గ్రూప్ 4 ప్రిలిమినరీ కీ (TSPSC GROUP 4 PRELIMINARY KEY) వచ్చే వారంలో విడుదల కానుంది. టీఎస్పీఎస్సీ అందుకు సంబంధించిన కసరత్తు దాదాపుగా పూర్తి చేసింది. జులై 1వ తేదీన టీఎస్పీఎస్సీ గ్రూప్-4 పరీక్ష జరిగింది. పరీక్ష ముగిసి దాదాపు నెలన్నర రోజులు కావస్తుండటంతో లక్షలాది మంది గ్రూప్ 4 ఫలితాలు ఎప్పుడొస్తాయా.. అని ఎదురుచూస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తరహాలోనే పరీక్ష జరిగిన తర్వాత 15 రోజులకు టీఎస్పీఎస్సీ ప్రైమరీ కీ విడుదల చేస్తుందని అభ్యర్థులు ఎదురు చూశారు. కానీ.. గ్రూప్ 4 పరీక్ష రాసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం, రెండు (పేపర్ 1, పేపర్ 2) పేపర్లు ఉండటంతో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ ప్రక్రియ ఆలస్యమైందని టీఎస్పీఎస్సీ అధికారులు చెబుతున్నారు.
మొత్తం 8180 గ్రూప్-4 ఉద్యోగాలకు 7.61 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. వీరందరూ ప్రైమరీ కీ ఎప్పుడు విడుదల అవుతుంది? ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ వారంతో ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ పూర్తి కానుండటంతో వచ్చే వారంలో ప్రైమరీ కీ విడుదల చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. ప్రైమరీ కీ పై అభ్యంతరాల స్వీకరణకు అభ్యర్థులకు కొంత గడువు ఇవ్వనుంది. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ కీ రిలీజ్ చేస్తుంది. ఫైనల్ కీతో పాటే ఫలితాలను విడుదల చేయనుంది.