టెన్త్ విద్యార్థులకు కొత్త వార్త. తెలంగాణ విద్యాశాఖ ఈ ఏడాది టెన్త్ పేపర్ ప్యాటర్న్ను మార్చేసింది. ఇప్పటికే టెన్త్ లో 11 పేపర్లను ఆరు పేపర్లకు కుదించింది. కొత్త పేపర్లలో క్వశ్చన్ల ను తగ్గించాలని విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. అందుకు అనుగుణంగా క్వశ్చన్ పేపర్లో మార్పులు చేసింది. బుధవారం రాత్రి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ అందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు.
- గతంలో ఎస్సే టైప్ క్వశ్చన్లలో ఒక్కో విభాగంలో రెండు ప్రశ్నలు ఇచ్చి వాటిలో ఒకటి రాయాలనే ఆప్షన్ ఉండేది. మొత్తం ఆరు విభాగాల నుంచి ఆరు ప్రశ్నలు రాయాల్సి ఉండేది. ఇప్పుడు విభాగాల వారీగా ఛాయిస్ తీసేశారు. మొత్తం ఆరు ప్రశ్నలు ఇస్తే.. అందులో నాలుగింటికి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో క్వశ్చన్కు గతంలో ఐదు మార్కులు ఉండగా, ఇప్పుడు ఒక్కో ఎస్సే టైప్ క్వశ్చన్కు ఆరు మార్కులు కేటాయించారు.
- గతంలో ఉన్న మూడు మార్కుల ప్రశ్నలను ఇప్పుడు నాలుగు మార్కుల ప్రశ్నలుగా పరిగణిస్తారు. ఆరు ప్రశ్నలుంటాయి. అన్నింటికీ సమాధానాలు రాయాలి. అందులో ఛాయిస్ ఏమీ లేదు.
- వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లలో మార్పేమీ లేదు. వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్లు 6 ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులుంటాయి.
- మొత్తం 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు.
- తొమ్మిదవ తరగతితో పాటు టెన్త్ స్టూడెంట్లకు ఈ ఏడాదితో పాటు వచ్చే ఏడాది కూడా ఈ కొత్త ప్యాటర్న్ పేపర్ అమల్లో ఉంటుంది.
