తెలంగాణ వైద్యరంగంలో నియామకాలను అత్యంత పారదర్శకంగా చేపడుతున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. ఇప్పటికే 1,331 మంది ఆయుష్ కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేశామని వివరించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 22,263 మందికి వైద్య ఆరోగ్యశాఖలో కొత్తగా ఉద్యోగాలు ఇచ్చామని మంత్రి వివరించారు. మరో 9,222 ఉద్యోగాల భర్తీకి రెండు నెలల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు.వచ్చే నెల నుంచి టి డియాగ్నస్టిక్స్లో 134 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం 54 పరీక్షలు మాత్రమే నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో వీటిని పెంచుతామని మంత్రి వివరించారు.
సోమవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో… వైద్యారోగ్య శాఖలో కొత్తగా నియమితులైన 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నియామక పత్రాలను మంత్రి హరీశ్ రావు అందించారు. కొత్తగా నియామకమైన వైద్యులు డీఎంఈ పరిధిలో పనిచేయనున్నట్లు మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కళాశాల చొప్పున నిర్మిస్తుందని చెప్పారు. ఈ కాలేజీల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు వైద్యశాఖ ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల బదిలీలు చేపడతామని మంత్రి వివరించారు. తాజాగా చేపట్టిన నియామకాలతో వైద్యవిద్య మరింత బలోపేతం అవుతుందని మంత్రి హరీశ్ రావు ఆశాభావం వ్యక్తంచేశారు.