HomeLATESTగ్రూప్​ 1 ప్రిలిమ్స్​ సక్సెస్​ ప్లాన్​

గ్రూప్​ 1 ప్రిలిమ్స్​ సక్సెస్​ ప్లాన్​

రాష్ట్ర స్థాయిలో టాప్​ సర్వీస్​ అయిన గ్రూప్​1 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ ఇటీవలే నోటిఫికేషన్​ రిలీజ్​ చేసింది. ప్రిలిమ్స్​ మే లేదా జూన్​ లో నిర్వహిస్తామని బోర్డు తెలిపింది. ఇంకా ప్రిలిమ్స్​ పరీక్షకు సుమారు 100 రోజులు సమయం ఉంది. ఈ సమయంలో ప్రిలిమ్స్​ తో పాటు మెయిన్స్​కు ఉమ్మడిగా ఎలా ప్రిపేర్​ అవ్వాలో ఒక ప్లాన్​ ప్రకారం ముందుకెళ్లాలి. లక్షల్లో పోటీ ఉండే ఎగ్జామ్​కు గ్రాడ్యుయేట్ల నుంచి పీహెచ్‌డీ స్కాలర్స్‌ వరకు ఎంతో మంది ప్రతిభావంతులు పోటీ పడుతుంటారు. 503 పోస్టులతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. దాని స్థానంలో 563 పోస్టుల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ప్రిలిమ్స్‌లో గట్టెక్కేందుకు సిలబస్, ప్రిపరేషన్‌ ప్రణాళిక గురించి తెలుసుకుందాం…

Advertisement

ప్రాథమిక(ప్రిలిమినరీ) పరీక్షను వచ్చే మే లేదా జూన్‌ నెలల్లో, ప్రధాన(మెయిన్‌) పరీక్షను సెప్టెంబరు లేదా అక్టోబరులో నిర్వహిస్తామని వెల్లడించింది. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14న సాయంత్రం 5 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కొత్త అభ్యర్థులతో పాటు గతంలో గ్రూప్‌-1 (4/22 నోటిఫికేషన్‌)కు దరఖాస్తు చేసుకున్నవారూ పరీక్షలు రాయాలంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని కమిషన్‌ స్పష్టం చేసింది.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్​ ఎగ్జామ్​ మే లేదా జూన్​లో, మెయిన్స్​ పరీక్ష సెప్టెంబర్ లేదా అక్టోబర్​లో నిర్వహిస్తారు. పూర్తి సమాచారం కోసం www.tspsc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

ఎగ్జామ్​ ప్యాటర్న్​: గ్రూప్​ 1 పరీక్ష రెండంచెల్లో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమ్స్​ ఇందులో నుంచి 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్స్​కు ఎంపిక చేస్తారు. ప్రాథమిక(ప్రిలిమినరీ) పరీక్ష ఆబ్జెక్టివ్‌ టైప్‌లో జరుగుతుంది. ఇందులో 150 మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. మెయిన్స్​ డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. జనరల్‌ ఇంగ్లీష్‌ పరీక్ష 150 మార్కులకు మూడు గంటలు ఉంటుంది. ఇది కేవలం క్వాలిఫయింగ్​ పేపర్​ మాత్రమే.

Advertisement

టైమ్​ మేనేజ్​మెంట్: గ్రూప్‌–1 ప్రిపరేషన్‌ లో అభ్యర్థులు సమయ పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్‌ మే లేదా జూన్​ లో ఉన్నందున ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ప్రిపరేషన్‌ చివరి దశలో రివిజన్‌ కోసం ఒక వారం రోజులు మినహాయిస్తే.. అభ్యర్థులు ప్రతిరోజు ప్రిలిమ్స్​తో పాటు కొంత సమయం మెయిన్స్​ కూడా కేటాయించి ప్రిపేర్​ అవ్వాలి.

అన్ని సబ్జెక్టులపై పట్టు పెంచుకోవాలి: అభ్యర్థులుప్రిపరేషన్‌ ప్రణాళికలో భాగంగా ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివేలా సమయ పాలన పాటించాలి. ప్రిలిమినరీ పరీక్ష సిలబస్‌లో మొత్తం 13 అంశాలను పేర్కొన్నారు. వీటిలో కొన్ని ఉమ్మడిగా అనుసంధానం చేసుకుంటూ చదివే టాపిక్స్‌ కూడా ఉన్నాయి. (ఉదా: కరెంట్‌ అఫైర్స్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌; భారత రాజ్యాంగం విధానం, పరిపాలన తదితర). వీటన్నింటిని బేరీజు వేసుకుంటే..అభ్యర్థులు ప్రతి రోజు సగటున 8 నుంచి 10 గంటల సమయం ప్రిపరేషన్‌కు కేటాయించేలా టైమ్‌ టేబుల్‌ రూపొందించుకోవాలి.

