Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ : ఆగస్ట్ ​2024

కరెంట్​ అఫైర్స్​ : ఆగస్ట్ ​2024

అంతర్జాతీయం

పారిస్‌ ఒలింపిక్స్‌ మస్కట్‌.. ఫ్రిజెస్‌
ఫ్రిజెస్‌.. పారిస్‌ ఒలింపిక్స్‌ మస్కట్‌ పేరిది. ఫ్రాన్స్‌ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్‌ క్యాప్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్‌కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్‌రిపబ్లిక్‌కు సూచికలు. ఫ్రాన్స్‌ జాతీయ చిహ్నంలోని ఎరుపు, తెలుపు, నీలం రంగులతో దీన్ని రూపొందించారు.

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే హత్య
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో గ్లోబల్ టెర్రరిస్ట్, పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ రాజకీయ చీఫ్ ఇస్మాయిల్ హనియే వైమానిక దాడిలో హత్యకు గురయ్యారు. టెహ్రాన్​లో ఇరాన్‌ నూతన అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఈ హత్య జరిగింది.

అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రో­జు
గత 84 ఏళ్లలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన రో­జుగా జులై 22వ తేదీ రికార్డు సృష్టించింది. ఆ రో­జున ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 17.15 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైనట్టు యూరోపియన్‌ యూనియన్‌­కు చెందిన కోపర్నికస్‌ క్లెమేట్‌ చేంజ్‌ సర్వీస్‌ (సీ3ఎస్‌) తెలిపింది.

బంగ్లాదేశ్‌ ప్రభుత్వాధినేతగా యూనస్‌
రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్‌ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వం వహించనున్నారు. ప్రధానిగా ఉన్న షేక్‌ హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు మొహమ్మద్‌ షహబుద్దీన్‌ పార్లమెంటును రద్దు చేశారు.

పాంగాంగ్‌ సరస్సుపై చైనా వంతెన
లద్ధాక్‌లోని పాంగాంగ్‌ సరస్సుపై చైనా 400 మీటర్ల కొత్త వంతెన నిర్మాణం పూర్తి చేసింది. 1958 నుంచి చైనా ఆధీనంలో ఉన్న భూభాగంలో నిర్మితమైన ఈ వంతెన.. లద్ధాఖ్‌లో భారత్, చైనాల మధ్య గల వాస్తవాధీన రేఖకు సమీపాన ఉంది.

అమెరికా జాతీయ ప‌క్షిగా బాల్డ్‌ ఈగల్‌
అమెరికా జాతీయ పక్షిగా ‘బాల్డ్‌ ఈగల్‌’ను గుర్తిస్తూ ఆ దేశ సెనెట్‌ బిల్లుకు ఆమోదం తెలిపింది. సుమారు 240 ఏళ్లుగా ఈ పక్షిని అమెరికాలో అధికార చిహ్నంగా వాడుకున్నారు.1940లో ఈ పక్షుల్ని వేటాడటంపై నిషేధం విధించారు. జాతీయ పక్షి హోదా మాత్రం ఇప్పటివరకు దక్కలేదు.

భారత్​లో ఆపరేషన్​ తరంగ్​
తరంగ శక్తి–2024 పేరిట తొలిసారిగా భారత్‌ బహుళ దేశాల వైమానిక విన్యాసాన్ని నిర్వహిస్తోంది. మొదటి దశ తమిళనాడులో జరగగా, రెండోదశ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్‌ 14వ తేదీ వరకు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నిర్వహించనున్నారు. దాదాపు 30 దేశాలు ఈ విన్యాసంలో పాల్గొననున్నాయి.

అమెరికాలో ఎత్తయిన హనుమాన్
అమెరికా టెక్సాస్ రాష్ట్రంలోని హోస్టన్ నగరంలో 90 అడుగుల ఎత్తయిన హనుమంతుని విగ్రహాన్ని ఆవిష్కరించారు.ఈ భారీ విగ్రహం అమెరికాలోని మూడవ ఎత్తయిన విగ్రహంగా పేరు తెచ్చుకుంది. ఈ విగ్రహానికి ‘స్టాట్యూ ఆఫ్ యూనియన్’ అని పేరు పెట్టారు. టెక్సాస్‌లోని షుగర్ ల్యాండ్ ప్రాంతంలోని అష్టలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

వేగంగా వ్యాపిస్తున్న మంకీపాక్స్‌
తూర్పు, మధ్య ఆఫ్రికా దేశాల్లో ప్రాణాంతక మంకీపాక్స్​ (ఎంపాక్స్‌) విస్తరణ పెరుగుతున్నట్లు అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. ఆయా దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించింది. ఎంపాక్స్‌ సోకితే ఫ్లూ తరహా లక్షణాలు కనిపిస్తాయి.

