ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పెండింగ్లో ఉన్న పోస్టులు క్లియర్ చేస్తున్న గవర్నమెంట్ గ్రూప్ 1,2,3 పరీక్షల షెడ్యూల్ రిలీజ్ చేయడంతో బిజీగా ఉంది. లోక్సభ ఎన్నికలతో పాటు సివిల్స్ ప్రిలిమ్స్ మే 26న నిర్వహించనున్నారు. దీంతో గ్రూప్ 1 పరీక్ష జూన్ లో నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. దాంతో పాటు గ్రూపు-2,3 పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టిని సారించారు. ఈ రెండు గ్రూపు పోస్టుల పరీక్షలను జూలై, ఆగస్టు మాసాల్లో నిర్వహించే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటికే ప్రకటించిన గ్రూపు-1 పరీక్షతో పాటు, ఇతర పోటీ పరీక్షల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని ఈ పరీక్షల తేదీలను ప్రకటించాలని చూస్తున్నారు. మొత్తం 783 గ్రూపు-2 పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టుల కోసం సుమారు 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత ఏడాది ఆగస్టు 29,30వ తేదీల్లో పరీక్షలను నిర్వహించాల్సి ఉంది. అయితే.. పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు రావడంతో ఆ పరీక్షలను వాయిదా వేసి గత నవంబరు 2,3వ తేదీల్లో పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించారు. అభ్యర్థుల ఆందోళనతో ఈ పరీక్షలను వాయిదా వేసి, ఈ ఏడాది జనవరి 6,7వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామా వంటి పరిణామాలతో ఈ పరీక్షలను మరోసారి వాయిదా వేశారు.
గ్రూప్1 ప్రిలిమ్స్, మెయిన్స్ మధ్యలో గ్రూప్2,3
గ్రూపు-3 పోస్టులకు సంబంధించిన పరీక్షను ఆగస్టులో నిర్వహించేందుకు సిద్ధం అవుతోంది. సుమారు 1,363 గ్రూపు-3 పోస్టుల భర్తీ కోసం గత ప్రభుత్వం నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పోస్టుల కోసం 5.8 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ పోస్టుల భర్తీ కోసం పరీక్షల తేదీలను ప్రకటించలేదు. గ్రూప్1 ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షల మధ్యలో గ్రూపు-2,3 పోస్టులకు సంబంధించిన పరీక్షలను నిర్వహించాలని టీఎస్పీఎస్సీ అధికారులు ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా జూలై, ఆగస్టు మాసాల్లో అయితే.. ఇతర పోటీ పరీక్షలు ఉండవు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉండే పరీక్షల షెడ్యూల్ను పరిశీలించి అనంతరం, గ్రూపు-2,3 పోస్టుల పరీక్షలను ప్రకటించాలని భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తున్నది.