పోటీ పరీక్షల ‘కీ’ (సమాధానాల) సమస్యలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చెక్ పెట్టనుంది. ప్రాథమిక కీ వెలువడినప్పటి నుంచి తుది కీ ఖరారయ్యే నాటికి అభ్యర్థుల్లో ఉన్న సమస్యలు దూరం చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తుంది. ఇక నుంచి ప్రాథమిక కీ విడుదల సమయంలోనే సమాధానాల్లో ప్రాథమిక తప్పులను గుర్తించి వాటిని సరిచేస్తూ సరైన సమాధానాలతో కీ ప్రకటించాలని నిర్ణయించింది. తద్వారా పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రాథమిక కీ సమయంలోనే ఎన్ని మార్కులు వస్తాయి? మెరిట్ సాధిస్తామా? లేదా.. వంటి అంశాలపై ముందే స్పష్టత రానుంది.
ప్రైమరీ కీ… ఫైనల్ కీ లో వ్యత్యాసం
ప్రాథమిక కీ విడుదల చేసేటప్పుడు ప్రశ్నపత్రం రూపొందించిన నిపుణులు చెప్పిన సమాధానాన్ని అందులో పొందుపరిచేవారు. ఆ తరువాత ప్రాథమిక కీపై అభ్యర్థుల నుంచి నిర్ణీత గడువులోగా అభ్యంతరాలను స్వీకరించి పరిశీలించేవారు. ఈ అభ్యంతరాలకు సరైన ఆధారాలు జతచేయాలి. లేకుంటే వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఈ తరహా విధానంతో అభ్యర్థుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనేవి. ప్రాథమిక కీ నాటికి వస్తున్న మార్కులకు.. తుది కీ నాటికి వస్తున్న మార్కులకు వ్యత్యాసం కనిపిస్తుండేది. కొన్ని సందర్భాల్లో ఒక్క మార్కు తేడాతో ర్యాంకుల్లో చాలా వెనుకబాటు కనిపిస్తోంది. దీంతో మార్కులు తగ్గాయన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంటోంది. గతంలో కొన్ని సందర్భాల్లో న్యాయ వివాదాలు తలెత్తి నియామక ప్రక్రియ ఆలస్యమైంది.
గ్రూప్ 4 లో పది.. గ్రూప్ 1 లో ఎనిమిది ప్రశ్నలు తొలగింపు
గతేడాది కమిషన్ నిర్వహించిన 8,180 గ్రూప్-4 ఉద్యోగాల పోటీపరీక్షలోనూ ప్రాథమిక కీ నుంచి తుది కీ నాటికి మొత్తం పది ప్రశ్నలు తొలగించారు. ఈ మేరకు పేపర్-1లో 7, పేపర్-2లో 3 ప్రశ్నలు ఉన్నాయి. వీటితో పాటు రెండు పేపర్లలో కలిపి 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు జరిగాయి. 5 ప్రశ్నలకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు సరైనవిగా ప్రకటించాల్సి వచ్చింది. రద్దయిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలోనూ తుది కీ వెలువడే నాటికి 8 ప్రశ్నలు తొలగించారు. రెండు ప్రశ్నలకు ఆప్షన్లు మారాయి. ఇదే తరహాలో ప్రతి పోటీపరీక్షలో ప్రశ్నల తొలగింపు, సమాధానాల మార్పు సాధారణంగా జరుగుతోంది. దీంతో అభ్యర్థుల మార్కుల అంచనాలు మారుతున్నాయి. ఈ మేరకు అభ్యర్థుల్లో గందరగోళ పరిస్థితులు నివారించేందుకు ప్రాథమిక కీ సమయంలో సబ్జెక్టు నిపుణుల అభిప్రాయాన్ని కమిషన్ తీసుకుంటోంది.
Nice