తెలంగాణలో జూన్ 11వ తేదీన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 2,33,248 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే.. ఈ ఫలితాలు ఎప్పుడు విడుదల అవుతాయో తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్ష జరిగి రెండు నెలలు కావొస్తున్నా ఫలితాలు విడుదల చేయకపోవడంతో వారిలో ఉత్కంఠ నెలకొంది. అయితే.. పలువురు అభ్యర్థులు గ్రూప్-1 పరీక్ష విషయంలో వివిధ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ.. హైకోర్టుకు వెళ్లడంతోనే ఫలితాలు ఆలస్యం అవుతున్నాయని టీఎస్పీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి.
వచ్చే వారంలోగా న్యాయపరమైన ఇబ్బందులు తొలగి ఫలితాల విడుదలకు లైన్ క్లీయర్ అవుతుందని అధికారులు భావిస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే వారం, పది రోజుల్లోగానే ఫలితాలను విడుదల చేస్తామని చెబుతున్నారు. అనంతరం మూడు నెలలు గడవు ఇచ్చి మెయిన్స్ నిర్వహించేలా టీఎస్పీఎస్సీ ప్రణాళికలు రూపొందిస్తోంది. నవంబర్ చివరి వారంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.