గ్రూప్ వన్ పోస్టుల ఫలితాల వెల్లడికి హైకోర్టు అనుమతులు ఇచ్చింది. ఒకే ఒక్క అభ్యర్థి లేవనెత్తిన న్యాయపరమైన అంశం ఆధారంగా మొత్తం పోస్టుల ఫలితాలను విడుదల చేయడం సరికాదని అభిప్రాయ పడింది. ఒక అభ్యర్థి స్థానికత వివాదాన్ని తాము తర్వాత తేల్చుతామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. ఈలోగా సింగిల్ జడ్జి ఆర్డర్ కారణంగా నిలిచిపోయిన గ్రూప్–1 ఫలితాలను విడుదల చేయాలని టీఎస్పీఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జస్టిస్ అభినంద్కుమార్ షావిలి, జస్టిస్ పి.కార్తీక్లతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వుల కారణంగా గ్రూప్ వన్ ఫలితాల వెల్లడికి న్యాయపరమైన అడ్డంకులు తొలిగాయి. నీహారిక అనే అభ్యర్థి ఏడో తరగతి ఏపీలోని విశాఖలో చదివారు. ఒకటి నుంచి పీజీ వరకు తెలంగాణలో పూర్తి చేశారు.
తనకు స్థానికత వర్తిస్తుందని ఆమె వేసిన పిటిషన్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల కారణంగా ఫలితాల వెల్లడి ఆగిపోయింది. ఆమె స్థానికతను పరిగణనలోకి తీసుకోవాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని ప్రభుత్వం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు చదివిన వాళ్లే స్థానికత వర్తిస్తుందని, నీహారిక అనే అభ్యర్థి ఏడో తరగతి విశాఖలో చదివిన కారణంగా ఆమెకు స్థానికత వర్తించదని టీఎస్పీఎస్సీ తరఫు అడ్వొకేట్ ఎం.రాంగోపాల్రావు వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి ఉత్తర్వుల కారణంగా లక్షల మంది గ్రూప్ 1 అభ్యర్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారని చెప్పారు.
ఫలితాల వెల్లడికి ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులకు అనుగుణంగా నీహారికతకు స్థానికత వర్తింపజేయాలని ఆమె లాయర్ సరసాని సత్యంరెడ్డి వాదించారు. వాదనల తర్వాత ఒక్క అభ్యర్థి కారణంగా ఫలితాలను నిలిపివేయడం చెల్లదని, స్థానికత వివాదాన్ని తర్వాత తేల్చుతామని, దీనిపై విచారణ చేసి ఉత్తర్వులు ఇస్తామని డివిజన్ బెంచ్ చెప్పింది. ఆ అభ్యర్థికి చెందిన సమగ్ర వివరాలు నివేదించాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. పలితాలను వెల్లడించుకోవచ్చునని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. స్థానికత వ్యవహారంపై తర్వాత తుది ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.