సెప్టెంబరు 6వ తేదీన డీఎస్సీ ఆన్లైన్ పరీక్షల ఫైనల్ ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. దాంతో డీఎస్సీలో వచ్చిన మార్కులకు టెట్ మార్కులను కలిసి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)ను ఇవ్వాల్సి ఉంది. ఆ జాబితాను వారం రోజుల్లో ఇస్తామని తుది కీ విడుదల సమయంలో విద్యాశాఖ వెల్లడించింది.
డీఎస్సీ తుది కీ విడుదల చేసిన తర్వాత వందల మంది టెట్ వివరాలు గతంలో తప్పులతడకగా ఆన్లైన్లో నమోదు చేశారని వెల్లడైంది. దాంతో ఆ వివరాల సవరణకు అవకాశం ఇచ్చారు. ఆ ప్రక్రియ కూడా ఈ నెల 13వ తేదీతో ముగిసింది. జీఆర్ఎల్ ఇచ్చిన తర్వాత జిల్లాల వారీగా ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున ఎంపిక చేసి మెరిట్ జాబితాను డీఈవోలకు పంపించాల్సి ఉంటుంది. కానీ, జీఆర్ఎల్ను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
ఫైనల్ ‘కీ’ వెల్లడైన తర్వాత పలువురు డీఎస్సీ అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తాము పుస్తకాల్లో ఉన్నట్లుగానే జవాబులు గుర్తించామని.. వాటికి మార్కులు ఇవ్వలేదని ఆయా అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఆఫీస్ వచ్చి చెప్పారు. అభ్యంతరాలను పరిశీలించిన నిపుణులు.. వాటిని పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఆ జాబితా విడుదల మరింత ఆలస్యం కావొచ్చని విశ్వసనీయ సమాచారం.