యూపీఎస్సీ సివిల్స్ (UPSC Civils 2024) తుది ఫలితాలు వెలువడ్డాయి. మంగళవారం మధ్యాహ్నం యూపీఎస్సీ ఈ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం వెయ్యికి పైగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది.
జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. ఇందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్లో సత్తా చాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్ 17వరకు దశల వారీగా పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది.
1,009 మంది అభ్యర్థులతో యూపీఎస్సీ(UPSC) తుది ఫలితాలను విడుదల చేసింది. ఇందులో జనరల్ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీలో 87మంది చొప్పున ఎంపికయ్యారు.
టాప్ 10 ర్యాంకర్లు వీరే..
- శక్తి దుబే
- హర్షిత గోయెల్
- డోంగ్రే అర్చిత్ పరాగ్
- షా మార్గి చిరాగ్
- ఆకాశ్ గార్గ్
- కోమల్ పూనియా
- ఆయుషి బన్సల్
- రాజ్కృష్ణ ఝా
- ఆదిత్య విక్రమ్ అగర్వాల్
- మయాంక్ త్రిపాఠి
UPSC అధికారిక వెబ్సైట్ upsc.gov.inలో తుది ఫలితాలను చూసుకోవచ్చు.

