుష్యాన్ని నియంత్రించే అడవి)గా మహారాష్ట్రలోని పెంచ్ టైగర్ రిజర్వ్(పీటీఆర్) అరుదైన గుర్తింపు సాధించింది.
ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న
కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. తాజా ప్రకటనతో ఈ ఏడాది మొత్తం ఐదుగురిని ఈ పురస్కారం వరించింది. అంతకుముందు ఎల్కే అద్వాణీ, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకుర్కు ‘భారతరత్న’ ప్రకటించించారు.
దేశంలో 718 మంచు చిరుతలు
దేశంలో మొత్తం 718 మంచు చిరుతలు ఉన్నట్లు ‘వైల్డ్లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ తొలిసారి నిర్వహించిన శాస్త్రీయ గణనలో తేలింది. 2019 నుంచి 2023 వరకు నాలుగేళ్లపాటు మంచు చిరుతల శాస్త్రీయ గణన జరిగింది. అందులో అత్యధికంగా లద్దాక్లో 477 చిరుతలు ఉన్నట్లు తేలింది.
తమిళ సినీ హీరో విజయ్ కొత్త పార్టీ
ప్రముఖ తమిళ సినీ హీరో విజయ్ రాజకీయ పార్టీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ పేరును ‘తమిళగ వెట్రి కళగం’గా పేర్కొన్నారు. అంటే ‘తమిళనాడు విజయ పార్టీ’ అని దానర్థం. త్వరలోనే పార్టీ జెండా, ఎజెండాలను వెల్లడిస్తానని తెలిపారు.
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు
వివాదాస్పద ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా కీలక అంశాలతో ఉన్న బిల్లును సీఎం పుష్కర్ సింగ్ ధామీ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లు ఆమోదం పొందితే స్వాతంత్య్రం తర్వాత ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది.
దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్తగా దాదాపు రెండు కోట్ల మంది(18- నుంచి 29 వయసు) యువ ఓటర్లను జాబితాలో చేర్చినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. గత లోక్సభ ఎన్నికల కంటే ఇప్పుడు ఆరు శాతం అధికంగా ఓటర్లు నమోదైనట్లు తెలిపింది.
పీఎం సూర్య ఘర్.. ముఫ్త్ బిజ్లీ యోజన
దేశంలోని కోటి ఇళ్లలో వెలుగులు నింపే లక్ష్యంతో ‘పీఎం సూర్య ఘర్.. ముఫ్త్ బిజ్లీ యోజన’ను ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. పథకంలో భాగంగా ప్రతి నెలా 300 యూనిట్ల వరకు విద్యుత్తు ఉచితంగా అందనుంది. ఈ ప్రాజెక్టుకు రూ.75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతున్నారు.
పంటల బీమాకు ప్రత్యేక పోర్టల్
ప్రధాన మంత్రి ఫసల్ (పంట) బీమా పథకంతోపాటు పలు బీమా ఉత్పత్తులు, సేవలను రైతులకు డిజిటల్ పద్ధతిలో అందించడానికి ‘సారథి’ పోర్టల్ను ప్రారంభించారు. పంటల బీమా ఫిర్యాదులను పరిష్కరించడానికి కిసాన్ రక్షక్ పోర్టల్నూ, 14447 నంబరు హెల్ప్ లైన్నూ ప్రారంభించారు.
పట్టాలెక్కనున్న ‘స్లీపర్ వందే భారత్’
దేశంలోనే మొట్టమొదటి ‘స్లీపర్ వందే భారత్’ దేశంలోని ప్రధాన మార్గాలైన ఢిల్లీ-–హౌరా, ఢిల్లీ–-ముంబై మధ్య నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం 41 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 39 రైళ్లు ట్రాక్పై నడుస్తుండగా, రెండు రైళ్లు రిజర్వ్లో ఉన్నాయి. మొదటి స్లీపర్ వందే భారత్ రైలును ఐసీఎఫ్ చెన్నై తయారు చేయనుంది.