స్మార్ట్‌ఫోన్ల సరఫరాల్లో చైనా టాప్​
దేశీయంగా ఏప్రిల్‌–-జూన్‌ త్రైమాసికంలో, స్మార్ట్‌ఫోన్ల సరఫరాల్లో చైనా కంపెనీలు వివో, షావోమీ తొలి రెండు స్థానాల్లో నిలిచాయని మార్కెట్‌ పరిశోధనా సంస్థ ఐడీసీ (ఇంటర్నేషనల్‌ డేటా కార్పొరేషన్‌) తెలిపింది. శామ్‌సంగ్‌ మూడోస్థానంలో నిలవగా, యాపిల్‌కు ఆరోస్థానం దక్కింది.

అంతర్జాతీయ నేర న్యాయస్థానంలోకి ఉక్రెయిన్‌
అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఐసీసీ)లో సభ్యత్వం పొందే దిశగా ఉక్రెయిన్‌ ముందడుగు వేసింది. సంబంధిత రోమ్‌ శాసనానికి ఆ దేశ పార్లమెంటు ఆమోదముద్ర వేసింది.

చైనా ఆర్మీ జనరల్‌కు పాక్‌ పురస్కారం
చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ లీ జియామింగ్‌ను పాక్‌ ఘనంగా సత్కరించింది. పాకిస్తాన్ అత్యున్నత గౌరవ పురస్కారాలలో ఒకటైన ‘నిషాన్-ఈ-ఇమ్తియాజ్’ను లీ జియామింగ్‌కు అందజేసింది. గతంలో ఈ గౌరవాన్ని భారత్‌కు చెందిన దివంగత నటుడు దిలీప్ కుమార్ అందుకున్నారు.

వయనాడ్​లో వరద బీభత్సం
కేరళ వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య200కి పైగా పెరిగింది. వందల మందికిపైగా గాయపడ్డారు. వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం, ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు, సైన్యం, నౌకాదళానికి చెందిన బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు
ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీం స్పష్టంచేసింది.

యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)కు కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ నియమితలయ్యారు. 1983 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి ప్రీతి సుదాన్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు.

ఐఎస్‌ఎస్‌లోకి గగన్‌యాన్‌ వ్యోమగామి
గగన్‌యాన్‌ మిషన్‌ కోసం శిక్షణ పొందుతున్న నలుగురు వ్యోమగాముల్లో ఒకరు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లోకి వెళ్లనున్నారు. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా నాసా, ఇస్రో, అమెరికాకు చెందిన యాక్సియమ్‌ అనే ప్రైవేటు సంస్థతో ఒప్పందం చేసుకుందన్నారు.

రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో మారిన పేర్లు
రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌ను ‘గణతంత్ర మండపం’గా, అశోక హాల్‌ను ‘అశోక మండపం’గా పేరు మార్చారు. దర్బార్‌ హాల్‌ను జాతీయ అవార్డులు ప్రదానం చేసేందుకు, ముఖ్యమైన వేడుకలు నిర్వహించేందుకు ఉపయోగిస్తుండగా.. అశోక హాల్‌ ఓ బాల్‌రూమ్‌గా ఉపయోగపడుతోంది.

‘షింకున్‌ లా టన్నెల్‌’ ప్రాజెక్ట్​ ప్రారంభం
లేహ్‌కు వెళ్లే రూట్‌లో షింకున్‌ లా టన్నెల్‌ ప్రాజెక్టు పనులను ప్రధాని మోడీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ టన్నెల్‌ సుమారు 4.1 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా టన్నెల్‌ ద్వారా లేహ్‌కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.

రాష్ట్రపతికి ఫిజీ అత్యున్నత పురస్కారం
ఫిజీ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘కంపానియన్‌ ఆఫ్‌ ది ఆర్డర్‌ ఆఫ్‌ ఫిజీ’ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందుకున్నారు. ఆ దేశ అధ్యక్షుడు రతు విలియమ్‌ మైవలిలీ కటోనివేర్‌ ముర్ముకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు.

ఐఎస్‌ఎస్‌ యాత్రకు శుభాంశు శుక్లా
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని (ఐఎస్‌ఎస్‌)కి చేపట్టబోయే యాత్ర కోసం ప్రధాన వ్యోమగామిగా గ్రూప్‌ కెప్టెన్‌ శుభాంశు శుక్లాను ఇస్రో ఎంపిక చేసింది. బ్యాకప్‌ కింద గ్రూప్‌ కెప్టెన్‌ ప్రశాంత్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ను ఎంపిక చేసింది. ఈ మిషన్‌ను అమెరికాతో సంయుక్తంగా నిర్వహిస్తుంది.

విజ్ఞాన్‌రత్న అవార్డులు
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పరిశోధనలు, నవ్యావిష్కరణలకు కృషి చేసే వారి కోసం కేంద్రం ఈ ఏడాది నుంచి కొత్తగా ప్రారంభించిన విజ్ఞాన్‌ అవార్డులకు పలువురు ప్రముఖులు ఎంపికయ్యారు. జీవరసాయన శాస్త్రవేత్త గోవిందరాజన్‌ పద్మనాభన్‌కు తొలి విజ్ఞాన్‌రత్న పురస్కారం ప్రకటించింది. విజ్ఞాన్‌ టీమ్‌ అవార్డును చంద్రయాన్‌-3 బృందం సొంతం చేసుకుంది.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీం తీర్పు
ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీం స్పష్టంచేసింది.

