ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నెల 31 (ఆదివారం) జరగాల్సిన తెలంగాణ జెన్కో సంస్థ ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల పరీక్ష వాయిదా వేసినట్లు ఆ సంస్థ సీఎండీ సయ్యద్ అలీ ముర్తుజా రిజ్వీ ప్రకటించారు. గతేడాది అక్టోబర్ 4వ తేదీన ఏఈ ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 16వ తేదీ నుంచి లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏఈ పరీక్ష నిర్వహించలేకపోతున్నామని, కొత్త తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని అభ్యర్థులు పరిగణలోకి తీసుకుని పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఇంతకుముందు సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేసిన సంగతి తెలిసిందే.