విశాఖలో ‘మిలాన్’ మెరుపులు
2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2022ని వరుసగా నిర్వహించి ప్రపంచ దేశాలకు సత్తాచాటిన విశాఖ మహా నగరం.. తాజాగా ప్రతిష్టాత్మక మిలాన్–2024 విన్యాసాలకు ఆతిథ్యం ఇస్తుంది. మిలాన్–2024 విన్యాసాలను ‘కమరడెరీ(స్నేహం)–కొహెషన్ (ఐక్యత)–కొలాబరేషన్(సహకారం)’ అనే థీమ్తో నిర్వహిస్తున్నారు.
గిన్నిస్ రికార్డుకు కథక్ నృత్యం
ఒకే సమయంలో 1,484 కళాకారులు కలిసి మధ్యప్రదేశ్లోని ఖజురహో దేవాలయ ప్రాంగణంలో కథక్ నృత్యాన్ని ప్రదర్శించి గిన్నిస్ రికార్డ్ సాధించారు. 50వ నాట్య ఉత్సవాల్లో వీరందరు ‘రాగ బసంత్’ అనే పాటకు 20 నిమిషాలు డ్యాన్స్ వేశారు.
మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్స్
మహారాష్ట్రలో విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఆ రాష్ట్ర శాసనసభ బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రజనాభాలో మరాఠాలు 28 శాతం మంది ఉన్నారు. తమిళనాడులో 69 శాతం, హరియాణాలో 67 శాతం, రాజస్థాన్లో 64 శాతం, బిహార్లో 69 శాతం, గుజరాత్లో 59 శాతం, పశ్చిమబెంగాల్లో 55 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
భారత్ కంపెనీల్లో ‘రిలయన్స్’ టాప్
భారత్లో అత్యంత విలువైన 500 ప్రైవేటు కంపెనీల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) మొదటిస్థానంలో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ విలువ రూ.15.6 లక్షల కోట్లు (ప్రస్తుత విలువ రూ.19.65 లక్షల కోట్లు). టీసీఎస్ రూ.12.4 లక్షల కోట్లతో రెండో స్థానంలో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ రూ.11.3 లక్షల కోట్లతో మూడో స్థానంలో ఉన్నాయి.
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ లోక్సభ ఎన్నికల వేళ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, సమాచార హక్కుకు విఘాతం కలిగిస్తోందంటూ పేర్కొంది. 2018లో ఎన్డీఏ సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
పిల్లలకు బ్లూ ఆధార్ కార్డ్
ఆధార్ కార్డును దేశంలోని అందరికీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది. అయితే బ్లూ ఆధార్ కార్డును దేశంలో ఐదేళ్ల కంటే తక్కువ వయసు కలిగిన పిల్లలకు జారీ చేస్తారు. ఇది నీలి రంగులో ఉన్న కారణంగానే దీనిని బ్లూ ఆధార్ కార్డు అని అంటారు.
ప్రాంతీయం
‘నంది’ స్థానంలో ‘గద్దర్’ పురస్కారాలు
రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అందజేసే ‘నంది’ పురస్కారాలను ఇకపై ‘ప్రజాయుద్ధనౌక గద్దర్’ పేరుతో ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. సినిమా, టీవీ, రంగస్థల కళాకారులు, కవులకు వాటిని ప్రదానం చేస్తామన్నారు.
టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్రెడ్డి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు (టీఎస్పీఎస్సీకి) చైర్మన్గా మాజీ డీజీపీ ఎం.మహేందర్రెడ్డి, సభ్యులుగా అనితా రాజేంద్ర, యరబాడి రామమోహనరావు, పాల్వాయి రజినీకుమారి, ప్రొఫెసర్ అమీరుల్లా ఖాన్, నర్రి యాదయ్య బాధ్యతలు స్వీకరించారు.
హైదరాబాద్లో డ్రోన్ పోర్ట్
హైదరాబాద్ పరిసరాల్లో 20 ఎకరాల్లో డ్రోన్ పోర్ట్ నిర్మాణం కోసం సీఏం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్సీ)తో డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణపై తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ అవగాహన ఒప్పందం చేసుకుంది.
‘పద్మశ్రీ’ గ్రహీతలకు రూ.25 లక్షల నజరానా
పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల నజరానా, ప్రతినెలా రూ.25 వేల పింఛను అందిస్తుందని ప్రకటించారు.
ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా రాజయ్య
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను ప్రభుత్వం నియమించింది. కమిషన్ సభ్యులుగా ఎం.రమేష్, సంకేపల్లి సుధీర్ రెడ్డి, నెహ్రూ నాయక్ మాలోత్ ను నియమిస్తూ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు.
వక్ఫ్ బోర్డు చైర్మన్
వక్ఫ్ బోర్డు చైర్మన్గా హైదరాబాద్కు చెందిన సయ్యద్ అజ్మతుల్లా హుసేని ఎన్నికయ్యారు. చైర్మన్గా పోటీలో ఆయన ఒక్కరే ఉండటం, డైరెక్టర్లంతా మద్దతు పలకడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది.
వార్తల్లో వ్యక్తులు
సుద్దాల అశోక్ తేజ
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రముఖ సినీగీత రచయిత, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్తేజకు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం ‘తెలుగు భాషా రత్న’ జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించింది. తెలుగు భాషాభివృద్ధికి చేస్తున్న సేవలకుగాను ఈ పురస్కారం అందజేయనుంది.
చంపయ్ సోరెన్
జార్ఖండ్ కొత్త సీఎంగా చంపయ్ సోరెన్ ఖరారయ్యారు. జేఎంఎం సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా చంపయ్ సోరెన్ను ఎన్నుకున్నట్లు జార్ఖండ్ పీసీసీ అధ్యక్షుడు రాజేశ్ ఠాకుర్ తెలిపారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణన్కు సీఎం హేమంత్ సోరెన్ రాజీనామా లేఖ అందజేశారని వెల్లడించారు.
తన్మయ్ అగర్వాల్
రంజీ ట్రోఫీలో హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (323 బ్యాటింగ్; 160 బంతుల్లో 33×4, 21×6) ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ చేశాడు. జెన్ నెక్స్ట్ మైదానంలో అరుణాచల్ ప్రదేశ్తో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ మ్యాచ్ లో ఈ రికార్డ్ నమోదు అయింది.
మాడిసన్ మార్ష్
కొలరాడోకు చెందిన 22 ఏళ్ల మాడిసన్ మార్ష్ మిస్ అమెరికా 2024 అందాల పోటీల్లో విజేతగ నిలిచి కిరీటాన్ని దక్కించుకుంది.ఆమె ఎయిర్ఫోర్స్ అధికారిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే మిస్ అమెరికా టైటిల్ గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
హాగే గాంగోబ్
నమీబియా అధ్యక్షుడు హాగే గాంగోబ్ క్యాన్సర్తో మరణించారు. దేశ రాజధాని విండ్హక్లోని లేడీ పోహంబా ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. 2015లో అధ్యక్షుడిగా ఎన్నికైన హాగే గాంగోబ్ అప్పటి నుంచి దేశాన్ని పాలిస్తున్నారు.
అనంత రవితేజ
అసాధారణ ప్రతిభావంతులకు అమెరికా ప్రభుత్వం మంజూరు చేసే ఈబీ-1 (ఐన్స్టీన్ వీసా) వీసా తిరుపతి యువకుడికి లభించింది. వాషింగ్టన్లోని ఆపిల్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్గా అనంత రవితేజ పనిచేస్తున్నారు.
మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
305 బిలియన్ డాలర్ల ఆస్తులతో వాల్టన్ కుటుంబాన్ని దాటి 2023లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రాజ కుటుంబం అవతరించింది. ఆయన సంపద విలువ అక్షరాలా రూ.25,38,667 కోట్లు.
నిఖత్ జరీన్
స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో పసిడిపై ఆశలు రేపిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ రజతం ఖాతాలో వేసుకుంది. మహిళల 50 కేజీల విభాగం ఫైనల్లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్ నిఖత్ 2-–3 తేడాతో జూనియర్ ఆసియా ఛాంపియన్ సబీన (ఉజ్బెకిస్థాన్) చేతిలో ఓడింది.