ప్రీవియస్​ పేపర్స్​పై లుక్కేయాలి: కొత్తగా ప్రిపరేషన్‌ ప్రారంభించే అభ్యర్థులు.. తొలుత సిలబస్‌ను ఆకళింపు చేసుకోవాలి. ప్రిలిమినరీ పరీక్షకు నిర్దేశించిన సిలబస్‌ను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. దాని ఆధారంగా చదవాల్సిన ముఖ్యమైన టాపిక్స్‌ స్పష్టత ఏర్పరచుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థులు తమకున్న సామర్థ్యం, ఆయా అంశాలపై అప్పటికే ఉన్న నైపుణ్యం ఆధారంగా.. ప్రిపరేషన్‌ సమయంలో ఏ అంశానికి ఎంత సమయం కేటాయించుకోవాలో నిర్ణయించుకోవాలి. అదే విధంగా టీఎస్‌పీఎస్సీ ఇటీవల కాలంలో నిర్వహించిన ఇతర నియామక పరీక్షల జనరల్‌ స్టడీస్‌ పేపర్లను పరిశీలించడం మేలు చేస్తుంది. దీనివల్ల పరీక్షలో ప్రశ్నలు అడిగే తీరుతోపాటు ముఖ్యమైన అంశాలను గుర్తించవచ్చు.

Advertisement

అంతర్జాతీయం నుంచి ప్రాంతీయం వరకు: అభ్యర్థులు ప్రిపరేషన్‌లో భాగంగా అంతర్జాతీయ, జాతీయ పరిణామాలు మొదలు స్థానిక అంశాల వరకూ.. అన్నింటిపైనా దృష్టి పెట్టాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత ప్రాధాన్య పరిణామాలపై ఫోకస్​ చేయాలి. తెలంగాణ చరిత్రలో తెలంగాణ సామాజిక ముఖ చిత్రాన్ని తెలియజేసే అన్ని అంశాలను చదవాలి. సాహిత్యం, కళలు, కవులు, సంస్థానాలు, భౌగోళిక స్వరూపం, వనరులు, ప్రభుత్వ పథకాలు, తెలంగాణ ఏర్పాటు తర్వాత అమలు చేస్తున్న కొత్త పథకాలు, కాంగ్రెస్​ ప్రభుత్వంలో తీసుకొచ్చిన ఆరు గ్యాంరెటీల గురించి చదవాలి.

సొంత నోట్స్​ ముఖ్యం: సబ్జెక్టుకు ఒకటి నుంచి ఎన్ని పుస్తకాలు చదివినా సొంత నోట్స్​ తయారు చేసుకుంటే రివిజన్​కు ఈజీగా ఉంటుంది. మతాలు, సామాజిక వర్గాలు, గిరిజన సమస్యలు, ప్రాంతీయ సమస్యలు వంటి స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా ఒక అంశాన్ని చదివేటప్పుడు అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి. ఉదాహరణకు సామాజిక వర్గాలనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆ వర్గాల నిర్వచనానికే పరిమితం కాకుండా.. వాటి ఆవిర్భావ చరిత్ర, విస్తరణ, తాజా పరిస్థితులు.. ఇలా అన్నిటినీ చదవాలి. అప్పుడే ఒక అంశంపై సంపూర్ణ అవగాహన ఏర్పడుతుంది.

జాతీయ పరిణామాలు: జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో.. సామాజిక సమస్యలు, ప్రభుత్వ విధానాలపై కచ్చితంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ విధానాలపై అధికారిక సమాచారం ఆధారంగా అవగాహన పెంపొందించుకోవాలి. ఇందులో మహిళా సాధికారత వంటివి ముఖ్యమైనవి. మహిళల సాధికారత కోసం జాతీయస్థాయిలో రకరకాల పథకాలు తెచ్చారు. మైనారిటీ, వెనుకబడిన తరగతులు, గిరిజన సంక్షేమం కోసం కొత్త విధానాలు ప్రవేశ పెట్టారు. అదే విధంగా పలు నూతన పాలసీలు రూపొందుతున్నాయి. వాటి గురించి కూలంకషంగా అధ్యయనం చేయాలి. ఉదాహరణకు నూతన విద్యా విధానాన్నే పరిగణనలోకి తీసుకుంటే..నూతన విద్యా విధానం ముఖ్యాంశాలతోపాటు ఇప్పటి వరకు తీసుకొచ్చిన విద్యా విధానాలు, ప్రస్తుత విధానానికి వాటికి మధ్య ఉన్న వ్యత్యాసం, ఉద్దేశం, ప్రధానాంశాలు, లక్ష్యాలు.. ఇలా అన్ని కోణాల్లో అధ్యయనం చేయాలి.