యూపీఎస్సీ చైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)కు కొత్త చైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌ నియమితలయ్యారు. 1983 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి ప్రీతి సుదాన్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఆమె యూపీఎస్సీ సభ్యురాలిగా పనిచేస్తున్నారు.

దేశంలోని టాప్‌- విద్యాసంస్థలు
కేంద్ర విద్యాశాఖ తాజాగా భారతదేశంలోనే అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను ప్రకటించింది. నేషనల్ ఇన్​స్టిట్యూషనల్ ర్యాకింగ్ ఫ్రేమ్ వర్క్ 2024 ప్రకారం.. ఐఐటీ మద్రాస్‌ టాప్​లో నిలిచింది.2016లో విద్యాసంస్థలకు ర్యాంకింగ్స్‌ ప్రారంభించినప్పటి నుంచి ఈ సంస్థ టాప్‌ ప్లేస్‌లోనే కొనసాగుతుండటం విశేషం. ఇక తర్వాతి స్థానాల్లో ఐఐఎస్‌సీ బెంగళూరు, ఐఐటీ బాంబే వరుసగా ఉన్నాయి.

రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో మారిన పేర్లు
రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్‌ హాల్‌ను ‘గణతంత్ర మండపం’గా, అశోక హాల్‌ను ‘అశోక మండపం’గా పేరు మార్చారు. దర్బార్‌ హాల్‌ను జాతీయ అవార్డులు ప్రదానం చేసేందుకు, ముఖ్యమైన వేడుకలు నిర్వహించేందుకు ఉపయోగిస్తుండగా.. అశోక హాల్‌ ఓ బాల్‌రూమ్‌గా ఉపయోగపడుతోంది.

గిన్నిస్‌ రికార్డు సాధించిన రికీకేజ్‌
మూడు గ్రామీ అవార్డుల విజేత రికీకేజ్‌ ఒడిశాకు చెందిన కళింగ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ (కేఐఎస్‌ఎస్‌)తో కలిసి ‘లార్జెస్ట్‌ సింగింగ్‌ లెసన్‌’ పేరిట భారత జాతీయగీతం జనగణమన గానంతో గిన్నిస్‌ రికార్డు సాధించారు. ఒడిశాకు చెందిన 14,000 మంది గిరిజన విద్యార్థులతో కలిసి సరికొత్త రికార్డు స్థాపించారు.

ఎస్‌బీఐ చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు
స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) చైర్మన్‌గా జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆగస్టు 28న శ్రీనివాసులు బాధ్యతలు చేపడతారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.

భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు
ప్రతిష్టాత్మకంగా భావించే 70వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2024లను కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. మలయాళ చిత్రం ‘ఆట్టం’ ఉత్తమ చిత్రంగా ఎంపికవగా, కాంతారా చిత్ర హీరో రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా, ఉత్తమ నటీమణులుగా తిరుచ్చిత్రంబలం( తమిళ్)లో నటించిన నిత్యమీనన్, కచ్ ఎక్స్ ప్రెస్ (గుజరాతీ)లో నటించిన మానసి పరేఖ్‌లు పురస్కారాన్ని పంచుకున్నారు. ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తీకేయ-–2 ఎంపికైంది.

85కు చేరిన రామ్సర్​ సైట్లు
దేశంలో మూడు కొత్త రామ్సర్‌ సైట్లను గుర్తించడంతో రామ్సర్‌ సైట్ల సంఖ్య 85కు చేరింది, ఇది దేశంలో 1,358,068 హెక్టార్ల విస్తీర్ణాన్ని కవర్‌ చేస్తుంది. తమిళనాడులోని నంజరాయన్‌ పక్షి అభయారణ్యం, కజువెలి పక్షి అభయారణ్యం, మధ్యప్రదేశ్‌లోని తవా రిజర్వాయర్‌. ఈ రామ్సార్ సైట్లు ప్రస్తుతం, త‌మిళనాడులో 18 సైట్‌లు ఉంటే, ఉత్తర్ ప్రదేశ్‌లో 10 సైట్లు ఉన్నాయి.

వెల్లుల్లి కూరగాయని హైకోర్టు తీర్పు
వెల్లుల్లిని కూరగాయగా వర్గీకరిస్తూ మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా భావించడం కన్నా వెజిటెబుల్‌గానే చూడాలంది. వెల్లుల్లికి గట్టి సువాసన, రుచి కారణంగా సుగంధ ద్రవ్యంగా చూస్తున్నప్పటికి దానికి ఉన్న పాడైపోయే గుణం, తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే వెజిటెబుల్‌గానే చూడాలంది.