అజిత్ మిశ్ర
బ్రిటన్లోని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది అజిత్ మిశ్రకు ప్రతిష్టాత్మక ‘ఫ్రీడమ్ ఆఫ్ ది సిటీ ఆఫ్ లండన్’ అవార్డు దక్కింది. యూకే, ఇండియా లీగల్ పార్ట్నర్షిప్ (యూకేఐఎల్పీ)కు వ్యవస్థాపక అధ్యక్షుడైన అజిత్ అక్కడ అందించిన న్యాయ, ప్రజాసేవలకు గుర్తింపుగా జనవరి 23న ఈ అవార్డు ప్రదానం చేశారు.
మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
305 బిలియన్ డాలర్ల ఆస్తులతో వాల్టన్ కుటుంబాన్ని దాటి 2023లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ రాజ కుటుంబం అవతరించింది. ఆయన సంపద విలువ అక్షరాలా రూ.25,38,667 కోట్లు.
గీతిక కౌల్
సైన్యానికి చెందిన కెప్టెన్ గీతిక కౌల్ చరిత్ర సృష్టించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్లో విధులు నిర్వర్తించనున్న తొలి మహిళా మెడికల్ ఆఫీసర్గా నిలిచారు. పూర్తిగా మంచుతో నిండి ఉండే సియాచిన్లో (సముద్ర మట్టానికి దాదాపు 15,500 అడుగుల ఎత్తులో) విపరీతమైన చలి ఉంటుంది.
నరేంద్ర మోదీ
దేశంలోనే అత్యుత్తమ ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచారు. 44 శాతం ప్రజాదరణతో ఆయన అగ్రస్థానం సాధించారు. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో15 శాతంతో వాజ్పేయీ రెండో స్థానంలో, 14శాతంతో ఇందిరా గాంధీ మూడో స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రుల జాబితాలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అగ్ర స్థానంలో నిలిచారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో ఉన్నారు.
డాక్టర్ సమీర్ షా
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ) నూతన చైర్మన్గా తొలిసారి భారతీయ మూలాలున్న డాక్టర్ సమీర్ షా ఎంపికయ్యారు.72 ఏళ్ల సమీర్ భారత్లోని ఔరంగాబాద్లో జన్మించారు. 1960లో బ్రిటన్కు వలస వెళ్లారు. బ్రిటన్ రాజు చార్లెస్–3 ఈ వారమే సంబంధిత ఎంపిక ప్రక్రియకు ఆమోదముద్ర వేశారు.
శశిథరూర్
ప్రముఖ రచయిత, రాజకీయ నాయకుడు శశిథరూర్ ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమం ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకున్నారు. ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు జెరార్డ్ లాంచర్ షెవాలి డెలా లిజియన్ డి’హానర్ను థరూర్కు బహూకరించారు.
అశ్వత్ కౌశిక్
భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్ కౌశిక్ స్టాటాస్ ఓపెన్ చెస్ టోర్నీలో పోలెండ్ గ్రాండ్మాస్టర్ జాక్ స్టోపాకు షాకిచ్చాడు. క్లాసికల్ చెస్లో పిన్న వయసులో గ్రాండ్మాస్టర్ను ఓడించిన ఆటగాడిగా అశ్వత్ (8 సంవత్సరాల 6 నెలల 11 రోజులు) ఘనత సాధించాడు.
స్పోర్ట్స్
టెస్టుల్లో నంబర్వన్ బౌలర్
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి ఈ ఘనత అందుకున్నాడు. భారత్ నుంచి ఓ ఫాస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానం సాధించడం ఇదే మొదటిసారి. ఐసీసీ బౌలర్ ర్యాంకింగ్స్లో బిషన్ సింగ్ బేడి, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా తర్వాత నంబర్వన్ బౌలర్ అయ్యాడు.
సెమిస్లో నిఖత్
రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్ స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నమెంట్లో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. మహిళల 50 కేజీల క్వార్టర్ఫైనల్లో ఆమె 5-–0తో వాస్సిలా (ఫ్రాన్స్)ను ఓడించింది. ఈ బౌట్లో నిఖత్కు ప్రత్యర్థి నుంచి గట్టిపోటీ ఎదురైంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్
ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ ఇటలీ కుర్రాడు జనిక్ సినర్ గెలుచుకున్నాడు. ఫైనల్లో మెద్వెదెవ్పై అతడు పైచేయి సాధించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ (మహిళలు)ను సబలెంక (బెలారస్) సొంతం చేసుకుంది. ఫైనల్లో సబలెంక 6–-3, 6–-2తో కిన్వెన్ జెంగ్ (చైనా)పై విజయం సాధించింది.
