తెలంగాణ గ్రూప్ 1 అభ్యర్థుల తుది మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది. 563 గ్రూప్ 1 సర్వీసు పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు, ర్యాంకులు ఇటీవలే విడుదలయ్యాయి. మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా 1:1 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను తాజాగా ప్రకటించింది. గ్రూప్-1లో ఇంటర్వ్యూలు లేకపోవడంతో 1:2కి బదులుగా నేరుగా 1:1 నిష్పత్తిలోనే అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు పిలిచింది.
మెయిన్స్ లో మార్కులు, రిజర్వేషన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులను పరిగణనలోకి తీసుకుని 1:1 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. మెరిట్ జాబితాలోని అభ్యర్థులు ఈ నెల 15 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ నెల 16, 17, 19, 21 తేదీల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకు నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ క్యాంపస్లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనుంది. అభ్యర్థులు షెడ్యూలు ప్రకారం నిర్ణీత తేదీల్లో హాజరు కాకున్నా, ఎవరివైనా ఒరిజినల్ సర్టిఫికెట్లు పెండింగ్లో ఉన్నా… వారికి 22వ తేదీన చివరి అవకాశం కల్పించారు.
అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లను, వాటి రెండు సెట్ల జిరాక్సు ప్రతులతో సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరు కావాల్సి ఉంటుంది. అభ్యర్థులు తమ ఆప్షన్లు నమోదు చేయకపోయినా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరు కాకపోయినా, ఎవరిదైనా అభ్యర్థిత్వం తిరస్కరణకు గురైనా వారి స్థానంలో తదుపరి మెరిట్ అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలుస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది.
