యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో (EPFO) పలు ఖాళీలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. మొత్తం 577 ఖాళీలు ఉండగా.. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టులు 418 ఉన్నాయి. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్స్ పోస్టులు మరో 159 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 25న ప్రారంభించింది యూపీఎస్సీ. దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు రిక్రూట్మెంట్ వెబ్సైట్ https://upsconline.nic.in/ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.25 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు. రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ దశల ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.