అతిపెద్ద హైపర్‌ లూప్‌ ట్యూబ్‌
అత్యాధునిక సాంకేతికతను వినియోగించి మద్రాస్‌ ఐఐటీ 425 మీటర్ల పొడవైన హైపర్‌ లూప్‌ ట్యూబ్‌ను నిర్మించింది. అక్కడి విద్యార్థులు ‘ఆవిష్కార్‌ హైపర్‌లూప్‌’ పేరుతో ఒక బృందంగా ఏర్పడి, దీని ట్రాక్‌ ఏ దశలో ఎలా ఉండాలి అనేది డిజైన్‌ చేశారు.

ఒడిశాలో ఉద్యోగినులకు నెలసరి సెలవు
ఒడిశా రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న మహిళలకు రుతుస్రావం సమయంలో తొలిరోజు లేదా రెండో రోజు సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది ఉద్యోగాలు చేస్తున్న మహిళలందరికీ వర్తిస్తుందని పేర్కొన్నారు.

ప్రపంచంలో టాప్​ బ్రాండ్​గా అమూల్‌
ప్రపంచంలోనే అత్యంత బలమైన ఆహార, డెయిరీ బ్రాండ్‌గా అమూల్‌ నిలిచింది. బ్రిటన్‌కు చెందిన కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్‌ ఫైనాన్స్‌ తన వార్షిక నివేదిక ‘ఫుడ్‌ అండ్‌ డ్రింక్‌ 2024’లో ఇచ్చిన ర్యాంకుల ప్రకారం నాలుగో ఏడాది అగ్రస్థానం నిలబెట్టుకుంది. ఆల్కహాలేతర పానీయాల బ్రాండ్లలో కోకకోలా (35 బి. డాలర్లు) తొలి స్థానంలో నిలిచింది.

జ‌న్‌పోష‌న్ కేంద్రాలుగా రేష‌న్ షాపులు
రేషన్‌ దుకాణాలను జన్‌ పోషణ్‌ కేంద్రాలుగా మార్చే పైలట్‌ ప్రాజెక్ట్‌ను కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రారంభించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌ లో పైలట్‌ ప్రాజెక్టు కింద 60 రేషన్‌ షాపులను జన్‌ పోషణ్‌ కేంద్రాలుగా మార్చనున్నట్టు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ అమలయ్యే షాపుల్లో ఇకపై చిరు ధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, నిత్యావసరాలు అమ్మవచ్చు.

లద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం లద్దాఖ్‌లో లేహ్, కార్గిల్‌ జిల్లాలు ఉన్నాయి. కొత్తగా జన్‌స్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్‌థాంగ్‌ జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.

ఏఐతో ఈ-ట్రాక్టర్‌
పుణెకు చెందిన సిద్దార్థ్‌ గుప్తా కృత్రిమమేధ (ఏఐ) జోడించి ఈ–-ట్రాక్టర్‌ ఆవిష్కరించాడు. ఈ ట్రాక్టర్‌ డ్రైవర్​ లేకుండానే దుక్కి దున్నేసి, వేరే పనులు సునాయాసంగా చేసేస్తుంది. సిద్దార్థ్‌ గుప్తా మగర్‌పట్టా వీఐటీ కళాశాలలో ఇంజినీరింగు పూర్తిచేశాక 2019లో ఈ-ట్రాక్టర్లపై పరిశోధన ప్రారంభించాడు.

నాస్కాం చైర్‌పర్సన్‌గా సింధు
ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కాం (నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ సర్వీస్‌ కంపెనీస్‌) చైర్‌ పర్సన్‌గా శాప్‌ ల్యాబ్స్‌ ఇండియా ఎండీ సింధు గంగాధరన్‌ నియమితులయ్యారు. శాప్‌ ల్యాబ్స్‌ తొలి మహిళా ఎండీగా ఉన్న ఈమె, గత ఏడాది నాస్కాం జీసీసీ కౌన్సిల్‌ ఛైర్‌గా ఎంపికయ్యారు.

ప్రాంతీయం

తెలంగాణ గవర్నర్‌గా జిష్ణుదేవ్‌ వర్మ
తెలంగాణ నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే జిష్ణు దేవ్ వర్మ చేత ప్రమాణం చేయించారు.

విద్యుత్​ విచారణ కమిషన్‌ చైర్మన్‌
యాదాద్రి, భదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కమిషన్‌కు చైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ను ప్రభుత్వం నియమించింది.

జాతీయ చేనేత పురస్కారం
దిల్లీలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో యాదాద్రి జిల్లాకు చెందిన కళాకారుడు కర్నాటి ముఖేశ్‌ భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖఢ్‌ చేతులమీదుగా ‘జాతీయ చేనేత పురస్కారం-2023’ అందుకున్నారు.

సిరిసిల్ల నుంచి హర్‌ ఘర్‌ తిరంగా జెండాలు
హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమం కోసం సిరిసిల్ల నుంచి దేశంలో పలు రాష్ట్రాలకు జాతీయ జెండాలను సరఫరా చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి తెలంగాణ తపాలా సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌మాస్టర్‌ జనరల్‌ (సీపీఎంజీ) పీవీఎస్‌ఎన్‌ రెడ్డి తెలిపారు.

