టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటరైంది. సిట్ కేసు నమోదు చేయటంతో పాటు పలువురిని అరెస్ట్ చేయటంతో పాటు భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తమకు అందిన ఫిర్యాదులతో ఈడీ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) ఫైల్ చేసింది. లీకైన పేపర్ విదేశాలకు కూడా చేరటంతో హవాలా రూపంలో మనీ ట్రాన్సాక్షన్ జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే బేగంబజార్ పోలీసులు, సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్..నిందితుల రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న వివరాలతో కేసు నమోదు చేసింది. ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసిన నిందితులను విచారించేందుకు కోర్టు అనుమతి తప్పనిసరి. దీంతో మంగళవారం ఉదయం ఈడీ అధికారులు నాంపల్లి కోర్టులో పిటీషన్ ఫైల్ చేయనున్నట్లు తెలిసింది. కోర్టు అనుమతి మేరకు నిందితులను కస్టడీకి తీసుకుని విచారించనుంది.
ఒకరి నుంచి ఒకరికి.. చైన్ లింకింగ్ తరహాలో టీఎస్పీఎస్సీ పేపర్లు అమ్ముకోవటం ద్వారా ఇప్పటికే రూ.40 లక్షలు చేతులు మారినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో ఎవరెవరి ప్రమేయముంది.. డబ్బులు ఎలా వచ్చాయి… ఎన్ని చేతులు మారాయనేది ఈడీ ప్రధానంగా ఆరా తీసే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిట్ చేసిన దర్యాప్తుతో పాటు టీఎస్పీఎస్సీలో బాధ్యులైన వారి నుంచి తమకు అవసరమైన వివరాలను ఈడీ సేకరిస్తోంది. ప్రధానంగా నిందితుల ఆర్ధిక లావాదేవీలపైనే ఈడీ ఫోకస్ పెట్టింది. టీఎస్పీఎస్సీ మాజీ నెట్వర్క్ అడ్మిన్ రాజశేఖర్ రెడ్డి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, న్యూజిలాండ్ నుంచి ప్రశాంత్రెడ్డి నుంచి కానీ ఇతరుల నుంచి మనీలాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ దర్యాప్తు ప్రారంభించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ ను విచారించిన సిట్
పేపర్ లీక్ కేసులో టీఎస్పీఎస్సీ (TSPSC) చైర్మన్ జనార్దన్ రెడ్డి స్టేట్ మెంట్ ను సిట్ నమోదు చేసింది. ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసి పలువురిని విచారించిన సిట్.. సోమవారం ఉదయమే టీఎస్పీఎస్సీ ఛైర్మన్కు నోటీసులు ఇచ్చింది. సిట్ అధికారులు టీఎస్పీఎస్సీ ఆఫీసుకు వెళ్లి దాదాపు అయిదు గంటల పాటు ఛైర్మన్ను విచారించారు. పేపర్ల తయారీ నుంచి పేపర్ల కస్టోడియన్ బాధ్యతలు.. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ వివరాలన్నీ ఛైర్మన్ను అడిగి తెలుసుకున్నారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను సిట్ ఆఫీసర్లు రికార్డు చేసుకున్నారు.
రాష్ట్రపతికి లేఖ రాసిన బీఎస్పీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీకేజీ కేసును సిబిఐకి అప్పగించి సమగ్ర విచారణ జరపాలని బీఎస్పీ రాష్ట్ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ భారత రాష్ట్రపతికి లేఖ రాశారు. లీకేజీ వెనుక ముఖ్యమంత్రి కార్యాలయం పాత్ర ఏమిటో తేల్చాలని కోరారు. ప్రస్తుత కమీషన్ ను బర్తరఫ్ చేయాలని కోరుతూ రాష్ట్రపతికి రాసిన లేఖను ఆయన ట్విటర్లో పోస్ట్ చేశారు.