Advertisement

తెలంగాణపై స్పెషల్​ ఫోకస్​: తెలంగాణ ప్రత్యేక ప్రాధాన్యం ఉన్న అంశాల విషయంలో… పరీక్షలో కొన్ని ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ముందుగా తెలంగాణ కల్చర్​, జాగ్రఫీ, పథకాలపై అవగాహన పెంచుకోవాలి. నీళ్లు.. నిధులు.. నియామకాలు.. వంటి వాటిపై ఎలాంటి విధానాలు తెచ్చారో తెలుసుకోవాలి. అదే విధంగా రాష్ట్రంలో ఆయా వర్గాల కోసం అమలు చేస్తున్న నూతన విధానాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, గిరిజనులకు సంబంధించిన విధానాలపై ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారో తెలుసుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ కల్చర్​, వారసత్వ సంపద, కళలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్​లో తెలంగాణ ఉద్యమం టాపిక్​ లేకపోవడంతో కల్చర్​ మీద ఫోకస్​ చేయాలి.

డిస్క్రిప్టివ్‌ అప్రోచ్​ ప్రిపరేషన్​: అభ్యర్థులు ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. ముఖ్యంగా డిస్క్రిప్టివ్‌ విధానంలో చదివితే సదరు అంశానికి సంబంధించి అన్ని విషయాలపై అవగాహన ఏర్పడుతుంది. ఉదాహరణకు సోషియో కల్చరల్‌ హిస్టరీ ఆఫ్‌ ఇండియా గురించి అడిగితే.. వాటిపై బిట్‌ బ్యాంకులకు పరిమితం కాకుండా.. డిస్క్రిప్టివ్‌ విధానంలో చదవాలి. ఫలితంగా ఏ కోణంలో ప్రశ్న అడిగినా జవాబు గుర్తించగలుగుతారు. ఇది మెయిన్స్​కు ఉపయోగపడుతుంది. ఆయా పుస్తకాలు ఎంపిక చేసుకున్న అభ్యర్థులు.. వాటిని క్షుణ్నంగా చదవాలి. ఒక టాపిక్‌కు సంబంధించి నిర్వచనం మొదలు తాజా పరిణామాలకు వరకూ.. సమగ్ర అవగాహన పెంపొందించుకోవాలి. అభ్యర్థులు పరీక్షలో విజయం కోసం నిర్ణయాత్మక సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యం పెంచుకోవాలి. దీనివల్ల ఆబ్జెక్టివ్‌తోపాటు డిస్క్రిప్టివ్‌ విధానంపైనా పట్టు లభిస్తుంది. అదే విధంగా నిర్దిష్టంగా ఆయా టాపిక్స్‌ను వాస్తవ పరిస్థితుల్లో అన్వయిస్తూ చదవాలి. ఫలితంగా ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంటుంది.

ప్రిలిమ్స్ కమ్​ మెయిన్స్‌ ప్రిపరేషన్​: గ్రూప్స్‌ అభ్యర్థుల్లో చాలా మందిలో నెలకొనే సందేహం.. ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్‌కు కూడా చదవొచ్చా? అనేది. ప్రస్తుత సిలబస్‌ అంశాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ అవకాశం ఉందనే చెప్పాలి. మెయిన్స్‌ డిస్క్రిప్టివ్‌ విధానంలో, ప్రిలిమ్స్‌ ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు మెయిన్స్, ప్రిలిమ్స్‌ అంశాల సిలబస్‌ను బేరీజు వేసుకుని.. వ్యాసరూప విధానంలో చదివే నేర్పు సొంతం చేసుకోవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండింటికీ సన్నద్ధత లభిస్తుంది.

Advertisement

స్ట్రాటజీతో ముందుకెళ్లాలి: అభ్యర్థులు ముందుగా ప్రిలిమ్స్, మెయిన్‌ సిలబస్‌ను పరిశీలించాలి. ఆయా అంశాలపై ఉన్న అవగాహన స్థాయి, నైపుణ్యం ఆధారంగా సమయ పాలన రూపొందించుకోవాలి. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ చదివేలా ప్లాన్‌ చేసుకోవాలి. రోజుకు 8 నుంచి 10 గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. ప్రిలిమ్స్‌ పరీక్ష తేదీకి నెల రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌కే సమయం కేటాయించాలి. మాక్‌ టెస్ట్‌లు, మోడల్‌ టెస్ట్‌లు వంటి వాటికి హాజరై.. వ్యక్తిగత సామర్థ్యాన్ని తెలుసుకోవాలి. పరీక్షకు వారం రోజుల ముందు రెడీ రెకనర్స్, తాము రాసుకున్న షార్ట్‌ నోట్స్‌ ఆధారంగా పూర్తిగా రివిజన్‌కే కేటాయించాలి. ప్రతి దశలోనూ సమయ పాలనకు ప్రాధాన్యమిస్తూ.. నిర్దిష్ట ప్రణాళికతో చదివితే మలి దశ మెయిన్స్‌కు అర్హత సాధించొచ్చు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!