ఐటీ రంగంలో హైదరాబాద్‌ హవా
2023-–24 ఏడాదికి తెలంగాణలో ఐటీ ఎగుమతుల విలువ రూ.2,68,233 కోట్లకు చేరింది. గతేడాదితో పోల్చితే 11.2% పెరిగింది. ఈ విషయంలో జాతీయస్థాయి వృద్ధిరేటు 3.3% మాత్రమే. రాష్ట్రంలోని ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 9.46 లక్షలకు చేరింది.

రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు
తెలంగాణ పోలిస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ చదువు యాదయ్యకు ప్రెసిడెంట్స్ మెడల్ ఫర్ గ్యాలంటరీ (పీఎంజీ) అవార్డ్ అందుకున్నారు. ఈ రాష్ట్రపతి అవార్డ్‌ను దేశం మొత్తంలో ఒకే ఒక్క పోలీస్‌ అధికారి యాదయ్యకు దక్కింది.

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలు
గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఆచార్య కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌ శుక్రవారం శాసనమండలి సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వీరితో ప్రమాణం చేయించారు.

వ్యవసాయ సలహాదారుగా పోచారం
రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని, పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్య చైర్మన్‌గా నల్గొండ జిల్లాకు చెందిన గుత్తా అమిత్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోచారంకు క్యాబినెట్‌ మంత్రి హోదాతో ఈ పదవిలో ఉంటారు.

వార్తల్లో వ్యక్తులు

మనూ భాకర్‌
ఒకే ఒలింపిక్స్ ఎడిషన్‌లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ మహిళా అథ్లెట్‌గా మనూ భాకర్‌ చరిత్ర సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకంతో పాటు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌తో కలిసి మరో కాంస్యం సాధించింది.

వినయ్‌ క్వాత్రా
భారత విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా అమెరికాలో భారత రాయబారిగా నియమితులయ్యారు.1988లో ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా విధుల్లో చేరిన వినయ్‌ క్వాత్రా వివిధ హోదాల్లో పనిచేశారు.

సారా జోస్ట్రోమ్‌
మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో సారా జోస్ట్రోమ్‌ (స్వీడన్‌) గోల్డ్​ మెడల్​ సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె 52.16 సెకన్లలో రేసు పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. లియాన్‌ మర్చండ్‌ (ఫ్రాన్స్‌) పసిడి డబుల్‌ సాధించాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లై, 400 మీటర్ల మెడ్లీలోనూ మర్చండ్‌ స్వర్ణం గెలిచాడు.

కె.పద్మజ
దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్‌ చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌(పీసీసీఎం)గా కె.పద్మజ రైల్‌నిలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆమె ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్‌(ఐఆర్‌టీఎస్‌) 1991 బ్యాచ్‌ అధికారి. కాగా ద.మ. రైల్వే జోన్‌లో తొలి మహిళా పీసీసీఎం ఈమెనే.

పూజా మనోరమ దిలీప్‌ ఖేడ్కర్‌
మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా మనోరమ దిలీప్‌ ఖేడ్కర్‌ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. ఆమె రికార్డులను పరిశీలించగా సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్స్‌-2022 నియమాలను ఉల్లంఘించినట్లు తేలిందని, అందుకే భవిష్యత్తులో యూపీఎస్సీకి చెందిన ఎలాంటి పరీక్షలను రాయకుండా ఖేడ్కర్‌పై శాశ్వత నిషేధం విధించింది.

నరేంద్ర మోదీ
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. సర్వేలో 69 శాతం ఓట్లతో భారత ప్రధాని మొదటి స్థానంలో నిలవగా.. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్‌ ఒబ్రేడర్‌ 63 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు.

సాధనా సక్సేనా నాయర్‌
భారత సైన్యంలో వైద్యసేవల విభాగం డైరెక్టర్‌ జనరల్‌ (డీజీ)గా లెఫ్టినెంట్‌ జనరల్‌ సాధనాసక్సేనా నాయర్‌ బాధ్యతలు చేపట్టారు.ఈ పదవిని దక్కించుకున్న తొలి మహిళ ఆమే. సాయుధ దళాల హాస్పిటల్‌ సర్వీసెస్‌ డీజీ పదవిని చేపట్టిన తొలి అతివగా కూడా ఆమె పేరిటే రికార్డు ఉంది.

వినయ్‌ క్వాత్రా
భారత విదేశీ వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి వినయ్‌ క్వాత్రా అమెరికాలో భారత రాయబారిగా నియమితులయ్యారు.1988లో ఐఎఫ్‌ఎస్‌ అధికారిగా విధుల్లో చేరిన వినయ్‌ క్వాత్రా వివిధ హోదాల్లో పనిచేశారు.

సారా జోస్ట్రోమ్‌
మహిళల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో సారా జోస్ట్రోమ్‌ (స్వీడన్‌) గోల్డ్​ మెడల్​ సొంతం చేసుకుంది. ఫైనల్లో ఆమె 52.16 సెకన్లలో రేసు పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. లియాన్‌ మర్చండ్‌ (ఫ్రాన్స్‌) పసిడి డబుల్‌ సాధించాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లై, 400 మీటర్ల మెడ్లీలోనూ మర్చండ్‌ స్వర్ణం గెలిచాడు.

