ఇంటర్ మీడియట్ క్లాసులపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో 30 వ తేదీ వరకు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం ఇప్పటికే సెలవులు ప్రకటించింది. దీంతో కొన్ని కాలేజీలు ఆన్లైన్ ద్వారా క్లాసులు అటెండ్ కావాలని విద్యార్థులకు సమాచారం అందించాయి. కానీ ఆన్ లైన్ లో కూడా క్లాసులు నిర్వహించవద్దని తాజాగా ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. సోమవారం రాష్ట్ర కేబినేట్ జరుగనుంది. కేబినేట్లో తీసుకునే నిర్ణయాల ఆధారంగా స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీల క్లాసుల నిర్వహణ, సెలవుల కొనసాగింపుపై తదుపరి యాక్షన్ ప్లాన్ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అన్ని పరీక్షలు వాయిదా
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా.ఏవీఎన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు www. braouonline.in లో చూడొచ్చని సూచించారు.