పేపర్ లీకేజీ కారణంగా రద్దు చేసిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను ఈ నెల 11 నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరీక్ష నిర్వహణకు కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో పరీక్ష రద్దుకు దారి తీసిన అన్ని అంశాలను, లోపాలను పరిగణలోకి తీసుకుని ఈ సారి అలా జరగకుండా చర్యలు చేపట్టారు. అభ్యర్థులకు పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించి, బయోమెట్రిక్ ధ్రువీకరణ తరువాతే ఎగ్జామ్ సెంటర్లలోకి అనుమతించనున్నారు. ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్న ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను ఈ నెల 3 లేదా 4వ తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు టీఎస్పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.
అలా చేస్తే డిబార్..
పరీక్ష నిర్వహణలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది. ఇప్పటికే 50 మందికి పైగా అభ్యర్థులను శాశ్వతంగా డిబార్ చేసిన టీఎస్పీఎస్సీ.. భవిష్యత్ లోనూ నిబంధనలను ఉల్లంఘించే అభ్యర్థులపై ఇలాంటి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తోంది. పరీక్ష కేంద్రాల్లో అల్లరి చేసి ప్రశాంత వాతావరణానికి ఇబ్బంది కలిగించినా.. ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలతో పట్టుబడినా.. ఇతర అవకతవకలకు పాల్పడినా పోలీసు కేసులు పెడతామని హెచ్చరిస్తోంది. దీంతో పాటు జీవితకాలం నిషేధం విధిస్తామని స్పష్టం చేస్తోంది.