పూజా మనోరమ దిలీప్‌ ఖేడ్కర్‌
మహారాష్ట్రకు చెందిన వివాదాస్పద ప్రొబేషనరీ ఐఏఎస్‌ అధికారిణి పూజా మనోరమ దిలీప్‌ ఖేడ్కర్‌ అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. ఆమె రికార్డులను పరిశీలించగా సివిల్‌ సర్వీస్‌ ఎగ్జామ్స్‌-2022 నియమాలను ఉల్లంఘించినట్లు తేలిందని, అందుకే భవిష్యత్తులో యూపీఎస్సీకి చెందిన ఎలాంటి పరీక్షలను రాయకుండా ఖేడ్కర్‌పై శాశ్వత నిషేధం విధించింది.

వేణుగోపాల్
పార్లమెంట్‌లో కీలకమైన ప్రజాపద్దుల కమిటీ(పీఏసీ) చైర్మన్‌గా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌ నియమితులయ్యారు. 15 మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ సభ్యులతో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీకి వేణుగోపాల్‌ నేతృత్వం వహిస్తారు. 2025 ఏప్రిల్ 30 వరకు ఈ కమిటీకి గడువు ఉంటుంది.

నళిన్‌ ప్రభాత్
జమ్మూకశ్మీర్‌కు కొత్త డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా(డీజీపీ) 1992వ బ్యాచ్‌ ఏపీ కేడర్‌ ఐపీఎస్‌ అధికారి నళిన్‌ ప్రభాత్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్‌లో డీజీపీగా ఆర్‌ఆర్‌ స్మైన్‌ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పదవీకాలం సెప్టెంబర్ 30వ తేదీ ముగియనుంది.

రామ్‌ నారాయణ్‌ అగర్వాల్
ప్రముఖ క్షిపణి శాస్త్రవేత్త, ‘అగ్ని’ క్షిపణి మిషన్‌ తొలి ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ రామ్‌ నారాయణ్‌ అగర్వాల్ అనారోగ్యంతో హైదరాబాద్​లో మరణించారు. భూతల క్షిపణి.. భారత క్షిపణుల్లో మణిహారంగా పేర్కొనే ‘అగ్ని’ని రూపొందించడంలో ఈయన కీలకపాత్ర పోషించారు. అందుకే ఆర్‌ఎన్‌ అగర్వాల్‌ను ఫాదర్‌ ఆఫ్‌ ది అగ్ని సిరీస్‌ ఆఫ్‌ మిస్సైల్స్‌గా పిలుస్తుంటారు.

సింగం శ్రీకాంత్‌ పాణి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఖగోళ, భౌతిక శాస్త్రవేత్త సింగం శ్రీకాంత్‌ పాణిని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) నుంచి అవార్డు అందుకున్నారు. విశ్వంలోని సుదూర ప్రాంతాలపై పరిశోధనలు చేస్తూ, సరిహద్దులను ఛేదించి సవాళ్లను ఎదుర్కొంటున్న తరుణంలో ఖగోళ శాస్త్ర పరిశోధలకు ఈ అవార్డు దక్కింది.

రాహుల్‌ నవీన్‌
ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాత్కాలిక చీఫ్‌గా ఉన్న రాహుల్‌ నవీన్‌ పూర్తిస్థాయి డైరెక్టర్‌గా నియమితులయ్యారు.1993 బ్యాచ్‌ ఐఆర్‌ఎస్‌ అధికారి అయిన నవీన్‌ ఈడీ డైరెక్టర్‌గా రెండేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఏది ముందైతే అప్పటివరకు పదవిలో కొనసాగుతారు.

పావెల్‌ దురోవ్‌
ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ ‘టెలిగ్రామ్‌’ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్‌ దురోవ్‌ను పారిస్‌ విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. టెలిగ్రామ్‌ ద్వారా హవాలా మోసం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లలపై లైంగిక దోపిడీకి సంబంధించిన సమాచారం షేర్‌ చేయడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.

వినోద్‌ కుమార్‌ చౌదరి
ఢిల్లీకి చెందిన వినోద్‌ టైపింగ్‌లో ఏకంగా 20 గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులు సృష్టించాడు. తద్వారా 19 గిన్నిస్‌ రికార్డులను తన పేర లిఖించుకున్న సచిన్‌ను దాటేశాడు. కళ్లకు గంతలు కట్టుకుని అత్యంత వేగంగా టైపింగ్‌ చేయడం, నోటి పుల్ల (మౌత్‌ స్టిక్‌)తో టైపింగ్, ఆంగ్ల వర్ణమాలను ముక్కుతో వేగంగా టైప్‌ చేయడం వంటి అరుదైన ఫీట్లు వినోద్‌ ఖాతాలో ఉన్నాయి.

