సివిల్స్ సాధించడమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు శుభవార్త. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో సివిల్ సర్వీస్ అకాడమీలో ఫ్రీ ట్రైనింగ్ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను కోరుతున్నారు. పీహెచ్ డీ విద్యార్థులు, క్యాంపస్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కళాశాలలు, నిజాం కాలేజీలకు చెందిన మొదటి, ద్వితీయ సంవత్సరం చదువుతుున్న ఎంఏ, ఎంకాం, ఎమ్మెల్సీ విద్యార్థులు, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎల్ఎల్ఎం, ఇతర పీజీ కోర్సుల విద్యార్థులు డిసెంబర్ 2 వరకు అప్లయ్ చేసుకోవాలని డైరెక్టర్ డాక్టర్ కొంగ నాగేశ్వరరావు తెలిపారు.
సివిల్ సర్వీస్ అకాడమీలోని వంద సీట్లను డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రన్స్ లో సాధించిన ర్యాంకు ఆధారంగా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ ఫ్రీ కోచింగ్ కు అభ్యర్థులను సెలక్ట్ చేయనున్నట్లు చెప్పారు. సీటు సాధించిన అభ్యర్థులను మే 1 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఉస్మానియా వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.