తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్ (TSPSC GROUP 1 PRELIMS) మళ్లీ వాయిదా పడుతుందా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జూన్ 11వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించింది. ఈలోగా పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించటంతో గందరగోళం నెలకొంది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ను రెండు నెలల పాటు వాయిదా వేయాలని 36 మంది అభ్యర్థులు మంగళవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం ఇప్పటికే రాష్ట్రంలో సంచలనం రేపుతోంది. దీంతో పలు పరీక్షలను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. కొన్ని పరీక్షల తేదీలను రీషెడ్యూలు చేసింది. ఇందులో భాగంగానే గత ఏడాది అక్టోబర్ 16న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను టీఎస్పీఎస్సీ రద్దు చేసింది. దీంతో అప్పుడు ప్రిలిమ్స్ పరీక్ష రాసిన 2.8 లక్షల మంది అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
టీఎస్పీఎస్సీ పరీక్షల రీషెడ్యూలులో భాగంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను తిరిగి జూన్ 11న నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. టీఎస్పీఎస్సీ అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తోంది. ఈలోగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ కు చెందిన బి.వెంకటేష్తో పాటు మరో 35 మంది గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టులో సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశారు.
రెండు నెలల పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలని పిటిషనర్లు కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అభ్యర్థుల ప్రిపరేషన్కు వీలుగా గ్రూప్ 1, 2, 3, 4 రిక్రూట్మెంట్ పరీక్షల మధ్య కనీస వ్యవధి ఉండాలని ఈ పిటిషన్లో ప్రదానంగా ప్రస్తావించారు. అందుకే టీఎస్పీఎస్సీ 11వ తేదీన నిర్వహించే ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇవ్వాలని, కనీసం రెండు నెలల పాటు పరీక్షను వాయిదా వేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు.
మే 25న ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇందులో హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, టీఎస్పీఎస్సీ చైర్మన్, టీఎస్పీఎస్సీ సెక్రటరీ, హైదరాబాద్ సిటీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (క్రైం) అడిషినల్ కమిషనర్లను ప్రతివాదులుగా చేర్చారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) యాక్ట్ ప్రకారం గ్రూప్ 1,2,3,4 పరీక్షలు నిర్వహించాలంటే ప్రతి పరీక్షకు మధ్య కనీసం రెండు నెలల గ్యాప్ ఉండాలి. నిరుద్యోగ అభ్యర్థులు ఆయా పరీక్షలకు ప్రిపేర్ కావడానికి వీలుగా గ్యాప్ ఉండాలన్న నిబంధనకు వ్యతిరేకంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ నిర్వహించేందుకు నోటిఫికేషన్ ఇవ్వడం చట్ట వ్యతిరేకంగా ప్రకటించాలి. వెంటనే ప్రిలిమినరీ నిర్వహించకుండా మధ్యంతర స్టే ఉత్తర్వులు ఇవ్వాలి.
నిరుద్యోగులకు మేలు జరిగేలా ఆయా పరీక్షల్లో అర్హత సాధించేలా ఉండేందుకు వీలుగా ప్రిలిమినరీ పరీక్షలను వాయిదా వేయాలి. ఈ విధంగా చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రటరీలకు స్వయంగా వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోయింది. ఏకపక్షంగా, అన్యాయంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలి… అని అభ్యర్థుల పిటిషన్ను ఈ నెల 25న జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పుల్లా కార్తీక్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారణ చేయనుంది.
సీబీఐ కేసు జూన్ 5న విచారణ
ఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి సంబంధించి మరో కేసుపై జూన్ 5న విచారణ జరుగనుంది. టీఎస్పీఎస్సీ ఆఫీసులో పని చేస్తున్న సిబ్బందిపైనే లీకేజీ అభియోగాలు ఉన్నాయి. ఇప్పటికే దీనిపై ప్రభుత్వం సిట్తో దర్యాప్తునకు ఆదేశించింది. దర్యాప్తు కొలిక్కిరాలేదు. నేరాభియోగాలపై నిగ్గు తేలకుండానే ప్రిలిమినరీ నిర్వహించాలని నోటిఫికేషన్ ఇచ్చింది. లీకేజీ వ్యవహారంపై సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐ దర్యాప్తునకు ఇవ్వాలని కోరుతూ దాఖలైన మరో వ్యాజ్యం జూన్ 5న హైకోర్టు విచారణకు రానుంది.