డా.రఘురాం
ప్రముఖ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ చికిత్స నిపుణులు, కిమ్స్‌-ఉషాలక్ష్మి బ్రెస్ట్‌ డిసీజెస్‌ సెంటర్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ డాక్టర్‌ రఘురాంకు అంతర్జాతీయ శస్త్ర చికిత్స సమాఖ్య(ఐఎస్‌ఎస్‌) గౌరవ ఫెలోషిప్‌ను స్వీకరించారు. 122 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ సంస్థ గౌరవ ఫెలోషిప్‌నకు తొలిసారి భారత ఉపఖండం నుంచి డాక్టర్‌ రఘురాం ఎంపికయ్యారు.

సాయితేజ
తెలంగాణలోని హైదరాబాద్‌ జిల్లాకు చెందిన సాయితేజ యూరప్‌లోని అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ను అధిరోహించాడు. జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ద్వారా సాయితేజ తన సాహసానికి మరో మెట్టు ఎక్కాడు.

తన్వీ పత్రి
భారత టీనేజ్‌ షట్లర్‌ తన్వీ పత్రి ఆసియా అండర్‌–15 బ్యాడ్మింటన్ బాలికల సింగిల్స్‌ చాంపియన్‌గా అవతరించింది. ఈ గెలుపుతో ఆసియా అండర్‌–15 బాలికల సింగిల్స్‌ విభాగంలో టైటిల్‌ సాధించిన మూడో భారత క్రీడాకారిణిగా తన్వీ గుర్తింపు పొందింది.

స్పోర్ట్స్​

చైనాకు తొలి గోల్డ్​, కజకిస్థాన్‌కు ఫస్ట్​ మెడల్​
పారిస్‌ ఒలింపిక్స్‌లో చైనా తొలి స్వర్ణం దక్కించుకుంది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్లో లిహావ్‌ షెంగ్‌-యుటింగ్‌ హువాంగ్‌ జోడీ గెలిచింది. ఫైనల్‌ కంటే ముందు జరిగిన కాంస్య పోరులో తొలి పతకం కజకిస్థాన్‌కు దక్కించుకుంది.

షూటింగ్‌లో స్వప్నిల్‌కు కాంస్యం
పారిస్ ఒలింపిక్స్‌లో యువ షూటర్‌ స్వప్నిల్ మెన్స్‌ 3 పొజిషన్‌ షూటింగ్‌ ఫైనల్‌లో మూడో స్థానంలో నిలిచి, కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. మూడు పొజిషన్లలో జరిగిన ఈ పోటీల్లో స్వప్నిల్ మొత్తం 451.4 పాయింట్లు సాధించాడు.

వినేశ్‌ ఫొగాట్‌పై అనర్హత
ఒలింపిక్స్‌ రెజ్లింగ్‌ ఫైనల్లోకి దూసుకెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్‌ ఫొగాట్‌ చరిత్ర సృష్టించింది. కానీ ఉండాల్సిన బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందనే కారణంగా వినేశ్‌ను అనర్హురాలిగా తేలుస్తూ.. ఆమె విజయాలను రద్దు చేశారు.

వంద మీటర్ల చాంపియన్​ లైల్స్‌
పారిస్‌ ఒలింపిక్స్‌ 100 మీటర్ల పరుగులో అమెరికా అథ్లెట్‌ నోవా లైల్స్‌ విజేతగా నిలిచాడు. అతను 9.79 (.784) సెకన్లలో లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఫైనల్లో కిషేన్‌ థాంప్సన్‌ను వెనక్కి నెట్టి నోవా స్వర్ణం గెలిచాడు.

ముగిసిన పారిస్​ ఒలింపిక్​ గేమ్స్​
200కు పైగా దేశాలు, 10 వేల మందికి పైగా అథ్లెట్లతో ఆకట్టుకున్న పారిస్​ ఒలింపిక్స్​ ముగిశాయి. అమెరికా 126 పతకాలతో అగ్రస్థానం, 91 పతకాలతో చైనా రెండో స్థానం సాధించాయి. ఒక రజతం, అయిదు కాంస్యాలు సాధించిన భారత్‌ 71వ స్థానానికి పరిమితమైంది. గత క్రీడల్లో 48వ స్థానం సాధించింది. తర్వాతి ఒలింపిక్స్‌ లాస్‌ఏంజెలెస్‌లో జరగబోతున్నాయి.

అభినవ్‌ బింద్రాకు ఒలింపిక్‌ ఆర్డర్‌
భారత దిగ్గజ షూటర్‌ అభినవ్‌ బింద్రాకు అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) ప్రతిష్టాత్మక ‘ఒలింపిక్‌ ఆర్డర్‌’ను ప్రదానం చేసింది. బింద్రా 2008లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో విజేతగా నిలిచి.. వ్యక్తిగత ఒలింపిక్స్‌ స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించాడు.

