ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పించనర్లకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు, పింఛనర్లకు ఇచ్చే అలవెన్స్ ను(Allowance) పెంచుతూ విభాగాల వారీగా ఉత్తర్వులు జారీ చేసింది. ట్రావెలింగ్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్ 30శాతం పెంచింది. బదిలీ పై వెళ్లే ఉద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ 30శాతం పెంచింది. సెలవురోజుల్లో పనిచేసే లిఫ్ట్ ఆపరేటర్లు, డైవర్లకు అదనంగా రూ. 150 చెల్లించాలని నిర్ణయించింది. షెడ్యూల్ ఏరియాలో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్ కాంపన్సెటరీ అలవెన్స్ 30శాతం పెంచింది. దివ్యాంగ ఉద్యోగులకు ఇచ్చే కన్వీయన్స్ అలవెన్స్ రూ. 2000 నుంచి రూ. 3000 పెంచింది. ఇళ్లు నిర్మించుకునే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 20 లక్షల నుంచి రూ. 30లక్షలకు పెంచింది. కారు కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ పరిమితిని రూ. 6లక్షల నుంచి 9 లక్షలకు పెంచింది. మోటార్ సైకిల్ కొనుగోలు చేసే వారికి ఇచ్చే అడ్వాన్స్ 80వేల నుంచి రూ. లక్షకు పెంచింది. ఉద్యోగుల పిల్లల పెళిళ్ళకు సంబంధించి, కుమార్తె పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ లక్ష నుంచి రూ. 4 లక్షలు, కుమారుడి పెళ్లికి ఇచ్చే అడ్వాన్స్ రూ. 75వేల నుంచి రూ. 3 లక్షలకు పెంచింది. స్టేట్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్స్ ఉద్యోగులకు ఇచ్చే ఇన్సెంటివ్ 30శాతం పెంచింది.
రాజ్నాథ్ సింగ్ ను కలిసిన కేటీఆర్
హైదరాబాద్లో స్కైవేలు, స్కై వాక్స్ కోసం రక్షణ శాఖ భూములు కేటాయించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కోరినట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్.. రాజ్నాథ్ సింగ్ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకొని పోతున్నదని మేం చెప్పుకోవడం కాదు.. కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది అని కేటీఆర్ తెలిపారు. అయితే ఈ అభివృద్ధి పరంపర కొనసాగే క్రమంలో.. తెలంగాణ రాష్ట్రం వేగంగా ఎదుగుతూ, విస్తరిస్తూ జాతి నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రానికి చేయూతనివ్వండి, మద్దతు ఇవ్వండి. తద్వారా జాతి నిర్మాణంలో మరింత ఉధృతంగా పాల్గొనే అవకాశం వస్తుంది. భారతదేశానికి కూడా లాభం జరుగుతుందనే మాటను కేంద్రానికి చాలాసార్లు చెప్పామని కేటీఆర్ గుర్తు చేశారు.
మహబూబ్ నగర్ మెడికల్ కాలేజీ గర్తింపు రద్దు
మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల గుర్తింపును రద్దు చేస్తున్నట్లు నేషనల్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. ఫ్యాకల్టీ, సదుపాయాల కొరత, బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టం సీసీ కెమెరాలు లేకపోవడం తో పాటు మరికొన్ని సౌకర్యాలు లేని కారణంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.. కాలేజీలో ఉన్న లోపాలను సరి చేసుకుని మరొకసారి అప్పిలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
మరో 1827 ఉద్యోగాలకు అనుమతులు
డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని టీచింగ్ ఆసుపత్రుల్లో 1827 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ శుక్రవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ మెడికల్ హెల్త్ అండ్ రిక్రూట్మెంట్ బోర్డ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిన ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలనే సీఎం కేసీఆర్ గారి లక్ష్యాన్ని వేగంగా చేరుకుంటున్నామని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు చెప్పారు.మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన వైద్యులను, నర్సులను, ఇతర సిబ్బందిని భర్తీ చేస్తున్నామన్నారు.
తెలంగాణ రెయిన్ అలర్ట్
తెలంగాణ రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మొత్తం ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో రాష్ట్రం మొత్తం ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
డీకేతో కోమటిరెడ్డి భేటీ
కాంగ్రెస్ పార్టీలో మళ్లీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి యాక్టివ్ అయ్యారు. తాజాగా కర్ణాటక పిసిసి చీఫ్ డీకే శివకుమార్ తో ఆయన భేటీ కావడం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. 40 నిముషాల పాటు జరిగిన వీరి భేటీలో షర్మిల అంశం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. దివంగత వైఎస్సార్తో కోమటిరెడ్డి కి మంచి సంబంధాలు ఉండడం వల్ల ఇప్పటికే షర్మిల రాకను కోమటిరెడ్డి ఆహ్వానించారు. ఇటు షర్మిలకు డీకే శివ కుమార్ కుటుంబం తో సన్నిహిత సంబంధాలు ఉండడం వల్ల డీకే కూడా షర్మిల హైకమాండ్ వద్ద ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. షర్మిల జాయినింగ్ పై హైకమాండ్ సుముఖంగా ఉన్నట్లు కోమటిరెడ్డి తో డీకే తెలిపారు. కానీ షర్మిల చేరికపై తెలంగాణ కాంగ్రెస్ నేతల అభ్యంతరాలను కూడా పరిగణలోకి తిసుకుంటామని డీకే తెలిపినట్లు సమాచారం.
తెలంగాణ ఎన్నికల కసరత్తు వేగవంతం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన కసరత్తులో ఎన్నికల కమిషన్ వేగం పెంచింది. ఈ ఏడాది డిసెంబర్తో రాష్ట్ర అసెంబ్లీ కాలం ముగియనుంది. దీంతో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నది. ఇందులో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో 33 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు ఎన్నికల నిర్వహణపై ఈసీ అధికారులు అవగాహన సమావేశం నిర్వహించినట్లు సీఈవో వికాస్రాజ్ అన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఓటింగ్ శాతాన్ని పెంచడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు అవగాహన కల్పించారు. సమస్యాత్మక ప్రాంతాలు, స్ట్రాంగ్ రూంల భద్రతపైనా ఆరా తీశారు.