ఓఎంఆర్ షీట్లకు సంబంధించిన పిటిషన్పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ (TSPSC GROUP ! PRELIMS EXAM) రద్దు చేయాలన్న పిటిషన్ పై హైకోర్టు (HIGH COURT) విచారణ చేపట్టింది. అభ్యర్థుల బయోమెట్రిక్ సేకరించక పోవడం అనుమానంగా ఉందన్న పిటిషనర్ల వాదనపై హైకోర్టు స్పందించింది. ఓఎంఆర్ షీటుపై ఫోటో లేకపోవడాన్ని కూడా తప్పుపట్టింది. ఓఎంఆర్ షీటుపై హాల్టికెట్ నంబరు, ఫోటో ఎందుకు లేవని, బయోమెట్రిక్ ఎందుకు సేకరించలేదని హైకోర్టు టీఎస్పీఎస్సీని ప్రశ్నించింది. అక్టోబరులో చేసినవన్నీ రెండో సారి జూన్లో పరీక్ష నిర్వహించినప్పుడు ఎందుకు చేయలేదని అడిగింది. పరీక్షల్లో అక్రమాల నిరోధించడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని హైకోర్టు ప్రశ్నించింది.
పరీక్షల ఏర్పాట్లు ఎలా చేయాలన్నది టీఎస్పీఎస్సీ విచక్షణ అధికారమని టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఏర్పాట్లపై అభ్యర్థులెవరూ అభ్యంతరం చెప్పలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. బయోమెట్రిక్, ఓఎంఆర్పై ఫోటోకు సుమారు రూ.1.50 కోట్ల ఖర్చు అవుతుందని టీఎస్పీఎస్సీ లెక్కలు చెప్పింది. ఆధార్ వంటి గుర్తింపు కార్డుల ద్వారా ఇన్విజిలేటర్లు అభ్యర్థులను ధ్రువీకరించారని హైకోర్టుకు వివరణ ఇచ్చింది.
పరీక్ష పారదర్శకంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేయడం టీఎస్పీఎస్సీ బాధ్యత అని.. పరీక్షల నిర్వహణలో ఖర్చుల విషయం ముఖ్యం కాదని హైకోర్టు కామెంట్ చేసింది. పరీక్ష నిర్వహణ కోసం అభ్యర్థుల నుంచి ఫీజు తీసుకున్నారా.. లేదా అనే పాయింట్ను హైకోర్టు లేవనెత్తింది. ఈ వ్యవహారంలో మూడు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.