గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ఈరోజు సాయంత్రం లేదా రేపు వెల్లడి కానున్నాయి. టీఎస్పీఎస్సీ అందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసింది. గ్రూప్ 1 ఫలితాలకు అడ్డంకిగా మారిన హైకోర్టు కేసు ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశముంది. హైకోర్టులో ఉన్న కేసు విచారణ పూర్తయిందని, మంగళవారం లేదా బుధవారం హైకోర్టు నుంచి తీర్పు వెలువడే అవకాశముంది. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రిలిమ్స్ రిజల్ట్ రిలీజ్ కు లైన్ క్లియర్ అవుతుంది. తీర్పు కాపీ తమకు అందిన వెంటనే ప్రిలిమ్స్ క్వాలిఫై అభ్యర్థుల లిస్ట్ విడుదల చేస్తామని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణలో మొత్తం 503 గ్రూప్ 1 పోస్టులకు అక్టోబర్ 16న టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. అదే నెల 29న ప్రిలిమినరీ కీ విడుదల చేసింది. అభ్యంతరాలు, నిపుణుల కమిటీ సూచనలతో 5 ప్రశ్నలను తొలిగించింది. నవంబర్ 15న ఫైనల్ కీ రిలీజ్ చేసింది. రెండు, మూడు వారాల్లోనే ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈలోగా పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించటంతో రిజల్ట్ పెండింగ్లో పడింది.
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు భారీగా అభ్యర్థులు పోటీ పడ్డారు. 503 పోస్టులకు మొత్తం 3,80,081 మంది దరఖాస్తులు చేసుకున్నారు. 2,85,916 మంది పరీక్షకు హాజరయ్యారు. ప్రిలిమ్స్లో వచ్చిన మార్కుల మెరిట్తో పాటు రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున (1:50 నిష్పత్తిలో) అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేస్తారు. ఈ లెక్కన మొత్తం 503 పోస్టులకు 25150 మంది అభ్యర్థులను మెయిన్స్కు ఎంపిక చేయనున్నారు. ప్రిలిమ్స్ రిజల్ట్ ఇచ్చిన తర్వాత కనీసం మూడు నెలల వ్యవధి ఉండేలా మెయిన్స్ పరీక్షకు షెడ్యూలు రిలీజ్ చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో మే నెలలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి.