ఉద్యోగార్థులకు అదనపు నైపుణ్యాలతో పాటు ఉద్యోగం చేస్తున్న వారికి కెరీర్లో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లే వినూత్నమైన కోర్సులను అందించేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆహ్వానం పలుకుతోంది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా మండలితో ఎంఓయూ కుదుర్చుకుంది. అతి తక్కువ ఫీజుతో పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఈ కోర్సులను పరిచయం చేయనున్నారు. ఐఎస్బీలో సర్టిఫికేట్ కోర్సులకు చాలా ఫీజు ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో వీటిని కేవలం రూ.2,360కే అందిస్తున్నారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సర్టిఫికేట్ అందించనుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుతో పాటుగా అఖిల భారత సాంకేతిక విద్యామండలి కూడా ఆమోదం తెలిపింది. ఆన్లైన్ ద్వారా అందించే ఒక్కో కోర్సును 40 గంటల పాటు నిర్వహిస్తారు.
కోర్సుల వివరాలు
బిజినెస్ లిటరసీ కోర్సు
ఈ కోర్సులో అకౌంటింగ్ ఫండమెంటల్స్, స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఎనలిటిక్స్, క్రిటికల్ థింకింగ్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, నెగోషియేషన్, ఎనాలసిస్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తదితర అంశాలపై బోధన అందిస్తారు.
బిహేవియరల్ స్కిల్స్
ఈ కోర్సులో కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ మైండ్సెట్, ఆర్ట్ ఆఫ్ నెట్వర్కింగ్ టెక్నాలజీ ఫండమెంటల్స్, ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ తదితర అంశాలను బోధిస్తారు. 40 గంటల ఈ ప్రోగ్రామ్ను కనీసం 3 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
డిజిటల్ లిటరరీ కోర్సు
ఈ కోర్సులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్చైన్ టెక్నాలజీ, డిజిటల్ మార్కెంటింగ్, డేటా సైన్స్ వంటి డిజిటల్ టెక్నాలజీపై ట్రైనింగ్ ఇస్తారు.
ఎంటర్ప్రెన్యూరియల్ లిటరసీ
ఇందులో స్టార్టప్ డెవలప్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్, ఎంటర్ప్రెన్యూర్షిప్, మార్కెటింగ్, ఫైనాన్స్ తదితర బిజినెస్ సంబంధిత అంశాలను బోధిస్తారు.
రాష్ట్ర సాంకేతిక విద్యామండలి ఆధ్వర్యంలో దరఖాస్తుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి నెలాఖరు నుంచి దరఖాస్తుల స్వీకరిస్తారు. ఏప్రిల్ 15 నుంచి మొదటి ఏవేని రెండు కోర్సులను, మే 15 నుంచి మిగిలిన రెండు కోర్సులను ప్రారంభిస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
వెబ్సైట్ : https://www.isb.edu