రోహన్ బోపన్న రికార్డు
అత్యంత పెద్ద వయసులో గ్రాండ్స్లామ్ ట్రోఫీ గెలిచిన ఆటగాడిగా భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న రికార్డు సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్ (ఆస్ట్రేలియా)తో కలిసి అతడు ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల డబుల్స్ టైటిల్ చేజిక్కించుకున్నాడు. 43 ఏళ్ల బోపన్నకు పురుషుల డబుల్స్లో ఇదే తొలి గ్రాండ్స్లామ్ టైటిల్.
అండర్-–19 చాంపియన్
అండర్-19 ప్రపంచకప్2024 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఫైనల్లో టీమ్ ఇండియా యువ జట్టు 79 పరుగుల తేడాతో ఆసీస్ టీమ్పై ఓడిపోయింది. ఆస్ట్రేలియా స్కోర్ 253/7, భారత్ మాత్రం 174 పరుగుకే ఆలౌటైంది. అండర్-19 వన్డే ప్రపంచకప్ను ఆస్ట్రేలియా నాలుగోసారి సాధించింది.
టెస్టుల్లో నంబర్వన్ బౌలర్
టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తొలిసారి ఈ ఘనత అందుకున్నాడు. భారత్ నుంచి ఓ ఫాస్ట్ బౌలర్ ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానం సాధించడం ఇదే మొదటిసారి.
ప్రపంచకప్ షూటింగ్లో గోల్డ్
10 మీటర్ల షూటింగ్ ప్రపంచకప్లో ఎయిర్ పిస్టల్ జూనియర్ అమ్మాయిల వ్యక్తిగత విభాగంలో స్వర్ణ, రజతాలు భారత్ ఖాతాలోనే చేరాయి. 8 మంది తలపడ్డ ఫైనల్లో దేవాన్షి ధామ (240 పాయింట్లు), లక్షిత (238) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు.
స్విమ్మింగ్లో ప్రపంచ రికార్డు
ప్రపంచ అక్వాటిక్స్ చాంపియన్షిప్లో పురుషుల 100 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది.దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 4*100 మీటర్ల రిలే ఫైనల్లో చైనా స్విమ్మర్ పాన్ జాన్లె తన అంచెను 46.80 సెకన్లలో పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.
సైన్స్ అండ్ టెక్నాలజీ
సూపర్ కంప్యూటర్గా బ్రెయిన్
2016లో ఎలన్ మస్క్ ప్రారంభించిన ‘న్యూరాలింక్’ ప్రాజెక్టులో భాగంగా బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ సాంకేతికత(బీసీఏ)ను మానవులపై తొలిసారి ప్రయోగించినట్లు ప్రకటించారు. ఓ వ్యక్తి మెదడులో చిప్ను అమర్చామని, ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నాయని వెల్లడించారు.
భారత్కు ఎంక్యూ9-బీ రక్షణ
భారత్కు అత్యాధునిక సామర్థ్యాలున్న 31 ఎంక్యూ9-బీ డ్రోన్లు అందజేసేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం కింద సముద్రంపై నిఘా కోసం 15 సీ గార్డియన్ డ్రోన్లు, పదాతి దళం, వాయుసేన కోసం 16 స్కై గార్డియన్లను భారత్ దాదాపు 4 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయనుంది.
జీఎస్ఎల్వీ ఎఫ్14 ప్రయోగం సక్సెస్
ఇస్రో ప్రతిష్టాత్మంగా చేపట్టిన జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ఫిబ్రవరి 17న షార్ నుంచి ఇన్శాట్-3డీఎస్ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లింది. దీంతో వాతావరణ అంచనా, విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన, భూమి, సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులపై అధ్యయనం చేయనుంది.