తెలంగాణలో మొత్తం 8039 గ్రూప్-4 (TSPSC Group-4) ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను గత నెల 30న పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 141 ఖాళీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 8,180కు చేరింది. అయితే.. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు.. అంటే జనవరి 30తో ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను https://www.tspsc.gov.in/ వెబ్ సైట్లో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రారంభం సందర్భంగా టీఎస్పీఎస్సీ అనితా రామచంద్రన్ కీలక ప్రకటన చేశారు. అభ్యర్థులు గడువులోగా తమ దరఖాస్తులు సమర్పించాలన్నారు.
ఆఖరి తేదీని పొడిగించే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆసక్తి కలిగిన అభ్యర్థులు తేదీ పొడిగింపుపై ఆశలు పెట్టుకోకుండా రేపు సాయంత్రం 5 లోగా దరఖాస్తులను సమర్పిస్తే మంచిది. ఇదిలా ఉంటే.. గడువు సమీపిస్తున్న కొద్దీ గ్రూప్-4 కు భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. నిన్న సాయంత్రం (జనవరి 24)న రికార్డు స్థాయిలో 47,362 దరఖాస్తులు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. దీంతో మొత్తం దరఖాస్తుల సంఖ్య 7,88,521కి చేరింది. ఇంకా ఆఖరి రోజు భారీగా దరఖాస్తుల వచ్చే అవకాశం ఉందని టీఎస్పీఎస్సీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.