పారాఒలింపిక్స్‌ ఫ్లాగ్‌ బేరర్స్​
పారిస్‌ వేదికగా ఒలింపిక్స్‌ ముగియగా.. ఆగ‌స్టు 28 నుంచి సెప్టెంబర్‌ 8 వరకు అక్కడే పారాలింపిక్స్‌ జరగనున్నాయి. ఈ క్రీడల్లో భారత్‌ నుంచి 84 మంది అథ్లెట్లు 12 క్రీడాంశాల్లో పాల్గొంటారు. పారిస్‌ పారాలింపిక్స్‌ ప్రారంభ వేడుకల్లో జావెలిన్‌ త్రోయర్‌ సుమిత్‌ అంటిల్, షాట్‌పుటర్‌ భాగ్యశ్రీ జాదవ్‌ భారత ఫ్లాగ్​ బేరర్స్​గా వ్యవహరించనున్నారు.

యూఏఈలో మహిళల ప్రపంచకప్‌
ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ బంగ్లాదేశ్‌ నుంచి యూఏఈకి తరలించారు. బంగ్లాదేశ్‌లో అధికార మార్పిడి నేపథ్యంలో కల్లోల పరిస్థితులు నెలకొనడంతో ఈ మెగా టోర్నీ నిర్వహణ సాధ్యం కాదని ఐసీసీ బోర్డు వేదికను మార్చింది.

ఐసీసీ చైర్మన్​గా జై షా
ఐసీసీ నూతన చైర్మన్‌గా బీసీసీఐ సెక్రటరీ జై షా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. డిసెంబర్‌ 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నాడు. గతంలో జగ్‌మోహన్‌ దాల్మియా, శరద్‌ పవార్‌, ఎన్‌.శ్రీనివాసన్‌, శశాంక్‌ మనోహర్‌ ఐసీసీ చైర్మన్లుగా పనిచేశారు.

సినెర్​కు ఐదో సింగిల్స్​ టైటిల్​
ఇటలీ టెన్నిస్‌ స్టార్ సినెర్‌ ఐదో సింగిల్స్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌–1000 టోర్నీలో సినెర్‌ తొలిసారి విజేతగా నిలిచాడు. ఈ టోర్నీకి ముందు సినెర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్, మయామి మాస్టర్స్‌ టోర్నీ, రోటర్‌డామ్‌ ఓపెన్, హాలె ఓపెన్‌లు గెలిచాడు.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

చంద్రుడి మట్టి నమూనాల్లో నీరు
చాంగే-5 మిషన్‌ ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి తీసుకొచ్చిన మట్టి నమూనాల్లో నీటి అణువులను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. 2009లో భారత్‌ ప్రయోగించిన చంద్రయాన్‌-1 వ్యోమనౌక చంద్రుడిపై ఆక్సిజన్, హైడ్రోజన్‌ అణువులు ఉన్న ఖనిజాలను గుర్తించింది.

గ్లైడ్ బాంబ్ ‘గౌరవ్‌’ స‌క్సెస్‌
సుఖోయ్‌-30 యుద్ధ విమానం నుంచి భార‌త్ మొట్టమొద‌టిసారిగా ప్రయోగించిన లాంగ్‌రేంజ్ గ్లైడ్ బాంబ్‌(ఎల్ఆర్‌జీబీ) ‘గౌరవ్‌’ ప‌రీక్ష విజ‌య‌వంతమైంది. ఈ బాంబును డీఆర్‌డీవో ఒడిశా తీరంలోని లాంగ్ వీల‌ర్ ద్వీపంపై ప్రయోగించింది.1,000 కిలోల బ‌రువుండే గౌర‌వ్‌కు దూర ప్రాంతంలోని ల‌క్ష్యాల‌ను ఛేదించే స‌త్తా ఉంద‌ని పేర్కొంది.

ఎస్ఎస్ఎల్వీ-డీ3 ప్రయోగం సక్సెస్​
షార్‌ నుంచి ఆగస్టు16వ తేదీ స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ3)ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. చిన్న చిన్న శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపేందుకు తయారు చేసిన ఎస్‌ఎస్‌ఎల్‌వీని ఇస్రో మూడోసారి ప్రయోగించింది. రక్షణ రంగంతో పాటు విపత్తు నిర్వహణ, ఇతర రంగాలకు ఈ ఉపగ్రహాల సేవలు ఏడాదిపాటు అందనున్నాయి.

హైబ్రిడ్‌ రాకెట్ రూమీ-–1 సక్సెస్​
పునర్వినియోగ హైబ్రిడ్‌ రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. చెన్నై ఈసీఆర్‌లోని తిరువిడందై తీర గ్రామం నుంచి స్పేస్‌జోన్‌ ఇండియా, మార్టిన్‌ గ్రూప్‌ సంస్థలు తయారుచేసిన ‘రూమీ-1’ రాకెట్​ విజయవంతంగా నింగిలోకి పంపారు. వాతావరణ పరిస్థితులు, కాస్మిక్‌ రేడియేషన్, యూవీ రేడియేషన్, గాలిలో నాణ్యత వివరాలు సేకరిస్తుంది.

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : జులై​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : జూన్​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : మే​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : ఏప్రిల్​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : మార్చి​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : ఫిబ్రవరి​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : జనవరి​ 2024

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!