తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురు చూసిన నోటిఫికేషన్లలో గ్రూప్-4 ఒకటి. మొదట 9168 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు వెబ్ నోట్లో ప్రకటించగా.. డిటైల్డ్ నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య 8039గా మాత్రమే ఉంది. దీంతో మొత్తం 1129 ఖాళీలు తగ్గడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే.. పంచాయితీ రాజ్ విభాగంలో ఈ 1129 పోస్టులు తగ్గాయి. ఆ శాఖ నుంచి కేవలం కొన్ని పోస్టులకు మాత్రమే ప్రతిపాదనలు అందడం.. మిగతా వాటి విషయంలో ఆ శాఖ నుంచి స్పష్టత రాకపోవడమే ఇందుకు కారణం. తాజాగా మరో 141 ఖాళీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 8,180కు చేరింది. అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు.. అంటే జనవరి 30తో ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్లో సమర్పించాల్సి ఉంటుంది.
నిన్నటి వరకు 7,88,521 మంది అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించారు. భారీగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటుండడంతో సర్వర్ సైతం సోమవారం ఉదయం నుంచి మొరాయిస్తోంది. ఇలా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతుండడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును మరికొన్ని రోజులు పొడిగించాలని కోరుతున్నారు. మరికొందరు అభ్యర్థులు ఓటీఆర్ అప్డేషన్, విద్యార్హతల ధ్రువపత్రాల సమర్పించి దరఖాస్తు చేసుకోవడానికి మరికొంత సమయం కావాలని కోరుతున్నారు. అయితే గడువు పెంపుపై టీఎస్పీఎస్సీ (TSPSC) నుంచి ఎలాంటి ప్రకటన ఇంతవరకు రాలేదు.
కొద్ది సేపటి క్రితం టీఎస్పీఎస్సీ బోర్డు అత్యవసరంగా భేటీ అయినట్లు సమాచారం. ఈ భేటీలో గ్రూప్-4 దరఖాస్తు గడువు పెంపు విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువు మరో వారం రోజులు పెంచే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఈ రోజు సాయంత్రంలోగా ఈ అంశంపై టీఎస్పీఎస్సీ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు మాత్రం గడువు పెంపు కోసం ఎదురు చూడకుండా.. సాధ్యమైనంత వరకు ఈ రోజు సాయంత్రం 5 లోగా దరఖాస్తులను సమర్పించడమే బెటర్.