ఎస్సై, కానిస్టేబుల్ నియామక పరీక్షలో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలపాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLRB) నిర్ణయించింది. కోర్టు ఆదేశాల ప్రకారం మార్కులు కలపడం ద్వారా ఉత్తీర్ణులైన వారి జాబితాను ఈ నెల 30 నుంచి.. అంటే రేపటి నుంచి అధికారిక వెబ్ సైట్లో (https://www.tslprb.in/) అందుబాటులో ఉంచనుంది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ తో ఆ వివరాలను తెలుసుకోవాలని బోర్డు సూచించింది.
వారికి పార్ట్-2కు అప్లై చేసుకునే ఛాన్స్
అర్హత సాధించిన అభ్యర్థులు పార్ట్ 2 అప్లికేషన్ చేసుకోవాలని తెలిపింది. ఇప్పటికే నిర్వహించిన పీఈటీ, పీఎంటీ పరీక్షలో అర్హత సాధించిన వారు మరో సారి పార్ట్ 2 దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని టీఎస్ఎల్పీఆర్బీ స్పష్టం చేసింది. అంతే కాకుండా.. పీసీ/ఎస్సై లో ఏదో ఒకటి అర్హత సాధించి.. ఇప్పుడు పీసీ/ఎస్సైలో అర్హత సాధించిన వారు పార్ట్ 2 చేసుకోవాలని తెలిపింది. వీరికి మళ్లీ.. ఈవెంట్స్ నిర్వహించమని బోర్డు తెలిపింది. పార్ట్ 2 దరఖాస్తులను ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 5వ తేదీలోపు సమర్పించాలని తెలిపింది. ఈ తేదీలు ఎట్టి పరిస్థితుల్లో పొడిగించడం కుదరదని స్పష్టం చేసింది.
కొత్తగా అర్హత సాధించిన వారికి ఫిబ్రవరి 15 నుంచి ఈవెంట్స్ నిర్వహించనున్నట్లు తెలంగాణ పోలీస్ నియామక బోర్డు వెల్లడించింది. పీఈటీ/పీఎంటీ అడ్మిట్ కార్డులను ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 10 మధ్య వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఫిబ్రవరి 15 నుంచి వీరికి ఈవెంట్స్ నిర్వహిస్తామని నోటీస్ లో పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఏడు ప్రాంతాల్లో రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ ఉంటుందని తెలిపారు. ఏమైనా సందేహాలు అంటే.. 93937 11110 లేదా 93910 05006 నంబర్లను సంప్రదించాలని సూచించింది.