దేశంలోని 21 ఐఐటీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ (టెక్నాలజీ), ఎంఎస్ (రీసెర్చ్), ఎమ్మెస్సీ-పీహెచ్డీ (డ్యూయల్ డిగ్రీ) కోర్సుల్లో 3,000 సీట్ల భర్తీకి నిర్వహించే ‘జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (JAM-2025)’కు అక్టోబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత: నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి పరీక్ష ఐఐటీ దిల్లీ నిర్వహించనుంది. జామ్ స్కోరుతో ఐఐటీలతోపాటు, ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్లు, ఎన్ఐటీలు, ఇతర విద్యా సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఇక్కడ కోర్సులు పూర్తిచేసుకున్నవారు మెరుగైన అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీల్లో అవకాశం వచ్చినవారు స్టైపెండ్ అందుకోవచ్చు.
సీట్ల వివరాలు: మొత్తం మూడు వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐఐటీ హైదరాబాద్లో ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, గణితం, భౌతికశాస్త్రం సీట్లను జామ్ ర్యాంకు ఆధారంగా కేటాయిస్తారు. ఐఐటీ తిరుపతిలో ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, ఎమ్మెస్సీ గణితం- స్టాటిస్టిక్స్, ఎంఏ గణితం- స్టాటిస్టిక్స్ సీట్లున్నాయి.
సబ్జెక్టులు: ఏడు సబ్జెక్టుల్లో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. అవి.. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, జియాలజీ, మ్యాథమెటిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్. వీటిలో ప్రతిభ చూపినవారు ఏడు సబ్జెక్టులకు చెందిన పలు స్పెషలైజేషన్లతో కోర్సులు ఎంచుకోవచ్చు. పరీక్ష నిమిత్తం అభ్యర్థులు ఒకటి లేదా గరిష్ఠంగా రెండు సబ్జెక్టులు ఎంచుకోవచ్చు. సెషన్-1లో ఒకటి, సెషన్-2లో మరొక సబ్జెక్టులో పరీక్ష రాసుకోవచ్చు. సెషన్-1లో కెమిస్ట్రీ, జియాలజీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో పరీక్ష నిర్వహిస్తారు. రెండో సెషన్లో.. బయోటెక్నాలజీ, ఎకనామిక్స్, మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ల్లో ఇవి ఉంటాయి.
ఎగ్జామ్ ప్యాటర్న్: జామ్ ప్రవేశ పరీక్షను ఆన్లైన్లో నిర్వహిస్తారు. వ్యవధి 3 గంటలు. ఆంగ్ల మాధ్యమంలో ప్రశ్నపత్రం ఉంటుంది. ఏ సబ్జెక్టు ప్రశ్నపత్రంలోనైనా మొత్తం ఆబ్జెక్టివ్ 60 ప్రశ్నలు. వంద మార్కులు. మూడు విభాగాల్లో (మల్టిపుల్ ఛాయిస్, మల్టిపుల్ సెలెక్ట్, న్యూమరికల్) ప్రశ్నలు అడుగుతారు. వీటిని ఎ, బి, సి సెక్షన్లుగా విభజించారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్కి రూ.900 రెండు పేపర్లకు రూ.1250. మిగిలిన అభ్యర్థులు అందరికీ ఒక పేపర్కు రూ.1800. రెండు పేపర్లకు రూ.2500 అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 2న పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.jam2025.iitd.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.