తెలంగాణలో జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది టీఎస్పీఎస్సీ. మొత్తం 503 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించిన ఈ పరీక్షకు 2,33,248 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే.. పరీక్ష ముగిసి 15 రోజులు దాటినా.. ఇంకా ప్రైమరీ కీని విడుదల చేయలేదు కమిషన్. దీంతో ప్రైమరీ కీ ఎప్పుడు విడుదల అవుతుంది? మెయిన్స్ కు ఎంపికైనవారి జాబితా ఎప్పుడు? అన్న ఆందోళన అభ్యర్థుల్లో వ్యక్తం అవుతోంది. అయితే.. ప్రైమరీ కీని (ఈనెల 28న) బుధవారం విడుదల చేయడానికి కమిషన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
కీ పై అభ్యంతరాల స్వీకరణకు కొంత గడువు ఇచ్చి ఫలితాలను విడుదలను విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియను కమిషన్ పూర్తి చేసిందని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే జులై మొదటి వారంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేయాలని కమిషన్ భావిస్తోంది. ఇంకా.. నవంబర్లో మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలని కమిషన్ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఇటీవల టీఎస్పీఎస్సీ బోర్డు భేటీ అయ్యింది. ప్రిలిమ్స్ రిజల్ట్స్, మెయిన్స్ నిర్వహణ, కొత్త పరీక్ష తేదీల ప్రకటన తదితర అంశాలపై సుధీర్ఘంగా చర్చించింది.