తెలంగాణలో టీచర్ల పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న డీఎస్సీకి ఈసారి అంతంతమాత్రంగానే స్పందన కనిపిస్తోంది. మొదటి పది రోజుల్లో కేవలం 16399 మంది అభ్యర్థులు డీఎస్సీకి అప్లై చేసుకున్నారు అప్లికేషన్లకు మరో ఇరవై రోజులు గడువుంది. రాష్ట్రంలో మొత్తం 5089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈనెల 20 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. వచ్చే నెల 20వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువు ఉంది. వచ్చిన దరఖాస్తులు కేవలం 16399 కావటంతో.. ఇప్పటి వరకైతే తక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
డీఎస్సీ నియామకాలకు టెట్లో క్వాలిఫై కావటం తప్పనిసరి. గత నెలలో నిర్వహించిన టెట్ 2023 ఫలితాలు ఈనెల 27వ తేదీన విడుదలయ్యాయి. టెట్ ఫలితాలు వచ్చేంత వరకు అభ్యర్థులందరూ వెయిట్ చేయటమే అందుకు కారణమని తెలుస్తోంది. టెట్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులందరూ డీఎస్సీ పోస్టులకు పోటీ పడే అవకాశాలున్నాయి. అందుకే ఈ వారం నుంచి అప్లికేషన్ల సంఖ్య పెరుగుతుందని ఆఫీసర్లు చెబుతున్నారు. మరోవైపు పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటం, కొన్ని కేటగిరీలో జీరో పోస్టులు ఉండటం కూడా అప్లికేషన్ల సంఖ్య తక్కువగా నమోదవటానికి కారణమనే అభిప్రాయాలున్నాయి. ఈసారి డీఎస్సీకి దాదాపు రెండు లక్షల మంది పోటీ పడుతారని విద్యాశాఖ అంచనా వేసింది.