తెలంగాణ గ్రూప్ 1 ఫలితాల్లో పురుషులతో సమానంగా మహిళలు పోటీ పడ్డారు. టాప్ 50 ర్యాంకుల్లో 25 మంది, తొలి వంద ర్యాంకుల్లో 41 మంది మహిళలున్నారు.

హైదరాబాద్కు చెందిన లక్ష్మీ దీపిక కొమ్మిరెడ్డి రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. మెయిన్స్ పరీక్షల్లో 900 మార్కులకు లక్ష్మీ దీపిక 550 మార్కులు సాధించారు. ఉస్మానియాలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన లక్ష్మీ దీపిక గతంలోనే ఎంపీడీవో సెలెక్టయ్యారు. రెండు సార్లు యూపీఎస్సీ ఇంటర్వ్యూ కు సెలెక్టయ్యారు.
నల్గొండ జిల్లాకు చెందిన దాడి వెంకటరమణ 535.5 మార్కులతో రెండో ర్యాంకు సాధించారు. ఆరేండ్లుగా సివిల్ సర్వీసెస్కు ప్రిపేరవుతున్న వెంకటరమణ.. గ్రూప్-1 ఫస్ట్ అటెంప్ట్ లోనే సత్తా చాటడం విశేషం. ఇటీవల టీజీపీఎస్సీ ప్రకటించిన జూనియర్ లెక్చరర్ సివిక్స్ పోస్టుకు, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికయ్యారు. గ్రూప్-2లో 378వ ర్యాంకు సాధించారు.
మల్టీ జోన్-1 కేటగిరీలో టాపర్గా హనుమకొండ జిల్లాకు చెందిన తేజస్వినిరెడ్డి (532.5 మార్కులు) నిలిచారు. మొత్తం మీద నాలుగో ర్యాంకు సాధించారు. ఆమె ప్రస్తుతం మండల పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.
ర్యాంక్ | హాల్ టికెట్ నంబర్ | పేరు | మార్కులు |
---|---|---|---|
1 | 240946218 | లక్ష్మీ దీపిక | 550 |
2 | 240920349 | వెంకట రమణ | 535.5 |
3 | 240907150 | – | 535.5 |
4 | 240911068 | తేజస్విని రెడ్డి | 532.5 |
5 | 240918455 | కృతిక | 532.0 |
6 | 240911138 | పూనాటి హర్షవర్ధన్ | 525.5 |
రంగారెడ్డి జిల్లా మీర్పేట కార్పొరేషన్ జిల్లెలగూడకు చెందిన సిద్ధాల కృతిక గ్రూపు-1లో 532 మార్కులతో రాష్ట్రస్థాయిలో 5వ ర్యాంకు సాధించారు. నాలుగు సార్లు సివిల్స్ కు ప్రయత్నించిన కృతికకు మంచి ర్యాంకు రాలేదు. ఇటీవల గ్రూప్-4లో 511వ ర్యాంకు సాధించి వాణిజ్య పన్నుల శాఖలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగంలో చేరారు. తాజాగా గ్రూప్-1లో రాష్ట్రస్థాయి ఐదో ర్యాంకు సాధించారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణానికి చెందిన పూనాటి హర్షవర్ధన్ గ్రూప్-1లో రాష్ట్రస్థాయిలో ఆరో ర్యాంకు, మల్టీ జోన్-2 స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించాడు. బిట్స్ పిలానీ లో ఇంజనీరింగ్ చదివిన హర్షవర్ధన్ రూ.27 లక్షల వార్షిక వేతనంతో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేశారు. ఉద్యోగం మానేసి సివిల్ప్కు ప్రిపేరవుతున్నాడు.