వరుసగా ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేస్తోన్న తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. నియామక పరీక్షలను సైతం పూర్తి చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగా ఈ రోజు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ నియామకాలకు సంబంధించిన పరీక్షను నిర్వహించింది.సెప్టెంబర్ 5వ తేదీన మొత్తం 23 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ పరీక్షకు మొత్తం 19,812 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 16,763 మంది అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఈ నియమాక పరీక్షకు సంబంధించి తెలంగాణలోని 17 జిల్లాల్లో 75 ఎగ్జామ్ సెంటర్లను ఏర్పాటు చేశారు.
ఈ రోజు ఉదయం నిర్వహించిన పేపర్ 1 పరీక్షకు 11,274 మంది అభ్యర్థులు (56.90 శాతం) హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగి పేపర్-2 పరీక్షకు 11499 మంది అభ్యర్థులు (58.04 శాతం) హాజరయ్యారు. ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. పరీక్ష పర్యవేక్షణకు టీఎస్పీఎస్సీ ఆఫీస్ లో కమాండ్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితో పాటు కమిషన్ సభ్యులు కమాండ్ సెంటర్ నుంచి పరీక్షను పర్యవేక్షించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.