30 నుంచి పోడు భూముల పంపిణీ
రాష్ట్రంలో ఈ నెల 30 వ తేదీనుంచి గిరిజనులకు పోడు భూముల పట్టాలను పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని అసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నారు. అదే రోజు నూతనంగా నిర్మితమైన ఆసిఫాబాద్ కలక్టరేట్ కార్యాలయం, జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు.
అఖిలపక్ష సమావేశానికి బీఆర్ఎస్ తరపున వినోద్ కుమార్
మణిపూర్ లో చెలరేగిన హింసపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ హాజరైంది. పార్టీ తరపున ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ తరపున ఎంపీ గురుమూర్తి ఈ భేటీకి వచ్చారు.
కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పిలుపు
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లా ముఖ్యనేతలకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. సోమవారం రాహుల్ గాంధీతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు భేటీ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది.ఈ నెలాఖరున పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్లో చేరబోతున్నారు. అయితే.. ఢిల్లీలో కాకుండా ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టి పొంగులేటి చేరబోతున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలు క్లారిటీ ఇచ్చేశారు. మరోవైపు.. నాగర్ కర్నూల్ వేదికగా జరిగే సభలో జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
కాంగ్రెస్ ఓ ప్యాకేజ్ పార్టీ: విజయశాంతి
కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద ప్యాకేజ్ పార్టీ అని, 2018లో గెలిచిన ఎమ్మెల్యేలను ఎలా అమ్ముకుందో ప్రజలందరికీ తెలుసని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి విమర్శించారు. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలోని మూసాపేట్ డివిజన్ లో ఇంటింటికి బీజేపీ భరోసా యాత్ర నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ‘కేసీఆర్ హఠావో– బీజేపీ కీ లావో’ నినాదంతో ముందుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రేపై విజయశాంతీతో చర్చలంటూ లీకేజీలిస్తూ, అవాస్తవాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ కావాలనే కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి లేపుతున్నారని ఆరోపించారు.
ఢిల్లీకి షర్మిల.. కాంగ్రెస్ లో వైఎస్సాఆర్టీపీ విలీనం?
వైఎస్సాఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారంటూ జోరుగా ఊహాగానాలు, ప్రచారం జరుగుతున్న వేళ ఇందుకు ఊతమిచ్చేలా కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు రోజుల్లో షర్మిల ఢిల్లీకి వెళ్తున్నారనే సమాచారం ఒక్కసారిగా గుప్పుమంది. ఈ పర్యటనలో ఆమె కాంగ్రెస్ ముఖ్యనేతలో భేటీ అవుతారని ప్రచారం జరుగుతోంది. కాగా వైఎస్ షర్మిల ఇప్పటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పలుమార్లు భేటీ అయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతానికి బీజేపీలోనే ఉన్నా: రాజగోపాల్ రెడ్డి
ఎమ్మెల్సీ కవిత విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరించాలని, ప్రజలు అదే కోరుకుంటున్నారని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అండర్ స్టాండింగ్ ఉందని అంతా అనుకుంటున్నారని అధిష్టానానికి కూడా అదే చెబుతానన్నారు. ఆ అపోహలను తొలగించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. పార్టీ మార్పుపై వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని, తాను ప్రస్తుతానికి బీజేపీలోనే ఉన్నానన్నారు. ఈరోజు మాజీ మంత్రి ఈటలతో కలిసి ఢిల్లీ బయల్దేరిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో జరుగుతున్న పరిణామాలను, తన సందేహాలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకు, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వివరిస్తానని చెప్పారు. కర్ణాటక ఎన్నికల తర్వాత కొంచెం ప్రజల ఆలోచనలో కొంచెం మార్పు వచ్చినట్టు కనబడుతోందని, మోదీ, అమిత్ షా తల్చుకుంటే ఇప్పటికీ తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందన్నారు.
సీఎం కాన్వాయ్ లోకి కొత్త కారు.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు
సీఎం కేసీఆర్ కాన్వాయ్ లోకి కొత్త ల్యాండ్ క్రూజర్ వాహనం వచ్చి చేరింది. ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి కొత్త కారును భద్రతా సింబంది తీసుకువచ్చారు. కొండపై ల్యాండ్ క్రూజర్ కార్ కు ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కారుకు ప్రమాదం
తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. కర్నాటకలోని శృంగేరి పీఠ సందర్శనకు వెళ్తుండగా మంగళూరు సమీపంలోని ముడూరు,-నల్లూరు క్రాస్ వద్ద ఇవాళ ఉదయం ఘటన జరిగింది. ఎదురుగా వచ్చే వాహనాన్ని తప్పించబోయిన ఎమ్మెల్యే కారు చెట్టును ఢీకొట్టినట్టు తెలుస్తోంది. కారు డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. చెట్టును ఢీ కొట్టి కారు ఆగిపోకపోతే పక్కనే ఉన్న లోయలో పడేదని సమాచారం.
దౌల్తాబాద్ లో దారుణం
వికారాబాద్ జిల్లాలోని దౌల్తాబాద్ లో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తి చెవులు, ముక్కు, నాలుకను కోసి అతి కిరాతకంగా చంపేశారు. మృతుడు దౌల్తాబాద్ కు చెందిన సంగేపల్లి శేఖర్(32)గా పోలీసులు గుర్తించారు. పాత కక్షలు, వివాహేతర సంబంధం నేపథ్యంలో ఈ మర్డర్జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు గోపాల్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
మరో మెడికో ఆత్మహత్యాయత్నం
వరంగల్ జిల్లాలో మరో మెడికో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపుతోంది. కేఎంసీలో పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న లాస్య నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి యత్నించింది. వెంటనే విద్యార్థినిని ఎంజీఎంకు తరలించగా.. వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఇప్పటికే సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులతో మెడికో ప్రీతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించడం తీవ్ర సంచలనం రేపుతోంది.